ఆ ఫైళ్లలో ఏముంది?
posted on Dec 9, 2023 5:54AM
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని మాజీ ఎస్డీవో హల్ చల్ చేశారు. కార్యాలయంలోని ఫైళ్ల తరలింపునకు, ధ్వంసానికి ప్రయత్నించారు. ప్రభుత్వం మారిన తరువాత ఆయన ఫైళ్ల తరలింపు, ధ్వంసానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. అభ్యంతరాలను లెక్క చేయకుండా కార్యాలయంలోనికి ప్రవేశించిన మాజీ ఎస్టీవో కల్యాణ్ ఫైళ్లను ధ్వంసం చేసి, సంచీలలో మూటగట్టి బయటకు తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.
రెండు రోజుల కిందట ఓ వైపు కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మంత్రి శ్రీనివాస గౌడ్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలింపునకు ప్రయత్నాలు జరగడం, అలాగే పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి కూడా ఫర్నీచర్ తరలింపునకు ప్రయత్నాలు జరగడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఫైళ్ల ధ్వంసం, తరలింపునకు యత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది.
గత ప్రభుత్వంలో పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి,ఫిషరీస్ శాఖల మంత్రి అయిన తలసానికి ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్ ఆయా శాఖల ఫైళ్ల తరలింపునకు ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. ఓఎస్డీగా తన పదవీ కాలం ముగిసిన నాలుగు రోజుల తరువాత, అదీ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి ఫైల్స్ తీసుకెళ్లొద్దని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసినా, కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో దస్త్రాల తరలింపునకు ప్రయత్నించడంతో ఆ శాఖలో భారీ అక్రమాలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే బీరువాల్లో ఫైల్స్ ఎలుకలు కొట్టేస్తున్నాయనీ, అయినా అవేమీ అంత ముఖ్యమైనవి కావనీ కల్యాణ్ తన చర్యను సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.