ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి
posted on Sep 15, 2025 4:46PM

బీఆర్ఎస్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి విజ్ఞప్తి చేసినట్లు సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆధారాలు సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జగదీష్రెడ్డి, వివేక్ గౌడ్, చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ నాయకులతో ప్రచారాల్లో ఎందుకు తిరుగుతున్నారు, వాళ్లతో దిగిన ఫోటోలను పోస్టర్లుగా ఎందుకు వేసుకుంటున్నారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. హస్తం పార్టీ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు.