ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో సినీ నిర్మాత

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవ్వరినీ వదలడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాత ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. 
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ నిర్మాత పేరు బయటకొచ్చింది. ఈ వ్యవహారంలో బాధితుడి ఫిర్యాదు మేరకు మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యర్నేని పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన దగ్గర ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నవీన్ పై కేసు నమోదు చేశారు. 

గతంలో తాను ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జునరావుతోపాటు తన సంస్థలోని నలుగురు డైరక్టర్లు కూడా లబ్ది పొందారని చెప్పారు. కాగా, వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలశిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావులను ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.