సమస్యలపై మంత్రిని నిలదీస్తూనే ఆగిన రైతు గుండె
posted on Dec 27, 2025 5:18AM

రాజధాని అమరావతిలోని మండడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మునిసిల్ శాఖ మంత్రి నారాయణ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా ఘటన జరిగింది.
అమరావతిలో ఎన్-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న రైతు దొండపాటి రామారావు తమ సమస్యలపై తొలుత ప్రశాంతంగానే మాట్లాడారు. అయితే మధ్యలో తీవ్ర ఆవేదనకు, ఆవేశానికీ లోనయ్యారు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తమ ఇళ్లు పొలాలూ తీసుకుని రోడ్డున పడేస్తారా అంటూ మంత్రిని నిలదీశారు. ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
దీంతో అక్కడున్న అధికారులు, రైతులు రామారావుకు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ వెంటనే అతడిని మంత్రి కాన్వాయ్ వాహనంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. నిర్వాసిత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. భూ సమీకరణలో భాగంగా రాములు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు. ఎన్-8 రోడ్డు కింద ఇళ్లు కోల్పోతున్న వారి జాబితాలో ఆయన ఇల్లు కూడా ఉంది.