అందరి టార్గెట్ హండ్రెడ్ సీట్స్.. మూడు పార్టీలది ఒకటే క(గో)ల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే..  2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.  నిజానికి..  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో  ఎందుకో ఏమో కానీ ఎన్ని ‘కలలు’ మొదలయ్యాయి. అదికూడా మరెవరో కాకుండా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే  ఎన్ని’కల’లకు శ్రీకారం చుట్టారు.  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో..  వంద అసెంబ్లీ, 15 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ముఖ్యమంత్రి  హామీ ఇవ్వడంతో..  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ‘వంద’ చర్చ మొదలైంది. 

నిజానికి.. ప్రస్తుత రాజకీయాల్లో బొమ్మా– బొరుసూ తారుమారు అయ్యేందుకు మూడున్నర సంవత్స రాలు చాలా చాలా ఎక్కువ సమయం. మూడున్నర సంవత్సరాలు కాదు..  మూడున్నర వారాలలో కూడా రాజకీయం ఉల్టాపల్టా అయ్యే అవకాశం ఉందని  నడుస్తున్న చరిత్రే చెపుతోంది. ఎక్కడిదాకానో ఎందుకు..  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు కూడా విశ్వసించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో  హస్త రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. సో.. రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. గెలుపు ఓటములు ఎలా తారుమారు అవుతాయో  నెలల ముందు  ఉహించడం కూడా  ఒక విధంగా సాహసమే అవుతుంది.

కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు  ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి, ఎప్పుడో మూడున్నరేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే కలలు కంటున్నాయి. నిజానికి..  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రాజకీయ ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. సో... మూడున్నర సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఇప్పుడే చెప్పడం సాహసం కాదు..  ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. అయినా..  మూడు ప్రధాన పార్టీలూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తునాయి. చప్పట్లు కొట్టి  చిటికెల పందిళ్ళు వేస్తున్నాయి. 

అయితే..  అందరికీ తెలిసిన ఈ రాజకీయ సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా అంటే తెలియక కాదు కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకున్న 100 అసెంబ్లీ , 15 లోక్ సభ సీట్ల  రాగాన్ని  బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ అధ్యక్షడు ఎన్. రామచంద్ర రావు ఎత్తు కున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ వందకు ఐదు తక్కువ 95 సీట్లు ఖాయంగా వస్తాయని కేటీఆర్   అంటే..   బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు  కమలానికి వంద సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు. 

అంతే  కాదు..  గమ్మత్తుగా రామచంద్ర రావు, ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనేందుకు..  కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అన్నంత సింపుల్ లాజిక్ చెప్పారు. అవును..  తెలంగాణ ప్రజలు పదేళ్లు టీఆర్ఎస్/బీఆర్ఎస్ సుందర ముదనష్ట పాలన చూశారు.  ఇప్పుడు అదే తరహాలో.. ఇంకా చెప్పాలంటే.. అంతకంటే ఘోరంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి..  తెలంగాణ ప్రజలకు బీజేపీని గెలిపించడం తప్ప మరో గత్యంతం లేదన్న రీతిలో చెప్పుకొచ్చారు. 

అయితే ఎవరి కలలు ఎలా ఉన్నా.. వాస్తవాలు మరోలా ఆన్నాయని చరిత్ర చెపుతోంది. రీసెంట్  ఉదంతాలనే ఉదాహరణగా తీసుకున్నా..  2024 ఎన్నికల్లో బీజేపీ  చార్ సౌ పార్ (400 ప్లస్) కలలు కంది. ఫలితం ఏమిటో చెప్పనక్కర లేదు..  దో సౌ చాలీస్’ (240) దగ్గరే ఆగిపోయింది. అలాగే.. ఇంకొంచెం వెనక్కి వెళితే, 2023 తెలంగాణ  శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్  కూడా హండ్రెడ్ ప్లస్ (100ప్లస్) పైనే ఆశలు పెట్టుకుంది. కానీ.. 40 దగ్గరే ఆగి పోయింది.(అందులో  ఓ పది సీట్లు ఇప్పటికే జారి పోయాయి అనుకోండి అది వేరే విషయం). అలాగే..  ఇంకో అడుగు వెనక్కివేస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో, మారుమోగిన, సారూ ..కారూ .. పదహారు  స్లోగన్ గురించి చెప్ప నక్కర లేదు.  సో .. రాజకీయ నాయకుల  పగటి కల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ.. రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలు మాత్రం, రాను రాను రాజు గుర్రం గాడిద  సామెతను గుర్తు చేస్తున్నాయి. రోజురోజుకు గీత దాటుతున్నాయి. రోత పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం అయితే సర్వతా వ్యక్తమవుతోందని అంటున్నారు.