రాజ్ కేసిరెడ్డి విచారణకు ఈడీ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ కేసులో కింగ్పిన్ గా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డిని విచారణకు అనుమ తించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇక నేరుగా రంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే  ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు సిద్ధమౌతోంది. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు  అనుమతి ఇవ్వాల్సిందిగా విజయవాడ ఏసీపీ కోర్టులో ఈబీ పిటిషన్ దాఖలు చేసింది.  

మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కేశినెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం (మే 16) విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన న్యాయవాది ఏకంగా కోర్టులోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు తప్పించుకుని రాజ్ కేసిరెడ్డిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కోర్టులోనే రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారన్న అభిప్రాయం పరిశీలకులలో  వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు రెడీ అవుతుండటంతో  ఇక ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టు కావడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో  ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనీ, సంచలన అరెస్టులు జరుగుతాయనీ అంటున్నారు.