ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ.. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ
posted on Jan 31, 2025 11:17AM
.webp)
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం (జనవరి 31) పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన వీడ్కోలు లభించింది. మంగళగిరిలోని ఆరోబెటాలియన్ మైదానంలో జరిగిన వీడ్కోలు పరేడ్ లో ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై యూనిఫారంకు దూరమౌతున్నానన్న ఆలోచనే భరించలేకున్నానన్నారు. తన జీవితంలోనే ఇవి అంత్యంత ఉద్విగ్నభరిత క్షణాలు అన్న ద్వారకా తిరుమలరావు.. తన కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాన్నారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వరకూ అన్నీ చూశానన్నారు.
కాగా పోలీసు శాఖపై ద్వారకాతిరుమలరావు చెరగని ముద్ర వేశారని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ప్రజా భద్రత కోసం పలు సంస్కరణలు చేపట్టారనీ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్ ఏర్పాటు కూడా ద్వారకా తిరుమలరావు ఆలోచనేనని చెప్పిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానన్న హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.