డ్యూటీ ఎక్కిన దువ్వాడ వాణీ!.. టెక్కలి వైసీపీలో మళ్లీ మొదలైన మూడుముక్కలాట!
posted on May 30, 2025 1:00PM
.webp)
రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మధురిల వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జిటిక్ ఫ్యామిలి డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సేన్షేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాధురి ప్రవేశించడం.. అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం.. క్లైమాక్స్ లేని కధగా మారింది. ఇప్పటికీ ఈ వ్యవహారంలో అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.
దువ్వాడ వాణి తన నిరసనను మాని.. మాయం అవ్వడంతో.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పీడ్ పెంచారు. వరుసగా ఇంతర్వ్యులు ఇస్తూ.. విడాకులు వచ్చిన వెంటనే తమ వివాహం అంటూ... శ్రీనుకు వారసుడిని కూడా ఇస్తాను అంటూ తమ పెయిర్ ను వైరల్ చేసుకున్నారు. ఓ వైపు శ్రీను, మాధురి స్పీడ్ పెంచడంతో పూర్తిగా మ్యుట్ అయిపోయారు దువ్వాడ వాణి.. అయితే జగన్ కు వీర భక్తుడిగా ముద్ర పడ్డ దువ్వాడ శ్రీను.. టెక్కలి వైసిపి ఇంచార్జ్ విషయంలో విభేదాలు రావడం, జగన్ మాటకు అడ్డు చెప్పడం స్టోరీలో పెద్ద ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. డామిట్.. కధ అడ్డం తిరిగింది అన్నట్టుగా.. వైసిపి నుండి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడం తో.. మిగిలిన కధను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్ళీ తెరపై ప్రత్యక్షం అయ్యారు దువ్వాడ వాణి.
మొదట్లో టెక్కలి వైసిపి ఇంచార్జ్ పెరాడ తిలక్ వెనుక ఉంటూ వచ్చిన వాణి.. ఇప్పుడు ఇండివిడ్యుయల్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టెక్కలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శలలో గడచిన కొద్ది రోజులుగా చురుకుగా పాల్గొంటున్న దువ్వాడ వాణి.. మళ్ళీ తన క్యాడర్ కు వేకప్ కాల్ ఇచ్చేసారు. దువ్వాడ వాణి ఇచ్చిన వేకప్ కాల్ తో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నా.. ఎక్కడ మళ్ళీ తమ ఇంచార్జ్ సీటుకు ఎసరు పెడతారో అన్న ఆందోళన మాత్రం పెరాడ తిలక్ వర్గీయులలో కనిపిస్తోంది.
గతంలో దువ్వాడ శ్రీనుకు, పెరాడ తిలక్ వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి.. దువ్వాడ శ్రీను సస్పెన్షన్ తో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి.. దువ్వాడ వాణీ రాకతో కోతకు గురవుతుందా అన్న ఆందోళన కూడా స్థానిక వైసిపి శ్రేణుల్లో లేకపోలేదు. ఇకోవైపు.. జగన్ కోపం తాత్కాలికమే అనీ.. మళ్ళీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానని దువ్వాడ శ్రీను కుడా స్టేట్మెంట్ లు ఇస్తుండటం కూడా తిలక్ సేనను ఇరుకున పెడుతోంది. దీంతో చాలాకాలం తరువాత మళ్ళీ టెక్కలి వైసిపిలో మూడు ముక్కలాట మళ్ళీ మొదలైందనే చెప్పుకోవచ్చు.