సజ్జల సంకరజాతి వ్యాఖ్యలపై డీజీపీకి ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు

 

సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ  సొంత ఛానెల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిని దేవతల రాజధాని అనడాన్ని ఖండిస్తూ,  అది వేశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు దారుణ వ్యాఖ్యలు చేశారు. టీవీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజుకు వంత పాడుతూ ఔను అమరావతిలో సెక్స్ వర్కర్లు అన్న వార్తను తాను కూడా చూశానంటూ పేర్కొన్నారు.  కాగా ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళాలోకం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాజకీయ విశ్లేషకుడు కృష్ణం రాజు పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యం.. ఆ అభిప్రాయాలు కృష్ణం రాజు వ్యక్తిగతం.. తమకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది.   అయితే కొమ్మినేని అరెస్టు పై వైసీపీ  తీవ్ర అభ్యంతరం  వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షి టీవీకి సంబంధం లేదని పేర్కొంటూనే.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని గుండెలు బాదేసుకుంటోంది. కృష్ణం రాజు చేసినవి అనుచిత వ్యాఖ్యలే అని అంగీకరిస్తూనే..వాటికి వంతపాడిన కొమ్మినేని అరెస్టు అన్యాయమనడంలోని లాజిక్కేమిటో వైసీపీయులే చెప్పాలి.

అదలా ఉంచితే... కొమ్మినేని అరెస్టుపై  వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఆ సందర్భంగా  సజ్జల చేసిన సంకరజాతి వ్యాఖ్య కాంట్రవర్సినీ కాస్తా కాంప్లికేట్ స్థాయికి తీసుకు వెళ్లింది.  కొమ్మినేని అరెస్టు అక్రమంటూ పెట్టిన ప్రెస్ మీట్లో ఆ ఆరెస్టు అక్రమం ఎలా అయ్యిందో చెప్పడం మాని,  అమరావతి మహిళలపై ఆయన మరో సారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  జగన్ కు మహిళల పట్ల అపార గౌరవం.. అటువంటి జగన్ అమరావతి మహిళలను అవమానిస్తారా, ఆయన  చానెల్ ఆ పని చేయదుగాక చేయదు అంటూ గట్టిగా చెప్పకోవడానికి శతధా ప్రయత్నించిన సజ్జల.. జగన్‌కు, ఆయన చానెల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన, చేస్తున్న వారిపై దూషణల పర్వానికి దిగారు.  పిశాచాలు, రాక్షసులు,  సంకర జాతి అంటూ  అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సజ్జల వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ గట్టిగా ఖండించారు. ఇక డిప్యూటీ స్పీకర్ అయితే.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. దీంతో సజ్జల చిక్కుల్లో పడ్డారు.