నకిలీ ఈ స్టాంపుల స్కామ్.. ఆ ఒక్కడి కుట్రేనా?

నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం ఏపీ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టులు జరిగినా.. పోలీసులు ప్రకటన చేసినా ఇంకా ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో రిస్క్‌తో కూడిన ఈ వ్యవహారాన్ని కేవలం ఓ మీసేవ నడిపే వ్యక్తే చేశారా.. లేదంటే ఇందులో పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా?  అలాగే.. ముందుగానే ఎంతో ఆలోచించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఓ ప్లాన్ ప్రకారమే చేశారా?..  లేదంటే కోవర్టు రాజకీయాలకు తెరతీశారా అన్న   డౌటనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కల్యాణదుర్గం ఈ స్టాంపుల కుంభకోణంలో ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతోనే  ఈ మొత్తం కుంభకోణం బయటకు వచ్చిందని వెల్లడించారు జిల్లా ఎస్పీ జగదీశ్. ఈ సందర్భంగా  ఆయన మరిన్ని కీలక అంశాలు వెల్లడించారు. నిందితుడు బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు దాదాపుగా 15 వేల 850 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించినట్లు చెప్పారు.

స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వంద రూపాయల స్టాంపులను కొనుగోలు చేసిన బాబు.. ఫోటో షాప్‌ సాయంతో లక్షరూపాయల నకిలీ స్టాంపులుగా మార్చారని ప్రకటించారు. అయితే.. తెలుగుదేశం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీతోపాటు ఈ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీల కోసం 438 నకిలీ స్టాంపులను ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు విక్రయించినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. 
ఇక్కడే పొలిటికల్‌  వార్ మొదలైంది. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నది కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయనకు చెందిన ఎస్సార్సీ సంస్థ. వీళ్లు చాలా రోజుల నుంచి మీసేవ బాబు వద్దే స్టాంపులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే  900 కోట్ల రుణం కోసం మరోసారి ఈ స్టాంపులు కొన్నారు. అయితే.. ఇందుకు సంబందించి స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య. అంతేకాదు.. స్కాంలో వాళ్ల పాత్ర ఉంది కాబట్టే సంబంధిత వివరాలు బయటపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మీసేవ బాబుకు ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారాయన.    

వైసీపీ నేతల కామెంట్లకు కౌంటరిస్తున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. మీ సేవ బాబుతో తనకు బాగా పరిచయం ఉందని వైసీపీ నాయకులు చెప్పడం అర్థరహితమంటూ కొట్టి పారేశారాయన. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన తనకు బాగా క్లోజ్ అనిచెప్పడం సరికాదంటున్నారు ఎమ్మెల్యే. అంతేకాదు.. వైసీపీ నేతలకే బాబుతో చాలా అనుబంధం ఉందని ఆరోపించారాయన. అసలు తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపు వాళ్లకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారాయన. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏసీబీ, సిట్ లేదంటే సీబీఐ సహా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే సురేంద్ర బాబు. 

రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఎస్‌ఆర్‌సీ సంస్థ ఫిర్యాదుతో ఈ కుంభకోణానికి సంబంధించి తీగ కదిలింది. పైగా మీ సేవ బాబు.. మొత్తం 15 వేలకు పైగా ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. మరి అందులో నకిలీలు ఇంకా ఎన్ని ఉన్నాయి అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి వాటి సంగతేంటి? నకిలీ స్టాంపులతో తీసుకున్న లోన్ల విషయంలో బ్యాంకులు ఎందుకు ఇంకా స్పందించడం లేదు? అసలు ఇంత పెద్ద వ్యవహారం ఒక్క మీ సేవ నడిపే బాబుతో అవుతుందా అన్నది కూడా ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలే అన్న మాట విన్పిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu