ఢిల్లీ కోర్టులో కాల్పులు.. నలుగురు మృతి 

దేశ రాజధాని  కాల్పులతో దద్దరిల్లింది. ఢిల్లీలోని రోహిణీ కోర్టు కాల్పులతో  రక్తమోడింది. ఓ కేసులో అరెస్టయిన గ్యాంగ్ స్టర్ జితేంద్ర అలియాస్ గోగిని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా.. ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు.

లాయర్ల ముసుగులోకి కోర్టులోకి ఎంటరైన దుండగులు.. ఓ మహిళా లాయర్ సహా జితేంద్రపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేంద్ర స్పాట్ లోనే చనిపోయాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో లాయర్ల వేషంలో వచ్చిన ఇద్దరు దుండగులు చనిపోయారు. మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన మహిళా న్యాయవాదిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

కోర్టులో కాల్పులు జరిపింది టిల్లూ తాజ్పూరియా గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 40 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాగా, రెండేళ్ల క్రితం ఓ ఘటనకు సంబంధించి జితేంద్రతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అయిన కుల్దీప్ ఫజ్జాను స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కుల్దీప్ ఫజ్జా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా జితేంద్ర గ్యాంగ్ లో 50 మందికి పైగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.