కరోనా చికిత్సలు బంద్.. సీఎం జిల్లాలో ఘోరం
posted on Apr 29, 2021 7:41PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా ప్రమాదకరంగా ఉంటోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనాతో చనిపోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,831 కొత్త కేసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ, నెల్లూరు జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసుల విజృంభణలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా హాస్పిటల్స్ లో కరోనా రోగులకు ఇచ్చేందుకు మందులు కూడా లేవని తెలుస్తోంది. బెడ్లు లేకపోవడంతో రోగులు హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. పరిస్థితులు విషమించాకా హాస్పిటల్స్ కు వస్తున్నా.. సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే హాస్పిటల్స్ లో బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతుండగా.. జగన్ సర్కార్ అధికారుల తీరుతో కరోనా బాధితులకు మరింత గండం వచ్చి పడింది. కడప నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్సలు బంద్ అయ్యాయి. కడప ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ యాజమాన్యం అందరూ కలిసికడప IMA హలులో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కేసులు పెట్టి జరిమాన వేసి వేధిస్తున్నారనే కారణంతో కోవిడ్ ట్రీట్మెంట్ బంద్ చేయాలని తీర్మానించుకున్నారు.

కడపలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ పెషేంట్ లను జాయిన్ చేసుకోవడం లేదు. తమ హాస్పిటల్స్ ముందు బోర్డులను పెట్టి స్వచ్ఛందoగా మూత వేశారు యాజమాన్యాలు. దీంతో కడపలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. స్వయంగా డబ్బు పెట్టి. వైద్యం చేయించు కుందాం అన్నా బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటల్స్ మూ పడటంతో చికిత్స అందక నరకయాతన పడుతున్నారు.

జగన్ సర్కార్ అధికారుల తీరుతో కరోనా వస్తే కడపలో వైద్యం కరువైంది. కరోనా పెషేంట్ కడప దాటి పోతేనే వైద్యం దొరికే పరిస్థితి నెలకొంది. సీఎం సొంత గడ్డలోనే కరోనా రోగులకు చికిత్స అందని పరిస్థితులు రావడంపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.