కోమా నుంచి కోలుకున్న జెస్సీ రైడర్
posted on Mar 31, 2013 10:54AM
ఆగంతకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ కోమా నుంచి బయటపడ్డాడు. కుటుంభ సుభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేకపోతున్నాడు. ఆరోజు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడని రైడర్ వ్యక్తిగత మేనేజర్ శనివారం వెల్లడించాడు. అతని పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, అయితే పూర్తిగా కోలుకోవాలంటే మాత్రం మరింత సమయం పడుతుందని కివీస్ క్రికెటర్ల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి హీత్ మిల్స్ అన్నాడు. బుధవారం అర్ధరాత్రి క్రైస్ట్చర్చ్లోని ఓ బార్ ఎదుట జరిగిన ఘర్షణలో రైడర్ తలకు, ఊపిరి తిత్తులకు బలమైన గాయాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏప్రిల్ 4న వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఐపీఎల్ ఆరో అంచె పోటీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుఫున ఆడాల్సిన రైడర్ ఈ ఘటనతో లీగ్కు దూరమయ్యాడు. మే, జూన్ నెలల్లో జరిగే ఇంగ్లండ్తో సిరీస్ లోపు రైడర్ గ్రౌండ్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.