ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన జితేందర్ రెడ్డి..!
on May 2, 2024
'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'జితేందర్ రెడ్డి'. రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాని ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించింది. మే 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
1983-89 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన 'జితేందర్ రెడ్డి' ట్రైలర్ ఎన్టీఆర్ పాత్రను కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో నక్సలిజాన్ని వ్యతిరేకిస్తూ, హిందూయిజంకి మద్దతుగా ఉన్నట్టుగా జితేందర్ రెడ్డి పాత్ర కనిపిస్తుంది. అలాగే, "ప్రజల కోసం అడవుల బాట పట్టిన నక్సల్స్ దేశ భక్తులు. వారి పోరాట స్ఫూర్తి గొప్పది." అని ఎన్టీఆర్ అన్నట్టుగా సంభాషణలు ఉండగా, దానికి కౌంటర్ గా కథానాయకుడు "నక్సలైట్లు దేశభక్తులు కాదు సార్. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు దేశభక్తులు.. ప్రాణాలు తీసేవాళ్ళు కాదు సార్." అంటూ ఎన్టీఆర్ తో చెప్పినట్లుగా ట్రైలర్ లో ఉంది. మొత్తానికి ట్రైలర్ లో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్లుగా ఉంది.