వరద యాత్రా? విహార యాత్రా? జగనన్నా సెల్ఫీ ఏంటన్నా?
posted on Dec 3, 2021 11:38AM
రాయలసీమపై ప్రకృతి పగబట్టింది. వరుణుడు విరుచుకుపడ్డాడు. వాగులు పొంగాయి. చెరువులకు గండిపడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సీఎం సొంతజిల్లా కడప జిల్లా కన్నీరు సంద్రమైంది. కష్టాల్లో ఉన్నప్పుడు పాలకులు పట్టించుకోలేదు. అటువైపు కూడా తొంగి చూడలేదు. ముఖ్యమంత్రికి తన సొంత ప్రాంతమనే మమకారం కూడా లేకుండా పోయింది. వానలు వెలిశాక.. వరద తగ్గాక.. పరిస్థితి కుదటపడ్డాక.. తీరిగ్గా పర్యటించారు సీఎం జగన్రెడ్డి. అయితే, ఆయన వరద ప్రాంత సందర్శణకు వచ్చారో లేక, విహార యాత్రకు విచ్చేశారో అన్నట్టు ఉంది వ్యవహారం అంటున్నారు. సీఎం జగన్ హెలికాప్టర్ టూర్, సెల్ఫీ సందడిపై సోషల్ మీడియాలో తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. జగనన్న ఇందేందన్నా.. అంటూ కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు.
అసలే వానలు, వరదలు. సర్వం కోల్పోయి కడప జిల్లా వాసులు దిగాలు. తినటానికి తిండి లేక, తాగడానికి మంచి నీరు లేక.. ఉండటానికి ఇల్లు లేక.. ఉన్నదంతా వరద పాలై.. జనం విలవిల్లాడుతుంటే.. జగన్రెడ్డి మాత్రం ఎంచక్కా హెలికాప్టర్లో విహరిస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. స్వయంగా సెల్ఫీలు తీసుకోవడంపై.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు కడప ప్రజలు కన్నీరు కారుస్తుంటే.. మీ ముఖాలపై చిరునవ్వులు ఎలా వస్తున్నాయి జగనన్న అంటూ నిలదీస్తున్నారు. తాము నిలువ నీడ లేకుండా బాధపడుతుంటే.. మీరు హెలికాప్టర్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
విమర్శలకు కారణమైన సెల్ఫీ ఇదే. సీఎం జగన్రెడ్డినే స్వయంగా ఈ సెల్ఫీ తీశారు. హెలికాప్టర్లో సీఎంతో పాటు మంత్రి సురేశ్, ఎంపీ మిథున్రెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డిలు ఉన్నారు. సెల్ఫీ కదా.. అందుకేనేమో అంతా నవ్వుతూనే ఉన్నారు. బహుషా.. హెలికాప్టర్లో విహరిస్తున్నాననే సంతోషాన్ని పదిలంగా సెల్ఫీలో దాచుకోవాలనుకున్నారో ఏమో.. ఇలా ముచ్చటపడి ఫోటో తీసుకున్నారు. సెల్ఫీలు తీసుకోవడం తప్పేమీ కాదు. కానీ, ఆ సమయం, సందర్భమే అస్సలు బాగోలేదని తప్పుబడుతున్నారు. వరద బాధితులు విషాదంలో మునిగి ఉంటే.. ఆ వరద ప్రాంతాలకు వెళుతూ ఇలా ఎంజాయ్ చేయడమేంటనేదే విమర్శకులు ప్రశ్న.