రేవంత్ మౌనం పై కాంగ్రెస్ చార్జిషీట్?
posted on Apr 21, 2025 10:17AM
.webp)
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిజానికి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా, శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరినీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సోనియా, రాహుల్ గాంధీ పై చార్జిషీట్ దాఖలు చేయడాన్ని, తప్పు పడుతున్నారే తప్ప మొత్తంగా చార్జిషీటే తప్పని ఆనడం లేదు.
ఇంతవరకు ఎవరిపైనా జరగని మహాపరాధం ఏదో సోనియా, రాహుల్ విషయంలో జరిగిపోయింద న్నట్లుగా మండిపడుతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. మిగిలిన ఇద్దరి గురించి, పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే.. విషయం తెలిసిన పెద్దలు ఇది అందరికీ తెలిసిన కాంగెస్ నేతల స్వామి భక్తికి, విధేయతకు చక్కని నిదర్శనం అంటున్నారు.
అయితే.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా వీధుల్లోకి వచ్చి పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు, బీజేపీ పై విరుచుకు పడుతున్నారు, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఈ విషయంపై పెదవి విప్ప లేదు. ఒక్క ముక్క మాట్లాడ లేదు. ఈడీ చర్యను ఖండించలేదు. కనీసం, ఒక ప్రకటన అయినా చేయలేదు. ఓ వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, నిన్న మొన్నట్లో ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్ వరకూ కాంగ్రెస్ నాయకులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై, అరేయ్ ..ఒరేయ్ స్థాయిలో మండి పడుతున్నారు. అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం చీమైనా కుట్టినట్లు లేదు. కనీసంలో కనీసం ఒక ఖండన ప్రకటన కూడా చేయలేదు. అసలు తనకు ఏమీ సంబంధం లేని అంశం అన్నట్లుగా.. ఆయన తన పనిలో తాను బిజీబిజీగా ఉన్నారని అంటున్నారు.
అయితే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దేశంలో లేరు. జపాన్ లో పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన స్పందించలేదని కొందరు అనుకున్నా, ఎందుకో అది, అంతగా నమ్మబుల్ గా లేదని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అది నిజం కాదు.. కుంటి సాకు మాత్రమే అని కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు. నిజానికి.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, పదవులు ఆశిస్తున్నవారు ఇలాంటి సందర్భాలను అగ్రనేతల పట్ల విధేయత చూపేందుకు ఒక అవకాశంగా తీసుకుంటారు.
కప్పుడు శరద్ పవార్, తారిక్ అన్వర్, పీఏ సంగ్మా, సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించిన సమయంలో కొందరు వీర విధేయులు ఏకంగా గాంధీ భవన్ లో అగ్గి పెట్టారు. అంతవరకు ఎందుకు ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారిచినప్పుడు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పడు కూడా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన పేరిట విధేయ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈడీ, మోదీలను జాయింట్ గా దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ కుటుంబం త్యాగాలను ఏకరవు పెడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. అలాగే భవిష్యత్ లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించారు. ఎటొచ్చి రేవంత్ రెడ్డి మాత్రమే సైలెంట్ గా ఉండి పోయారు.
అయితే.. ఇప్పడు అదంతా ఒకెత్తు అయితే, రేవంత్ రెడ్డి మౌనం, ప్రతి పక్షాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ కు మరో అస్త్రం అయిందని అంటున్నారు. సహజంగానే రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ విమర్శించేందుకు సిద్ధంగా ఉండే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే తొలి అస్త్రాన్ని సంధించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్’ కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీల పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడానికి నిరసనగా దేశంలోని కాంగ్రెస్ నేతలంతా ధర్నాలకు దిగుతూ బీజేపీని ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ల అగ్రనేతల మీద కేసులు పెట్టినా చడీ చప్పుడు లేదు. మోదీ, రేవంత్ దృఢమైన బంధమే ఇందుకు కారణం. ఆయనను ఈయన కాపడుతున్నారు..ఈయనను ఆయన కాపాడుతారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అలాగే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ఢిల్లీకి ‘కబురు అందించారని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ( ఏప్రిల్ 19), చార్జిషీట్ ఫ్యూచర్ ఆక్షన్ పై చర్చించేందుకు ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు, ఇతర ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పూస గుచ్చినట్లు వివరిస్తూ.. రేవంత్ రెడ్డి అవిధేయ ధోరణికి సంబంధించిన అభియోగాలతో ఆయనపై చార్జిషీట్ ని సమర్పించినట్లు చెపుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పంది స్తుందనేది వేచి చూడవలసి ఉంటుందని.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాతనే అధిష్టానం తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు.