కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం! గవర్నర్ కు కేసీఆర్ వర్తమానం! 

తెలంగాణ మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణకు ముహుర్తం ఖరారైందా? రెండు, మూడు రోజుల్లోనే కొత్త మంత్రులకు ఛాన్స్ దక్కనుందా? అంటే తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం పుదిచ్చేరిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్.. హడావుడిగా హైదరాబాద్ వస్తున్నారు. తాను హెదరాబాద్ వస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం పుదిచ్చేరి, తమిళనాడులో లాక్ డౌన్ అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోను బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అయినా తమిళి సై హైదరాబాద్ కు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణ కోసమే గవర్నర్.. హడావుడిగా హైదరాబాద్ వస్తున్నారనే చర్చ జరుగుతోంది. 

ఇటీవలే వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఈటల నిర్వహించిన వైద్య శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. రెండు, మూడు రోజులుగా వైద్యశాఖపై సీఎం కేసీఆరే సమీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ విధింపు ప్రకటన కూడా వైద్య శాఖ మంత్రి లేకుండానే వచ్చింది. రాష్ట్రంలో కోవిడ్ పంజా విసురుతున్న సమయంలో వైద్య శాఖకు మంత్రి లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య మంత్రి లేకపోవడంపై విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కరోనా సమయంలో వైద్య శాఖ మంత్రిని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. కరోనా కష్టాలను చెప్పుకోవడానికి మంత్రి లేకుంటే ఎలా అని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. 

కరోనా కట్టడిపై ఫోకస్ చేసిన తెలంగాణ సర్కార్.. మంత్రి కేటీఆర్ సారథ్యంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. అయితే కొవిడ్ కల్లోల సమయంలో వైద్యశాఖను సీఎం దగ్గర ఉంచుకోకుండా.. మరొకరి అప్పగిస్తేనే బెటరనే చర్చ టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతుందంటున్నారు. దీంతో సీఎం కేసీఆర్ కూడా వైద్యశాఖకు కొత్త మంత్రిని నియమించాలని డిసైడ్ అయ్యారంటున్నారు. కొత్త వైద్య శాఖ కోసం చాలా పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కేసీఆర్ తొలి కేబినెట్ లో వైద్య శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డికి రెండో సారి ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఈటల స్థానంలో లక్ష్మారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు వైద్య శాఖను అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది. డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి అయితే బెటరనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారంటున్నారు. అంతేకాదు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడం కూడా ఆయన ప్లస్ గా మారిందంటున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు వైద్య శాఖను అప్పగించవచ్చనే మరో చర్చ కూడా జరుగుతోంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హరీష్ రావు పాల్గొనడటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. 

కేబినెట్ విస్తరణ ఉంటే... ఈటలతో ఖాళీ అయిన ఒక్క స్థానానికే పరిమితం అవుతారా లేక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. కేబినెట్ లో భారీగానే మార్పులు ఉండవచ్చనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. మరో ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఈటలతో పాటు మహబూబ్ నగర్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కవితకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పల్లాను కేబినెట్ లోకి తీసుకుంటే.. ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కమిషన్ కోసం మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకై వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రిపదవిపై ఇప్పటికే కేసీఆర్ సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది.