ఏపీ లో కొత్త పార్టీ..
posted on Nov 23, 2018 9:22AM

ఆంద్రప్రదేశ్ లో కొత్త పార్టీ అవతరించబోతుంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వైసీపీ అధినేత జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా వెలుగులోకి వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టనున్నారు. ఈనెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి స్వయంగా వివరించనున్నారు. మహారాష్ట్ర క్యాడర్ కి చెందిన లక్ష్మీనారాయణ కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గత కొంతకాలంగా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆహ్వానించిందని ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఆయన విరామమిస్తూ సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా తెలుస్తుంది.
ప్రభుత్వ సేవలో ఉన్నప్పటినుంచే ఆయన గ్రామీణ సమస్యలపై,ముఖ్యంగా రైతుల స్థితిగతులపై అధ్యయనం చేశారు. పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి రైతులతో మమేకమయ్యారు. వారి ఇక్కట్లను స్వయంగా తెలుసుకున్నారు. అనేక కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్యపరిచారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని కితాబు ఇచ్చారు. అంతేకాకుండా బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలంలో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక కూడా ఇచ్చారు. ఎట్టకేలకు అందరి ఊహాగానాలకు తెరదింపుతూ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇచ్చేసారు.