దర్యాప్తు సంస్థలపైనే ఎదురు కేసులు.. తెలుగు రాష్ట్రాలలో కొత్త ధోరణి

దర్యాప్తు సంస్థలంటే ఇక రాజకీయ నాయకులకు భయం పోయిందా? వాటి దూకుడుకు అడ్డు కట్ట వేసే కిటుకు వారు కనిపెట్టేశారా? అంటే ప్రస్తత పరిస్థితులను గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది. దర్యాప్తు సంస్థల దూకుడును అరికట్టడానికి ఏం చేయాలో మాత్రం ముందుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ దారి చూపారని చెప్పాలి.  ఆ తరువాత దానినే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవుతున్నారు. రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆ ఆరోపణలను బలపరిచేవిగానే ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే.. రాష్ట్రంలో  కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని తెరాస సర్కార్ మధ్య యుద్ధం జరుగుతున్నదా అన్నట్లుగానే ఉంది. కేంద్రం తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తెరాస కేంద్రం నేతలు లక్ష్యంగా ఏకంగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద రాజకీయ పంజరంలో దర్యాప్తు సంస్థలు బందీ అయిపోయాన్న భావన మాత్రం సామాన్య జనంలో బలంగా ఏర్పడిందనడంలో సందేహం లేదు. ఇక దర్యాప్తు సంస్థల తనిఖీలు, దాడులు, సోదాలను ఎదురుదాడితోనే ఎదుర్కొవాలన్న నిర్ణయానికి రాజకీయ పార్టీలు వచ్చేశాయని చెప్పక తప్పదు.

దర్యాప్తు సంస్థల అధికారులపై ఎదురు కేసులు పెట్టడం ద్వారా దర్యాప్తును నీరుగార్చడం, లేదా జాప్యం అయ్యేలా చూడటం అన్న ఎత్తుగడను రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఈ ధోరణి వైసీపీ సర్కార్ పాలనలోని ఏపీలో తొలుత మొదలైందని చెప్పాలి. వైఎస్ వివేకా హత్య కేసు ఏపీ సర్కార్ కు ఇష్టం లేకపోయినా సర్కార్ ప్రమేయం లేకుండా నేరుగా హై కోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టీ పట్టడంతోనే తీగలు లాగేసింది.. డొంకలు వరకూ దర్యాప్తు చేరిపోయింది. వివేకా హత్య వెనుక సూత్రధారులు ఇక వెలుగులోనికి వచ్చేసినట్లు అన్న పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మొదలైంది సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టడమనే ప్రక్రియ. అలాగే దాడుల ప్రక్రియ. దీంతో కొలిక్కి వచ్చిందనుకున్న దర్యాప్తు పురోగతి మందగించింది.

దీంతో స్వయంగా సీబీఐయే హైకోర్టుకు తమపై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదనీ చెప్పుకుంది. చివరకు వివేకా హత్య కేసు విచారణ  ఏపీ బయట జరిగేలా ఉత్తర్వులు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు కూడా విన్నవించుకుంది.ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును సరిగ్గా అలాగే అడ్డుకోవాలని కేసీఆర్ తమ పార్టీ నేతలకు సూచించారు. దర్యాప్తు సంస్థలపై తిరగబడండని ఏకంగా పిలుపు నిచ్చారు. మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ చెప్పింది అమలులో పెట్టేశారు కూడా. తన నివాసాలు కార్యాలయాలు, అలాగే తన బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాలను రాజకీయ కక్ష పూరితమైనవేనని ఆరోపించడమే కాకుండా తన కుమారుడిపై ఐటీ అధికారులు చేయి చేసుకున్నారంటూ ఆరోపణలకు గుప్పించారు.

ఆస్పత్రి పాలైన కుమారుడిని చూడనీయడం లేదంటూ తన ఆస్పత్రి ముందే ధర్నాకు దిగారు. అంతే కాదు తన కుమారుడిపై ఒత్తిడి తీసుకువచ్చి ఐటీ అధికారులు కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై ఐటీ అధికారపై కేసు నమోదైంది. మొత్తం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ క్రీడలో పావులుగా మారిపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో పడిన పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది.  దీంతో దర్యాప్తు సంస్థలు సజావుగా తమ పని కొనసాగించే పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు. ఇందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.