కడప ఎంపీ అవినాష్ అనుచరులపై కేసు
posted on Jun 24, 2025 9:27AM
.webp)
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహిత అనుచరులపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ ను కారులో వెంబడించారన్న ఆరోపణలపై వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ లపై పులివెందుల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తనను కొందరు వ్యక్తులు కారులో వెంబడించారనీ, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందనీ పులివెందుల పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్ లపై బీఎన్ఎస్ లోని 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోతారని వైసీపీ స్థానిక నాయకులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.