ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన.. ప్రభుత్వంపై కాగ్ మండిపాటు..
posted on Nov 26, 2021 5:04PM
ఏపీలో ఆర్థిక నిర్వహణకు అసలు బడ్జెట్కు పోలిక లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ రిపోర్ట్ తేల్చిచెప్పింది. శాసనసభను లెక్కలోకి తీసుకోకుండా పద్దులు నిర్వహిస్తున్నారని తప్పుబట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం.
"2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను వ్యయం చేసి, ఆ తర్వాత జూన్ 2020లో శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు చోటు చేసుకున్నాయి".. అంటూ కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
"చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీనపరిచారు. ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారు. శాసనసభ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసిన సందర్భాలు పునరావృతం అవుతున్నాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదు" అని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"2018-19 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయి. కొత్త సంక్షేమ పథకాల వల్ల రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం పెరిగాయి. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20లో 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పొల్చితే 2019-20లో రూ.32,373 కోట్ల మేర బకాయిల చెల్లింపులు పెరిగాయి. చెల్లించాల్సిన బకాయిల వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదు. శానస వ్యవస్థను నీరు గార్చేలా నిధుల నిర్వహణ ఉంది" అని కాగ్ తన నివేదికలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.