బీఆర్ఎ రజతోత్సవాలు పార్టీ జాతర కాదు తెలంగాణ పండగ!

తెలంగాణ రాష్ట్ర సమితి, (టీఆర్ఎస్) రజతోత్సవం జరుపుకుంటోంది. తెలంగాణ పండగ చేసుకుంటోంది.అయితే, ఇది టీఆర్ఎస్/ బీఆర్ఎస్ పండగేనా అంటే కాదు.ఇది, తెలంగాణ పండగ. తెలంగాణ ప్రజల పండగ. ఎవరు అవున న్నా, ఎవరు కాదన్నా, టీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ. అందుకే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం (ఏప్రిల్ 27)జరుపుకుంటున్న రజతోత్సవ వేడుక. ఒక పార్టీ వేడుక కాదు, తెలంగాణ ప్రజల పండగ. తెలంగాణ ఇంటింటి పండగ.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పాతికేళ్ళ క్రితం,2001 ఏప్రిల్‌ 27న, కల్వకుట్ల చంద్రశేఖర రావు సారధ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్,(ప్రస్తుత భారత రాష్ట్ర సమితి-బీఆర్ఎస్), లక్ష్యాన్ని సాధించి చరిత్రను సృష్టించింది. నిజానికి, టీఆర్ఎస్ కు ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వుంది. ప్రత్యేక రాష్ట సాధన కోసం ఉద్యమాలు సాగాయి. పార్టీలు పుట్టాయి. కానీ, తెలంగాణ ప్రజల ఆరుపదుల ఆకాంక్ష  నెరవేరింది మాత్రం టీఆర్ఎస్ సారథ్యంలో  సాగిన 14 ఎళ్ల పోరాటం ద్వారానే అనేది కాదనలేని నిజం. నిజం. రాష్ట్ర ఆవిర్భావానికి, ఇతర కారాణాలు ఎన్నున్నా, మూలం మాత్రం టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్. అవును పాతికేళ్ళ నాడు జలదృశ్యంలో కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండానే  ఉద్యమాన్ని, విజయ తీరాలకు చేర్చింది.      

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పాతికేళ్ళ క్రితం 2001 ఏప్రిల్‌ 27న  కల్వకుట్ల చంద్రశేఖర రావు సారథ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి-బీఆర్ఎస్) పాతికేళ్ళ ప్రస్థానంలో మెరుపులు,మరకలు, చూసింది. అయినా.. టీఆర్ఎస్ ఆవిర్భావం  చరిత్రలో స్థిరంగా నిలిచి పోయే ఒక  చారిత్రిక సత్యం.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్  పుష్కర కాలానికి పైగా సాగించిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది. 
నిజానికి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక.. కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది.  ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్‌తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది.

2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.

పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ మధ్యలో దృష్టి సారించారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అంత అనుకూలంగా రాలేదు.  స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇండ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది.ఆయితే 2024 ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత డీలా పడింది. ఈనేపధ్యంలో ఈరోజు బీఆర్ఎస్ జరుపుకుంటున్న రజతోత్సవాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.