రాసిపెట్టుకోండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..కేసీఆర్ దీమా
posted on Apr 27, 2025 8:15PM
.webp)
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా జమ్మూకశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు.. ఎంతోమంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు. ఇవాళ ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. ఆ నాడు గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారని చెప్పారు. కానీ ఎనాడూ నిరాశ చెందలేదని.. నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని, జననీని, జన్మభూమిని మించింది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవమానపరిచారు.
ఎన్నో మాటలు అన్నారు. ఎగతాళి, అవహేళన చేశారు. మఖలో పుట్టింది పుబ్బలో పోతదని అన్నారు. కానీ అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది బలిదానాలతోని, అనేక ఉద్యమాలతోని యావత్ తెలంగాణ అద్భుతమైన ఉద్యమమై ఎగిసిపడింది. ఒక సమయంలో తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చుని బరిగీసి నా తెలంగాణ అక్కడ పెట్టు అని నిలబడ్డ సందర్భం సృష్టించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని అన్నారు.కేసీఆర్ రైతు బంధు కింద ఏం ఇస్తుండు.. పదివేలు ఇస్తుండు.. మేం 15 వేలు ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్లు 2 వేలు ఇస్తుండు మేం 4 వేలు ఇస్తామని చెప్పిండ్రు. ఇద్దరు ఉంటే ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరం ఇస్తమని చెప్పిండ్రు.. ఇవన్నీ కాంగ్రెసోళ్లు చెప్పిండ్రు కదా.. దివ్యాంగులకు కేసీఆర్ 4 వేలు ఇస్తుండు మేం 6 వేలు ఇస్తమండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు.
విద్యార్థులకు విద్యాకార్డు కింద ఐదు లక్ష్యల గ్యారెంటీ కార్డు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పిండ్రు. ఇక ఒకరి వెనుక ఒకరు ఉరిచి.. 2 లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ 9న ఒక కలంపోటుతో ఖతం చేస్తా అని అన్నారు. చేసిండ్రా అంటే చేయలేదు అని కేసీఆర్ విమర్శించారు.ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం పుట్టలేదు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్ర కల కూడా నెరవేరింది. చీకట్లను పారదోలడానిక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెనక్కి మళ్లితే, ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపాండని అని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించాను.
ఆ తనదనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్యమం పురోగమించిందన్నారు.హెచ్సీయూ భూములు అమ్ముకుంటున్నారు. అసలు ఏ భూములు అమ్ముకోవాలి. ఏ భూములు అమ్మకూడదో విచక్షణ ఉండాలని సూచించారు. వందకు వందశాతం మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.