హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ..సడెన్గా అమెరికాకు కవిత గులాబీ పార్టీలో గుబులు
posted on May 16, 2025 4:53PM

బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారిద్దరూ సుమారు 2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. హరీశ్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్ రావు తండ్రి ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు.
ఈ క్రమంలో హరీశ్ రావు ఇంటికి వచ్చిన కేటీఆర్ అక్కడ సుమారు 2 గంటల పాటు హరీశ్ రావుతో సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, గులాబీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత పరిస్తితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల హరీశ్ రావుపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ రావు క్లారీటీ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని స్వాగతిస్తానని ఇటీవలే హరీశ్ రావు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
మరోవైపు మరికాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్ళనున్నారు. ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇటీవల కవిత సైతం సొంత పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేటీఆర్ భేటీ కావడం పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.