యెమెన్లో ఘోర విషాదం.. సముద్రంలో పడవ బోల్తా.. 68 మంది మృతి
posted on Aug 4, 2025 1:38PM

సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. యెమెన్ వద్ద సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
54 మృతదేహాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి. మరికొన్ని మృతదేహాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. వీటిని మార్చురీకి తరలించారు. గల్లంతైన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెడుతుంటారు.
స్మగ్లర్లు వారిని పడవల ద్వారా రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ల మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పడవల్లో సామర్థ్యానికి మించి వలసదారులను ఎక్కించుకుంటూ ఉంటారు. ఓవర్ లోడ్ కారణంగా ఆ పడవలు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. పెద్ద సంఖ్యలో వలసదారులు చనిపోతూ ఉంటారు. గత కొన్ని నెలల్లోనే వందల మంది వలసదారులు పడవ బోల్తా ఘటనల్లో చనిపోయారు. మార్చి నెలలో ఏకంగా నాలుగు బోట్లు బోల్తా పడ్డాయి. 186 మంది గల్లంతయ్యారు. ఈ విషయాలను ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది.