నాకు ఓటు వేయకపోతే మిమల్ని శపిస్తా

 

నాకు ఓటేయండి.. మీకు అది చేస్తా, ఇది చేస్తా అని హామీలు ఇచ్చే నాయకులను చూస్తుంటాం. అయితే ఒక బీజేపీ నేత మాత్రం నాకు ఓటు వేయకపోతే మిమల్ని శపిస్తా అని బెదిరిస్తున్నాడు. ఆయనే ఎంపీ సాక్షి మహారాజ్‌. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. అయితే ఆయన అక్కడి ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దూరం రేపుతున్నాయి. 'నేను సన్యాసిని. మీరు గెలిపిస్తే .. నేను గెలుస్తా. లేకుంటే గుళ్ళో నేను భజన  చేసుకుంటా లేదా కీర్తనలు పాడుకుంటా. అయితే ఇవాళ నేను ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చాను. మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను. సన్యాసినిని మీరు నిరాకరిస్తే.. మీ కుటుంబ సుఖసంతోషాలను తీసేసుకుంటాను. మిమ్మల్ని శపిస్తాను' అని సాక్షి మహారాజ్‌ ఓటర్లను బెదరించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.