"ఛత్రపతి"నే టచ్ చేసింది...!
posted on May 5, 2016 5:50PM

మరాఠాలు దైవంగా కొలిచే మహాయోధుడు ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్రులకు ఎంత గౌరవం, భక్తి ఉందో దేశమంతా తెలుసు . అలాంటి ఛత్రపతి శివాజీని అగౌరవపరిచింది ఒక బీజేపీ మహిళా కార్పోరేటర్. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ కార్పోరేటర్ రాజశ్రీ శిర్వాద్కర్ కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహంపై చేయి వేసి స్టైలుగా ఫోటోకి పోజిచ్చారు. ఇక్కడితో బాగానే ఉంది. కాని ఆమె ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ధీరత్వానికి ప్రతీకగా కొలిచే శివాజీపై చేయివేస్తావా..? అంటూ ఆ పోస్ట్పైనా, కార్పోరేటర్పైనా నెటిజన్లు ఫైరయ్యారు. ఈ ఫోటో అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ నేతల కంట పడింది. ఇంకేముంది దీనికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో రాజశ్రీపై చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ కూడా నిర్వహించారు. కళ్లు తెరచిన కార్పోరేటర్గారు తాను పొరపాటు చేశానని, శివాజీపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.