రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి

 

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మెహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన యం.యల్.సి.ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు విజయం సాధించారు. ఆయన తెరాసకు చెందిన జి. దేవి ప్రసాదరావు మీద 13, 318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించగలిగారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకు నీటిపారుదల శాఖలో తను చేస్తున్న ఉద్యోగానికి దేవీ ప్రసాద్ రాజీనామా చేసి మరీ ఈ యం.యల్.సి.ఎన్నికలలో పోటీ చేశారు. కనుక ఈ ఓటమిని జీర్ణించుకోవడం ఆయనకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరువురికీ కూడా కష్టమే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కేవలం 2, 856 ఓట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గాలలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు జరిగిన 11రౌండ్ల ఓట్ల లెక్కింపులో తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర రెడ్డి తన సమీప బీజేపీ ప్రత్యర్ధి ఎర్రబెల్లి రామ్మోహన్ రావుపై పూర్తి ఆధిక్యత కనబరుస్తున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి 8277 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu