అతిక్ అహ్మద్ మామూలోడు కాదు
posted on Apr 22, 2023 8:20PM
అతిక్ అహ్మద్ ఈ లోకాన్ని వదిలి పోయి వారం రోజుల పైనే అయింది. అంత్యక్రియలు కూడా జరిగి పోయాయి. అయినా, అయన పేరు వింటే ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యంగా అతగాడు ఆడుతూ పాడుతూ హత్యలు, అత్యాచారాలు , కబ్జాలు చేసిన ప్రయాగ్రాజ్లో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఆవును కొద్ది రోజుల క్రితం సినిమా ఫక్కీలో మర్డరై పోయిన యూపీ గ్యాంగ్స్టర్, సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ మర్డర్ కు ముందు అయన ఎవరో ఉత్తర ప్రదేశ్ బయట పెద్దగా తెలియక పోవచ్చును కానీ, ఆయన కొడుకు ఎన్ కౌంటర్ లో చనిప్యిన రెండు రోజులకే పోలీసులు, మీడియా కెమెరాల సాక్షిగా ‘లైవ్’లో హత్యకు గురైన తర్వాత ప్రపంచానికి ఆయన పరిచయం అవసరం లేకుండా పోయింది. నిజానికి, అతిక్ అహ్మద్ హత్య మనకు కొత్త కావచ్చును కానీ, ఇలాంటి హత్యలు చూడడమే కాదు చేసిన అనుభవం కూడా ఆయనకు ఉందని యూపీ మీడియా కోడై కూస్తోంది. ఒక్క హత్యలు, అత్యాచారాలే కాదు అతిక్ అహ్మద్ యూపీ లొ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.సమాజ్వాదీ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను నిర్వహించిన అతిక్ ఇష్టారాజ్యంగా కబ్జాలు సాగించారు. చిత్రం ఏమిటంటే ఆయన బాధితులలో మాములోళ్లు కాదు, మహా నాయకులు, వారి బంధువులు కూడా ఉన్నారు. అది కూడా ఇంకెవరో కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిలా నాయకురాలిగా కితాబు అందుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బంధువులు కుడా ఉన్నారు.
రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుతం అధికారంలో ఉన్న రోజుల్లోనే,అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బంధువు భూమిపై కూడా అతని కన్ను పడినట్లు తెలుస్తోంది. అయితే సోనియా తక్షణమే జోక్యం చేసుకోవడంతో అతిక్ పప్పులు ఉడకలేదు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండటంతో అతిక్ ఆటలు సాగలేదు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోనియా మామ గారైన ఫిరోజ్ గాంధీ కుటుంబానికి చెందిన వీర గాంధీకి ప్రయాగ్రాజ్లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో స్థలం ఉంది. ఆ స్థలాన్ని అతిక్ కబ్జా చేసి, తన మనుషులను అక్కడ పెట్టాడు.ఫిరోజ్ తోడల్లుడి సమీప బంధువైన వీర గాంధీ సోనియా గాంధీ సహాయాన్ని కోరారు. సోనియా జోక్యం చేసుకుని, అప్పటి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషీతో మాట్లాడారు. రీటా జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. దీంతో అతిక్ వెనుకంజ వేసి, ఆ భూమిని తిరిగి వీర గాంధీకి అప్పగించాడు.
వీర గాంధీకి సహాయపడటానికి స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముందుకు రాలేదని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే అతిక్ హత్య తర్వాత వీర గాంధీని మీడియా సంప్రదించింది. కానీ అతిక్ గురించి తానేమీ మాట్లాడబోనని వీర చెప్పారు. అయితే రీటా మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీర గాంధీ భూమి విషయంలో తనతో సోనియా గాంధీ మాట్లాడారని, తాను జిల్లా యంత్రాంగంతో మాట్లాడానని, ఫలితంగా అతిక్ వెనుకంజ వేసి, భూమిని వదిలేశాడని చెప్పారు. దీని బట్టి చూస్తే, సోనియా గాంధీ బంధువు వీర గాంధీ అంతటి వాడు కూడా అతిక్ అహ్మద్ చనిపోయి వారం రోజులకు పైగానే అయినా ఇంకా, అతని పేరు ఎత్తెందుకు కూడా భయపడుతున్నారు,
అంటే,అతిక్ ఎంత భయంకరుడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అతిక్ అహ్మద్ మామూలు గ్యాంగ్స్టర్ కాదు, అరివీర భయంకర గ్యాంగ్స్టర్. అతిక్ అహ్మద్పై 100కుపైగా కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు వంటి కేసులు ఉన్నాయి. అతిక్ ఆస్తుల విలువ అనేక వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రూ.1,169 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వీటిలో రూ.750 కోట్ల విలువైన ఆస్తులను ధ్వంసం చేయగా, రూ.417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అతను సంపాదించిన ఆస్తుల్లో ఇది సముద్రంలో నీటి బొట్టు వంటిదని అధికారులు చెప్తున్నారు.అందుకే అతగాడిని అంత అమానుషంగా హత్య చేసినా రాజకీయ నాయకులు తప్పించి సామాన్య ప్రజలు కనీసం, అయ్యో ..అనైనా అనలేదు. అవును అతిక్ మామూలోడు కాదు. మామూలు గ్యాంగ్స్టర్ కాదు.