పీఎస్సార్ కు బీపీ డౌన్.. బెజవాడ జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలింపు

విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 24) అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఆయనకు బీపీ డౌన్ అయ్యిందని అంటున్నారు. ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయులును ఏప్రిల్ 22న హైదరాబాద్ లో  ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  అంతేకాకుండా ఆయన ఇంటితో పాటు ఫామ్‌హౌస్‌లోను, ఆయన బంధువుల ఇళ్లల్లోను సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 

అంతకు ముందు శుక్రవారం (మే 23) హైదరాబాద్   శివారు మొయినాబాద్ మండలంలోని  ఆయన ఫామ్ హౌస్ లో  ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సోదాలు కొనసాగాయి.  ఈ ఫామ్ హౌస్ లోనే గత నెల 22న ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా పీఎస్సార్   ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ వాల్యుయూషన్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  2018-2019 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు   నిధులు దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలపై పీఎస్సార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.