ఎన్నికల కమిషన్ బీజేపీ ప్లేయర్గా కాదు.. అంపైర్గా ఉండాలి : తులసి రెడ్డి
posted on Aug 18, 2025 8:23PM

ఓటర్ల జాబితాలో అవకతవకలకుగానూ ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. సోమవారం కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అంపైర్ లా కాకుండా బీజేపీ టీమ్ ప్లేయర్ గా ప్రవర్తించడం గర్హనీయమన్నారు.
ప్రజా స్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువని, అటువంటి ఎన్నికలకు సక్రమమైన ఓటర్ల జాబితా ప్రామాణికమని,కానీ అటువంటి ఓటర్ల జాబితాలో కొందరు అర్హులకు చోటు లేకపోవడం,కొందరు అనర్హులు ఉండడం సర్వ సాధారణం అయిందన్నారు.
ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు గానూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.అవక తవకలు ఉన్నందుకు ఎన్నికల కమిషనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఓటర్ల జాబితాలో అవక తవకలు ఉన్నాయని అన్నారు.
మరి ఆయనను కూడా క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ అడగాలి కదా అని ప్రశ్నించారు. నిస్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ నియామకమే పక్షపాతంతో కూడుకొని ఉందని, నియామక కమిటీలో ప్రధాన మంత్రి,లోక్ సభలో ప్రతి పక్ష నాయకుడు తో పాటు న్యాయ మూర్తి బదులు కేంద్ర మంత్రి ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని తులసి రెడ్డి కోరారు.