విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
posted on Aug 8, 2014 8:54AM
.jpg)
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో ఒక్కో జిల్లాలో వారానికి రెండు రోజులు చొప్పున పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు రేపు విశాఖ జిల్లాలో పర్యటించ నున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి నుండి చంద్రబాబు జిల్లా పర్యటన ప్రారంభిస్తారు. ఈరోజు ఆయన తుమ్మపాల, గంధవరం, గజపతి నగరం గ్రామాలలో పర్యటిస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలు, విద్యార్ధులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకొంటారు. ఆ తరువాత స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జిల్లా పరిస్థితి తెలుసుకొని అవసరమయిన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈరోజు చోడవరంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన పాల్గొంటారు.
గత ఏడాది ఆయన పాదయాత్ర చేసినపుడు గ్రామీణ ప్రజల సమస్యలు అనేకం ఆయన దృష్టికి వచ్చాయి. అయితే అప్పుడు ఆయన అధికారంలో లేనందున వాటిని పరిష్కరించలేకపోయారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి సమస్యలను పరిష్కరించగలిగే స్థితిలో ఉన్నందునే అయన ఇప్పుడు ఈవిధంగా గ్రామాలను పర్యటిస్తున్నారని భావించవచ్చును. ముఖ్యమంత్రి స్వయంగా అన్ని జిల్లాలలో గ్రామాలను పర్యటించడం చాలా కష్టమే అయినప్పటికీ, ప్రజల నుండి వస్తున్న అనూహ్యమయిన స్పందన చూసి చంద్రబాబు జిల్లా పర్యటనలు కొనసాగిస్తున్నారు.