మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టి, ఆమోదింప చేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులమీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీ రాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. 

గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లులును ప్రవేశపెట్టింది. అయితే శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడింది. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించటంతో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా శాసన మండలిని రద్దు చేస్తూ శాసన సభ తీర్మానం చేసింది. మార్చి 15 వ తేదీ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి సత్తా చాటితే మూడు రాజధానులకు ప్రజల మద్దతు లభించినట్టేననే అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించాలని ప్రభుత్వం భావిస్తోంది.