అలిపిరి నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత
posted on Sep 20, 2023 9:11AM
తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకదారిలోని లక్ష్మీనరసింహ ఆలయం 2850 మెట్టు వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ బోనులోకి చిరుత చిక్కింది. దీంతో ఇప్పటి వరకూ అలిపిరి నడకదారిలో ఆరు చిరుతలను బంధించినట్లైంది.
వీటిలో మూడింటిని అటవీ అధికారులు అరణ్యంలో విడిచిపెట్టారు. చిన్నారి లక్షితను పులి చంపిన ఘటన తర్వాత అధికారులు ట్రాప్ బోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధిస్తున్నారు. మ్యాన్ ఈటర్ చిరుతను గుర్తించి దానిని జూకు తరలించాలని భావిస్తున్నారు. అయితే ఇంత వరకూ బంధించిన వాటిలో మూడు చిరుతలు మ్యాన్ ఈటర్ లు కావని నిర్ధారణ కావడంతో వాటిని అడవిలో విడిచిపెట్టారు.
తాజాగా బోనులో చిక్కిన చిరుత కాకుండా మిగిలిన రెండింటిలో లక్షితను చంపిన చిరుతను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా అలిపిరి నడకదారిలో వెళ్లేందుకు భక్తులు భయపడాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలూ తీసుకున్నామనీ, భక్తులకు కర్రలు పంపిణీ చేస్తున్నామనీ తెలిపారు.