వల్లభనేని వంశీ... అయ్యో పాపం అనే నాథుడే లేడు!

 

చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు వంశీ గత 95 రోజులుగా రిమాండ్ ఖైదీగగా జైలులో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో ఒకటి రెండు సార్లు జైలు నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా గురువారం (మే 16) కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన జైలుకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. అప్పటి నుంచీ ఆయన జైలులోనే ఉన్నారు. ఒక కేసు తరువాత ఒక కేసు వంశీ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తం ఐదు కేసులలో నాని నిందితుడు.

టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే విషం కక్కారు. పార్టీ అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు అక్రమాలు, దౌర్జన్యాలు. ఇప్పుడా పాపాలన్నీ ఒకే సారి పండుతున్నాయా అన్నట్లుగా ఆయనపై కేసులు నమోదౌతున్నాయి. చివరికి ఆయన సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం వంశీ పరిస్థితి పట్ల ఇసుమంతైనా సానుభూతి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏదో కొద్ది మంది అనుచరులు వినా ఆయనకు మద్దతుగా మాట్లాడే వారే కరవయ్యారు. ఇదంతా వంశీ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయమే సాధారణ జనం నుంచి వైసీపీ క్యాడర్ వరకూ వ్యక్త అవుతోంది. 

రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి ఆ పార్టీ కష్ట కాలంలో ఉండగా కాడె వదిలేసి అధికారపార్టీ పంచన చేరిన వంశీ.. అలా చేరి ఊరుకోకుండా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు  తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే 2024 ఎన్నికల నాటికే ఆయన జనం మద్దతును సానుభూతినీ కోల్పోయారు. ఇక ఓటమి తరువాత నియోజకవర్గానికి ముఖం చూపిన పాపాన పోలేదు. అసలు దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్నట్లుగా ఆయన కనిపించలేదు. వినిపించలేదు. అయితే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మళ్లీ రంగంలోకి దూకారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అక్కడే అడ్డంగా బుక్కై అరెస్టయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయన కటకటాల వెనుకే ఉన్నారు. 

అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిలు వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయనపై ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్య‌క్తికి సంబంధించిన ఇంటి వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. వాటితో స‌ద‌రు ఇంటి కబ్జాకు సహకరించారన్న కేసు, అలాగే 2019 ఎన్నికల సమయంలో వంశీ ఓ పోలింగ్ బూత్ వద్ద చేసిన హంగామాకు సంబంధించిన కేసు వంశీ స‌హ‌క‌రించారని కేసు న‌మోదైంది. ఇలా వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు కేసుల్లో వంశీకి బెయిలో, ముందస్తు బెయిలో లభించింది. ఇక ఆరో కేసులో అంటే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన బెయిలు పిటిషన్ పై శనివారం ( మే 17)న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆ కేసులో కూడా వంశీకి బెయిలు వస్తే ఇక ఆయన విడుదలే అని అంతా భావించారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులూ వంశీ విడుదల ఖాయమన్న ఆశాభావంతో ఉన్నారు. అంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై వంశీపై నమోదైన కేసులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానికి నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సపోజ్, ఫర్ సపోజ్ బెయిలు వచ్చినా విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి.  

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఈ నెల 19లోగా కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశిం చింది. అయితే వంశీని ఈ కేసులో శనివారమే పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని అంటున్నారు.  వంశీ వరుస కేసులతో జైళ్లోనే ఉంటున్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు వినవస్తున్నా అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు.