మాజీ డీజీపీ ప్రసాద్ రావు మృతి..
posted on May 10, 2021 10:15AM
ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ ప్రసాద్ రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ప్రసాద రావు సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా పనిచేసిన ప్రసాద్ రావు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా, ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. బి.ప్రసాదరావు 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1997లో ఆయన భారత పోలీసు, 2006లో రాష్ట్రపతి పతకాలు అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన మరణవార్త రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.