కరోనా నేపధ్యంలో ఏపీలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన రవాణాశాఖ

కేవలం నిత్యావసర, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తూ ఏపీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక టీం లు ఏర్పాటు చేయటంతో పాటు, అతిక్రమించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయటానికి నిర్ణయం తీసుకుంది. అనుమతి తీసుకున్న అత్యవసరం కారుకు సైతం డ్రైవర్ కాకుండా ఒకరు మాత్రమే వెళ్ళే అవకాశం, ఆ ఒక్కరు కూడా వెనుక సీటులో నే ప్రయాణం చేయాలి అనే నిబంధన విధించింది. బైక్ పై ఒకరికి మాత్రమే అనుమతి, అలాగే అన్ని గూడ్స్ వాహనాలకు అనుమతి ఇవ్వాలని, ఖాళీ గూడ్స్ వాహనాలకు  ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. 

గూడ్స్ వాహనాల  ఇబ్బంది ఉంటే రాష్ట్ర కంట్రోల్ రూం ని సంప్రదించాలని, లారీ ఓనర్స్ తో సమావేశం అయ్యి వారికి అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.  హైవే పై ట్రక్ రిపేర్ షాపులు, డాబాలు, లేబర్ ట్రాన్స్పోర్ట్ లాంటి అంశాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని 1 శాతం హైపో క్లోరైట్ సొల్యూషన్ తో సాటిటైజ్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అందిస్తామని కూడా వారు చెప్పారు.