ట్యాంక్‌బండ్‌పై టీడీపీ ధర్నా, అరెస్ట్‌

హైదరాబాద్‌ : అంబేద్కర్‌ విగ్రహాల కూల్చివేత సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు.రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఆయన  ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. ఆందోళన కారణంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు మోత్కుపల్లి నర్సింహులును అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం ప్రభుత్వమే చేయిస్తోందని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఈ సంఘటనలో అసలు దోషులను శిక్షించలేని సీఎం వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటల ఫలితంగానే ఈ విగ్రహాల కూల్చివేత జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చుపెడుతుందని ఆయన విమర్శించారు. మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించడంతో టీడీపీ, కేవీపీఎస్‌ కార్యకర్తలు పోలీసులు అరెస్ట్‌ చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu