తాగుబోతు ఖాకీలపై చర్యలు.. టీటీడీ ఈవో శ్యామలరావు
posted on May 24, 2025 2:33PM
.webp)
తిరుమలలో తప్పతాగి హల్ చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు చెప్పారు. అన్నమయ్య భవన్ లో శనివారం (మే 24) డయల్ యువర్ ఈవో కార్యకరమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పుష్కరిణిలో శుభ్రంగా ఉండడం లేదని భక్తుల ఫిర్యాదు చేశారనీ, అద్దె గదులలో బాత్రూంలు కొన్ని సరిగా క్లీన్ చేయడం లేదని కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. ఇక శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతోందని భక్తుల వద్ద నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. భక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈవో స్పష్టం చేశారు.
అలాగే శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నమన్న ఆయన ఇటీవల తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తిరుమలను ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు. 100 బిగ్ క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్ల కేటాయింపు విషయంలో నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని అన్నారు. భక్తులకు సాంప్రదాయ వంటలు మాత్రమే అందించాలని మరోమారు స్పష్టం చేశారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టెక్నాలజీ ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. త్వరలో జిపిటి చాట్ బోట్ అందుబాటులోకి తీసుకువస్తామనీ, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 4 సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మరో 10 సేవలు ట్రయల్ రన్ లో ఉన్నాయని ఈవో శ్యామలరావు వివరించారు.