బైరెడ్డి భవిష్యత్ వాణి టి.ఆర్.ఎస్.కు 90 సీట్లు
posted on Mar 25, 2013 8:14AM
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉద్యమం చేస్తున్నారు. ఆదివారం కర్నూలుజిల్లా నందికొట్కూరులొ జరిగిన కార్యకర్తల సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ ... రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతానని తెలిపారు. అలాగే తెలంగాణలో ఎవరిని కదిలించినా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదం వినిపిస్తుందని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ప్రజల్లో బాగా ఉందని, రాబోయే ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.కు 90 సీట్లు ఖాయంగా వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని, అదే కనుక జరిగితే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని,టి.ఆర్.ఎస్.కు దీటుగా రాయలసీమ వాసుల్లో కూడా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం నినాదం కావాలని, ఇప్పటికే రాయలసీమ వెనుకబడి ఉందని, రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను రాయలసీమ పరిరక్షణ సమితికి కట్టబెట్టాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలు రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీలే అని ధ్వజమెత్తారు.