పార్టీ మారకముందే టీడీపీ ఎమ్మెల్యే అని రాసుకున్న వైసీపీ ఎమ్మెల్యే..

 

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి వైసీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి జంప్ అవ్వగా.. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ షాకిచ్చారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిశంకర్ టీడీపీ పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీని వీడే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఆయన తన కార్యకర్తలతో సమావేశమై వారి అభీష్టం మేరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈయన ఎంట్రీకి టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంకా పార్టీ మారకముందే..రాజశేఖర్ రెడ్డి తన ఫేస్ బుక్ లోని తన పేజ్ ను అప్పుడే టీడీపీ లోకి మార్చేశాడు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే అని కూడా తన ప్రొఫైల్ లో రాసేసుకున్నాడు.


మరోవైపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుజ్జగింపు చర్యలు చేపట్టడానికి ప్రయత్నించినా ఆయన మాత్రం టీడీపీలోకి వెళ్లడానికే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.