కూడంకుళం ప్రాజెక్ట్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
posted on May 6, 2013 3:51PM
కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంకు సుప్రీంకోర్టు ఓకె చెప్పింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీల నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్కడాలేవని న్యాయస్థానం తెలిపింది. చేపట్టవలసిన 17 భద్రతా చర్యల్లో ఇప్పటికే 12 అమలు చేశారని, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా అణు విద్యుత్ అవసరం ఎంతైనా ఉందని, ఇతర విద్యుత్లతో పోలిస్తే అణు విద్యుత్ చాలా చౌక అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని కొనసాగించవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకారులు, స్వచ్ఛంద సంస్థలు స్టే కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ వేగవంతంగా జరిగింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్ణ, దీపక్ మిశ్రాల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అణు విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ ఆందోళనలు తీవ్రతరం కావటంతో ఈ వివాదం కోర్టు కెక్కింది.