తెలంగాణాపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం

  నిన్న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన టీ-కాంగ్రెస్ నేతల తెలంగాణా సాధన సభ, విజయవంతమయింది. నేతలందరి సమిష్టి కృషివల్ల వేలాదిగా జనాలు తరలివచ్చారు. వారిని చూసిన నేతలకి కూడా మరింత ఉత్సాహం కలిగింది. ఇంతకు ముందు జరిగిన సభలు, సమావేశాలకి ఈ సభకి వారిలో చాలా స్పష్టమయిన మార్పు కనిపించింది. ఇదివరకు వారు తమ ప్రసంగాలలో తమ అధిష్టానాన్ని వెంటనే తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకొంటామని బెదిరిస్తూ మాట్లాడేవారు. అయితే, ఈ సారి మాత్రం అందరూ తమ అధిష్టానంపై పూర్తి నమ్మకం ప్రకటించడమే కాకుండా, కేవలం కాంగ్రెస్ వల్లనే తెలంగాణా వస్తుందని మరీ మరీ నొక్కి చెప్పారు. ప్రసంగించిన నేతలందరూ కూడా, ఇతర అంశాలను పక్కన బెట్టి, కేవలం ‘కాంగ్రెస్ వల్లనే తెలంగాణా వస్తుందని’ చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యతనీయడం గమనిస్తే, దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఉన్నట్లు అర్ధం అవుతోంది.   ఉద్యమాలతో తెలంగాణాలో పాతుకుపోయున్న కేసీఆర్ మరియు అతని పార్టీని ఎదుర్కోవడానికి తన పార్టీ నేతలని సిద్దం చేసి, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినప్పుడు ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకే దక్కేలా చేయడానికే అధిష్టానం ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది. మధుయాష్కీ మాట్లాడుతూ, కేవలం 15మంది యంపీలను గెలిపిస్తే తెరాస ఏవిధంగా తెలంగాణా సాధిస్తుందని ప్రశ్నించారు. 15మంది గెలిస్తే తెరాస బలపడుతుంది తప్ప రాష్ట్రం ఏర్పడదని, అందువల్ల జాతీయపార్టీ అయిన తమ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని చెప్పడం పార్టీ పెద్దల మాటలని అప్పజెప్పడమే. అది కూడా రానున్నఎన్నికలలోగానే తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని కూడా విస్పష్టంగా ప్రకటించడం గమనిస్తే ఈ సభ మొత్తం అధిష్టానం కనుసన్నలలో జరిగిందని అర్ధం అవుతుంది.   అందువల్ల ఈ ‘మాస్టర్ ప్లాన్’ ప్రకారం త్వరలోనే ఇటువంటి సభలు సమావేశాలు తెలంగాణా వ్యాప్తంగా మరిన్నిజరిపించి, తెలంగాణా ప్రజలలో ఇంకిపోయిన తెరాస ప్రభావాన్ని కొంత మేరయినా తగ్గించిన తరువాత చివరాఖరిగా ‘తెలంగాణా ప్రక్రియ ఇస్టార్ట్’ అంటూ కేంద్ర ప్రకటన వెలువడచ్చును. ఈ లోగా, కేసీఆర్ ని, అతని పార్టీని తన చిలకలతో దారికి తెచ్చుకోవడం, తోక జాడిస్తున్న సీమంద్రా నేతలని, పార్టీలో, ప్రభుత్వంలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్న వారికి నయాన్నో భయాన్నోనచ్చజెప్పి దారిలో పెట్టుకోవడం వంటి చిన్నాపెద్దా కార్యక్రమాలన్నిటినీ పార్టీ పూర్తి చేసుకోవలసి ఉంటుంది.   రాబోయే ఎన్నికలలో చక్రం తిప్పాలని కలలు గంటున్నకేసీఆర్ కి, తెలంగాణాలో పాగా వేయాలని తిప్పలు పడుతున్న బీజేపీకి కాంగ్రెస్ హస్తం అడ్డుపడవచ్చును. మరి, తన పదేళ్ళ శ్రమని (ఉద్యమాన్ని) కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా ఆఖరి నిమిషంలో వచ్చి హైజాక్ చేసుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకొంటాడని భావించలేము. దానికి ఆయన ఎటువంటి ఎత్తుగడ వేస్తాడో వేచి చూడాల్సిందే.

టీ-కాంగ్రెస్ సభకి అధిష్టానం ఆశీస్సులు

  ఇంత కాలం టీ-యంపీ, టీ-యంయల్యే, టీ-మంత్రులు అంటూ వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలందరూ, రేపు నిజం కాలేజీ మైదానంలో జరగబోయే సభను విజయవంతం చేయడం కోసం అందరూ కలిసి చాలా ఐకమత్యంగా పనిచేయడం చాలా అసాధారణంగా కనిపిస్తోంది. వారి ఐఖ్యత, హడావుడి చూసి తెరాస నేతలు కూడా కొంచెం కంగారు పడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అదేశాలతోనే వారీవిధంగా ప్రవర్తిస్తున్నారా? అనే అనుమానాలున్నాయి.   తెలంగాణా ఇచ్చేది తామేనని వారందరూ ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా చెపుతుండటంతో, కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ళ ఉద్యమాన్నిఈవిధంగా ఆఖరి నిమిషంలో హైజాక్ చేయబోతోందా? అనే అనుమానం కూడా వారిలో మొదలయింది. ఒకవేళ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వదలిస్తే దాని పూర్తి ప్రయోజనం తనకే దక్కాలనుకొంటుంది తప్ప తెరాస చేతిలో పెట్టాలని అనుకోదు. గనుకనే, తన పార్టీ నేతలను ఈవిధంగా మాట్లాడేందుకు ప్రోత్సహించి, వారి ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఇస్తున్నట్లు ప్రకటించడానికే ఈ సభని వెనుక నుండి ప్రోత్సహించిందా? అందుకే అందరూ కలిసి సభని నిర్వహిస్తున్నా కూడా ఇంత వరకు అధిష్టానం ఎటువంటి అభ్యంతరము చెప్పలేదా? వంటి ధర్మ సందేహాలున్నాయి.అదేవిధంగా, ఈ సభ సరిగ్గా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా ఎంపికయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తున్న సమయంలోనే జరగుతుండటం, కేవలం కాకతాళీయమా లేక ఇది ముందుగానే రచించబడిన కాంగ్రెస్ మార్క్ వ్యుహమా? అనే ధర్మ సందేహం కూడా ఉంది.   ఒకవేళ అదే నిజమయితే, టీ-కాంగ్రెస్ నేతల చేత ఇటువంటివే మరో ఒకటి రెండు సభలు నిర్వహింపజేసి, చివరాకరిగా వారి ఒత్తిడి తట్టుకోలేకనే తెలంగాణా ఇచ్చేస్తున్నట్లు ప్రకటించేస్తే సాంకేతికంగా తెలంగాణా సాధన కాంగ్రెస్ ఖాతాలో జమా అవుతుందని, కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. అయితే, ఈ డ్రామా అంతా తెలంగాణా ప్రజలను మభ్యపెట్టేందుకేనని తెరాస నేతలు తేలికగా కొట్టిపారేస్తూ వారి అత్యుత్సాహం చూసి తామేమి భయపడట్లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఈవిధంగా హడావుడి చేసే బదులు పార్లమెంటులో ఒక బిల్లు పెడితే సరిపోతుంది కదా అని తెరాస నేత కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.   అయితే, టీ-కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇటువంటి విమర్శలేవీ పట్టించుకొనే స్థితిలో లేరు. రేపు ఏదో ఒక మహాద్భుతం జరగబోతున్నట్లు అందరూ చాలా హుషారుగా సభకి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి హడావుడికి తెరాస నేతలే కాకుండా సీమంద్రా నేతలలో కూడా గుబులు మొదలయింది. కానీ వారి సభ సారాంశాన్నిపూర్తిగా విశ్లేషించిన తరువాతనే, తమ భవిష్య ప్రణాళికలు గురించి ఆలోచించుకోవాలని వారు నిర్ణయించుకొన్నారు. ఏమయినప్పటికీ, రేపు నిర్వహించే ఈ సభతో టీ-కాంగ్రెస్ నేతలందరిలో ఐఖ్యత కొట్టవచ్చినట్లు కనబడుతోంది. వారు ఇదే విధంగా ఐకమత్యంగా తమ సత్తా చాటుతూ, తెరసాకు ధీటుగా నిలిస్తే ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు తెలంగాణా ప్రకటించే ఆలోచన లేకపోయినప్పటికీ, తప్పకుండా అందుకు సిద్దపడవచ్చును.

కాంగ్రెస్ పార్టీకి తెరాస, వైకాపాలతో పొత్తులు తప్పవా

  రానున్నఎన్నికలలో తెలంగాణాయే ప్రధానంశంగా ఉంటుంది. గనుక, తెలంగాణా ప్రాంతాన్నిశాసిస్తున్నతెరాసను ఎదుర్కోవడానికి అన్నిపార్టీలు ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకోక తప్పదు. అయితే, కేంద్రం తెలంగాణాపై ప్రకటించే వైఖరిని బట్టి, అన్నిపార్టీలు తమ తమ వ్యూహాలు రచించుకొంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాపై ఎటువంటి నిర్ణయం తీసుకొంటే తనకు పూర్తి ప్రయోజనం కలుగుతుందో దానికే మొగ్గు చూపుతుంది.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తెరాసను, మిగిలిన ప్రాంతంలో తెదేపా మరియు వైకాపాలను డ్డీ కొనవలసి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలోగా తెలంగాణా ప్రకటన చేయకపోతే, తెరాస ప్రచారం చేసుకొంటున్నట్లు 100/15 సీట్లు కాకపోయినా అందులో సగమయినా తెరాస చీల్చుకు పోవడం ఖాయం. మిగిలినవి మూడు పార్టీలమధ్య చీలిపోతాయి. అందువల్ల, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తానని మాట ఇచ్చో, లేకపోతే అతనితో లోపాయికారీగా రహస్య ఒప్పందమో చేసుకొనో, ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే, ఒకవేళ రాష్ట్రంలోసంకీర్ణం ఏర్పడినా కనీసం తెరాస మద్దతయినా దొరుకుతుంది. అలా కాని పక్షంలో తెలంగాణాలో నాలుగు ప్రధాన పార్టీలు ఓట్లు చీల్చుకొంటే, ముందుగా నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే గనుక, నేడు కాకపోతే రేపయినా కాంగ్రెస్ పార్టీ తన గుమ్మం దగ్గిరకు వచ్చి నిలబడక తప్పదని కేసీఆర్ నిర్భయంగా ఉన్నాడు.   ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేందుకు సిద్దపడినప్పటికీ, ఎన్నికల తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలని కలలుకంటున్న తెరాస అధినేత కేసీఆర్ ముందు ఒప్పుకొన్నట్లుగా ఇప్పుడు విలీనానికి అంగీకరించకపోవచ్చును. ఒకవేళ ఒప్పుకొంటే చక్రం తిప్పడం సంగతి అటుంచి ముందు సోనియా, రాహుల్ గాంధీల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. అందువల్ల కేసీఆర్ అవసరమయితే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవచ్చును గానీ, విలీనానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించక పోవచ్చును.     ఇక, తెలంగాణాలో గులాబీ కారులో కాంగ్రెస్ ప్రయాణం సాఫీగా జరిగితే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతంలో తెదేపాను ఎదుర్కోవడానికి దానికి ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం వైకాపాయే. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అడగక ముందే ప్రకటించిన వైకాపాని, జగన్ విడుదలతో లింకు పెట్టి రాష్ట్రంలో కూడా మద్దతుకి ఒప్పించవచ్చును.   అయితే, జగన్ కూడా కేసీఆర్ లాగే కాంగ్రెస్ లో విలీనానికి అంగీకరించకపోవచ్చును. విలీనానికి ఒప్పుకొంటే ఆయన తన ఉనికినికోల్పోవడమే కాకుండా, కాంగ్రెస్ లో డజన్ల కొద్దీ ఉన్నముఖ్యమంత్రి అభ్యర్దులతో రేసులో దిగితే, ముఖ్యమంత్రి అవడానికి ఆయన జీవిత కాలం సరిపోదు. అదే కేవలం పొత్తులు పెట్టుకొంటే కాంగ్రెస్ హస్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మెలి తిప్పుతూ తన అదుపులో ఉంచుకోవచ్చును.   ఈవిధంగా కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో రెండు పార్టీలతో ఎన్నికల పొత్తులు గనుక ఏర్పర్చుకొంటే, అప్పుడు వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెదేపా ముందే ఆలోచించుకోక తప్పదు. లేకుంటే, తెదేపాకు ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ దేరీజే క్రోకడైల్ ఫెస్టివల్ తప్పదు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ మూడు ముక్కలాట

  గత పదేళ్లుగా రాష్ట్రం తెలంగాణా అగ్నిగుండంపై కూర్చొని ఉన్నపటికీ ఇంతవరకు తెలంగాణా సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. అయితే, సాధారణ ఎన్నికలు తరుముకోస్తుండటంతో, స్వపక్షంలోనే ఒక విపక్షం తయారవడంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఈ సమస్యకి ఏదోరకంగా ముగింపు పలకాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఈ సమస్య పరిష్కారంపై చిత్తశుద్దికంటే, దానిని ఏవిధంగా పరిష్కరిస్తే తనకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో అనే కోణంలోంచి మాత్రమే కాంగ్రెస్ ఆలోచనలు సాగుతున్నట్లు, డిల్లీ నుండి మీడియాకి లీకవుతున్న వార్తలు తెలియజేస్తున్నాయి.   తెలంగాణా రాష్ట్ర ప్రకటన చేస్తే, దానివల్ల కాంగ్రెస్ కంటే తెరాసయే ఎక్కువ లాభపడుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం గురించి కేశవ్ రావుద్వారా తెరాస అధినేతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో, మరి ఆయనను లొంగదీసేందుకో లేక మరికొంత కాలక్షేపం చేసేందుకో తెలియదు గానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణా ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంది? అనే ఒక కొత్త ఆలోచనను తాజాగా మీడియాకు లీక్ చేసింది.   ఊహించినట్లే, అటు తెలంగాణా నేతల నుండి, ఇటు రాయలసీమ నేతల నుండి కూడా వ్యతిరేఖత ఎదురయింది. ఒక సమస్యను పరిష్కరించడానికి బదులుగా మరొక కొత్త సమస్యను కాంగ్రెస్ సృష్టించాలను కొంటున్నదా? అని ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రం నుండి విడిపోవాలని కోరుకొంటూ ఉద్యమాలు చేస్తుంటే, మళ్ళీ జిల్లాలు కలిపేఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అనే తెరాస నేతల ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద సరయిన సమాధానం లేదు.   రాష్ట్రంలో ప్రజలను కానీ, ప్రతిపక్షాలను గానీ కాంగ్రెస్ అధిష్టానం లెక్కలోకి తీసుకోకపోయినా, కనీసం స్వంత పార్టీ నేతలనయినా విస్వశించవచ్చు కదా? అనేది సామాన్య ప్రజలకు కలిగే ధర్మ సందేహం. తన మూడు ప్రాంతల నేతలతో కలిసి చర్చించి, తను కోరుకొంటున్నట్లే తన పార్టీకి మేలు చేకూర్చే నిర్ణయమే ఎందుకు తీసుకోలేకపోతోంది? అనేది సామాన్యులను వేధిస్తున్నప్రశ్న.   ముందుగా పార్టీలో నేతల మధ్య సామరస్య ధోరణి, పార్టీని రక్షించుకోవాలనే తపన సాధించకుండా, కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా అది దానికే నష్టం కలిగించక మానదు. అయితే అనుభవం అయితే తప్ప తత్వం భోధపడదని ఊరికే అనలేదు పెద్దలు. కాంగ్రెస్ పార్టీకి కూడా రానున్న ఎన్నికలలో తప్పకుండా ప్రజలే ఈ తత్వం భోదపరుస్తారు.

నకిలీ ఓటర్లతో ఎన్నికలు నిర్వహణ, ప్రజాస్వామ్యం అపహాస్యం

  రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారి బన్వర్ లాల్ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ కడప జిల్లా మొత్తం మీద దాదాపు లక్ష నకిలీ (డూప్లికేట్) ఓటర్లను తాము గుర్తించామని, అందులో దాదాపు సగం మంది కడప మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోనే ఉన్నారని ఆయన తెలిపారు. అటువంటి నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   అధికారుల దృష్టికి వచ్చినవి లక్ష ఓట్లు అయితే, ఇంకా లెక్కకు రానివి ఎన్ని లక్షలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కడప జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత ఉప ఎన్నికలలోజైలు నుండే పోటీ చేసినపుడు అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించారు. బన్వర్ లాల్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఆయనకు పోలయిన ఓట్లలో ఇటువంటి నకిలీ ఓట్లు కూడా ఉన్నయనని అర్ధం అవుతోంది.   రాజకీయ పార్టీలే, తమ ప్రయోజనం కోసం ఈ నకిలీ ఓటర్లను సృష్టిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, ఎన్నికల కమీషన్ అటువంటి వారిని గుర్తించి ఏరిపారేయడంలో వైఫల్యం చెందుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా నకిలీలను, బోగస్ వోటర్లను ఏరిపారేయడం పెద్ద కష్టమేమి కాదు. అయినప్పటికీ, ఎన్నికల కమీషన్ ఆ పని ఎందుకు చేయలేకపోతోందో తెలియదు. ఈ నకిలీ ఓటర్ల సమస్య ఒక్క కడప జిల్లాకే కాక యావత్ దేశమంతా ఉంది. అంటే, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల్లోనో, లేక కోట్లలోనో ఈ నకిలీ ఓటర్లు ఉండే అవకాశం ఉంది.   డిశంబరులో నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు, ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటువంటి నకిలీ ఓటర్లను ఏరిపారేయకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం అవుతుంది.

రాజకీయాలతో పొద్దుపుచ్చుతున్న కిరణ్ సర్కార్

  రాష్ట్రంలో ప్రజలని తామే ఉద్దరించేస్తున్నట్లు తమ భుజాలు తామే చరుచుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆపదలో చిక్కుకొన్న తెలుగువారిని రక్షించడానికి మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రలో చిక్కుకొన్న గుప్పెడు తెలుగు ప్రాణాలు రక్షించడం కంటే, రాబోయే ఎన్నికలలో తమకు ఓట్లు రాల్చే ‘బంగారు తల్లి’ వంటి పధకాలను ఆమోదించుకోవడమే ఎక్కువ లాభాదాయకమనే ఆలోచనతో, ఆ బాధ్యతలను అధికారులకు వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం తాపీగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకొంది. అధికారులు కూడా తన సహజ సిద్దమయిన నిర్లక్ష్య వైఖరితో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్నప్పుడు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అధికారులలో కదలిక రాలేదు.   ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుగా చొరవ తీసుకొని భాదితులకు అండగా నిలబడటంతో, మండిపడిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం తగదంటూ ఒక ఉచిత సలహా పడేసి చేతులు దులుపుకొన్నారు. “బాధితులకు వారి కష్ట కాలంలో సహాయం చేయడం రాజకీయమే అయితే, అటువంటి రాజకీయం చేయడానికి తామెప్పుడు ముందుంటామని” యువనాయకుడు లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఆయన మాటలు అన్నిపార్టీలకు అక్షరాల ఆచరణాత్మకం.   తెదేపా సహాయ కార్యక్రమాల వెనుక రాజకీయ ఆలోచనలు ఉన్నాయా లేవా? అనే సంగతిని పక్కన బెడితే, ఆపదలో ఉన్న సాటి తెలుగువారిపట్ల ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చూపుతున్న ఔదార్యం ప్రశంసనీయం.   ప్రతిపక్షాల పోరు పడలేకనో, లేక విమర్శలకు జడిసో మొత్తం మీద శాసన సభ సమావేశాలు ముగిసిన తరువాత, పరిస్థితిని సమీక్షించేందుకు తాపీగా ముగ్గురు మంత్రులను పంపి చేతులు దులుపుకొంది ప్రభుత్వం. వారు డిల్లీ వెళ్లి చేసింది ఏమిలేదు. ఇప్పటికీ, వారు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు.   ఈ లోగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన అనుచరులు బాధితులకు యధా శక్తిన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న ఆంధ్రా భవన్ లో ఉన్నభాధితులకువారు అండగా నిలబడటమే కాకుండా ఒక్కొకరికీ రూ.10,000 చొప్పున మొత్తం 74మందికి రూ.ఏడున్నర లక్షలు వారి మందులు, ఆహరం, ప్రయాణ ఖర్చుల నిమితం అందజేశారు.   శాసన సభ సమావేశాలు ముగిసిన తరువాత ఒక్కో శాసన సభ్యుడికి రూ.47,000 విలువ చేసే టాబ్లెట్ పీసీలు, దాదాపు 20,000 విలువ చేసే ఇతర బహుమానాలు అందజేసిన ప్రభుత్వం, బాధితులకి మాత్రం ఒక్కొకరికి రూ.2000 చొప్పున విదిలింఛి చేతులు దులుపుకొంది. ఇటువంటి సమయంలో కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ సమీక్షలతో కాలక్షేపం చేస్తూ ప్రభుత్వం అందులో పెద్దలు అత్యంత అమానవీయంగా, చాలా క్యాజువల్ గా ప్రవర్తిస్న్నారు.   అక్కడ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా డిల్లీలో నిలబడి సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ, బాధితులకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ హైదరాబాదు తరలిస్తుంటే, హైదరాబాదు వస్తున్న బాధితులని రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొంటున్న తెదేపా యువనాయకుడు లోకేష్ మరియు పార్టీ కార్యకర్తలు వారికి ప్రత్యేక బస్సులు, వ్యానులు ఏర్పాటు చేసి వారి వారి స్వస్థలాలకు తరలిస్తూ వారి అభిమానం చురగగొంటున్నారు.   ఇటువంటి ఆపద సమయంలో కూడా ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ నేతలు గానీ కనీస స్పందన చూపకపోవడం చాలా ఘోరం. తెదేపా తన యన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య బృందాన్ని డిల్లీ పంపితే వారిని అనుమతించకుండా అడ్డుపడటం మరీ దారుణం. పార్టీలకతీతంగా అందరూ చేతులు కలిపి భాదితులను ఆదుకోవలసిన ఈ తరుణంలో ఈవిధంగా డిల్లీలో చేరి రాజకీయాలు చేయడం చాలా హేయం. అధికారంలో ఉండి తాము చేయలేని పనిని తెదేపా చొరవ తీసుకొని చేస్తున్నపుడు, ఆ పార్టీ నేతలతో చేతులు కలిపి సహాయ కార్యక్రమాలలో పాల్గొనకపోయినా, కనీసం వారికి అడ్డుపడకుండా ఉంటే అదే పది వేలని హైదరాబాద్ చేరుకొంటున్న బాధితులు అనడం కాంగ్రెస్ నైజానికి అద్దం పడుతోంది.   తెదేపా రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తుంటే, తెదేపా నేతలు మాత్రం ఉడత భక్తిగా సహాయ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ప్రార్దించే పెదవుల కంటే, సాయం చేసే చేతులే మిన్న అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుకు చేసుకొంటే మంచిది.

జగనన్నవదిలిన బాణం గురి తప్పిందా

  షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర నిన్నటికి 2500కి.మీ. పూర్తిచేసుకొని ఈ రోజు సాయంత్రం విశాఖ జిల్లాలో మొదలవబోతోంది. ఆమె ప్రస్థానం విశాఖ, విజయనగరం జిల్లాలు మీదుగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు సాగుతుంది. అంటే కనీసం మరో వెయ్యి కి.మీ.ఆమె నడువనున్నారు. ఒక మహిళ తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఇంత పట్టుదలతో అన్ని వేల కి.మీ.నడవడం మామూలు విషయమేమీ కాదు.   కానీ ఇంత శ్రమపడుతున్న ఆమె, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ, తన శ్రమను తానే వృధా చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయగా మిగిలిన విలువయిన సమయాన్ని, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో స్వర్ణయుగ వర్ణనకి, దానిని తిరిగి సాధించబోయే తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవడానికే ఆమెకి సరిపోతోంది.   ఇంత శ్రమపడి చేస్తున్నఈ సుదీర్గ పాదయాత్రలో ఆమె ఈ వ్యర్ధ ప్రసంగాలకు సమయం వెచ్చించే బదులు, పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకొని ఉండి ఉంటే, ఆమె పాదయాత్ర ముగిసే సమయానికి రాష్ట్రమంతటా వైకాపా బలపడి ఉండేది. మళ్ళీ మళ్ళీ చేయ సాధ్యం కాని ఇటువంటి యాత్రని పూర్తిగా సద్వినియోగపరుచుకొని, ఎక్కడికక్కడ స్థానిక నేతలతో సమావేశమవుతూ పార్టీని పటిష్టపరుచుకొంటూ ముందుకు సాగి ఉండి ఉంటే దాని ఫలితం ఈ పాటికే రాష్ట్రమంతటా స్పష్టంగా కనబడేది. పైగా దానివల్ల ఆమె పార్టీలో ఒక బలమయిన ప్రత్యామ్నాయ నాయకురాలుగా ఎదిగే అవకాశం కూడా ఉండేది. కానీ, ప్రస్తుతం సాగుతున్నఆమె పాదయాత్ర తీరువల్ల ఆమెకు కానీ, పార్టీకి గానీ ఒనగూడే లాభం ఏమి లేదు.   అయితే, ఇందుకు ఆమెను గాక ఆమె సుదీర్గ పాదయాత్ర వల్ల పార్టీకి పూర్తి ప్రయోజనం కలిగేలా ప్రణాళిక రచించకుండా అశ్రద్ధ చూపిన పార్టీలో సీనియర్లను తప్పుపట్టాల్సి ఉంటుంది. పార్టీ అధినేతలు ముగ్గురూ-జగన్, విజయమ్మ, షర్మిల వారి వారి పరిధులలో పార్టీని బలపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం పార్టీ నిర్మాణం పట్ల ఏమాత్రం శ్రద్ద చూపకుండా, ఏసీ గదుల్లో కూర్చొని మీడియా స్టేట్మెంట్లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రాజకీయ దురంధులమని భుజాలు చరుచుకొనే సదరు నేతలు, షర్మిల పాదయాత్రని పార్టీకి ఉపకరించేలా ప్రణాళికలు రచించి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయినా కాకపోయినా, అది పార్టీ పటిష్టంగా ఉండేందుకు తోడ్పడేది.   కానీ, పార్టీ నేతలెవరికీ ఈ స్పృహ లేకపోవడం ఆ పార్టీ దురదృష్టమే. మరిటువంటి బాధ్యత లేని నేతల నందరినీ సారధిలేని రధంలోఎక్కించుకొని విజయమ్మ రానున్న ఎన్నికల కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఏవిధంగా విజయం సాధించాలని భావిస్తున్నారో ఆమెకే తెలియాలి. వారి అశ్రద్ద వలన జగనన్న వదిలిన బాణం ఏ లక్ష్యం చేధించకుండానే ముందుకు దూసుకుతోంది.   బహుశః ఆమె పాద యాత్ర ముగిసిన తరువాత పార్టీ నిర్మాణం గురించి ఆలోచిస్తారో, లేక జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యేక మొదలుపెడతారో? ఆ పార్టీ నేతలకే తెలియాలి. అయితే అప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తయి ఎన్నికల గుమ్మంలో ఉంటాయి. అప్పుడు ఈ నేతలందరూ కాడి పక్కన పడేసి వేరే పార్టీలోకి దూకేసినా ఆశ్చర్యం లేదు.

విషాదం మిగిల్చిన ప్రకృతి విలయ తాండవం

  నిన్నమొన్నటివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యాటకుల పాలిట స్వర్గధామం. దేశంలో ఎక్కడెక్కడి నుండో ప్రజలు వ్యయప్రాయసలకోర్చి అక్కడికి చేరుకొని ఒక జీవితానికి సరిపడే మధురానుభూతులు మూటగట్టుకొని మరలివస్తుంటారు. ఇక, అక్కడ ఉన్న అత్యంత ప్రాచీనమయిన కేదార్ నాథ్ మందిరం ప్రపంచ వ్యాపతంగా ఉన్న హిందువులందరికీ పరమ పావనమయిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అటువంటి సుందర ప్రదేశం ప్రకృతి విలయతాండవంతో పర్యాటకులకు జీవితంలో మరచిపోలేని పీడకలలు మిగిల్చింది.   ముక్కంటి నెలవున్న కేధార్ నాథ్ మందిర ప్రాంగాణమంతా భక్తుల శవాలతో నిండిపోయి నేడు మరుభూమిగా మారిపోయింది. ఈ ఘోర విపత్తులో అధికారికంగా వందల మంది చనిపోయినట్లు చెప్పబడుతుంటే, అక్కడ చిక్కుకొన్న పర్యాటకులు, సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నవారు చెప్పిన లెక్కల ప్రకారం కొన్నివేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల ఆశ్రమాలు, సత్రవులు, చిన్నా పెద్దా లాడ్జీలు, దాదాపు 60కి పైగా గ్రామాలు, 50కి పైగా చిన్నా పెద్దా వంతెనలు ఈ వరదలలో కొట్టుకుపోయాయంటే ప్రాణనష్టం అధికారిక లెక్కల కంటే చాల ఎక్కువేనని అర్ధం అవుతుంది. కేధార్ నాథ్ ఆలయం మరో రెండు సం.లు వరకు తెరువలేని పరిస్థితి అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే, ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయినా, మందిరం చుట్టూ ఉన్న అనేక భవనాలు కూలిపోయినా, కేదార్ నాథ్ ఆలయం, అందులో మూల విరాట్టు, బయటనున్ననంది విగ్రహం మాత్రం చెక్కుచెదరక పోవడం దైవలీలే.   ఇక ఈ ఘోర విప్పతులో దాదాపు 60వేల మందికిపైగా వివిధ ప్రాంతాలలో చిక్కడిపోగా, అదృష్టవంతులయిన కొందరు మాత్రం, అయిన వాళ్ళనీ, ఆత్మీయులనీ పోగొట్టుకొని భారమయిన హృదయాలతో ఎలాగో ఇళ్ళకు చేరుకోగలుగుతున్నారు. ఆలా తిరిగొచ్చిన వారు, తమ బయనక అనుభవాలను వర్ణించిచెపుతుంటే, పగవాడికి కూడా అటువంటి కష్టం వద్దని కోరుకొంటాము. ప్రకృతితో చక్కగా అనుసంధానమయిన ఉత్తరాఖండ్ వంటి ప్రాంతమే ఇంత ఘోర విపత్తుకి నిలయమయితే, విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న మన పట్టణాలు, నగరాలు ఎటువంటి ఘోర వైపరీత్యాలకు ఆహ్వానం పలకనుందో అని ఆలోచించడానికే భయం వేస్తుంది.

తెలంగాణాలో వైకాపా కోలుకొంటుందా?

  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ దుర్ఘటనలో అకస్మాతుగా మరణించిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బయటకి వచ్చి వైకాపా పెట్టిన కొత్తలో సానుభూతి వల్లనయితేనేమి, జగన్ పట్ల ప్రజలకేర్పడిన నమ్మకం వల్లనయితేనేమి, ఆపార్టీకి తెలంగాణాలో కూడా మంచి ఆదరణ కనబడింది. అయితే, తన పార్టీని మరింత బలపరుచుకోవడానికి జగన్ తెలంగాణాలో పర్యటించబోతే, తెరాస ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆయన తెలంగాణాలో అడుగుపెట్టకుండా అడ్డుకోగలిగింది. ఇక తెలంగాణా విషయంలో ఆయన స్పష్టమయిన నిర్ణయం ప్రకటించకుండా, సెంటిమెంటును గౌరవిస్తామంటూ వైకాపా ద్వంద వైఖరి అవలంభించడంతో, ఆ పార్టీని అడ్డుకొనేందుకు తెరాసకు మరో మంచి ఆయుధం దొరికింది.    ఆ తరువాత జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో వైకాపా మరిక బలపడలేకపోయింది. రాకెట్ స్పీడుతో సాగిపోయిన షర్మిల పాదయాత్రలు కానీ, విజయమ్మ రచ్చబండ కబుర్లు గానీ, ఆ పార్టీని తెలంగాణా ప్రజలు నమ్మేలా చేయలేకపోయాయి.   ఇక, తెరాస అధినేత కేసీఆర్ తన ఆకర్ష వ్యూహాలతో వైకాపా నేతలను తనవైపు తిప్పుకొంటూ మెల్లగా పార్టీని ఖాళీ చేసేస్తున్నాడు. తెలంగాణాలో వైకాపాకు బలమయిన నాయకుడయిన బోడ జనార్ధన్ ఆయన అనుచరులతో సహా ఇటీవలే తెరాసలోకి వెళ్ళిపోయారు.   ఇటువంటి పరిస్థితిలో మున్సిపల్ మరియు పంచాయితీ ఎన్నికలను ఎదుర్కోవలసి రావడం వైకాపాకు కొంచెం కష్టంగానే ఉంది. తెదేపా తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, బయ్యారం విషయంలో స్పష్టత ఇచ్చి తెలంగాణాలో నిలద్రొక్కుకొంటున్నపటికీ, ఆ రెండూ చేయని వైకాపా మాత్రం తెలంగాణా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది.   విజయమ్మ, షర్మిల ఇద్దరూ తెలంగాణాలో పర్యటించినప్పటికీ ‘జగనన్నవస్తాడు, రాజన్నరాజ్యం తెస్తాడు’ అని చిలకపలుకులు పలుకుతూ తెలంగాణా అంశంలో వారు స్పష్టత ఈయకుండా దాటవేయడంతో, వైకాపా తెలంగాణా వ్యతిరేఖమని కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రజల మీద ప్రభావం చూపడంతో క్రమంగా ఆ పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గుతోంది.   కొండా సురేఖ వంటి బలమయిన నేతలు సైతం ఇప్పుడు ప్రజలకి నచ్చజెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇక అదే సమయంలో తెలంగాణావాదాన్ని బలంగా వినిపిస్తున్నతెరాస తన పోరాటం తీవ్రతరం చేసిన ప్రతీసారి కూడా, వైకాపా ఆ పోరాటంలో పాల్గొనలేక పోవడంతో, ఆపార్టీ తెలంగాణా వ్యతిరేఖి అనే భావం ప్రజలలో మరింత బలపడి, అక్కడ అది ఒక అంటరాని పార్టీగా మిగిలిపోతోంది.   వైకాపా యొక్క ఈ బలహీనతను బాగా అర్ధం చేసుకొన్న కేసీఆర్ మరియు అతని పార్టీ నేతలు వైకాపాను మరింత ఇబ్బందిపెట్టేందుకు తెలంగాణా అంశంపై ఏదో నిత్యం ఒక సవాలు విసురుతూ ఆ పార్టీతో ఆడుకొంటుంటే, వారి ప్రశ్నలకు సంజాయిషీలు ఇచ్చుకోలేక వైకాపా నేతల తల ప్రాణం తోకకి వస్తోంది.   ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విజయమ్మ మళ్ళీ తెలంగాణా యాత్రలకు సిద్దమవుతున్నారు. కేసీఆర్ మాటలకు తీవ్ర ప్రభావితులయి ఉన్న తెలంగాణా ప్రజలను, తెలంగాణా ఊసే ఎత్తని వైకాపా సభలకు తరలించడానికి వైకాపా నేతలు చాల కష్టపడవలసి వస్తోంది. అందువల్ల, రేపు విజయమ్మ తెలంగాణాలో యాత్రలు మొదలు పెడితే, పార్టీని బలపరుచుకోవడం సంగతి దేవుడెరుగు, ముందు ఆమె సభలకి జనాలను తరలించగలిగితే అదే పదివేలు అని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.   ఒకవైపు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడాదిగా జైల్లో చిక్కుకుపోయి ఉండటం, మరో వైపు పార్టీ తెలంగాణా అంశంపై స్పష్టత ఈయకపోవడంతో వైకాపా తెలంగాణా ప్రజల దృష్టిలో పలుచనయింది. అందువల్ల ఆ పార్టీకి మొదట్లో కనబడిన ఆదరణ ఇప్పుడు కనబడటం లేదు.   ఎన్నికల సమయానికి తెరాస ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రెచ్చగొట్టినప్పుడు, దానిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు వైకాపా వద్ద ఉపాయమూ లేదు, ఉన్నా దానిని సమర్ధంగా అమలు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు లేడు గనుక వైకాపా సీమంద్రా ప్రాంతానికే పరిమితమయిపోక తప్పదు.

చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్

  బీజేపీతో కటిఫ్ చేసుకొని ఎన్డీయే కూటమి నుండి బయటపడిన జేడీ(యు)ని కాంగ్రెస్ పార్టీ దువ్వడం మొదలు పెట్టింది. ఆయన కోరినట్లు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని ముందే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, పనిలోపనిగా నితీష్ కుమార్ ని కూడా మంచి చేసుకొనే పనిలో పడింది. నిన్నమొన్నటి వరకూ ఎన్డీయేలో కొనసాగిన నితీష్ కుమార్ ను కూడా ఒక మతతత్వవాదిగా ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇపుడు ఆయన ఒక గొప్పలౌకికవాది అని కితాబులివ్వడం మొదలుపెటింది.   కానీ, ఎన్డీయే నుండి బయటకి వచ్చిన తరువాత కూడా జేడీ(యు) నేతలు బీజేపీకి అద్వానీ సారద్యం వహిస్తే తిరిగి తాము ఎన్డీయే కూటమిలోకి కొనసాగేందుకు ఆలోచిస్తామని చెప్పడంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ మళ్ళీ మనసు మార్చుకోక ముందే ఎలాగయినా తమ యుపీఏ కూటమిలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు బీహార్ శాసన సభలో బల నిరూపణకు చేయనున్నసందర్భంగా ఆయనకి అండగా నిలబడేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది.   ఇక, ఈ రెండు పార్టీల మధ్య రాయబారాలు, బేరాలు చూసి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి కంగారు మొదలయింది. బీహార్ లో తన అధికారానికి గండి కొట్టిన జేడీ(యు) బీజేపీతో అనైతిక పొత్తులు పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెపుతూ మోసగిస్తోందని ఇంత కాలం విమర్శిస్తూ తన ఆక్రోశం వెళ్ళగ్రక్కుతున్న లాలూ, ఊహించని ఈ సరికొత్త పరిణామాలకి మరింత కంగారు పడుతున్నారు.   మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపినపుడే తన చేతిలోంచి బీహార్ పగ్గాలు గుంజుకొన్నతన రాజకీయ ప్రత్యర్ధి నితీష్ కుమార్, ఇప్పుడు లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే తన పరిస్థితి ఏమిటనే భయం లాలూకి పట్టుకొంది. జేడీ(యు) ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలపకుండా ఉండేందుకు ఆయన తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. ఒక వైపు నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే మరో వైపు కాంగ్రెస్ ని మంచి చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు.   అయితే, లాలూ ప్రసాద్ వంటి కళంకిత వ్యక్తితో చేతులు కలపడం కంటే, బీహార్ ను అభివృద్ధిపధంలోకి నడిపిస్తున్న నితీష్ కుమార్ వంటి వ్యక్తితో చేతులు కలపడానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోంది. అలాగని లాలూని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా మున్ముందు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయనతో కూడా కాంగ్రెస్ సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది.   నితీష్ కుమార్ మరియు అతని జేడీ(యు)పార్టీ జాతీయ రాజకీయాలలో మరియు బీహార్ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారడంతో ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే ఉంది.

బీజేపీతో నితీష్ ఎందుకు తెగ తెంపులు చేసుకొన్నారు

  ఇంత కాలం రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ, జనత దళ్ (యు) నేతలు తెగతెంపులు చేసుకోగానే ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మొదలుపెట్టేసారు. జేడీయు ఎన్డీయేను వీడి నమ్మక ద్రోహం చేసిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అంతే ధీటుగా స్పందిస్తూ, బీజేపీలో కురువృద్ధుల వంటి వాజ్ పేయి, అద్వానీలను పక్కనపెట్టి ఆ పార్టీయే నమ్మక ద్రోహం చేసిందంటూ విమర్శలు చేసారు. తమ పార్టీ పెద్దలనే గౌరవించలేని బీజేపీ ఇతరులను ఏమి గౌరవించగలదని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. బీజేపీ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తమ పార్టీ ఎవరిని ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవలనేది అంతర్గత వ్యవహారమని అందులో ఇతరుల ప్రమేయం సహించబోమని ఆయన అన్నారు.   బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించుకోవడంతో జేడీయు బీజేపీకి దూరమయినట్లు చెపుతున్నపటికీ, నిజానికి నితీష్ కుమార్ కి కూడా ప్రధాని పదవి చేపట్టాలని ఆశ ఉండటంతో ఆయన ఒత్తిడి వల్లనే రెండు పార్టీలు దూరం కావలసి వచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే మోడీ వంటి వ్యక్తితో కలిసి పనిచేయడం అసంభవమని వాదిస్తున్ననితీష్ కుమార్, 2003లో వాజ్ పేయితో సహా అందరూ గోద్రా అల్లర్లకు మోడీని విమర్శిస్తే, నితీష్ కుమార్ మాత్రం ఆయనను వెనకేసుకు వచ్చారు.   అప్పుడు నితీష్ కుమార్ కి మంచిగా కనబడిన మోడీ నేడు చెడ్డగా కనబడటానికి ప్రధాన కారణం, ఆయన ప్రధాని పదవికి తనకి పోటీగా తయారవడం వలననేనని చెప్పవచ్చును. తానూ ప్రధాని పదవికి అనర్హుడనని నితీష్ కుమారే స్వయంగా చెప్పుకొంటున్నపటికీ, ఆయనకు ఆ కోరిక ఉందనేది మాత్రం సుస్పష్టం. అయితే, నితీష్ కుమార్ ఎన్డీయేలో ఉన్నా, యుపీయేలోకి వెళ్ళినా ఎన్నడూ ప్రధాని కాలేరనే చేదు నిజం ఆయన వంటి రాజనీతిజ్ఞుడు గ్రహించకపోవడమే విశేషం. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీకే సహజంగా ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూపీఏలో రాహుల్ గాంధీకి తప్ప వేరొకరికి అవకాశం ఉండదనేది బహిరంగ రహస్యమే. అటువంటప్పుడు, ఆయన అనవసర బేషజానికి పోయి ఎన్డీయే నుండి వైదొలగడం వల్ల ఇరుపార్టీలు నష్టపోవడం తప్ప ఎవరికీ ఒరిగేదేమీ ఉండదు.   ఈ విషయం ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కి కూడా స్పష్టంగా అర్ధమయినప్పటికీ, బీహార్ రాష్ట్రంలో జేడీ(యు)ను అధికారంలోకి తీసుకువచ్చిన నితీష్ కుమార్ ను కాదనలేని నిస్సహాయ స్థితి ఆయనది. జేడీయులో నితీష్ కుమార్ మాటే వేదంగా చెలామణి అవుతోంది గనుకనే బీజేపీతో తెగతెంపులు చేసుకోవలసి వచ్చింది.

Incredible Indian Politics

...... Harika Maddala       Describing about our incredible India, nevertheless, will be tough. Greedy politicians, politics... with leaders richest of the rich, slums... poorest of the poor, incurable disease of corruption, greatest of the great civilization, even greater mythology.   Our freedom fighters have no much value except in the photo frames and on currency notes. Our great, mighty political leaders give us no chance to trust them. Even an amateur leader or a politician, in his maiden speech, proves himself to be garrulous and desperate about power. These people are rather interested in patrimony than in the still developing country which can never be developed in their hands. Seeing these political cannibals, poor Indians turned into fatalists. They left their complete hope on the omnipresent.      Our politicians are highly skillful. They are ambidextrous at grabbing money and swallowing public funds. These censorious critics are incomparable to any orator for their invincible defenses. Farmers produce food for us. Then, do they have edible food to eat? The answer will be no. Incredible India, a nation which can't provide proper food to its food producer! The incredibleness of our nation lies neither in its history nor in civilization. It lies in its pretty poor villages where songs of anger and cries of hunger are heard.     We don’t want a leader who introduces schemes to swallow public funds… We don’t want a democracy where inheritance is still prevalent… We don’t want a minister who fights for omnipotence… What do we want then?     We want a doctor who can aid our disease of unemployment... We want a scientist who can invent an antidote to the poison of poverty... We want a leader who can save our country from bankruptcy… We want a country where democracy will find its true meaning.       This is INDIA, the world’s largest democratic country… not a game in computer to play your trick!

తెరాసా చేతిలో చిక్కుకొన్న తెదేపా

        నిన్న టీ-జేయేసీ మరియు తెరాసల అధ్య్వర్యంలో జరిగిన ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈ రోజు తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలునిచ్చినందుకు తెరాస బంద్ కు దూరంగా ఉంటున్నాయి. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొన్నప్పటికీ తమని అభినందించకపోగా అడ్వకేట్ల వేషంలో తెరాస గూండాలు తమపై దాడిచేయడం శోచనీయమని తెదేపా తెలంగాణా ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసను విమర్శించారు. అందువల్ల తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈరోజు బంద్ లో పాల్గొనకుండా కేవలం నిరసనలు తెలిపి సరిపెట్టుకొంటున్నాయి.   ఈ రెండు కార్యక్రమాల ద్వారా తెరాస తెలంగాణా ఉద్యమాలపై పూర్తి పేటెంట్ హక్కులు తమదేనని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తుంటే, దానికి సహకరించిన మిగిలిన పార్టీలు తెరాస తమనందరిని పూర్తిగా వాడుకొన్న తరువాత తెలంగాణా అంశాన్ని హైజాక్ చేస్తోందని, ఈ రోజు తెరాస తమను సంప్రదించకుండా తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలుపునివ్వడమే ఉదాహరణ అని ఆ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే తెరాస మాత్రం ఇవేవి పట్టించుకొనే స్థితిలో లేదు. నిన్నజరిగిన ఛలోఅసెంబ్లీ ఆందోళన కార్యక్రమానికి తాము ఊహించిన దానికంటే మంచి స్పందన రావడంతో అదే ఊపులో ఈ రోజు తెలంగాణా బంద్ కు కూడా పిలుపునిచ్చి ఈ రెండు కార్యక్రమాల పూర్తి క్రెడిట్ దక్కించుకొని రానున్న స్థానిక ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయాలని ఆశిస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన పార్టీలు కూడా తెలంగాణా అంశంపై ఎంతో కొంత క్రెడిట్ పొందాలని ఆశించడం సహజమే. కానీ ఆ క్రెడిట్ మొత్తం తెరాస తన్నుకొనిపోవడంతో అవిప్పుడు పశ్చాత్తాపడుతున్నాయి. ఇంత కాలం తెలంగాణా విషయంలో కొంచెం సందిగ్ధ స్థితిలో ఉన్నతెదేపా. ఎన్నికలు దగ్గరపడుతున్నందున మొట్ట మొదటిసారిగా తెరాస-తెలంగాణా జేఎసీల అధ్వర్యంలోజరిగిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంది. తన తొలి ప్రయత్నంలోనే ఎదురయిన ఈ చేదు అనుభవాన్ని తెదేపా జీర్ణించుకోలేకపోతోంది. అయితే, ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనకపోతే తెరాస తమపై తెలంగాణా వ్యతిరేఖముద్ర వేసి రానున్న ఎన్నికలలో తెలంగాణాలో తమ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని తెదేపా భయం. అలాగని తెరాసతో కలిసి ఇటువంటి ఆందోళనలలో పాల్గొనలేని పరిస్థితి. ఒక విధంగా తెరాస, తెదేపాతో సహా మిగిలిన అన్ని పార్టీలని కూడా తనను అనుసరించడమే తప్ప వ్యతిరేఖించలేని నిస్సహాయ పరిస్థితి కల్పించిందని చెప్పవచ్చును. తెలంగాణా అంశంపై రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా తమతమ రాజకీయ ప్రయోజనాలకోసం తప్పనిసరి పరిస్థితిలో తెరాసను తట్టుకొనేందుకు ఆ పార్టీ వెనుకే నడవక తప్పట్లేదు. అందువల్ల అంతిమంగా తెరాసకే రాజకీయ ప్రయోజనం కలుగుటింది తప్ప మిగిలిన పార్టీలు ఎటువంటి ప్రయోజనమూ పొందలేవు.       

మీడియా మధ్య అడ్డుగోడలు

  కులాలు, మతాలు మనుషులనే కాదు, రాజకీయ పార్టీలను చివరికి మీడియాను కూడా వేరుచేస్తున్నాయి. లౌకిక వాదం గురించి రాజకీయ పార్టీలు ఎన్ని ధర్మపన్నాలు వల్లించినా అవన్నీ ఏదో ఒక కులానికో లేక మతానికో కొంచెం అధిక ప్రాతినిద్యం వహిస్తున్నసంగతి బహిరంగ రహస్యమే. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి మూల స్థంభమయిన మీడియాకు కూడా ఈ కుల, మత చీడ పట్టి చాల కాలమే అయింది. అయితే దానిని బహిరంగంగా చెప్పుకోకపోవడమే నేడు లౌకిక వాదంగా చలామణి అవుతోంది.   ఇప్పుడు తెరాస, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడు మరో అడుగు ముందుకు వేసి, ఇప్పటికే కులగజ్జి అంటుకొన్న మీడియాకు రాజకీయ గజ్జి కూడా అంటించి నిలువునా చీల్చాయి. రాష్ట్రంలో మీడియా ఈ మూడు పార్టీలలో దేనికో ఒకదానికి కొమ్ము కాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ప్రజలకు కూడా తమకు నచ్చిన రాజకీయ రంగుటద్దాలను పెట్టుకొని తాము అభిమానించే పార్టీకి వత్తాసు పలికేవార్తలను తెలుసుకొనే సౌలభ్యం ఏర్పడింది.   వైకాపా అధ్యక్షుడు జగన్, కేసీఆర్ అధ్వర్యంలో నడిచే సాక్షి మరియు టీ-మీడియా సంస్థలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఇటీవల తీసుకొన్న నిర్ణయంతో, ఇప్పుడు మీడియా మధ్య ఉన్న సన్నటి గీతను కూడా చెరిపేసి ఏకంగా అడ్డుగోడలే కట్టేసినట్లయింది.   తన ప్రత్యర్ధ పార్టీకి చెందిన మీడియా సంస్థలు తమను అభాసుపాలు చేయడానికి పనిగట్టుకొని తప్పుడు కధనాలు ప్రచురించడమే కాకుండా, సమావేశాలలో ఇబ్బందికర ప్రశ్నలు వేస్తున్నందున సాక్షీ మరియు తెలంగాణా న్యూస్ వంటి వాటిని ఇక ముందు తమ సభలకు సమావేశాలకు దూరంగా ఉంచాలని తెదేపా నిశ్చయించుకొంది. ఆయా పత్రికా విలేఖరులను, ప్రతినిధులను ఇక ముందు తమ సభలకు, సమావేశాలకు అనుమతించబోమని తెదేపా అధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు.   దీనితో ఇక ఇంతవరకు మీడియా మధ్య జరుగుతున్న ప్రచ్చనంగా జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరి మీడియాను కూడా పూర్తిగా కలుషితం చేస్తుంది.  

ఛలో అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోసమేనా?

    స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెరాస ఛలో అసెంబ్లీ అంటూ మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను రాజేసే పనిలో పడింది. యధాప్రకారం ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించడం, పోలీసులు దానిని నిలువరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం, తెరాస, టీ-జేయేసీ నేతలు ఖండించడం, అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం వంటివన్నీ కూడా ఒక పద్దతి ప్రకారంగా సాగిపోతున్నాయి. చివరి నిమిషం వరకు ఈ తంతు కొనసాగిన తరువాత, ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం, దానిని సీమంద్రా నేతల కుట్రలపై తెలంగాణా ప్రజల విజయంగా తెరాస నేతలు అభివర్ణించడం కూడా అంతే పద్దతిగా జరిగిపోతుంది. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క పరిపాలన తప్ప ఇటువంటి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, బంద్ లు అన్నీ కూడా చక్కగా ఒక పద్ధతి ప్రకారం సాగిపోతున్నాయి. ఈవిషయంలో మనల్ని మనం మెచ్చుకోక తప్పదు.   తెలంగాణా ఉద్యమాలను ఇంతకాలం పక్కన బెట్టి ఎన్నికల బాట పట్టిన తెరాస దాని అనుబంధ సంస్థ టీ-జేయేసీలు తమకి అవసరమయినప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణా భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలనుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.   తెలంగాణా అంశంపై కేంద్ర ప్రభుత్వ నాన్పుడు ధోరణిని నిరసించే తెరాస, టీ-జేయేసీ నేతలు దాని సాధన పట్ల నిబద్దత చూపకపోవడం హాస్యాస్పదం. ఒకసారి ఉద్యమాల ద్వారా, మరో సారి డిల్లీలో లాబీయింగ్ ద్వారా, మరో సారి ఎన్నికలలో అధికసీట్లు గెలుచుకోవడం ద్వారా వారు తెలంగాణా సాధిస్తామని ప్రజలకి నమ్మబలుకుతూ, తెలంగాణా సెంటిమెంట్ ని, అంశాన్ని ఊరగాయలా నిల్వ ఉంచుకొని తమ అవసరమయినప్పుడు బయటకి తీసి ఈవిధంగా వాడుకోవడం శోచనీయం.   అదేవిధంగా, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణా ఉద్యమాలవల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నపటికీ, తెలంగాణా అంశంపై రాజకీయ లబ్ది పొందేందుకు దానిని నాన్చడం గర్హనీయం. అటు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికి, ఇటు ఉద్యమం చేస్తున్న నేతలకి తెలంగాణా అంశం రాజకీయ లబ్దిపొందే అంశంగా మారిపోవడంతో, మధ్యలో రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల బ్రతుకులు నానాటికి దయనీయంగా మారుతున్నాయి.

కాంగ్రెస్ కి కలిసి వచ్చిన బీజేపీ కుమ్ములాట

  బీజేపీలో అద్వానీ, సుష్మ స్వరాజ్, యశ్వంత్ సిన్హా తదితరులు నరేంద్ర మోడీని వ్యతిరేఖిస్తున్నకారణంగా ఇంత కాలం ఆయనకు నాయకత్వం కట్టబెట్టేందుకు జంకిన ఆపార్టీ, చివరికి దైర్యం చేసి ఆయనను ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నియమించింది. అయితే, తనను కాదన్న పార్టీకి అద్వాని కూడా గట్టి షాకే ఇచ్చారు. ఆయన అంత తీవ్రమయిన నిర్ణయం తీసుకొంటారని ఊహించని ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకొని ఆయన నిర్ణయం ఉపసంహరింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇదే అదనుగా ఆయన పార్టీని తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన తను రాజీనామా ఉపసంహరించుకోవాలంటే సుష్మా స్వరాజ్ ను పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతున్నట్లు సమాచారం. అవికాక ఆయనకి మరికొన్ని డిమాండ్స్ కూడా ఉన్నట్లు సమాచారం.   మరో ఆరు నెలలో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, పది నెలలలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవలసిన తరుణంలో బీజేపీలో అగ్రనాయకత్వం మధ్యన బయటపడిన ఈ అంతర్ యుద్ధం పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, అద్వానీతో బాటు ఆయన మద్దతుదారులు కూడా పార్టీని వీడే ప్రయత్నం చేసినట్లయితే పార్టీ రెండుగా చీలడం ఖాయం. అదే జరిగితే, వరుస కుంభకోణాలతో పరువుపోగోట్టుకొని రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి బయపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది తీయని వార్తే అవుతుంది. అందుకే, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో రగిలిన ఈ అంతర్ యుద్దానికి యధాశక్తిన తమ మాటలతో ఆజ్యం పోస్తున్నారు. ఒకవేళ, బీజేపీ గనుక నిలువునా చీలిపోయినట్లయితే, ఇక అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగే ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలలో కూడా ఊహించని అవకాశమేనని చెప్పవచ్చును.   అదేవిధంగా దేశంలోని బీజేపీని వ్యతిరేఖిస్తున్నప్రాంతీయ పార్టీలకు కూడా తమ 3వ ఫ్రంట్ కలలు నిజం చేసుకొనే అవకాశం దక్కింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు స్థానికంగా చాల బలంగా ఉన్నందున అవి బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలవు. అయితే, వాటికి జాతీయ దృక్పదం కంటే స్వంత ఎజెండాయే ముఖ్యం గనుక వాటి అంత తేలికగా సఖ్యత ఏర్పడే అవకాశం లేదు. ఒకవేళ ఏర్పడినా అది తాత్కాలికమే తప్ప శాశ్వితం కాబోదు. చిన్న పాము నయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు కాంగ్రెస్ పార్టీ 3వ ఫ్రంటు ఏర్పడక ముందే దానిని అవలీలగా చిన్నాభిన్నం చేసి తనకు ఎన్నికలలో ఎదురు లేకుండా చేసుకోగలదు. ఇటువంటి పరిస్థితులను సద్వినియోగం చేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అకస్మాతుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదు. బీజేపీలో చెలరేగిన ఈ అంతర్ యుద్ధం వలన అంతిమంగా లాభపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

ప్రతిపక్షాల కొంప ముంచిన అవిశ్వాసం

  కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రెండు నెలల క్రితం శాసనసభలో కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల ఆయన ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏమి లేకపోగా, అది ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలే తీవ్రంగా నష్టపోయాయి. చంద్రబాబు పరోక్ష సహకారంతో అవిశ్వాస గండం అవలీలగా గట్టెక్కిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇనుమడించిన ఉత్సాహంతో దూసుకుపోతుంటే, ఆ సందర్భంగా పార్టీ విప్ ను దిక్కరించిన కారణంగా ఏకంగా 15 మంది శాసన సభ్యులు అనర్హత వేటుకి బలయిపోయారు. తద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో మరింత బలం పుంజుకొన్నారు. శాసన సభ సమావేశాల ప్రారంభానికి రెండ్రోజుల ముందే స్పీకర్ వ్యూహాత్మకంగా శాసనసభ్యుల మీద అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు సభలో 145 స్థానాలతో అధికార పార్టీ మరింత బలపడింది. అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం గురించి మరో మారు ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేవు. ఒకవేళ చేయదలచుకొన్నా కూడా సభా నియమాల ప్రకారం ఒకే దఫాలో సాగుతున్న శాసన సభ సమావేశాలలో వరుసగా మూడవసారి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలులేదని రాజ్యంగా నిపుణులు చెపుతున్నారు.   ఈవిధంగా చూస్తే, తెరాస, వైకాపాలు అత్యుత్సాహానికి పోయి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల వైకాపాకే తీరని నష్టం కలిగింది. రాజకీయ అనుభవ రాహిత్యంతో ఆ పార్టీ అనాలోచితంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వలన పార్టీ విప్ప్ లు దిక్కరించి మరీ ఆ పార్టీకి విధేయత ప్రకటించినందుకు వారికి బహుమానంగా అనర్హత వేటు పది వారందరూ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. సాధారణ ఎన్నికలకి కేవలం పది నెలలే మిగిలి ఉన్నందున ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల కమిషనర్ హెచ్. ఎస్. బ్రహ్మ సూచన ప్రాయంగా ప్రకటించడంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ అధిష్టానం అండతో పార్టీలో చెలరేగిన అసమ్మతిని అణచిపారేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేటి నుండి మొదలయ్యే శాసన సభా సమావేశాలలో మరింత చెలరేగిపోవడం ఖాయం.

అభిమానుల బలహీనతే పెట్టుబడిగా సాగుతున్న ఐపీయల్

  ఐపీయల్ మ్యాచులు మన క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయమని దేశంలో క్రికెట్ అభిమానులు అందరూ చాలా సంతోషించారు. వివిధ దేశాలకు చెందిన తమ అభిమాన క్రికెట్ ఆటగాళ్ళను అందరూ కలిసి ఆడుతుంటే వారికి అదో పండుగే అయింది. దానికి సినీరంగం, చీర్ గర్ల్స్ గ్లామర్ కూడా తోడవడంతో వారి సంబరానికి అంతే లేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ, అటు క్రికెట్ అభిమానులకు ఆనందం, ఇటు క్రికెట్ బోర్డుకి, ఆటగాళ్లకి కాసుల వర్షం కురిపిస్తూ ఐపీయల్ ఇంతవరకు సజావుగా సాగిపోయింది.   అయితే, శ్రీశాంత్, అజయ్, అంకిత్ ముగ్గురూ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడటంతో, క్రికెట్ అభిమానులకి తమ కళ్ళ ముందు జరుగుతున్న ఆట నిజమయిన ఆట కాదని తెలిసి దిగ్బ్రాంతి చెందారు. ఆ వెంటనే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ మయప్పన్, రాజస్తాన్ రాయల్స్ యజమానులు అయిన బాలివుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఐపీయల్ పై బెట్టింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక, ఇండియన్ టీం క్యాప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ కూడా రితీ స్పోర్ట్స్ అనే వ్యాపార సంస్థలో వాటాలు కలిగి నలుగురు ఆటగాళ్ళను ముందుగానే ఫిక్స్ చేసుకోవడం మరింత అనుమానాలకు రేకెత్తించింది.   ఈ మొత్తం వ్యవహారలన్నిటినీ కూడా ఎక్కడో దుబాయ్ లో కూర్చొన్న దావూద్ ఇబ్రహం వంటి సంఘ వ్యతిరేఖ శక్తులు నియంత్రిస్తుండటం కొసమెరుపు. ప్రజల క్రికెట్ అభిమానాన్నిఒక బలహీనతగా గుర్తించిన సదరు శక్తులన్నీ కలిసి వారితో ఈవిధంగా ఆడుకోవడం ఆరంబించాయి. అప్పుడు అభిమానులకు తాము ప్రోత్సహిస్తున్నది క్రికెట్ ఆటనా లేక వ్యాపారన్నా లేక జూదాన్నా అనే ప్రశ్నతలెత్తింది. తమ విలువయిన సమయాన్ని కష్టార్జితాన్నిపణంగాపెట్టి వారందరూ కలిసి ఆడుతున్న ఈ ఐపీయల్ మ్యాచులలో తామే అందరి కంటే ముందు క్లీన్ బౌల్డ్ అయిపోయామని అర్ధం చేసుకొని వారు నివ్వెర పోయారు.   జంటిల్ మ్యాన్ గేం అని చెప్పబడుతున్న క్రికెట్ ఆట వెనుక ఇన్ని దుష్ట శక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఉన్నట్లు తెలిసిన తరువాత కూడా ఆ ఆటలో ఆనందం వెత్తుకోవాలని చూస్తే అది తమ బలహీనతకు మరో మారు లొంగిపోవడమే కాకుండా అటువంటి సంఘ విద్రోహ శక్తులకు పరోక్షంగా తమ మద్దతు తెలిపినట్లే అవుతుందని చాలా మంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారిప్పుడు.   ఈ ఐపీయల్ మ్యాచుల వల్ల దేశానికి ఖ్యాతి, ఆదాయం రాకపోగా ఉన్నపరువు గంగలో కలిసిపోయి, సొమ్ములు విదేశాలకు తరలిపోతున్నాయి. నేడు ఈ మ్యాచులలో కొందరు సినీతారలు ప్రత్యక్షంగా పాల్గొంటే, సాక్షాత్ బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్, ఆయన అల్లుడు మేయప్పన్, విందూ సింగ్, దావూద్ ఇబ్రహీం వంటి వారందరూ తెర వెనుక నిలబడి కధను నడిపిస్తున్నారు. ఇవి కేవలం ఇంత వరకు బయటపడిన కొన్ని పేర్లు మాత్రమే. ఇంకా ఈ వ్యవహరంలో ఎన్ని పెద్ద తలకాయలున్నాయో ఎవరికీ తెలియదు. స్విస్ బ్యాంకులని కూడా తమ అవినీతి సంపాదనతో నింపి పడేసిన మన రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కోట్లు కురిపిస్తున్న ఈ ఐపీయల్ మ్యాచ్చులకి దూరంగా ఉంటారని మనం భావించనవసరం లేదు. ఎంత పెద్ద అవినీతో భాగోతానయినా అవలీలగా కప్పి పుచ్చగల సమర్దులయినవారు తమ పేర్లు బయటపడకుండా పైకి కొందరి బొమ్మలే కనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు.   ఇక, ఇటువంటి అనైతిక ఆటలో తానూ భాగస్వామిని కాలేనని గౌరవంగా తప్పుకొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ని ఆదర్శంగా తీసుకొని ఆయన అభిమానులు కూడా ఈ ఐపీయల్ మ్యాచులుకి దూరంగా ఉంటే మేలేమో. ఇంత ఘోరంగా మోసం చేసిన ఐపీయల్ మ్యాచులు ఇప్పుడు వారికి ‘ఐ-ఓపెనర్’ అయ్యాయి.

కాంగ్రెస్ పంచాయితీలో ఇంతకీ తేలిందేమిటి?

  డిల్లీలో కాంగ్రెస్ పంచాయితీ ఇక ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పెద్ద తలకాయలన్నిటికీ పేరుపేరునా పిలిచి సింగల్ గా మరియు సామూహికంగా వేర్వేరు రకాల అక్షింతలు వేసి సాగనంపుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఎవరికీ ఏ టైపు అక్షింతలు వాడిందో పెరుమాళ్ళకే ఎరుక గనుక, వారందరూ బయటకి వచ్చినప్పుడు మాత్రం ఏదో ఘనవిజయం సాదించినట్లే కాలరేగరేసుకొని మీడియాతో మాట్లాడకుండా, ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్త పడుతూ రాష్ట్రంలో తిరిగి వచ్చి పడుతున్నారు.   ఇంతవరకు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఏమి చెప్పలేదు గనుక, మీడియా కూడా తనకు తోచినట్లు మంచి రుచికరమయిన మసాలా దట్టించి కధనాలు వండి వడ్డిస్తోంది. జనాలు కూడా వారి వారి టేస్టుల బట్టి వాటిలోంచి తమకు నచ్చిన వాటిని వడ్డించుకొని ఆనందిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే తంతును బట్టే డిల్లీ పంచాయితీలో ఏమి జరిగిందో కనిపెట్టుకొనే పని జనాలదే అవుతుంది.   ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ ఇంటికి వచ్చి చప్పుడు చేయకుండా కూర్చుంటే ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నందుకు ఆయనకు సోనియమ్మ అరగంట సేపు తలంటి పంపిందని భావించవచ్చును. ఒకవేళ, ఆయన కలలు కంటున్న హోంమంత్రి పదవి ఇస్తే, ముఖ్యమంత్రిని మరీ అంత రెచ్చిపోవద్దని హెచ్చరించినట్లు అనుకోవచ్చును.   ఒకవేళ ముఖ్యమంత్రి రామచంద్రయ్యకు మంగళ హారతి ఇచ్చేస్తే, చిరంజీవికి సోనియమ్మ అక్షింతలు వేసినట్లు చెప్పుకోవచ్చును. రామచంద్రయ్యను క్యాబినెట్ లో చిరంజీవి పఠం పెట్టుకొని మెగాభజన చేసుకోనిస్తే, ఇక రెడ్డిగారు అమ్మహస్తం పట్టుకొన్నపటికీ, పగటి (ఇందిరమ్మ) కలలు కనవద్దని, ఒక్క బంగారు తల్లినే కాకుండా పార్టీలో ఉన్న చిరంజీవి, రామచంద్రయ్య, దామోదర, జానారెడ్డి ఇత్యాది బంగారు తండ్రులను కూడా పట్టించుకోమని అమ్మ ఆదేశించినట్లే అనుకోవచ్చును.   ఇక, డిల్లీలో పంచాయితీలు ముగిస్తే, రేపటి నుండి మంత్రులందరూ మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెడతారని ప్రజలు అత్యాశకి పోతున్నారు. కానీ, ఒకసారి తెలంగాణా అంశం, మరోసారి అవిశ్వాసం, మరోసారి కళంకిత మంత్రుల ఉద్వాసన, ఇంకోసారి మంత్రి పదవుల భర్తీ, అసమ్మతి నేతల బుజ్జగింపులు వంటి అనేక సీరియస్ సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వచ్చిపడిపోతుంటే, ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ప్రజలు బాధపడటం అవివేకం.అప్పటికీ వారు డిల్లీ నుండి తిరిగి వచ్చినప్పుడల్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు కదా పాపం.