హరికృష్ణ, జానకిరామ్ ప్రాణాలు తీసిన సేమ్ నెంబర్

  నందమూరి హరికృష్ణ నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు.. గతంలో 2014 హరికృష్ణ కుమారుడు జానకి రామ్ కూడా నల్గొండ సమీపంలోనే రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే తండ్రి, కొడుకుల మృతిలో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.. ఇద్దరికీ నల్గొండ జిల్లాలో, సేమ్ హైవేపై ప్రమాదం జరిగింది.. అయితే ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది.. జిల్లా, హైవే నే కాదు ఈ రెండు ప్రమాదాల్లో ఇద్దరి కారు నెంబర్లు కూడా సేమ్.. జానకి రామ్ ప్రయాణించిన కారు నెంబర్ ఏపీ29 బీడీ 2323 కాగా.. ఇప్పుడు ప్రమాదానికి గురైన హరికృష్ణ కారు నెంబర్ ఏపీ 28బీడబ్ల్యూ 2323 .. మాములుగా నందమూరి కుటుంబానికి 9 సెంటిమెంట్.. దీంతో నందమూరి కుటుంబానికి 2323 కలిసి రావట్లేదని అభిమానులు భావిస్తున్నారు.  

హరికృష్ణ మృతికి సోషల్ మీడియాలో ప్రముఖుల సంతాపం

నందమూరి హరికృష్ణ ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. ఆయన మరణవార్త విని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.     ‘నందమూరి హరికృష్ణగారి మృతి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి నిజంగా తీరనిలోటు’ - నారా లోకేష్‌ ‘నందమూరి హరికృష్ణ చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’-  వైఎస్‌ జగన్‌ హరికృష్ణ మరణ వార్త  విచారం కలిగిస్తోంది.. సోదరుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తోపాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను - కేటీఆర్ చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు.. ఇది కొన్ని వారాల క్రితం ఆయన చెప్పిన మాట.. కానీ ఇప్పుడు ఆయన లేరు.. నీతో పాటు నీ గర్జనను కోల్పోతున్నందుకు ఎంతగానో బాధగా ఉంది అన్నయ్య - నాగార్జున ‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త ఎంతో విచారం కలిగిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా ప్రియమైన సోదరుడు తారక్‌, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’- మహేష్‌బాబు ఈ రోజు నా సోదరుడు హరికృష్ణను కోల్పోయాను.. ఏం చెప్పాలో నాకు మాటలు రావడంలేదు - మోహన్‌బాబు ‘హరికృష్ణగారు చనిపోయారన్న వార్త నమ్మలేకపోతున్నా. గుండె పగిలిపోతోంది. నాకు, నా తండ్రికి ఎంతో ఆప్తులు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లకు ఆ దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలి’- దేవిశ్రీ ప్రసాద్‌ ‘హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని షాకయ్యా! వ్యక్తిగతంగా ఆయన్ను ఎప్పుడూ కలవలేదు. కానీ, ఎంతో కాలం నుంచి తెలిసిన వ్యక్తిలా అనిపించేవారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ -నాని ‘ఎంతో హృదయ విదారక వార్తను విన్నా. హరికృష్ణగారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఆయనొక డైనమిక్‌, నిజయాతీ కలిగిన వ్యక్తి. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ -శ్రీను వైట్ల ‘నిజంగా షాక్‌. హరికృష్ణగారు మృతి చెందడంతో ఎంతో విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’- అనిల్‌ రావిపూడి ‘నమ్మలేకపోతున్నా. ఆయన కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి’ -మంచు విష్ణు ‘దేవుడు కఠినాత్ముడు. మాటలు రావడం లేదు. హరికృష్ణ అంకుల్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించాలి’ - మంచు మనోజ్‌ ‘నిద్ర లేవగానే ఇలాంటి భయంకరమైన వార్త వింటానని అనుకోలేదు. హరికృష్ణగారి మరణ వార్త విని విచారంతో నా హృదయం బరువెక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. తారక్‌, కల్యాణ్‌లకే కాదు, మొత్తం కుటుంబానికే ఆయన మరణం పెద్ద లోటు’ -సుధీర్‌బాబు ‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది’ - వరుణ్‌తేజ్‌ ‘నందమూరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ -సాయిధరమ్‌తేజ్‌ ‘తారక్‌, కల్యాణ్‌రామ్‌ సర్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వారికిది చాలా కఠిన సమయం. హరికృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ - వెన్నెల కిషోర్‌

హరికృష్ణ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

  నందమూరి హరికృష్ణ మరణ వార్త విని ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు అన్నారు.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు.. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని, సాంఘిక ,పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చేయి అని కొనియాడారు.. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు.. నందమూరి తారకరామారావుకు ఆయన అత్యంత ఇష్టుడు అని, ఎన్టీఆర్‌ చైతన్య రథసారథిని స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ ఎన్టీఆర్‌ను ప్రజలకు చేరువ చేశారని గుర్తుచేశారు.. నిరాడంబరుడు, నిగర్వి, స్నేహానికి మారుపేరు అయిన హరికృష్ణను కోల్పోవడం బాధాకరమన్నారు.

కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ చివరి లేఖ

  నందమూరి హరికృష్ణ  హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా, నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు.. ఎన్టీఆర్ తనయుడిగా, సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా హరికృష్ణ అందరికీ సుపరిచితులు.. కాగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 2 న అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.. అయితే హరికృష్ణ మరణానికి ముందు, ఆయన పుట్టినరోజు వేడుకుల గురించి అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు.. 'సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను' అని హరికృష్ణ లేఖలో పేర్కొన్నారు.. హరికృష్ణ చివరిలేఖను చూసి అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.  

నందమూరి హరికృష్ణ ఇకలేరు

  సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం.. హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాద సమయంలో కారులో ఆయనతో సహా ముగ్గురు ఉన్నట్లు సమాచారం.. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది.. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.

టీఆర్ఎస్ 'ప్రగతి నివేదన సభ' ఏర్పాట్ల వద్ద వైసీపీ ఎమ్మెల్యే..!!

  టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర కలాన్ వద్ద 'ప్రగతి నివేదన' పేరుతో సెప్టెంబర్ 2 న భారీ బహిరంగ సభ పెడుతున్న విషయం తెలిసిందే.. ఈ సభకోసం అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే ఆ ఏర్పాట్ల వద్ద ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దర్శనమిచ్చారు.. ఆయన ఎవరో కాదు చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ప్రగతి నివేదన సభ వద్ద ఏర్పాట్లను పరిశీలీంచడానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడే వున్నారు.. దీంతో ఆయన్ని కలవడానికి ఇక్కడికి వచ్చినట్లు చెవిరెడ్డి తెలిపారు.. వ్యక్తిగత పనిపైనే మేయర్ ను కలిసినట్లు ఇందులో రాజకీయాలేమీ లేవని అన్నారు.. మరోవైపు, చెవిరెడ్డికి సంబంధించిన వాహనాలును ఈ సభా ఏర్పాట్ల కోసం వాడుతున్నారని.. దీంతో వాటి వ్యవహారాలను చూసుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.. కేవలం బిజినెస్ పనుల్లో భాగంగానే చెవిరెడ్డి అక్కడికి వెళ్లినట్టు సమాచారం.

జగన్ బాణం మళ్ళీ దూసుకొస్తోంది

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ సోదరి 'షర్మిల' తెలుగు ప్రజలకు సుపరిచితమే.. అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల వైసీపీలో కీలకంగా వ్యవహరించారు.. పాదయాత్ర చేసి, జగన్ ని అన్యాయంగా జైలులో పెట్టారనే విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు.. జగన్ జైలులో ఉన్నా, జగన్ వదిలిన షర్మిల అనే బాణం దూసుకుపోతోందని కార్యకర్తలు సంబరపడిపోయారు.. ఒకానొక సమయంలో వైసీపీ అంటే షర్మిల అనుకునే స్థాయికి వెళ్ళింది.. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా.. అది షర్మిల విషయంలో కూడా రుజువైంది.. జగన్ విడుదల, రాష్ట్ర విభజన జరిగిపోయాయి.. ఇంతలో 2014 ఎన్నికలు వచ్చాయి.. షర్మిలను జగన్ పక్కన పెట్టారో లేక షర్మిలే పక్కకి వెళ్లారో తెలీదు కానీ.. అప్పటివరకు పాదయాత్ర, స్పీచ్ లతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన షర్మిల, ఎన్నికల బరిలోకి దిగలేదు.. తరువాత రాజకీయాలకు కూడా దూరమవుతూ వచ్చారు.. ఇంచు మించు ఆమెని అందరూ మర్చిపోయారు.     అయితే ఇప్పుడు షర్మిల గురించి పార్టీలో చర్చ మొదలైంది.. వచ్చే ఎన్నికల్లో ఆమెని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారట.. రాజంపేట లేదా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి షర్మిలను బరిలోకి దించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. మరోవైపు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.. షర్మిల ఎక్కడ నుండి బరిలోకి దిగుతారో తెలీదు కానీ బరిలోకి దిగటం మాత్రం పక్క అంటూ చర్చలు జరుగుతున్నాయి.. అదే విధంగా షర్మిల వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. గత ఎన్నికల కంటే ముందు జగన్ వదిలిన షర్మిల అనే బాణం దూసుకొచ్చింది తరువాత సుమారు నాలుగున్నరేళ్ళు పాటు కనిపించకుండా పోయింది.. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత తిరిగొస్తున్న బాణం, మరి దూసుకెళ్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.

మోదీని అధికారం నుంచి వెంటనే దించేయాలి

కరుణానిధి మరణంతో 50 ఏళ్ల తర్వాత డీఎంకేలో అధ్యక్షుడి మార్పు జరిగింది.. డీఎంకే అధ్యక్షుడిగా ఆయన కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్.. ఇంతకు ముందులా కాదని, ఇప్పుడు తాను సరికొత్త స్టాలిన్‌నని అన్నారు.. కరుణానిధి మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయని.. కరుణానిధి రాష్ట్రం కోసం, దేశం కోసం ఎంతో సేవ చేశారని.. పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.     అదే విధంగా రాష్ట్రంలోని అన్నాడీఎంకే పై కేంద్రంలోని బీజేపీపై స్టాలిన్ మండిపడ్డారు.. అన్నాడీఎంకే ప్రజల కోసం పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారికెప్పుడూ పదవుల కుమ్ములాటలే కానీ, ప్రజల సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు.. ఇక దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, దేశ ప్రజలను మతాలుగా విడదీసేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.. దేశంలో జరుగుతున్న దారుణాలను అరికట్టాలంటే మోదీని అధికారం నుంచి వెంటనే దించేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.. డీఎంకే, బీజేపీకి దగ్గరవుతుందని వార్తలు వినిస్తున్న సమయంలో స్టాలిన్‌, మోదీపై విమర్శలు చేయటం ఆసక్తిని రేపుతున్నాయి.. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు.. జేసీ లాజిక్కు

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే పొత్తుల గోల మొదలైంది.. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. కొందరు అసలు కాంగ్రెస్ తో పొత్తు ఏంటి?.. అది టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అయితే తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.     తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, అసలు ప్రభుత్వం ఏర్పాటు సంగతి అటుంచి ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పలేని స్థితిలో కూడా కాంగ్రెస్ టీడీపీ మద్దతు కోరుతోందని, రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదని అభిప్రాయపడ్డారు.. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని జేసీ అన్నారు.. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటుంది.. కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని అన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని, అలా చేసినప్పుడు ముస్లింలు పార్టీకి దూరమై ఎక్కడ సీట్లు తగ్గుతాయో అన్న భయంతోనే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నాడని జేసీ, కేసీఆర్ ను విమర్శించారు.

నెల్లూరులో టీడీపీ నష్టనివారణ చర్యలు..!!

  గత కొంతకాలంగా టీడీపీతో అసంతృత్తితో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారన్న విషయం తెలిసిందే.. తన సొంత నియోజకవర్గం ఆత్మకూరుతో పాటు, నెల్లూరు జిల్లాలోని టీడీపీ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలకు చెందిన నేతలను కూడా తనవెంట వైసీపీలోకి తీసుకువెళ్లాలని ఆనం ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.. అయితే వచ్చే ఎన్నికల్లో ఆనం వైసీపీ నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, టీడీపీ అధినాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.. ఇప్పటికే ఆత్మకూరు ఇంచార్జిగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ ను నియమించింది.. అదేవిధంగా అన్ని మండలాల నేతలతో ముఖాముఖి చర్చించి, పార్టీని వీడకుండా చూడాల్సిందిగా చంద్రబాబు మంత్రులు చంద్రమోహన్ రెడ్డి, నారాయణలతో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆదేశించినట్టు తెలుస్తోంది.

మోదీ హత్యకు కుట్ర.. వరవరరావు అరెస్ట్.!!

  విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు నివాసంలో పుణె పోలీసులు సోదాలు నిర్వహించారు.. గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారించారు.. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.. మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. పుణె నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.. వరవరరావు, ఆయన కుమార్తె, ఆయన స్నేహితులు, నాగోల్‌లోని ఓ విలేకరి నివాసంలో సోదాలు చేసారు.. మరోవైపు వరవరరావు ఇంటిదగ్గర ఉద్రిక్తత నెలకొంది.. వరవరరావు ఇంట్లో సోదాలు విషయం తెలుసుకున్న పలువురు ఆయన ఇంటికి పెద్దఎత్తున వచ్చారు.. ఈ సందర్భంగా పోలీసులతో ప్రజాసంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు.. ప్రజా గొంతుకను అణచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోదాలు ముగిసిన తర్వాత వరవరరావును అరెస్ట్‌ చేశారు.

జగన్.. చంద్రబాబు.. నెక్స్ట్ ఎవరు ?

  ఏపీ రాజకీయాల్లో ఈమధ్య మాజీ డీజీపీ సాంబశివరావు పేరు బాగా వినిపిస్తోంది.. మొన్నటికి మొన్న సాంబశివరావు వైసీపీ అధినేత జగన్ ని కలిసారు.. ఇంకేముంది మాజీ డీజీపీ వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి.. దానికి తగ్గట్టే వైసీపీ సీనియర్ నేత విజయ సాయి రెడ్డి కూడా సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.. కానీ సాంబశివరావు దీన్ని ఖండిస్తూ అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు.. దీంతో ఇక చర్చ ముగిసింది అనుకుంటుండగా.. ఈ రోజు సాంబశివరావు, ఏపీ సీఎం చంద్రబాబుని కలిసారు.. సీఎంను తెదేపాలో చేరిక కోసం కలిశారా.. లేక వ్యక్తిగతంగా కలిశారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.. చూద్దాం సాంబశివరావు, చంద్రబాబుతో భేటీ గురించి ఏం స్పష్టత ఇస్తారో.

నెహ్రూ కేవలం కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తే కాదు

ఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో మాజీ ప్రధాని నెహ్రూ మెమోరియల్‌ ఉంది.. ఈ కాంప్లెక్స్‌ను మాజీ ప్రధానుల మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు.. ఈ లేఖలో మన్మోహన్‌ సింగ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. నెహ్రూ గొప్పతనాన్ని చెప్పటంతో పాటు, వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం తీరు ఎలా ఉండేదో గుర్తు చేసారు.     'చరిత్ర, వారసత్వానికి గౌరవమిచ్చి జవహార్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ జోలికి వెళ్లకుండా వదిలేయండి.. నెహ్రూ కేవలం కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తే కాదు, ఈ దేశానికి ప్రధాని.. ఈ మెమోరియల్‌ భారత తొలి ప్రధానికి గుర్తు.. ఈ దేశం కోసం ఆయన ఎంతో కృషి చేశారు.. ఆయన గొప్పతనాన్ని ప్రత్యర్థులు కూడా మెచ్చుకున్నారు.. భాజపా అగ్రనేత వాజ్‌పేయి హయాంలోనూ ఈ మెమోరియల్‌ మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.. కానీ ఇప్పుడు ఈ మెమోరియల్‌ను మార్చాలని ప్రభుత్వం అజెండాగా పెట్టుకోవడం బాధాకరం' అని లేఖలో పేర్కొన్నారు.. అదే విధంగా నెహ్రూ మరణించిన సమయంలో వాజ్‌పేయీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని కూడా మన్మోహన్ లేఖలో ప్రస్తావించారు.. ‘పండిత్‌జీ మరణించిన సమయంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పార్లమెంట్‌లో ఇలా అన్నారు.. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌కు మళ్లీ ఎవరు వచ్చినా నెహ్రూ ఉన్నప్పుడు వచ్చినంత ఖ్యాతీ రాదు. ఆయన వ్యక్తిత్వం అజరామరం.. ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే తత్వం, హుందాతనం, గొప్పతనం మళ్లీ చూడలేమేమో.. ఆయన ఆదర్శాలు, ఈ దేశంపై ఆయనకున్న ప్రేమను మనమంతా గౌరవించాలి అని వాజ్‌పేయీ నెహ్రూను కొనియాడారు’ అని మన్మోహన్‌ గుర్తచేశారు.. సెంటిమెంట్‌ను గౌరవించి నెహ్రూ మోమోరియల్‌కు మార్పులు చేర్పులు చేయొద్దని మన్మోహన్‌ ప్రధాని మోదీని కోరారు.. మరి ఈ విషయంపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు

  ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు చరిత్ర సృష్టించింది.. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీగా సింధు నిలిచింది.. ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్లో పీవీ సింధు, ప్రపంచ నం.2 అకానె యమగూచి(జపాన్‌) పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో భారత్ తరపున మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన వారు లేరు.. ఆ లోటుని పీవీ సింధు తీర్చి చరిత్ర సృష్టించింది.. మరోవైపు మంగళవారం ఫైనల్ జరగనుంది.. ఈ పోరులో సింధు, ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌తో తలపడనుంది.. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ 12 సార్లు తలపడగా తై జు యింగ్ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించింది.. మరి ఈసారి పీవీ సింధు విజయం సాధించి భారత్ కు స్వర్ణం సాధించిపెడుతుందేమో చూడాలి.

విజయ సాయి రెడ్డి పరువుపోయింది..!!

వైసీపీ నేతలు తొందరపడి నోరుజారి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.. ఆ మధ్య వైసీపీ అధినేత జగన్ కాపు రేజర్వేషన్లు, పవన్ పెళ్లిళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే.. జగన్ ఆ విమర్శల నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డారు.. ఇక రీసెంట్ గా వైసీపీ సీనియర్ నేత విజయ సాయి రెడ్డి తొందరపడి నోరుజారి పరువుపోగొట్టుకున్నారు.     ఇంతకీ మేటర్ ఏంటంటే.. విశాఖ జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు.. ఆ వెంటనే ఆయన తమ పార్టీలో చేరుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.. అంతేనా సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు.. ఆయన సలహాలు తీసుకుని రానున్న ఎన్నికలను వైసీపీ సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు.. ఇంకేముంది స్వయంగా విజయ సాయి రెడ్డి చెప్పడంతో వైసీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు చేరిక అంటూ ఒకటే వార్తలు.. దీంతో షాక్ తిన్న సాంబశివరావు ఓ ప్రకటన విడుదల చేసారు.. జగన్‌ను తాను కలవడం వెనుక ఎటువంటి రాజకీయాలకు తావు లేదని కేవలం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని తెలిపారు.. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వెల్లడించారు.. దీంతో విజయసాయి రెడ్డిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.. అసలు ఏమీ లేకుండానే పార్టీలో చేరుతున్నారని ప్రకటించి విజయసాయి రెడ్డి పరువు పోగొట్టుకున్నారని కొందరు అంటుంటే.. గతంలో అధికారిగా చంద్రబాబుని కూడా కలిశారు అంతమాత్రాన టీడీపీలో కూడా చేరినట్టా అని ప్రశ్నిస్తున్నారు.. అందుకే అంటారు రాజకీయనాయకులు ఒకటికి రెండుసార్లు అలోచించి మాట్లాడాలని.. లేదంటే ఇలానే అవుతుంది.

బాబు మరో అడుగు.. అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ప్రారంభం

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో లిస్టింగ్‌ చేసారు.. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. జ్యోతి ప్రజ్వలన అనంతరం 9.15 గంటలకు చంద్రబాబు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు.     చంద్రబాబుతో పాటు ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆశిష్‌కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని అన్నారు.. సాంకేతిక వినియోగంలోనూ ప్రథమస్థానంలో కొనసాగుతోందని ప్రశంసించారు.. అమరావతి నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందన్నారు.. నగర నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్లు జారీ చేయడం మంచి ఆలోచన అన్నారు.. 1998లో అహ్మదాబాద్‌ నిర్మాణం కోసం మున్సిపల్‌ బాండ్లు జారీ అయ్యాయని తెలిపారు.. అమరావతి బాండ్లు ఆగస్టు 14న జారీ కాగా.. గంట వ్యవధిలోనే రూ.2వేల కోట్లు సమకూరినట్టు వెల్లడించారు.. కాగా రాజధాని నిర్మాణంలో ఇదొక కీలక అడుగు అనే మాట వినిపిస్తోంది.

వాజ్‌పేయి ముందే మరణించినా.. బీజేపీ కావాలనే దాచిందా.!!

  మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ నెల 16 వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.. అయితే ఆయన నిజంగానే 16 న మరణించారా ? లేక ముందే మరణిస్తే బీజేపీ కావాలని దాచిందా? అంటూ ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.. అయితే ఈ అనుమానాలకు తెరలేపింది ప్రతిపక్షాలు కాదు.. బీజేపీ మిత్రపక్షమైన శివసేన నేత సంజయ్‌ రౌత్‌.. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయంపై ఆయన ఓ వ్యాసం రాశారు.. వాజ్‌పేయి ఆగస్టు 16నే చనిపోయారా? లేదంటే ఆగస్టు 15కు ముందే చనిపోయారా? అని ప్రశ్నించారు.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉన్న సందర్భంగా ఎర్రకోట నుంచి సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?.. పదవికాలం ముగుస్తుండటంతో, ప్రధానమంత్రిగా మోదీకి ఈ పంద్రాగస్టు ప్రసంగమే చివరిదనే విషయం తెలిసిందే.. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రసంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆగస్టు 16 నాడు వాజ్‌పేయ్ మృతి విషయాన్ని వెల్లడించారా? అని వ్యాసంలో సంజయ్‌ రౌత్‌ రాసుకొచ్చారు.. ఈయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారాన్ని రేపుతాయో ఏంటో చూడాలి.

ముందస్తు ఎన్నికలు వస్తాయని మేం చెప్పలేదు: కేటీఆర్

తెలంగాణలో ప్రజల నోట, నాయకుల నోట ఒకటే మాట.. ముందస్తు ఎన్నికలు.. ముందస్తు ఎన్నికలు.. తెరాస ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది, రేపో మాపో అసెంబ్లీని కూడా రద్దు చేస్తుంది అంటూ వార్తలొస్తున్నాయి.. అయితే తెరాస మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.. తెరాస సీనియర్‌నేత, కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్న మాట నిజమే కానీ మూహూర్తాలు, తేదీలు మేం పెట్టుకోలేదు.. ముహూర్తాలను మేమూ పత్రికల్లోనే చూస్తున్నాం అన్నారు.     ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలు వస్తాయని తామెక్కడా అధికారికంగా చెప్పలేదని, మీడియాలో మాత్రమే రాస్తున్నారనీ అన్నారు.. ఎన్నికల కోసం ప్రగతి నివేదన సభ జరపడం లేదని స్పష్టం చేశారు.. గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశామో చెప్పడానికే ఈసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మేమేందుకు ఎన్నికలకు భయపడతాం? ముందస్తు ఎన్నికలంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? అని ప్రశ్నించారు.. ప్రజల ముందుకెళ్లడానికి ప్రతిపక్షాలకు ధైర్యం చాలడం లేదని అన్నారు.. ప్రజలు ప్రతిపక్షాలను ఛీకొట్టారని, ప్రజలే తమకు బాస్‌లు అని అన్నారు.. ప్రజలకు మేం జవాబుదారీగా ఉంటాం.. ప్రజల మనసులు దోచుకున్నాం, ప్రతిపక్షాల పార్టీల్లా ప్రజల సొమ్మును దోచుకుని కుంభకోణాలు చేయలేదు అన్నారు.. ఎన్నికలంటే తెరాసకు కొత్తేమీ కాదన్నారు.. ముందస్తు ఎన్నికలపై త్వరలో స్పష్టత వస్తుందని అన్నారు.