సంజయ్ రాసలీలలు బయట పెడతా! టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అనేక మలుపులు తిరుగుతూ సంచలనాలకు కారణమవుతోంది. మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బండి సంజయ్ తనను రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి అన్నారు. బండి సంజయ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను యూజ్ సెల్ ఫెలో అన్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మైనంపల్లి..  తన గురించి బండి సంజయ్ కి ఏం తెలుసని మండిపడ్డారు.  బండి సంజయ్ భరతం పడతానని హెచ్చరించాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. బండి సంజయ్ రాసలీలల వ్యవహారాలన్నీ మీడియా ముందు పెడతానని మైనంపల్లి హెచ్చరించారు. బండి సంజయ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, ఎంపీకి తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ అని వ్యంగ్యం ప్రదర్శించారు. మరోసారి మల్కాజ్ గిరిలో అడుగుపెడితే బండి గుండు పగలడం ఖాయమన్నారు మైనంపల్లి హన్మంతరావు. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా తప్పుడు సంజయ్ ఆరోపణలు చేశాడని ఆరోపించారు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ... ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్ళతో దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ  మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదన్నారు. పోలీసు అధికారుల ముందు దాడి చేస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని సంజయ్ నిలదీశారు. బీజేపీ నేతలు చనిపోవడానికైనా.. చంపడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ జెండా, మహాత్మాగాంధీ ఫొటో కింద పడేసారని దీనిపై డీజీపీ, కమిషనర్ వెంటనే స్పందించాలన్నారు. తమ కార్పొరేటర్ శ్రావణ్‌పై దాడి చేసినవారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై  పోలీసు కేసు నమోదైంది. ఈ కేసులో 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కార్యకర్తపై టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది.   

మాస్క్ తో మూతి తుడుచుకున్న జగన్.. నెవ్వర్ బిఫోర్ మెసేజ్ అంటూ ట్రోలింగ్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైలే డిఫరెంట్. ఆయన తీరు అందరికి భిన్నంగా ఉంటుంది. అందరిది ఒకదారి ఉలిపికట్టెది మరో దారి అన్నట్లుగా దేశమంతా ఒక దారిలో పోతుంటే.. ఏపీలో జగన్ రెడ్డి పాలన మరో దారిలో పోతుందనే విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఆయన రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త పాలసీ తీసుకురావడం కూడా ఇందులో భాగమే అంటారు. రివర్స్ టెండరింగ్ పాలసీ లాగానే జగన్ రెడ్డి పాలనంతా రివర్స్ గానే ఉందనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి.  కరోనా కట్టడి విషయంలోనూ సీఎం జగన్ తీరు అందరికింటే భిన్నంగానే ఉంది. ఏపీ సీఎం జగన్ కు, కరోనాకు ఉన్న అవినాభావ సంబంధం గురించి గతంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది.కరోనా మామూలు జలుబులాంటిదని, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాను తరిమేయొచ్చంటూ జగన్ చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనాతో సహజీవనం తప్పదంటూ జగన్ అన్న మరో మాట ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయింది. కరోనా కట్టడికి మాస్క్ ధరించడమే ప్రధానమని వైద్య నిపుణులు చెబుతుంటే .. ఏపీ సీఎం జగన్ మాత్రం మాస్క్ జోలికే వెళ్లలేదు. మాస్క్ లేకుండా సమావేశాలకు హాజరయ్యారు. బహిరంగ వేదికపైనా జగన్ మాస్కు పెట్టుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనాలు మాస్కు పెట్టకోకపోతే ఫైన్ గా ఫైన్ వేస్తానని చెప్పే జగనన్న మాస్కు పెట్టుకోరంటూ విమర్శలు వచ్చాయి. కరోనా సమయంలో ఎక్కువగా బయటికి రాలేదు జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే అంతా నడిపించారు.  మాస్కులు, శానిటైజర్లు… నాకెందుకు వచ్చిన గోల అనుకున్న జగన్…తాడేపల్లి ప్యాలెస్ వదిలి అడుగు బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో జగన్ మాస్కు పెట్టుకొని జనాలకు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు ఏపీ సీఎం. సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేయక తప్పదు కాబట్టి…తాజాగా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే దాకా అంతా బాగానే ఉంది.  ఏపీ ప్రజలను  ఉనుద్దేశించి మాట్లాడాల్సిందిగా జగన్ ను ఆహ్వానించగానే…ఏపీ ప్రజలకే కాదు యావత్ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ గొప్ప సందేశాన్నిచ్చారు జగన్.  ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన జగన్…అప్పటిదాకా అతి కష్టం మీద పెట్టుకున్న మాస్కును…అతి సులువుగా తీసి పడేశారు. అయితే  అప్పటిదాకా కరోనా నుంచి తనకు రక్షణనిచ్చిన మాస్క్ అని చూడకుండా…మాస్క్ పై ఏమాత్రం కనికరం లేని జగన్… అదే మాస్క్ ను కర్చీఫ్ లా భావించి మూతి తుడుచుకున్నారు. దీంతో, మాస్కును ఇలా కూడా వాడవచ్చా అంటూ అక్కడున్న వారితో పాటు…ఆ వేడుకలను లైవ్ చూస్తున్న వారంతా మాస్కు మీద వేలేసుకున్నారు. నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జగన్ ఇచ్చిన ఈ సందేశం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.  స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏ సీఎం, ఏ పీఎం, ఏ దేశాధ్యక్షుడు ఇవ్వలేని గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఘనత జగన్ దే నంటూ నెటిజన్లు  ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. మాస్క్ ను ఇలా కూడా వాడతారా…నువ్వు దేవుడివి స్వామి అంటూ మీమ్స్, సెటైర్లు పేలుస్తున్నారు. ఇన్నాళ్లు ఈ టెక్నిక్ తెలీక ఎన్ని కర్చీఫ్ లు కొన్నానో…అంటూ మన్మథుడు సినిమాలో బ్రహ్మి డైలాగ్ తో మీమ్స్ పేలుస్తున్నారు. రాక రాక…ఆర్నెల్ల తర్వాత జనం మధ్యలోకి వచ్చిన వచ్చిన జగన్…మరో 6 నెలలకు ట్రోలింగ్ కు సరిపడా కంటెంట్ ఇచ్చిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్క్ వాడకంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన జగన్…అంటూ ట్రోలింగ్ జరుగుతోంది.

బంధు.. అందరికా లేక కొందరికా? కేసీఆర్ కొంప ముంచబోతోందా? 

టీఆర్ఎస్ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోంది. దళిత బంధుతో తమకు బాగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు గులాబీ బాస్. అయితే క్షేత్రస్థాయిలో  పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దళిత బంధుతో అసలుకే ఎసరు వచ్చేలా ఉందని అధికార పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. దళిత బంధుకు అందరికి పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని లేదంటే టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి ఓపెన్ గానే చెప్పేశారు. కడియమే కాదు గులాబీ నేతలంతా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధుతో ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు.  సీఎం కేసీఆర్ దళిత బంధు వ్యూహం పెద్దగా పనిచేసే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా, దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం వారికి, “దళిత బంధు” పేరుతో రూ.10 లక్షలు నేరుగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ ముందుగా హుజరాబాద్ లో “పైలెట్ ప్రాజెక్టు” చేపట్టారు.  ఇప్పటికే, ఈ పథకం కింద వాసాలమర్రి లో 76 దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.7.76 కోట్లను అందజేశారు. తన దత్తత గ్రామం వాసాలమర్రి లో దళిత వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు బాసటగా నిలిచారు.  వాసాలమర్రి పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా, తమకు అనుకూలంగా మలుచుకునే ఆలోచనతో సీఎం కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు.  హుజరాబాద్ కోసం, మొదటి విడతగా రూ.500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 54 వేల మంది దళిత ఓటర్లు ఉన్నారు. దాదాపు 16 వేల దళిత కుటుంబాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీరందరికీ ‘దళిత బంధు” పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంది. మొదటి విడత రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో, కేవలం 5 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. దీంతో మిగతా 11 వేల మంది కుటుంబాల పరిస్థితి ఏంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.  మొదటి విడతలో కొంత మందికి ప్రయోజనం చేకూర్చితే  మిగతావారు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలున్నాయి. దళిత కుటుంబాల్లోని 65 శాతం మంది లబ్ధి పొందని కారణంగా టీఆర్ఎస్ పై కోపంతో రగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాల అందరికీ రూ. 10 లక్షల చొప్పున అందించేందుకు మరో రూ.1100 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఇదంతా కేవలం మరో 15 రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేయగలిగితే, దళిత వర్గాల్లో ఉన్న మొత్తం ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్ కు అనుకూలంగా పడే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో దళిత వర్గాల్లో చిచ్చు రాజేసిన అపవాదును టిఆర్ఎస్ మూటగట్టుకుని చతికిల పడే అవకాశాలు ఉన్నాయి. “దళిత బంధు పథకం” లబ్ధి పొందని దళితులు సాధారణంగానే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.  కేవలం దళిత కుటుంబాలకే కాకుండా, పేద, అణగారిన వర్గాల కుటుంబాల అందరికీ రూ.10 లక్షల చొప్పున అందించాలని ఆయా కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అగ్రవర్ణాల అయిన రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాల సంఘం నేతలు కూడా తమకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో “రెడ్డి” సామాజిక వర్గానికి చెందిన 22,600 ఓట్లు, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం మైనారిటీ, ఓసి వర్గాలకు చెందిన ఓట్లు దాదాపు 40 వేల వరకు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన లబ్ధి పొందని కారణంగా, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.  ప్రధానంగా వెనుకబడిన జాతిగా ఉన్న గిరిజనులకు, దళితుల వలే రూ. 10 లక్షలు తమకు, ఇవ్వనట్లయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. అలాగే యాదవులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో అందే తోక సహాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే రూ. 10లక్షల సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాదవులకు గొర్రెలు ఇచ్చి, మచ్చిక చేసుకోవడం కుదరదని ఆ వర్గాలు తేల్చి చెబుతున్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంటు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇటీవలే కల్పిం చింది. దీన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ఈ రెండు వర్గాలు, తమకు ఖచ్చితంగా రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. యాదవ సామాజిక వర్గానికి 22,150, రజక సామాజిక వర్గానికి 7,600, నాయి బ్రాహ్మణులకు 3,300, ముదిరాజ్ సామాజిక వర్గానికి 23 220, పద్మశాలి లకు 26,350 ఓట్లు, మున్నూరు కాపులకు దాదాపు 30 వేల ఓట్లు ఉన్నాయి. మైనారిటీలకు 5,100 ఓట్లు ఉన్నాయి. ఇతర అణగారిన సామాజిక వర్గాలకు కలిపి 12 వేల కోట్లు ఉన్నాయి. ప్రధానంగా, దళిత సామాజిక వర్గానికి అంటే అత్యంత వెనుకబాటుకు గురైన ఎస్టి సామాజికవర్గానికి 7,600 ఓట్లు ఉన్నాయి. వీరికి కూడా ఇలాంటి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందకపోవడం వల్ల, తమకు సైతం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్లు, రైతు బంధు పథకాలు హుజురాబాద్ నియోజకవర్గంలో వెలవెలబోతున్నాయి. రూపాయలు 10 లక్షల ఆర్థిక సాయంతో “దళిత బందు” ప్రవేశపెట్టిన పథకంతో.. ఇప్పటికే ఇస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకం ద్వారా వచ్చే లబ్ధి పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆసరా పింఛన్లు రైతుబంధు పథకం రూ.10వేలకు మించి కనిపించడం లేదు. కానీ “దళిత బంధు” పథకం రూ. 10 లక్షలు అనేసరికి ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇటీవల కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పక్కా భవనాలు ప్రతి గ్రామంలో నిర్మిస్తామని, వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఇవేమీ హుజురాబాద్ ప్రజలకు పెద్దగా ఎక్కడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడి ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ, అవి వారి చెవికి ఎక్కడం లేదు. ఏ నోట విన్నా, తమకు 10 లక్షలు ఖచ్చితంగా కావాలని డిమాండ్ వస్తోంది. మర  ప్రభుత్వం అన్ని కులాల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉందా..? లేకుంటే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి..? అనేది అగమ్యగోచరంగా కనిపిస్తోంది.

మెగాస్టార్స్ మళ్ళీ మెరిశారు.. జగన్ ఆహ్వానం అందుకేనా?

మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే సారి వార్తల్లో  తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. చిరంజీవిని జగన్ రెడ్డి పిలిచింది సినిమా ఇండస్ట్రీ సమస్యలు చర్చించేందుకే అయినా.. ఇద్దరి మద్య గత కొంతకాలంగా  ఇంకేవో సంబంధాలు ఎదుగుతూ వస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుంచి చిరంజీవికి పిలులు రావడం, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ సీరియస్  చర్చకు దారి తీసింది.  చిరంజీవి కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి, అంతేకాకుండా,ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నా.. ఈ మధ్య కాలంలో అయన మళ్ళీ రాజకీయ వార్తల్లోనూ కనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానం కాంగ్రెస్ నాయకులకే వచ్చింది. అయినప్పటికీ ఆయనేమీ స్పందించలేదు కానీ, కాంగ్రెస్ నాయకులే చర్చించుకుని, చివరకు ఉన్నారనే నిర్ణయానికి వచ్చారు. అలాగే, చిరంజీవిని ఏపీసీసీ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అదలా ఉంటే, చిరంజీవికి  జగన్ రెడ్డి రాజ్య సభ టికెట్ ప్రామిస్ చేసినట్లు మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో .. ఏపీ సీఎం మెగాస్టార్’ను ఎందుకు పిలిచినా, మీడియాలో మాత్రం ఇంకేందుకో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ‘అన్నయ్య’ కథ అలా ఉంటే జనసేన అదినేత ‘తమ్ముడు’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలం తర్వాత ఏపీలోలో ఎంట్రీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకే ఆయన శనివారమే విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు (ఆదివారం) మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. స్వాతంత్ర స్పూర్తితో రాజకీయాలలో మార్పు రావాలని, అందుకు ఈతరం ముందుండాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే, అలాంటి స్పూర్తిని రగిల్చేందుకు ప్రభుత్వ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెడతామని, అన్నారు.  ఈసారి ఏపీ పర్యటనలో పవన్ కళ్యాణ్ లో  మార్పు కనిపిస్తోంది. గతంలో చాలా కాలంగా ఆయన ఏపీకి వచ్చినా మిత్ర పక్షం బీజేపీకి సమాచారమే ఉండేది కాదు. జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని, అటు నుంచి అటే వెళ్ళిపోవడం జరుగుతోంది. అయితే, ఇటీవల బీజేపీ నాయకులు, ఇదేమి మిత్ర ధర్మం, ఉమ్మడి పోరాటాలు చేయాలని చెప్పుకున్న సంకల్పం ఏమైందని, కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ, జనసేన పొత్తు పుటుక్కుమన్నట్లే, అన్న ప్రచారం జరిగింది. బీజేపీ నాయకుల హెచ్చరికలే పనిచేశాయో, ఏమో కానీ, ఈసారి  విజయవాడలో కాలు పెడుతూనే, నాయకుల టచ్’లోకి వెళ్ళిపోయారు. పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌’తో కలిసి జనసేన- బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌, దగ్గుబాటి పురందేశ్వరితో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.  మాములుగా అయితే పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవును కానీ, విడిపోయాయి అనుకున్న పార్టీలు  మళ్ళీ కలవడంతో  రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది.

అమరావతికే జగన్ జై కొడతారా? పంద్రాగస్టు ప్రసంగంలో సంకేతమిచ్చారా? 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్ మనసు మారిందా? మూడు రాజధానుల సిద్ధాంతాన్ని పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అమరావతి పేరు వింటేనే విసుక్కునే  వైసీపీ అధినేత.. ఇప్పుడు అమరావతి అభివృద్ధిపై ఫోకస్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రశ్నలే అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. కొన్ని రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయి. మూడు రాజధానుల సిద్ధాంతాన్ని సీఎం జగన్ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కిలిక విరామామా లేక నిజంగానే ఆయన మనుస మారిందా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.  చాలా కాలంగా సీఎం జగన్ సచివాలయానికి వెళ్లడం లేదు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సడెన్ గా ఆయన మానసు మార్చుకున్నారు. ఇక నుంచి సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించారు. ప్రతి పది రోజులకోసారి సచివాలయానికి వెళ్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇటీవలకాలంలో సచిలవాలయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో సీఎం జగన్ సచివాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  సీఎం జగన్ నిర్ణయంతో సచివాలయంతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.  ఇక నుంచి సచివాలయానికి వెళ్ళాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారు?. ఆకస్మిక నిర్ణయానికి దారితీసిన పరిణామాలు ఏమైఉంటాయి?. సచివాలయ విషయంలో ఐఏఎస్‌లపై చీఫ్ సెక్రెటరీ ఎందుకు సీరియస్‌గా ఉన్నారు ?. అమరావతి నుంచి విధులు నిర్వర్తించడం ఇన్నాళ్లూ ఎందుకు జరగలేదు?. మూడు రాజధానుల సిద్ధాంతానికి జగన్ తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నారా?.’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగానే స్వాత్రంత్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి.. మూడు రాజధానుల ప్రస్తావనే తన ప్రసంగంలో తేలేదు. దీంతో అమరావతి విషయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తుందనే చర్చ జోరందుకుంది.  స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏమేం చేసింది..? అనేదానితో పాటు పలు విషయాలపై నిశితంగా మాట్లాడారు సీఎం జగన్. అయితే.. గతంలో పలు సభల్లో, సమావేశాల్లో, పంద్రాగస్టులో కూడా మూడు రాజధానుల గురించి జగన్ చాలా సార్లే ప్రస్తావించారు. ఈసారి ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావనే అస్సలు కనిపించలేదు. ఆయన ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రాకపోవడంతో వేడుకలకు వచ్చిన పెద్దలు, వైసీపీ నేతలు, వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. పాలనలోని ముఖ్య అంశాలను ప్రస్తావించిన జగన్.. అత్యంత కీలకమైన మూడు రాజధానుల గురించి మాట్లాడకపోవడంతో... ఏదో జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.  అమరావతి రైతుల ఉద్యమం 600 రోజులకు పైగా కొనసాగుతోంది. రైతులు, రైతు కూలీలు పోరాచం చేస్తున్నారు. మరోవైపు ఏపీలోని తీరప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం, గతంలో పట్టించుకోని సచివాలయానికి రెగ్యులర్ గా వెళ్లాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తీరుతో అమరావతి విషయంలో ఆయన కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుందనే చర్చ వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.

బీజేపీ కార్పొరేటర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి.. జెండా ఆవిష్కరణలో రచ్చ రచ్చ

స్వాతంత్ర దినోత్సవ వేడుక రాజకీయ రగడకు వేదికైంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో రచ్చరచ్చైంది. జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానిక బీజేపీ కార్పొరేటర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సే మధ్య జరిగిన గొడవతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ ఘటనతో బీజేపీ కార్పొరేటర్ కు గాయాలు కావడంతో రాజకీయ వివాదం మరింత ముదిరింది.  మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.  ఈ ఘర్షణలో కార్పొరేటర్ శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. బీజేపీ కార్పొరేటర్ ను అంతు చూస్తానంటూ ఎమ్మెల్యే మైనంపల్లి బెదిరిస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. మైనంపల్లి రెచ్చగొట్టడం వల్లే టీఆర్ఎస్ కార్యకర్తలు కార్పొరేటర్ పై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలంటూ  మల్కాజిగిరి చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ ఘర్షణపై ఎమ్మెల్యే మైనంపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.అటు బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు.  టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు  పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి నీచమైన వ్యక్తి అని, గూండాయిజం దాడులతో రాజకీయం చేస్తుండని  బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ లో చేరదామని వస్తే మేం తరిమికొట్టామని, అలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. మైనంపల్లి అక్రమాలను బయటపెట్టి రౌడీయిజాన్ని తొక్కిపడేస్తామని హెచ్చరించారు. దాడి జరుగుతున్న సమయంలో చోద్యం చూస్తున్న పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీజీపీ స్పందించి మైనంపల్లి సహా టీఆర్ఎస్ గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామన్నారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కలిపించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు విచక్షణ రహితంగా బూతులు తిడుతూ తన పై దాడి చేసారని చెప్పారు. నిందితులని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

కశ్మీర్ కు త్వరలో ఎన్నికలు.. ఎర్రకోట వేదికగా ప్రధాని ప్రకటన 

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. వాడ వాడలా త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతున్నాయి. జనాలంతా దేశభక్తితో ఉప్పొంగి పోతున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన మోడీ అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం సరిహద్దులో కాపలా కాస్తున్న వీర జవాన్లకు మోదీ ప్రణామాలు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు. కరోనా సంక్షోభం వేళ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను మోడీ కొనియాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కొవిడ్‌తో దేశ ప్రజలు సహనంతో పోరాడారని మోదీ పేర్కొన్నారు. ఈ సమయంలో అనే సవాళ్లను ఎదుర్కొన్నామని, అసాధారణ వేగంతో పనిచేశామని గుర్తు చేశారు. ఇది మన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందించిన బలమని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశానికి వారు పతకాలు మాత్రమే అందించలేదని, యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారందరికీ దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందన్నారు. దేశ సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పోషకాహార లోపంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనదని అన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ప్రతి  ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నంగా మిగిలిపోకూడదని అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పేదరికానికి కులం, మతం తేడా ఉండకూడదని పేర్కొన్నారు. ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందించాలని మోడీ అన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబలశక్తిగా మార్చాలన్న సంకల్పం తీసుకోవాలని మోదీ కోరారు. శతాబ్ది ఉత్సవాలకు మిగిలి ఉన్న ఈ 25 ఏళ్లు అమృత ఘడియలని చెప్పారు. ఈ కాలంలో ప్రతి పౌరుడు క్షణం కూడా వృథా చేయకుండా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ప్రధాని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించినట్టు తెలిపారు. భారతీయుల జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కరోనా నుంచి చాలా వరకు రక్షించాయని మోడీ వివరించారు.భారతదేశం నేడు టీకాల కోసం ఏ ఇతర దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.  దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ ఎన్నికలపై మోడీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల్లో పోషకాహారాన్ని అందిస్తామని, దేశంలోని ప్రతీ ఇంటీకీ నల్లా నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఎర్రకోట వేదికగా మోడీ హామీనిచ్చారు. 

రాష్ట్రపతి స్వాతంత్య్ర‌ దినోత్సవ సందేశం.. ఆయ‌న ఏమ‌న్నారంటే..

‘‘దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాంతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు గొప్పగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యేడాది స్వాతంత్య్ర‌ దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవబోతున్నాయి. అమృత మహోత్సవంగా ఈసారి వేడుకల్ని నిర్వహించుకోబోతున్నాం’’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  ‘‘స్వాతంత్య్ర‌ దినోత్సవం మనకు పండగ దినం. మన స్వాతంత్య్ర‌ కాంక్ష ఎంతో మంది త్యాగధనుల ఫలితం. అందులో మనకు తెలిసినవాళ్లు ఉన్నారు, తెలియని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఈ దేశం కోసం చాలా గొప్ప త్యాగం చేశారు. అలాంటి గొప్ప వీరులకు నా తల వంచి నమస్కరిస్తున్నాను. గత 75 ఏళ్లలో పలు రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగాం. భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది’’ అని అన్నారు రాష్ట్రపతి.  టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభను కొనియాడారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిల్ని పోత్సహించినట్టు తెలిపారు. కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని.. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్‌ వేవ్‌పై పైచేయి సాధించగలుగుతున్నామన్నారు.   ‘‘కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించాం. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగింది. సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది’’ అని రాష్ట్ర‌ప‌తి తెలిపారు. ‘‘కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. ఈ మహమ్మారి నియంత్రణకు మన శాస్త్రవేత్తలు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతం కావడంవల్లే భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టగలిగాం. ఈ మహమ్మారి నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లే రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా మనమంతా మరిన్ని జాగ్రత్తలు పాటించాలనేదే కరోనా మనకు నేర్పిన పాఠం. వైరస్‌ తీవ్రత తగ్గినప్పటికీ కరోనా ఇంకా పోలేదు. కరోనా కట్టడి కోసం పనిచేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, కరోనా వారియర్లకు అభినందనలు. వారి సేవలే కరోనా సెంకడ్‌ వేవ్‌ను అదుపుచేయడంలో దోహదపడ్డాయి. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య కార్యకర్తల పాత్ర శ్లాఘనీయం. కరోనా సవాళ్లను అధిగమించాలన్న మనందరి సమష్టి సంకల్పమే సెకండ్‌ వేవ్‌ బలహీనపడేలా చేసింది’’ అని రాష్ట్రపతి త‌న ప్ర‌సంగంలో అన్నారు.   

బాప్‌రేబాప్‌.. ఆర్టీసీ బస్సులో కిలోన్న‌ర బంగారు న‌గ‌లు ప‌ట్టివేత‌..

ఆర్టీసీ బ‌స్సు ర‌య్ ర‌య్ మంటూ వెళ్తోంది. అన్నీ బ‌స్సుల్లానే అది కూడా. డ్రైవ‌రు, కండ‌క్ట‌రు, కొంత‌మంది ప్యాసింజ‌ర్లు. అంతా రోటీన్‌. స‌డెన్‌గా చెక్‌పోస్ట్ ప‌డింది. బ‌స్సును ఆపారు. పోలీసులు బ‌స్సు ఎక్కారు. ప్ర‌యాణీకులంద‌రినీ త‌నిఖీ చేస్తున్నారు. అప్పుడు మొద‌లైంది స‌డెన్‌గా హ‌డావుడి. ఒక్క‌సారిగా సంచ‌ల‌నం. పోలీసుల‌తో పాటు ప్యాసింజ‌ర్లూ ఉలిక్కిప‌డ్డారు. ఆ సీన్ చూసి అంతా బిత్త‌ర‌పోయారు. త‌మ క‌ళ్ల‌ను న‌మ్మ‌లేన‌ట్టు.. గుచ్చి గుచ్చి చూశారు. జ్యూవ‌ల‌రీ షాపుల్లో మిన‌హా అన్ని బంగారు న‌గ‌ల‌ను బ‌య‌ట ఒకేసారి చూడ‌టం వారంద‌రికీ అదే మొద‌టిసారి. అందులోనూ ఆర్టీసీ బ‌స్సులో అంత బంగారం బ‌య‌ట‌ప‌డ‌టం మ‌రింత షాక్‌. అందుకే ఇది బ్రేకింగ్ న్యూస్‌. కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు ద‌గ్గ‌ర‌ ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్‌ ముస్తాక్‌ హాక్‌ ఆర్టీసీ బస్సులో తెలంగాణలోని గద్వాల నుంచి కర్నూలుకు ఒక కేజీ 447 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని వస్తున్నాడు. ప‌క్కా స‌మాచారం మేర‌కు సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సును తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బ్యాగులో త‌ర‌లిస్తున్న‌ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును స్థానిక‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.  బంగారు న‌గ‌లు ఎవ‌రివి? ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి ర‌వాణా చేస్తున్నారు? ఏదైనా జ్యువ‌ల‌రీ షాపు వారివా? బిల్లులు లేని దొంగ బంగార‌మా? లేక‌, దొంగ‌త‌నం చేసుకొచ్చిన న‌గ‌లా? ఇలా పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.   

నా చావుకు సీఎం జ‌గ‌నే కార‌ణం.. వాలంటీర్ సూసైడ్ నోట్...

గ్రామ‌, వార్డు వాలంటీర్ల వ్య‌వ‌స్థ మేడిపండు లాంటిద‌ని మ‌రోసారి రుజువైంది. వాలంటీర్ల‌పై వైసీపీ నాయ‌కుల పెత్త‌నం ఎక్కువైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. వాలంటీర్ల‌ను కూలీలకంటే హీనంగా చూస్తున్నారు. వారితో గొడ్డులా చాకిరీ చేయించుకుంటున్నారు. ఓవైపు అధికారులు, మ‌రోవైపు అధికార‌పార్టీ నాయ‌కులు.. పెద్ద‌ల ఒత్తిళ్ల వ‌ళ్ల వాలంటీర్లు శారీర‌కంగా, మాన‌సికంగా కుంగిపోతున్నారు. కొంద‌రు ఆత్మ‌హ‌త్య కూడా చేసుకోవ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  తాజాగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ మ‌హేశ్ ఇంట్లో ఉరి వేసుకొని.. సూసైడ్ చేసుకోవ‌డం మ‌రింత కలక‌లానికి కార‌ణ‌మైంది. త‌న‌ చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగమే కార‌ణ‌మ‌ని సూసైడ్ లేఖ రాసి మరీ మహేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని సూసైడ్‌ నోట్‌లో రాశాడు మ‌హేశ్‌. తన లాంటి పరిస్థితి మరో వాలంటీర్‌కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో ప్ర‌దేయ‌ప‌డ‌టం సంచలనంగా మారింది.  మొద‌టినుంచీ వాలంటీర్ వ్య‌వ‌స్థ వివాదాస్ప‌దంగానే ఉంది. వాలంటీర్ల‌తో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే.. అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు మ‌రింత ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వైసీపీ నేత‌ల ఓవ‌రాక్ష‌న్‌ను, టార్చ‌ర్‌ను త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని అనేక‌మంది ఆరోపిస్తున్నారు. ఇవే విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఏకంగా త‌న చావుకు సీఎం జ‌గ‌నే కార‌ణ‌మ‌నేలా సూసైడ్ నోట్ రాసి మహేష్ అనే వాలంటీర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.   

ఏపీ ప్రభుత్వానిది కోర్టు ధిక్కరణేనా?  సీఎస్ జైలుకు వెళతారా? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడబోతోంది. కోర్టు ధిక్కరణ విషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఏపీ సీఎస్ జైలుకు వెళ్లాల్సి వచ్చినా రావచ్చని చెబుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబున్యుల్  కోర్టు ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్జీటీ సీరియస్ గా స్పందిస్తే మాత్రం జగన్ రెడ్డి సర్కార్ కు కష్టాలు తప్పవని అంటున్నారు.  అసలు విషయానికి వెళితే.. తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు రాజేసిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో  కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిశీలన పూర్తైంది. ఎన్జీటీ ఆదేశాలతో రెండు, మూడు వాయిదా తర్వాత ఎట్టకేలకు ప్రాజెక్టును పరిశీలించిన కేఆర్‌ఎంబీ.. రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికను రూపొందించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది. ఈ మేరకు ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించింది. డీపీఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు కేఆర్‌ఎంబీ నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది.  పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్ధారించినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను కేఆర్‌ఎంబీ అధికారులు తనిఖీ చేశారు. ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తిచేసినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించినట్లు కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఎన్జీటీ సోమవారం విచారణ జరపనుంది. కోర్టు తీర్పు ధిక్కరణకు పాల్పడితే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో కేఆర్‌ఎంబీ నివేదికలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలడంతో ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. గతంలో హెచ్చరించినట్లు సీఎస్ ను జైలుకు పంపుతుందా, అదే జరిగితే సంచనమే కానుంది. 

రేవంత్ సభకు సీనియర్లు బ్రేకులు! కాంగ్రెస్ కథ ఇక మారదా? 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి పార్టీని ఏకతాటి మీద ముందుకు తీసుకు పోయేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పార్టీ  సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్లి వారి వ్యక్తిగత యోగక్షేమాలతో పాటుగా, పార్టీ మంచి చెడులు కూడా చర్చించారు. ఆశీస్సులు అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్లతో పాటుగా దేవేందర్ గౌడ్ వంటి  ఇతర పార్టీల సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్లి పలకరించి వచ్చారు. కాంగ్రెస్ కలిసినప్పుడు, అందరి సహాయ సహకారాలు కోరడమే కాకుండా, అందరం కలిసి పనిచేద్దామని,కాంగ్రెస్ పార్టీని బతికించుకుందామని చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నాలు కొంత ఫలించినట్లే కనిపించాయి.  అయినా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, ఎప్పటినుంచే పార్టీలో ఉన్న సీనియర్లను కాదని , నిన్నగాక మొన్న, (నాలుగేళ్ళ క్రితం) పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం సీనియర్లలో చాలా మందికి  అప్పట్లో  మింగుడు పడ లేదు. ఇప్పటికీ కొందరు ఆ బాధను జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే, అందరూ కాకపోయినా కొందరు నాయకులు పార్టీ కార్యకలాపాలకు సాధ్యమైనంత దూరంగానే ఉంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కనీవినీ ఎరగని రీతిలో జరిగిన ఇంద్రవెల్లి గర్జన సభకు కూడా కొందరు సీనియర్లు దూరంగానే ఉన్నారు. అయినా లక్ష మందితో జరిగిన ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ కార్యకర్తల్లో బూతన ఉత్సాహాన్ని నింపింది. రేవంత్ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని మరింతగా పెంచింది.  ఇంద్రవెల్లి సభ అందించిన విజయోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా  సభల విషయంలో ఆదిలోనే వివాదం తలెత్తింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభలలో తొలి ప్రారంభ సభను, ఆగష్టు 18న కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్’సభ నియోజక వర్గం పరిధిలోని  ఇబ్రహీం పట్నంలో నిర్వహించాలని పీసీసీ ఆధ్వర్యంలోని దండోరా కమిటి నిర్ణయించింది. అయితే తమ నియోజక వర్గంలో జరపతలపెట్టిన సభకు సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని కోమటి రెడ్డి కస్సు మన్నారు. ఇదే విషయాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దృష్టికి, ఫిర్యాదు రూపంలో తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే వివాదం ఇంకా ముదరక ముందే అనూహ్యంగా పోలీసులు వివాదానికి పరిష్కారం చూపించరు. ట్రాఫిక్ సమస్యలు కారణంగా చూపింది,  ఇబ్రహీం పట్నంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల సూచనా మేరకు, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బొంగుళూరు సమీపమలో ముందుగ అనుకున్న విధంగా ఆగష్టు 18 సాయంత్రం నలుగు గంటలకు ‘దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభని నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.  అయితే ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, రేవంత్ రెడ్డికి సీనియర్లు సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంటుందని,అధిష్టానం అండదండలు ఉనంతవరకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎదురుండదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్న సంకేతాలు ఇచ్చారు. దళిత బంధు రూట్ లో కారెక్కేందుకు, ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ కొచ్చిన గొప్ప అలోచన అంటూ మెచ్చుకున్నారు. రాష్ట్ర జనభాలో ఒక వంతున్న దళితులకు మేలు చేసే పథకాన్ని తీసుకొచ్చిన  ముఖ్యమంత్రిని రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందించాలని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం పై కూడా సర్వే ఆచి తూచి స్పందించారు... ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లుగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏమైనా రేవంత్ నాయకత్వం విషయంలో కాంగ్రెస్ సీనియర్ల కొందరు ఇంకా కినుగ్గానే ఉన్నారు. అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.. అది మాత్రం నిజం.. 

మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి...

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సొగసరి, గడసరి సుందరాంగులు.. కుర్రకారుకు వలపు వలలు వేస్తూ జేబులకు గాలం వేస్తున్నారు. "ఒంటరిగా ఉన్నామని ఫీలవుతున్నారా.. మీ భావాలు పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడో/స్నేహితురాలా కావాలా?" అంటూ వచ్చే ఒక్క ఎస్‌ఎంఎస్‌ ఎందరో యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుదాంలే అనుకుని ఫోన్ కలిపితే ఇక అంతే సంగతులు. ఆ విష వలయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. వలపు వలలకు చిక్కి.. గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే పోయే పరువు తిరిగిరాలేదన్న బెంగతో సతమతమవుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని కూడా కక్కలేక, మింగలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.  ఈ తరహాలోనే విశాఖ యువకుడి నుంచి జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి అనే 24 ఏళ్ల యువతి అక్షరాలా రూ.24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దర్ని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో సుమారు 25 మంది అమ్మాయిలు పనిచేశారు. అది మూతపడటంతో వీరందర్నీ అక్కడే పనిచేసే 30 ఏళ్ల షాహిక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అనే టీం లీడర్‌ చేరదీశాడు. ఈయనది కృష్ణాజిల్లా. రెహమాన్ ఈ యువతులకు ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి వీరితో ఈ మోసాలు చేయిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. వీరే కాకుండా ఇంకా నగరంలో చాలామంది కిలాడీలు ఇలాగే తర్ఫీదు పొంది ఉన్నారని, వారి వివరాలు బయటపడితే.. ఇంకా ఎంతమంది కుర్రకారు బాధితులుగా మారారో బయటకొస్తుందంటున్నారు పోలీసులు. రెహమాన్ నుంచి మరిన్ని వివరాలు అందుకున్న పోలీసులు.. ఆ యువతుల కోసం అన్వేషిస్తున్నారు.  నెరజాణల వలకు ఎలా చిక్కుతున్నారంటే... మార్కెటింగ్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, కాల్‌సెంటర్ల నుంచి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ పంపిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేయగానే కి‘లేడీ’లు రంగంలోకి దిగుతున్నారు. వర్చువల్‌ నంబర్లతో కాల్‌ చేస్తున్నారు. పది పదిహేను రోజులు తరచూ ఫోన్లు చేసి ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. బాధితులు వారి నంబర్‌ అడిగితే ఈ కిలాడీలు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న నంబర్లను ఇస్తున్నారు. ఇక ఇక్కడే కథలోని అసలు ట్విస్టు మొదలవుతుంది. ఆ నెరజాణలు వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేస్తూ కుర్రకారును ముగ్గులోకి దింపుతున్నారు. వీడియో కాల్స్‌ చేసి రెచ్చగొడుతున్నారు. నగ్నంగా చూడాలని ఉందా? అంటూ కవ్విస్తున్నారు. మత్తెక్కించే మాటలతో యూత్ ను టెంప్ట్ చేస్తున్నారు. పైదుస్తులు మాత్రమే తీసేస్తే రూ.500, ఇంకొంచెం కిందివి తీసేస్తే రూ.వెయ్యి, పూర్తిగా నగ్నంగా చూడాలనుకుంటే రూ.2 వేలు చెల్లించాలంటూ.... ఒక్కో ఆఫర్ కు ఒక్కో రేటుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.  వీరి డ్రామాలో ఫైనల్ ట్విస్ట్ తెలుసుకున్న పోలీసులకు మతి పోతోంది. ఈ దశలో వారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వారు ఒకటి, రెండు దశల్లో సెమీ న్యూడ్ సీన్స్ చూపించడం పూర్తయ్యాక బాధితులను కూడా న్యూడ్ గా కనిపించాలంటూ షరతులు పెడుతున్నారు. నేను న్యూడ్ గా చూపించాను కదా... మరి నీ సంగతేంటి... అంటూ రెచ్చగొడుతున్నారు. వారి మాటలకు కుర్రకారు మంత్రముగ్ధులయ్యాక.. అప్పుడు ‘స్క్రీన్‌ రికార్డింగ్‌’ ఆప్షన్ తో వీడియో చిత్రీకరిస్తున్నారు. తర్వాత ఆ వీడియోను సంబంధిత యువకుల వాట్సాప్‌ నెంబర్స్ కు పంపిస్తున్నారు. ఆ తరువాత అవే వీడియోలను ఫేస్ బుక్, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలా.. అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో బాధిత యువకులు చేసేదేం లేక అడిగినంతా డబ్బు చెల్లించి అవమానకరమైన రీతిలో సీన్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇదే వారి పాలిట వరదాయినిలా మారిందని పోలీసులంటున్నారు.

మాకు కావాలి.. మాబంధు! గులాబీ లీడర్లకు నిలదీతలు

ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది, అంటే ఇదే నేమో, హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ను ఎలగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ అండదండలతోనే కావచ్చును, ఈటల హుజూరాబాద్’లో తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయంగానే కాదు, ఆర్థికంగానూ నియోజక వర్గం పరిధిలో మరే ఇతర నాయకునికి అందనంత ఎత్తుకు చేరుకున్నారు.  అయితే అనూహ్య పరిణామాల నడుమ రాజకీయ ప్రత్యర్ధిగా మారిన ఈటలను, ఎన్నికలలో ఓడించడం ముఖ్యమంత్రి కేసీఆర్’ కు  ఒక విధంగా అనివార్యంగా మారింది, మరో వంక అంత తేలిగ్గా అయ్యే పని కాదని అర్థమైంది. సర్వ శక్తులువడ్డి పోరాడక తప్పని పరిస్థతి ఎదురైంది. ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి కేసీఆర్, దళిత బంధు, బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. పథకం మంచి చెడులు ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రం,నాగాస్త్రమై  తెరాస ఎమ్మెల్యేలు, మంత్రుల  మెడకు చుట్టుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళితే అక్కడ ఇతర సామాజిక వర్గాల పేదలు మాకూ కావలి ... మా బంధు అంటూ చుట్టుముడుతున్నారు. చికాకు పరుస్తున్నారు.    మరోవైపు రాజకీయ పార్టీలు దళిత బందుకు స్వాగతం పలుకుతూనే, దళిత బంధు అనుబంధ డిమాండ్లతో మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇందులో భాగంగానే, శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ కమిటీ  చైర్మన్ సురేంద్ర ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రిని కాంగ్రెస్ కార్యకర్తలు ఘోరావ్ చేసినంత పని చేశారు. ఓవైపు చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుండగా.. ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని నినాదాలు చేస్తూ  నిరసనకు దిగారు.దీందో  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇదేదో ఒక్క వికారబాద్’లో ఒక్క సబితా ఇంద్రా రెడ్డికి మాత్రమే ఎదురైన చేదు అనుభవం కాదు. మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హుజూరాబాద్ వరాలు, గుదిబండగా మారుతున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, జనం డిమాండ్ చేస్తుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి “ మేమూ రాజీనామా చేస్తాం, మళ్ళీ పోటీ కూడా చేయం, మా నియోజక వర్గాలలో హుజురాబాద్ వరాల వాన కురిపించండి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈటలను ఓడించడం మాట ఎలా ఉన్నా హుజూరాబాద్ వారాలు మంత్రులు, అధికార  పార్టీ ఎమ్మెల్యేలకు జనంలోకి వెళ్ళకుండా చేస్తోంది. ఎంకి పెళ్ళి సుబ్బి చావు వచ్చిందన్న సామెతను గుర్తుచేస్తోంది.

లాయర్ నే బురిడీ కొట్టించిన నైజీరియన్ నెరజాణ

సైబర్ నేరాల గురించి మన పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నా దాదాపుగా రోజుకో కొత్తరకం నేరం వెలుగుచూస్తూనే ఉంది. అది కూడా పోలీసుల ఇళ్లలోనే దొంగలు పడ్డట్టు... న్యాయవాదుల ఖాతాల్లోంచే తెలివిగా డబ్బులు తస్కరించే కిలాడీలు హైదరాబాద్ లో చాలా బాగా పెరిగిపోయారు. తాజాగా హైదారాబాద్ లోని మేడిపల్లకి చెందిన ఓ మహిళా న్యాయవాది నైజీరియన్ కిలాడీ విసిరిన సైబర్ వలకు చిక్కింది. 12,862 డాలర్లు (రూ. 9.26 లక్షలు) సమర్పించుకుంది. విషయం ఆలస్యంగా తెలిశాక లబోదిబోమనడం ఆ న్యాయవాది వంతయింది.  అసలెలా జరిగిందంటే... మేడపల్లికి చెందిన మహిళా న్యాయవాది రాధిక బల్లా... ఫేస్ బుక్ లో టీనా హ్యాన్సన్ అనే నైజీరియన్ యువతితో చాటింగ్ మొదలుపెట్టింది. ఆమెతో చాటింగ్ కాస్తా రాధిక ఖాతాకే ఎసరు తెచ్చింది. స్నేహంగా ముందుకెళ్తున్న రాధికను బాగా వాడేయాలని టీనా డిసైడైంది. ఒకానొక సందర్భంలో తన ప్రపోజల్ ను రాధిక ముందు పెట్టింది. తమకు బేస్ లైన్ సొల్యూషన్స్ అనే కంపెనీకి ఉందని, దానికి సంబంధించిన ఓ కేసును కోర్టులో వాదించేందుకు గాను న్యాయవాదిగా వ్యవహరించాలని టీనా కోరింది. అయితే భారీ ఎత్తున పారితోషికం లభించే ఆ కేసు వాదించే అవకాశం రావాలంటే ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించింది.  టీనా మాటలు నమ్మిన రాధిక ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు అక్షరాలా రూ. 9.26 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యాక ఫోన్ చేస్తే రాధిక ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినట్టు చెబుతోంది. ఆ తరువాత ఫేస్ బుక్ లో వెతగ్గా... టీనా అకౌంట్ కూడా డిలీట్ చేసుకున్నట్టు కనిపించింది.  నైజీరియన్ నెరజాణ టీనా హ్యాన్సన్ చేసిన మోసానికి.. న్యాయవాది రాధిక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మన సైబరాబాద్ పోలీసులు ఇలాంటి నేరాల గురించి ఎంతో అప్రమత్తం చేస్తున్నా... న్యాయవాదులే బలైపోతుండడం విచిత్రమే.

అక్రమార్కులకే కార్యదర్శి వత్తాసా? జూబ్లీ హిల్స్ సొసైటీలో కొత్త కుట్రలా? 

జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించిన రికార్డుల విషయంలో తలెత్తిన వివాదం పోలీసు స్టేషన్ వరకు చేరింది. సొసైటీ బైలా ప్రకారం.. దీనికి సంబంధించిన రికార్డులను సభ్యులు పరిశీలించుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ విషయంలో సొసైటీ అధ్యక్షుడు, ఇతర సభ్యులతో సెక్రటరీ వ్యవహరించిన తీరు గొడవకు కారణమైందని అంటున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ మురళీముకుంద్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. పాత రికార్డులన్నీ పరిశీలిద్దామని అధ్యక్షుడు బొల్లినేని రవీందర్  కోరితే.. ఆయనకు సహకరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కార్యదర్శిపై వస్తున్నాయి.  గత పాలకమండలి చేసిన అక్రమాలన్నీ తవ్వితీసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రస్తుత పాలకమండలి సీరియస్‌గా ప్రయత్నం చేస్తోంది. అయితే కార్యదర్శిగా దానికి సపోర్ట్ చేయాల్సిన మురళీ ముకుంద్ రివర్స్ కావడం చర్చగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడిపైన, ఇతర సభ్యులపైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం అందరిని అశ్చర్యపరుస్తోంది.  పాత రికార్డులన్నీ పరిశీలిద్దామని అడగడటం వాటిని తప్పెలా అవుతుందని పాలకమండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అడిగిన వివరాలు ఇవ్వడం, రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయడం సొసైటీ కార్యదర్శి పని అని.. అది చేయకుండా అక్రమార్కులకు వంత పాడేలా మురళీ ముకుంద్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 'ఓట్ ఫర్ ఛేంజ్' అన్న నినాదంతో గెలిచి ఇప్పుడు 'నాట్ ఫర్ ఛేంజ్‌' అంటూ పాత పాలకమండలికి సపోర్ట్ చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని అంటున్నారు.కొందరి ప్రయోజనాల కోసం ఆయన యూటర్న్‌ తీసుకున్నారని జూబ్లీహిల్స్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.   జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కొత్త పాలకమండలి మార్చిలో బాధ్యతలు చేపట్టింది. గతంలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన నేపథ్యంలో వాటిని వెలికి తీసేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది. రికార్డులు, పక్కా ఆధారాలతో వాటిని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. ఎవరికో లాభం చేయడానికే మురళీ ముకుంద్‌ ప్రస్తుత పాలకమండలిని బద్నాం చేయాలని చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీమ్ వర్క్‌గా ముందుకు సాగాల్సిన చోట మురళీ ముకుంద్ ఏకఛత్రాధిపత్యం కోరుకున్నారని, రెండిళ్ల పూజారిలా అటు జూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్ ఛైర్మన్‌గా, ఇటు సొసైటీ కార్యదర్శిగా సర్వం తన పెత్తనమే సాగాలనుకున్నారని చెబుతున్నారు. సొసైటీ ప్రెసిడెంట్‌ను సైతం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబని జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యులు నిలదీస్తున్నారు. సొసైటీ బైలాస్ ప్రకారం రికార్డులన్నీ కార్యదర్శి దగ్గరే ఉంటాయి. అయితే ఆ రికార్డులు పరిశీలించడానికి ఇంకెవ్వరికీ హక్కు లేదని కార్యదర్శి ఎదురు తిరగడంతోనే ఈ పేచీ అంతా వచ్చిందని అంటున్నారు.  నిజాయితీగా రికార్డులన్నీ పరిశీలించి పాత పాలకమండలి అక్రమాల్ని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొత్త అధ్యక్షుడు. దీనికి మురళీ ముకుంద్ సహకరించడం లేదు. సొసైటీ కార్యదర్శిగా మురళీముకుంద్‌ పోరాడాల్సింది గతంలో పలు రికార్డులు మాయం చేసిన వారితోనా..? లేదంటే ఆ అక్రమాల్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అధ్యక్షుడితోనా..? ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉంటే ఈ గొడవలు, వివాదాలు ఉండనే ఉండవని అంటున్నారు.  జూబ్లీ హిల్స్ సొసైటీ వివాదంపై కొత్త పాలకమండలి బహిరంగ లేఖ విడుదల చేసింది... సొసైటీ ప్రెసిడెంట్ రవీంధ్రనాథ్ చౌదరి ఇచ్చిన ప్రెస్ నోట్ వివరాలు ఇలా ఉన్నాయి...  ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను.  కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం కాదని ఎవరూ అనలేరు. మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా .. అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని  స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటిని మరింత క్షుణ్ణంగా విచారించాలని పాలకవర్గం భావించింది. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా డెల్లాయిట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని నిర్ణయించాం. ఈనెల 11వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశాం. తద్వారా స్థలాల కేటాయింపులు ఎవరెవరికి ఎలా జరిగాయి. ఎంత ధరలకు ఇచ్చారనే అన్ని విషయాలు తేల్చాలని భావించాం.  కానీ కార్యదర్శి మురళీముకుంద్‌ పాత పాలకవర్గం తప్పులను బయటపెట్టే ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారు. కమిటీ నిర్ణయాల అమలుకు కార్యరూపం ఇవ్వాల్సిన కార్యదర్శి ఫైళ్ళను తన ఆధీనంలోనే ఉంచేసుకున్నారు. అసలు గత కొంతకాలంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారికి అండగా నిలవాలనే వైఖరితోనే ఉన్నారు. తన అధీనంలో ఉన్న ఫైళ్ళను ఇంటి వద్దకు తీసుకెళ్ళడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. కొంత మంది సభ్యులకు సంబంధించిన న్యాయమైన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్ళను కూడా పెండింగులో పెట్టేశారు. కార్యాలయంలో ఫైళ్లు ఉన్న లాకర్లకు తాళం వేసుకుని వెళ్ళారు. ఎవరి అక్రమాలను బయటపెడతామని నమ్మి సభ్యులు మమ్మల్ని గెలిపించారో ఆ పాత పాలకవర్గంలోని పెద్దలతో మురళీ ముకుంద్ కుమ్మక్కయ్యారు. వాళ్ళ అవినీతి బయటికి రాకుండా కుట్ర పన్నారు. అందులో భాగంగానే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు, సహకార శాఖకు తప్పుడు ఫిర్యాదులు చేశారు.  ఈనెల 11 వ తేదీన జరిగిన సమావేశంలో తనపై ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని మురళీ ముకుంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు. అక్కడ ఏం జరిగిందనే దానికి హాజరైన సభ్యులే సాక్ష్యం. అసలు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూసినా తేటతెల్లమవుతుంది. ఆడియో, వీడియో రికార్డింగ్ ఉంది. వాటి ద్వారా  మా చిత్తశుద్ధి ఏంటో నిరూపితమవుతుంది. మురళీ ముకుంద్ ఏ ప్రయోజనాలను ఆశించారో కానీ గత పాలకవర్గంతో లాలూచీ పడ్డారు. తాను వాళ్ళతో చేరిపోయానని, పాలకవర్గాన్ని రద్దు చేయిస్తానని, ఇంకెవరికో ధారాదత్తం చేస్తానని అంటున్న ఆడియో రికార్డింగ్‌లు కూడా బయటికొచ్చాయి. ఇవి అతని నిజస్వరూపాన్ని బయటపెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు మురళీముకుంద్ వైఖరిని తప్పుపట్టారు. దాంతో ఆయనే సమావేశంలో అసహనాన్ని ప్రదర్శించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో సభ్యుల హక్కులను కాపాడే క్రమంలో పాలకవర్గం కార్యదర్శి అధికారాలను తప్పించేలా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ సొసైటీ ప్రెసిడెంట్‌కు దఖలుపరుస్తూ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సొసైటీ బైలాస్‌లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నాం. సొసైటీ అధ్యక్షుడు స్వయంగా ఎన్ని సార్లు అడిగినా, మొత్తం మేనేజింగ్‌ కమిటీ చెప్పినా ఫైళ్ళను ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దాంతో ఆయన గత పాలవర్గంలో అక్రమాలు చేసిన వారితో కుమ్మక్కయ్యారనేది తేలిపోయింది. దీనివల్లే  అయనకున్న అధికారాలను తొలగించాం. దీనికి సంబంధించిన వివరాలు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమాలను నిరోధించి తీరుతాం. సభ్యులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అంటూ కొత్త పాలకమండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 

కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్? రాజకీయ పునరేకీకరణ దిశగా రేవంత్ స్కెచ్.. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ దిశగా ముమ్మర యత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా వివిధ వేదికల ద్వారా ఉద్యమిస్తున్న నేతలందరిని ఏకం చేసేలా ఆయన చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. చెరుకు సుధాకర్ తో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటి చైర్మెన్ మధు యాష్కి గౌడ్ చర్చలు జరిపారని సమాచారం. ఆ చర్చలు ఫలించడంతో త్వరలోనే చెరుకు సుధాకర్ అధికారికంగా హస్తం గూటికి చేరనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారట. కాంగ్రెస్ లో సముచిత స్థానం ఇస్తామని చెరుకుకు పీసీసీ పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు బలమైన అనుచర గణం ఉంది.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చెరుకు సుధాకర్ కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో కీలక నేతగా పని చేసిన చెరుకు సుధాకర్.. చాలా సార్లు జైలుకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ కూడా నమోదైంది.  వరంగల్ సెంట్రల్ జైలులో ఆయన చాలా రోజుల పాటు గడిపారు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా నకిరేకల్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో విఫలమైంది. నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చారని మొదట ప్రచారం జరిగినా.. తర్వాత సీన్ మారిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే తనకు సీటు రాకుండా పోయిందని చెరుకు సుధాకర్ అప్పట్లో ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకు సుధాకర్ పోటీ చేశారు. గట్టిగానే పోరాడినా అనుకున్నతంగా ఓట్లు సాధించలేకపోయారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో మొదటి నుంచి చెరుకుకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో చెరుకును కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో ఆయన సానుకూల స్పందించారని తెలుస్తోంది. మధుయాష్కి గూడా చెరుకు రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో జరిగే రెండో దళిత గిరిజన దండోరా సభలోనే చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. చెరుకు సుధాకర్  తో పాటు ఆయన వర్గీయులు కూడా కాంగ్రెసు పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ఇటు రెడ్డి.. అటు బండి.. మ‌రి, ఈట‌ల సంగ‌తేంటి? ఆయ‌న ఆగ‌మేనా?

'జ‌న ఆశీర్వాద యాత్ర‌'.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి చేయ‌బోతున్న జోర్దార్ ప‌ర్య‌ట‌న‌. ఈ నెల 19 నుంచి 21 వ‌ర‌కు షెడ్యూల్‌. కోదాడ నుంచి మొద‌లు.. వ‌యా సూర్యపేట‌, వ‌రంగ‌ల్‌, జ‌న‌గాం, ఆలేరు, యాద‌గిరిగుట్ట‌, భువ‌న‌గిరి, హైద‌రాబాద్ వ‌ర‌కు. 12 జిల్లాలు, 7 పార్ల‌మెంట్, 17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 324 కిలోమీట‌ర్ల యాత్ర‌. కిష‌న్‌రెడ్డి యాత్ర‌కు మ‌ద్ద‌తుగా బండి సంజ‌య్‌, డీకే అరుణ‌, కె.ల‌క్ష్మ‌ణ్‌ల‌తో పాటు బీజేపీ నాయ‌క‌గ‌ణ‌మంతా ఆయ‌న వెంట యాత్ర చేయ‌నుంది. మూడు రోజుల పాటు 'జ‌న ఆశీర్వాద యాత్ర‌' కొన‌సాగ‌నుంది.  రెండు రోజుల‌ గ్యాప్ త‌ర్వాత‌.. ఆగ‌స్టు 24 నుంచి ఇక అస‌లైన బీజేపీ దండ‌యాత్ర‌. నియంతృత్వ‌, కుటుంబ‌, అవినీతి పాల‌న విముక్తి కోస‌మంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌కుమార్ 'ప్ర‌జా సంగ్రామ యాత్ర'తో తెలంగాణ ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నారు. విడ‌త‌ల వారీగా 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ యాత్ర కంటిన్యూ అయ్యేలా సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టింది బీజేపీ. 'ప్ర‌జా సంగ్రామ యాత్ర' తొలిద‌శ‌ హైద‌రాబాద్‌ భాగ్య‌ల‌క్ష్మి టెంపుల్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా అయిన హుజురాబాద్ వ‌ర‌కూ సుమారు 2 నెల‌ల పాటు బండి యాత్ర కొన‌సాగ‌నుంది. ఆగ‌స్టు 24న పాత‌బ‌స్తీలో బండి పాద‌యాత్ర ప్రారంభ‌మై.. గోల్కొండ, చేవెళ్ల, వికారాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట మీదుగా మెదక్‌.. అలా అలా హుజురాబాద్ వ‌ర‌కూ చేరుకుంటుంది. బండి సంజయ్‌ పాదయాత్ర విజయవంతానికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కీలక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లిపోయాయి. పాదయాత్రను విజయవంతం చేసేందుకు 30 నిర్వహణ కమిటీలు ఏర్పాటు కాగా.. అవి వాటి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి. బీజేపీ శ్రేణుల‌తో పాటు ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర స‌క్సెస్‌కు ప‌క్కాగా గ్రౌండ్‌వ‌ర్క్ చేస్తున్నాయి.  తెలంగాణ‌లో ఈసారి ఎలాగైనా అధికారం చేప‌ట్టేందుకు క‌మ‌ల‌నాథులు ప‌క్కాగా పావులు క‌దుపుతున్నారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి 3 రోజుల‌ 'జ‌న ఆశీర్వాద యాత్ర‌'తో పార్టీలో జోష్ తీసుకురానున్నారు. ఆ వెంట‌నే బండి సంజ‌య్ చేప‌ట్టే 'ప్ర‌జా సంగ్రామ యాత్ర'  హుజురాబాద్ చేరే వ‌ర‌కూ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు యాత్ర‌ల‌పైనే బీజేపీ త‌న బ‌లాన్ని, బ‌ల‌గాన్ని ప్ర‌ధానంగా మోహ‌రిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ రెండు యాత్ర‌లు గ్రాండ్ స‌క్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200ల‌కు పైగా క‌మిటీలు యాత్ర స‌న్నాహాల్లో నిమ‌గ్న‌మై ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక రాష్ట్ర‌స్థాయి బీజేపీ బ‌డా నేత‌లంతా ఈ యాత్ర‌ల్లో భాగ‌స్వామ్యం కానున్నారు. అంతా ఓకే. క‌మ‌ల‌నాథుల ప్లానింగ్ బాగుంది. యాత్ర‌ల సంగ‌తి స‌రేగానీ.. మ‌రి, హుజురాబాద్‌లో ఈట‌ల ప‌రిస్థితి ఏంటి? నేత‌లంతా యాత్ర‌లో బిజీగా ఉంటే.. కురుక్షేత్రంలో అభిమాన్యుడిలా పోరాడుతున్న ఈట‌లకు అండాదండా అందించేది ఎవ‌రు? రానున్న రెండు నెల‌ల పాటు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్రతో పాద‌యాత్ర‌లో ఉంటే.. ఆయ‌న వెంటే కాషాయ ద‌ళ‌మంతా న‌డిస్తే.. హుజురాబాద్‌లో గులాబీ దూకుడును ఎదుర్కొంటూ ఈట‌ల వెనుక ఊరేగే వారు లేక‌పోతే ఆయ‌న ఒంట‌రివారు కారా? అనే అనుమానం వ్య‌క్తమ‌వుతోంది.  ఓవైపు అధికార టీఆర్ఎస్ ప‌లువురు మంత్రులు, డ‌జ‌న్ల కొద్ది ఎమ్మెల్యేలు, ప‌దుల సంఖ్య‌లో పార్టీ నాయ‌కుల‌ను హుజురాబాద్‌లో మోహ‌రించి.. ఫంక్ష‌న్ హాళ్లు, హోట‌ళ్లలో తిష్ట వేసి.. ఈట‌ల అనుచ‌రులంద‌రికీ వ‌ల‌లు విసిరి.. ద‌ళిత బంధుతో ఊద‌ర‌గొట్టి.. దూకుడు మీదుంటే.. బీజేపీ మాత్రం ఈట‌ల‌ను అనామ‌కుడిలా వ‌దిలేసి.. క‌మ‌ల‌నాథులంతా యాత్ర‌ల్లో మునిగితేలుతుంటే.. అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక‌ను.. ఈట‌ల వ్య‌క్తిగ‌త పోరుగానే బీజేపీ చూస్తోందా? అనే అనుమానం. రాజేంద‌ర్ గెలుపుతో బీజేపీకి అద‌నంగా వ‌చ్చే లాభం లేమీ లేద‌ని.. ఆయ‌న గెలిచినా.. ఆ క్రెడిట్ కాషాయం ఖాతాలో కాకుండా ఈట‌ల అకౌంట్లోనే ప‌డుతుంద‌ని.. ఓడినా పెద్ద‌గా పోయేదేమీ లేద‌ని భావిస్తోందా? అనే డౌట్‌. అందుకే క‌మ‌ల‌నాథులు ఈట‌ల గెలుపుకంటే కూడా తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బ‌లోపేతంపైనే అధికంగా దృష్టి సారించార‌ని అంటున్నారు.  కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి 'జ‌న ఆశీర్వాద యాత్ర‌', బండి సంజ‌య్ 'ప్ర‌జా సంగ్రామ యాత్ర'ల‌తో కాషాయ‌ద‌ళ‌మంతా బిజీగా మారిపోయింది. ఈ యాత్ర‌ల ఎఫెక్ట్ ఈట‌ల గెలుపోట‌ముల‌పై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో ఎన్నిక‌లు పెట్టుకొని.. ఈ స‌మ‌యంలో న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో యాత్ర‌లు చేస్తే.. అది ఈట‌ల‌కు ఏమాత్రం లాభం చేకూర్చ‌క‌పోగా.. న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి, క‌మ‌ల‌నాథులు ఆలోచ‌న ఎలా ఉందో.. ఎందుకు ఇలా పోటాపోటీ యాత్ర‌లు చేస్తున్నారో.. వారికో తెలియాలి.. బీజేపీలో జూనియ‌ర్ అయిన ఈట‌ల రాజేంద‌ర్ మాత్రం ఆ యాత్ర‌ల విష‌యంలో ఏమాత్రం సంతృప్తిగా లేర‌ని స‌మాచారం. కీల‌క స‌మ‌యంలో త‌న ఇలాకాలో, త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండ‌కుండా.. యాత్ర‌ల పేరుతో తోటి క‌మ‌ల‌నాథులంతా త‌న‌ను ఒంట‌రి వాడిని చేస్తున్నార‌నే అస‌హ‌నం స‌న్నిహితుల ద‌గ్గ‌ర వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. నిజ‌మేగా..! ఈట‌ల వాద‌న‌లోనూ వాస్త‌వం ఉందిగా...!!

టీచర్లకు జన సమీకరణ బాధ్యతలు! జగన్ బాటలో కేసీఆర్ సర్కార్ విడ్డూరం..

ముఖ్యమంత్రి అంటే చాలా ఎంతో ప్రాముఖ్యం ఉన్న తరహాలో ఆలోచించి, నిర్ణయాలు అమలు చేస్తాడని అంతా ఆలోచిస్తారు. మంత్రివర్గంలో ముఖ్యమైనవాడు కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రి అన్నారు. కానీ... తెలంగాణ సీఎం అయినా, ఏపీ సీఎం అయినా ఇద్దరూ ఇంత వరస్ట్ గా ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కాక తెలుగు ప్రజలంతా తలలు పట్టుకుంటుున్నారు.  ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఏపీ సీఎం జగన్.. వైన్స్ షాపుల ముందు ప్రభుత్వ టీచర్లు విధులు నిర్వహించేలా ఆర్డర్లు పాస్ చేసి అభాసుపాలయ్యారు. ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పౌర సమాజం నుంంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అదే ఒరవడిని ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా పాటిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముంగిట ఆయనకు బుర్ర చెడిందా.. లేక బుర్ర ఉన్నవాళ్ల సలహా తీసుకోవడం లేదా తెలీదు కానీ... ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం కేసీఆర్ పరిపాలనను నవ్వులపాలు చేస్తోంది.  ఈ నెల 16న దళితబంధు స్కీము ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ వెళ్తున్నారు. అక్కడ భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఎంతో ఘనంగా అక్కడే ఆ పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని డీఈవో నుంచి టీచర్లకు, ఎంఈవోలు, జీహెచ్ఎంలకు ఆదేశాలు అందాయి. జన సమీకరణ బాధ్యత వీరిదేనని జిల్లా విద్యాధికారే చెప్పడంతో ఎడ్యుకేషన్ స్టాఫంతాా ఆ కసరత్తులో తలమునకలై ఉన్నారు. వీరంతా స్పెషల్ ఆఫీసర్లుగా ఉంటూ.. స్థానికంగా కోఆర్డినేటర్లను నియమించుకోవాలని, వారి ద్వారా జనసమీకరణ, సభ ఏర్పాట్ల పనులు పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలని ఆదేశాలు అందడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  దళిత బంధు ప్రభుత్వ పథకమైనా... హుజూరాబాద్ ఉపఎన్నిక అనేది పార్టీ వ్యవహారం కాబట్టి.... ఒక పార్టీకి ఉపయోగపడేలా ప్రభుత్వ స్టాఫ్ ను ఎలా వాడుకుంటారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రైవేటు కూలీలను పెట్టి పని పూర్తి చేయించుకోవాలే తప్ప... ఖజానాలో డబ్బు లేదని ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులను రాజకీయ సభలకు వాడుకోవడం సరికాదని, దీనివల్ల పిల్లల ముందు ఉపాధ్యాయులు నైతికంగా దిగజారిపోతారన్న వ్యాఖానాలు వినిపిస్తున్నాయి. మరి జగన్ లాగే కేసీఆర్ ఈ నిర్ణయం మీద వెనుకడుగు వేస్తారా.. చూడాలి మరి.