YouTuber

పాక్‌లో సన్నీయాదవ్‌ బైక్ రైడ్..రంగంలోకి ఎన్‌ఐఏ

  యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్‌‌‌‌లో బైక్ రైడ్ చేశారు. పాక్ టూర్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌‌‌లోడ్ చేశాడు. అయితే, ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్‌ను ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారుల సమాచారంతో తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  మరోవైపు భయ్యా సన్నీయాదవ్ రెండు నెలలు పాకిస్థాన్‌లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షల్టర్ ఇచ్చింది ఎవరు? పాకిస్థాన్‌లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సిందూర్ జరుతుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేశాడు? అనే విషయాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేసున్నాట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్థాన్‌లో రెండు నెలల దిన చర్యపై కూపీలాగుతున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ పర్యాటనపై విమర్శలు రావడంతో  సన్నీయాదవ్ ఇటీవలనే ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంతమంది తప్పులు వీడియోలు, వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్ముల్ని బాధపెట్టేవారిపై తాను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించాడు  

kadapa steel works start in 10 days

పది రోజుల్లో కడప స్టీల్ పనులు.. ఇక జిల్లాలో జగన్ ను పట్టించుకునేదెవరు?

కడప జిల్లా… ఎలాంటి డౌటూ లేదు.. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నదీ అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.  అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్దారణకు రావడం సరి కాదు. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాలను ఎలా అయితే దూరం చేసుకున్నాడో.. అలాగే కడపనూ దూరం చేసుకునే పరిస్థితికి వచ్చారు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సహా మూడు నియోజకవర్గాలలో పట్టు నిలుపుకోగలిగారు. అటువంటి కడపలో  తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. అలా నిర్వహించి ఊరుకోలేదు. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపించింది. వాటిల్లో అతి ముఖ్యమైనది కడప స్టీల్ ఫ్యాక్టరీ. పది రోజుల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు మహానాడు వేదికగాప్రకటించారు. ఇది కడప జిల్లా ప్రజల మూడ్ ను ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం నోటి మాటగా చంద్రబాబు కడప స్టీల్స్ గురించి చెప్పి ఊరుకోలేదు. కడప స్టీల్ ఎన్నాటు చేస్తున్న సంస్థకు ఈ మేరకు డెడ్ లైన్ కూడా విధించారు.   ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి కానున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12కు ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారపగ్గాలు అందుకుని ఏడాది అవుతుంది. కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవం లోగా కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల్సిదేనని సంబంధిత కంపెనీకి చంద్రబాబు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ తొలి దశలో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కడప అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయమనడంలో సందేహం లేదు. కడప స్టీల్స్ విషయంలో ఐదేళ్ల పాటు ఏం చేయకుండా వైసీపీ చేతులు ముడుచుకుని కూర్చుంది. ఇప్పుడు చంద్రబాబు కూటమి కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభమౌతాయని ప్రకటించడంతో జిల్లాలో ఇక జనగ్ ను కానీ, జగన్ పార్టీని కానీ పట్టించుకునే నాథుడు ఉండకపోవచ్చని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.

Nadendla Manohar

ఇక ఏపీలో సండే కూడా రేషన్ షాపులు ఓపెన్

  ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో కూటమి సర్కారు లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం నాడు విజయవాడలో రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీ ట్రయల్ రన్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.  ప్రజల సౌలభ్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని. జూన్ 1 నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ పదిహేను రోజుల్లో ఆదివారంతో సహా అన్ని రోజులూ షాపులు తెరిచే ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లేవారు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తమకు వీలైన సమయంలో, ముఖ్యంగా సెలవు దినమైన ఆదివారం కూడా రేషన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది" అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

split or new party

బీఆర్ఎస్ ను చీల్చడమా?.. కొత్త పార్టీయా.. కవిత అడుగులెటు?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కవిత హాట్ టాపిక్ గా మారారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా తండ్రి కేసీఆర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపుతే ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన క్షణం నుంచీ తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. అంతకు ముందు నుంచీ కూడా ఆమె మాటలు, తీరు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆమె బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పునాదులనే కదిపేశాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ నే ప్రమాదంలో పడేసేంత తీవ్రంగా ఉన్నాయి. వాస్తవానికి సొంత తండ్రి, సోదరుడు లక్ష్యంగా ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ పార్టీ పునాదులనే కదిలించేస్తున్నాయి. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి   బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్న ప్రచారం  ఎప్పటి నుంచో బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఈ ఆరోపణ చేస్తూ వస్తోంది.  వాస్తవానికి బీజేపీ విజయం కోసం కవిత ఓటమికి బీఆర్ఎస్ తెరవెనుక రాజకీయం నడిపిందన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. బీజేపీ గెలుపు కోసమే 2018 లో కవితను సొంత వారే బలిపశువును చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో  కవిత ఓటమి కి బిఆర్ఎస్ కు బీజేపీ తో ఉన్న తెరచాటు సంబంధాలే కారణం అనే వాదన కూడా అప్పట్లో గట్టిగానే వినిపించింది.  ఢిల్లీ  మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు.  కవిత అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్నది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. అయితే ఆ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలెవరూ కూడా  బీజేపీ కి వ్యతిరేకంగా ఒక్క ఖండన కూడా చేయలేకపోయారు. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ కేసీఆర్ పై విచారణకు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. , అలాగే    ఈ ఫార్ములా రేసింగ్ అంటూ కేటీఆర్ పై  కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నా, కేసీఆర్ కుటుంబం అరెస్టుల భయం నుంచి బయటపడాలన్నా బీఆర్ఎస్ కు బీజేపీ సాయం తప్పనిసరి.  ఈ నేపథ్యంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ అడుగులు ఆ దిశగానే పడుతున్నాయన్న అనుమానాలూ బలపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారంపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ లో చేరే ప్రశక్తే లేదని కవిత కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతో ఇప్పుడు కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్న చర్చ కూడా జోరందుకుంది. ఆమె కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నారనీ, ఆ పార్టీ పేరు బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలబోతగా టీబీఆర్ఎస్ అని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అదే సమయంలో కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఆమె పార్టీలో చీలిక తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక వేళ అదే జరిగితే.. జీహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కవిత వెంట నడిచే అవకాశాలున్నాయంటున్నారు. అలా కాకుండా ఆమె సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తే.. అప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులు కవిత వెంట నడిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. అంటే కవిత సొంతంగా కొత్త పార్టీ స్థాపించినా, లేదా పార్టీలోనే చీలిక తీసుకువచ్చినా ఆమె వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  దీంతో ఎలా చూసినా బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకంగానే ఉందంటున్నారు. కేసీఆర్ మౌనం, కేటీఆర్ దుందుడుకు తీరు కారణంగా ఇప్పటికే పార్టీలోని మెజారిటీ నేతలలో  తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందంటున్నారు. ఇప్పుడు అలా అసంతృప్తితో ఉన్న వారందరి గొంతుకగా కవిత తన గళమెత్తడం వారంతా కవిత వెంట నడిచే అవకాశలే మెండుగా ఉన్నాయంటున్నారు. 

MLA Rajasingh

ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే అని పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని షాకింగ్ కామెంట్స్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీచేయాలో వాళ్లే డిసైడ్  చేస్తారని రాజాసింగ్ అన్నారు. గతంలో కూడా ఇలానే జరిగిందని అన్నారు. దాని వల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధానకారణం తమ సొంత పార్టీ నేతలే అని చెప్పారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్, నేతలు నోరు మూసుకుని కూర్చొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మానేతలు కుమ్మక్కుతోనే మా పార్టీ నష్టపోయిందన్నారు. "వాస్తవానికి తెలంగాణలో పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇతర పార్టీల నాయకులతో మన సొంత పార్టీ నేతలు కుమ్మక్కు కావడం పార్టీలో కొందరు నాయకులు వారి గెలుపు కోసం స్వార్థంగా కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ని గెలుస్తున్నారని ఆయన అన్నారు.  

Mining don effect

మైనింగ్ డాన్ ఎఫెక్ట్.. విచారణ నుంచి తప్పుకున్న ముగ్గురు జడ్జీలు

 మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి ఎఫెక్ట్ న్యాయవ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారి. దాంతో గాలి అండ్‌ కో బ్యాచ్‌ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సహజమే. ఆ కేసులో గతంలో హాజరైనా... వ్యక్తిగత కారణం ఉన్నా తప్పుకుంటుంటారు. అయితే ఒకే కేసులో ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్న అరుదైన సంఘటనకు తెలంగాణ హైకోర్టు వేదిక అయింది. ఇలా ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ కె.శరత్, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలు విచారణ నుంచి తప్పుకొన్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలంటూ దోషులు బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్‌అలీఖాన్, వి.డి.రాజగోపాల్‌లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్‌ చేసి బెయిలు మంజూరు చేయాలని కోరగా, గాలి జనార్దన్‌రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే 6న వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీలు దాఖలు చేశారు.  ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏడేళ్ల లోపు శిక్ష పడి, గతంలో బెయిలు పొందినట్లయితే తక్షణం శిక్ష అమలును నిలిపివేసి బెయిలు మంజూరు చేసే సంప్రదాయం ఉందన్నారు. అందులోనూ మూడున్నరేళ్లకుపైగా జైలు జీవితం గడిపారని, అందువల్ల బెయిలు మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ సీబీఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను ఈ వారానికి వాయిదా వేశారు. ఇందులో భాగంగా దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్‌లు బుధవారం జస్టిస్‌ కె.శరత్‌ బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభ సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.  తర్వాత అవి జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చాయి. సాయంత్రం 7 గంటల సమయంలో అవి విచారణకు రాగా మరో న్యాయమూర్తి ముందుంచాలంటూ తప్పుకున్నారు. దీంతో న్యాయవాదులు.. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకొన్నారని, వీటిపై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్‌ నగేశ్‌ భీమపాక.. పిటిషన్‌లకు చెందిన ఫైళ్లను తెప్పించి పరిశీలించి ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసు అని.. తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. దీంతో బెయిలు పిటిషన్‌ల విచారణకు గాలితో సహా దోషులు మరోవారం వేచి ఉండాల్నిన పరిస్థితి ఎదురైంది.

kavitha sesational allegations

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదన్న సంకేతం ఇంటి  ఆడబిడ్డపై సోషల్ మీడియాలో టార్గెట్ చేశారంటూ ఆరోపణ బీఆర్ఎస్  అధినేత కుటుంబంలో  అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓపెన్ అప్ అయిపోయారు. సొంత సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కుటుంబంలో చీలిక అనివార్యమని తేల్చేశారు. తాను సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయమన్న సంకేతాలిచ్చేశారు. తన సోదరుడి నాయకత్వంలో పని చేసే ప్రశక్తే లేదని పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చి చెప్పారు.  బీఆర్ఎస్ లో ఏకైక నాయకుడు కేసీఆరేననీ, మరెవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించే ప్రశ్నే లేదనీ కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఆమె  ఎలాంటి శషబిషలూ లేకుండా పార్టీపై ధిక్కార స్వరాన్ని చాలా చాలా గట్టిగా వినిపించారు. దీంతో ఆమెకు ఇప్పుడో, ఇహనో షోకాజ్ నోటీసు జారీ చేసి.. పార్టీ నుంచి ఉద్వాసన చెప్పాలని అధినేత భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు షోకాజ్ నోటీసు, పార్టీ నుంచి ఉద్వాసన విషయాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల కవిత  మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పునాదులకు కుదిపేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే కుట్ర జరుగుతోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నంచీ కూడా ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడిన తరువాత కూడా బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రి గురించిన ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా బీఆర్ఎస్ గాలి తీసేశాయి. అంతే కాకుండా పార్టీలో తనను పక్కన పెట్టడం అన్నది ఇప్పుడు కాదనీ.. చాలా కాలం నుంచీ జరుగుతోందనీ ఆమె అన్యాపదేశంగా చెప్పారు. గతంలో అంటే మద్యం కుంభకోణం కేసులో తాను జైలుకు వెళ్లే సమయంలోనే పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యానని కవిత చెప్పుకోచ్చారు. ఇక తాను జైలులో ఉన్న సమయంలోనే తనపై కుట్రలు మొదలయ్యాయని ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత.. బీఆర్ఎస్ కు కేసీఆర్ వినా ఎవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించేది లేదని కుండబద్దలు కోట్టడం ద్వారా.. తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి తాను ససేమిరా అంగీకరించబోనని స్పష్టం చేశారు.   ఇక తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.   సొంత పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తననుటార్గెట్ చేశారన్న కవిత, ఇంటి ఆడబిడ్డపై సోషల్  మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులపై దాడి చేయిస్తారా అంటూ పేరు ప్రస్తావించకుండానే సోదరుడు కేటీఆర్ పై విరుచుకు పడ్డారు. నామీద పడి ఏడిస్తే ఏమొస్తుందంటూ పరోక్షంగానైనా తన తిరుగుబాటు సోదరుడిపైనేనని చెప్పేశారు.  తన లేఖను లీక్ చేసిన లీకు వీరులను పట్టుకోమంటూ గ్రీకు వీరులను తనపై రెచ్చగొట్టారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా సరే తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రణాళికాబద్ధంగా తనకూ కేటీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందనీ, తనను దూరం చేస్తే పార్టీలో లాభ పడేదెవరో అందరికీ తెలుసు అనడం ద్వారా ఆమె అన్యాపదేశంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు కవితకు ఉద్వాసన చెప్పి బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారా? లేక మరో సారి కుమారుడి పట్టాభిషేక ముహూర్తాన్ని వాయిదా వేస్తారా అన్నది కేసీఆర్ నిర్ణయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. మరి యువరాజ పట్టాభిషేకం జరుగుతుందా... మరోసారి వాయిదా పడుతుందా..చూడాల్సిందే. 

educational inistitytions in ponds and puddles

చెరువులు, కుంటల్లో బడా విద్యాసంస్థలు.. స్పందించని హైడ్రాపై విమర్శలు

ప్రభుత్వ భూములను రక్షిస్తాం, చెరువులు, నాలాలు పరిరక్షిస్తాం,  హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడుతాం.. హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఇదే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పగా సెలవిచ్చారు. అయితే ఆ దిశగా మొదట్లో కొంత వేగంగా వెళ్లిన హైడ్రా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పిన హైడ్రా ఆ తర్వాత మానవతా దృక్పథం అంటూ తన వైఖరి మార్చుకుంది. వేసవి సెలవుల్లో అక్రమంగా వెలిసిన విద్య సంస్థల భవనాలను తొలగిస్తామని చెప్పిన అధికారులు సెలవులు పూర్తవుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. హైడ్రా... హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటైన ఒకటి రెండు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు చెందిన భారీ నిర్మాణాలను కూలుస్తూ సంచలనాలకు తెరతీసింది. చెరువులు, బఫర్ జోన్లలో, ప్రభుత్వ భూముల్లో  అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ ప్రజల మన్ననలు పొందింది. సామాన్యులకు చెందిన నిర్మాణాలను కూల్చివేయడం, అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేస్తుందన్న ఆరోపణలతో హైడ్రాకు కొన్ని సందర్భాల్లో చెడ్డ పేరు కూడా వచ్చింది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల  తొలగింపులో హైడ్రా  చురుకైన పాత్ర పోషిస్తుందని భావించిన ప్రజలు అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై వేలాది ఫిర్యాదులు చేశారు. నాలాలు, రోడ్లు, పార్కులు, ఓపెన్ స్పేసెస్‌లో ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్నాయి.  భారీ నిర్మాణ సంస్థలు, రాజకీయ ప్రముఖులు చేసిన కబ్జాలపై సైతం హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి.  విద్యా సంస్థలు సైతం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశాయని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రముఖంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన పలు కట్టడాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి.  దుండిగల్ గ్రామ పరిధిలో చెరువు శిఖంలో భవనాలు నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కొంతమేర కూల్చివేతలు కొనసాగించారు. అక్కడ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని,  వేసవి సెలవుల్లో మిగతా వాటిని పరిశీలిస్తామని చెప్పి వెళ్లిపోయారు, అయితే వేసవి సెలవులు పూర్తవుతున్నా ఆ ఆక్రమణల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇక పాత బస్తీ సలకం చెరువు లో  కాలేజ్ నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఎంఐఎంకు చెందిన ప్రధాన వ్యక్తులు ఈ కాలేజ్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై అప్పట్లోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అయితే  అక్కడ కాలేజ్ రన్నింగ్ అవుతున్నందున ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. చెరువులు ఎంత ముఖ్యమో విద్యార్థుల ఎకడమిక్ ఇయర్ కూడా అంతే ముఖ్యమని,  అందుకు అనుగుణంగా సమయం ఇస్తామని, ఆ సమయంలోగా వారు సెటరైట్ చేసుకుంటే ఓకే..  లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే ప్రకటించారు.  ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్మాణాలు సైతం పోచారం మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్‌లోని  నాడెం చెరువు బఫర్ జోన్, ఎఫ్డీఏలో ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని కూడా పరిశీలించారు అధికారులు. మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చెరువులో ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పుడు విద్యాసంవత్సరం రన్నింగ్ లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సెలవుల్లో వాటిపై చర్యలు తీసుకుంటారని అంతా భావించినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రధాన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చెరువులు, నాలాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేసినా, అలాంటి వాటిని కూల్చివేయకపోవడం వెనక కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఫిర్యాదు వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను   కూల్చివేసిన హైడ్రా ఆ తరువాత కొంత సడలింపులు ఇచ్చింది. అప్పటికే ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఇళ్లలో పబ్లిక్ నివాసం ఉంటే అలాంటి వాటిని కూల్చబోమని హైడ్రా ఒక ప్రకటన చేసింది. అయితే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చిన అధికారులు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ విషయంలో వేసవి సెలవుల్లో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు . ఇప్పుడు సెలవులు పూర్తి అవుతున్నా అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం విమర్శల పాలవుతోంది.

enforcement directorate  record statement from raj kesireddy

ఈడీ ప్రశ్నలతో రాజ్ కేశిరెడ్డి ఉక్కిరిబిక్కిరి.. ఏడుగంటల విచారణ.. వాంగ్మూలం నమోదు

మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బుధవారం (మే28) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో  రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా కేశిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో అక్రమ నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు చేరవేశాడన్న విషయంపైనే ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారలు కేశిరెడ్డిని విచారించారు. వందకు పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఈ కుంభకోణంలో కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టారు? బ్యాంకు ఖాతాలు ఎన్ని?  ఏయే బ్యాంకులలో ఖాతాలు తెరిచారు వంటి ప్రశ్నలతో కేశిరెడ్డిని ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు చెబుతున్నారు.  ఏడుగంటల సుదీర్ఘ విచారణ అనంతరం కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే మద్యం కుంభకోణంపై ఈడీ మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా ఇదే మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు గురువారం (మే29) తీర్పు వెలువరించింది. రాజ్ కేశిరెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన  ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్పలను కూడా కస్టడీకి అప్పగించాలంటూ సిట్ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు గురువారం (మే 29) తీర్పు వెలువరించనుంది.  

allu arjun best actor

ఉత్తమనటుడు అల్లు అర్జున్.. ఉత్తమ సినిమా కల్కి

గద్దర్ అవార్డుల ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల   తరువాత సినీ పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుద్ధనౌక, దివంగత గద్దర్ పేరిట సినీ అవార్డులను అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.  అవార్డుల విజేతల జాబితాను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్‌పర్సన్‌  సీనియర్ నటి జయసుధ ప్రకటించారు. 2024 సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రంగా కల్కి సినిమాకు అవార్డు ప్రకటించారు.   ఉత్తమ నటుడిగా పుష్ప2లో నటనకు గాను అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35  చిన్న కథ కాదు సినిమాకు నివేదా థామన్  ఎంపికయ్యారు. ఇక రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్. మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ కు పురస్కారాలు దక్కాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా కల్కి సినిమాకు గాను నాగ్ అశ్విన్ కు అవార్డు దక్కింది.    ఈ సారి   ఉత్తమ చిత్రాలు,  ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకే కాకుండా  జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన సినిమాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందశారు. యానిమేషన్ సినిమాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు, లఘు చిత్రాల విభాగాల్లోనూ గద్దర్ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన వారికి, పుస్తకాలు ప్రచురించిన వారికి  కూడా గద్దర్ పురస్కారాలు దక్కాయి. గతంలో ప్రకటించిన కాంతారావు, పైడి జయరాజ్, ఎం. ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖుల పేర్లతో ఉన్న అవార్డులను కూడా కొనసాగించారు.

kadapa mahanadu last day today

మహానాడు చివరిరోజు... 5 లక్షల మందితో భారీ సభ

కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ  మహానాడు గురువారం ( మే 29) తో ముగియనుంది.  మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు తొలి రెండు రోజులు అత్యంత విజయవంతంగా జరిగాయి. జగన్ పార్టీకి పెట్టని కోటగా చెప్పుకునే కడప వేదికగా జరిగిన ఈ మహానాడు పలు ప్రత్యేకతలక వేదికైంది.   మహానాడులో భాగంగా తొలి రెండు రోజులూ   ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ప్రతినిధుల సమావేశాలు నిర్విరామంగా జరిగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక చివరి రోజైన గురువారం (మే 29)న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5 లక్సల మంది హాజరౌతారన్నది అంచనా. ఈ సభలో పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర ముఖ్య నాయకుల ప్రసంగాలు ఉంటాయి.   ఐదేళ్ల జగన్ అరాచక పాలన తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నది. ఈ కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించడమే కాకుండా... పార్టీ, ప్రభుత్వ భవిష్యత్ లక్ష్యాలపై కూడా ఈ ప్రసంగాలు ఉంటాయి.  ఇక ఈ బహిరంగ సభ కోసం నిరవాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో దాదాపు 2 లక్షల మందికి భోజన సౌకర్యం కల్పించారు. అలాగే కడపకు దారి తీసే మార్గాలలో మరో మూడు లక్సల మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇలా ఉండగా కడపలో మహానాడు సందర్భంగా కడప జిల్లా మొత్తం పసుపుశోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా పసుపుపచ్చని జెండాలు, తోరణాలతో పంగుడ వాతావరణం నెలకొంది.  

women claimbs cell tower

సెల్ టవర్ ఎక్కిన మహిళ.. ఎందుకంటే?

తెలుగుదేశంపార్టీ మహిళ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి  ఆత్మహత్య చేసుకుంటానంటూ కడప ఎన్టీఆర్ సర్కిల్ లోని  సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.  ఒక  పక్క రాష్ర్ట స్థాయి మహానాడులో ముఖ్యమంత్రి పాల్గొంటుండడం, మరో పక్క మీనాక్షి సెల్ టవర్  ఎక్కి ఆందోళన చేయడంతో  తెలుగుదేశంపార్టీ నాయకులు ఆందోళనకు గురయ్యారు.  వన్ టౌన్ పోలీసులు, ఫైర్, రెవిన్యూ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని టవర్  క్రింద దిగాలని కోరారు. పోలీసు అధికారుల మైకు ద్వారా మాట్లాడుతూ సెల్ టవర్ పై నుండి కింద కు దిగాలని, మీ డిమాండ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మిమ్మలను మహానాడు వద్దకు తీసుకు రావాలని లోకేష్ కోరారని ,వెంటనే క్రిందకు దిగితే మిమ్మలను లోకేష్ వద్దకు తీసుకు వెడతామంటూ పోలీసులు మీనాక్షికి మైకు ద్వారా కోరారు.   దీంతో ఆమె కిందకి దిగి వచ్చారు. వెంటనే ఆమెనను   ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.  ఇంతకీ మీనాక్షి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేయడానికి కారణం.. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేదన్న ఆవేదనే. ఇదే విషయం ఆమె మీడియాకు చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా లేఖ రాశారు. ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి దళితురాలినైన తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అన్నిటికీ మించి మహానాడుకు తన లాంటి   వారికి ఆహ్వానం లేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. 

elon mush resign as doze chairman

డోజ్ చైర్మన్ పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా ట్రంప్ కి బిగ్ షాక్!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా  చేశారు. తన రాజీనామాను ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించారు.   అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించే కాలపరిమితి ముగిసిందని, అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నాననీ మస్క్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించిన ట్రంప్ కు కృతజ్ణతలు చెబుతూనే.. తన రాజీనామా తరువాత కూడా డోజ్  మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని మస్క్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఆయన   ప్రభుత్వ విభాగాల్లో   వృథా ఖర్చులను అరికట్టడం  అనే లక్ష్యంతో డోజ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ డోజ్ కు ఎన్నికల ప్రచారంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎలాన్ మస్క్ ను చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయడం డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. 

kaviths bargain with congress

కాంగ్రెస్ తో కవిత బేరం? నిజమేనా?

స‌ర్క‌మ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒక‌టుంటుంది. దీని అర్ధ‌మేంటంటే వారి వారి మాన‌సిక- శారీర‌క- సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక‌- స్థితిగ‌తుల‌ను అనుస‌రించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచ‌నాకు రావ‌డం. దీన్నే ఇప్పుడు రెడ్ టీమిజం అని కొత్త‌గా కూడా పిలుస్తున్నారు. ఇది వేరే విష‌యం.  ఇక్క‌డ క‌విత‌కు అలాంటి ప‌రిస్థితి ఉందా? లేక బీఆర్ఎస్ పార్టీకే ఇలాంటి సిట్యువేష‌న్ త‌లెత్తిందా? అని చూస్తే ఇది జ‌స్ట్ క‌విత ప‌రిస్థితిలా క‌నిపించ‌డం లేదు. బీఆర్ఎస్  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఒక వేళ క‌వితే కాంగ్రెస్ లోకి వెళ్తే.. కాళేశ్వ‌రం విష‌యంలో కావ‌చ్చు, ఈ- కార్ రేస్ విష‌యంలో కావ‌చ్చూ.. బీఆర్ఎస్ కి   ఒక రిలీఫ్ రావ‌చ్చు. కార‌ణ‌మేంటంటే.. క‌వితే కాంగ్రెస్ లో ఉంటే.. ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్ర‌భుత్వం అంత అగ్రెసివ్ గా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క పోవ‌చ్చు. దీంతో క‌విత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి న‌రుక్కొస్తున్న‌దిగా ఒక అంచ‌నా. ఇక రెండోది.. దీన్ని రేవంత్ , ఆయ‌న స‌న్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయ‌క‌త్వాన్ని వ‌ద్ద‌ని వారించిన‌ట్టు భావించ‌డం. అదేమంటే అన‌వ‌స‌రంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మ‌న మీద వేసుకోవ‌డం ఎందుక‌ని.. వారు అనుకున్న‌ట్టు! అందుకే వ‌ద్ద‌న్న‌ట్టు చెప్ప‌డం కూడా ఒక‌ర‌కంగా.. తాను చంపబోయే జింక‌ను చూసి పులే జాలి ప‌డ్డ‌ట్టుగా ఉంది. ఇప్పుడు న‌డుస్తోన్న‌దంతా ఏంటి? త‌న‌ను కేసీఆర్ జైలుకు పంపిన‌ట్టే నేను కూడా ఆయ‌న్ను పంపాల‌న్న‌దే క‌దా? కేటీఆర్ ని కూడా వ‌ద‌ల‌కుండా వెంటాడి వేటాడి రివేంజ్ తీర్చుకోవ‌డ‌మే అస‌లు ఉద్దేశం అదే క‌దా? అంటారు కొంద‌రు ఎన‌లిస్టులు.  బేసిగ్గా ఇవ‌న్నీ జ‌ర‌క్కుండా క‌డియం శ్రీహ‌రి చెప్పిన‌ట్టు కేసీఆర్ తొలి నాళ్ల‌లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చి ఉండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొంద‌ర్ని కొని.. సొంతంగా అధికారంలోకి రావ‌చ్చు. ఇందుకు ఆస్కారాలు లేక పోలేదు. కానీ కేసీఆర్ అస‌లైన ఆలోచ‌న అది కాదు. డీఎంకే, అన్నాడీఎంకే ఫార్ములా... అంటే  ఇక్క‌డ కూడా బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ఉండాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ లో మ‌న వాళ్లు ఎవ‌రో ఒక‌రుండ‌టం. మ‌రీ లేకుంటే బీజేపీలో ఉండ‌టం. ఒక సారి మ‌నం (అంటే బీఆర్ఎస్) అధికారంలోకి వ‌చ్చినా.. రెండో సారి అటు వైపు వాళ్లు(కాంగ్రెస్ లేదా బీజేపీ) అధికారంలోకి వ‌చ్చినా.. మ‌న వాళ్లు అటు వైపు ఉంటారు కాబ‌ట్టి.. మ‌నం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగ‌డ‌. ఇదీ కేసీఆర్ 2018 నాటి నుంచి క‌ల‌లు కంటోన్న పొలిటిక‌ల్- స్కెచ్. ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు. ప‌రిపాల‌న‌లో ఏవో ఒక లోటు పాట్లు ఉండ‌నే ఉంటాయి. అధికారం పోయాక‌ వాటిని అడ్డు పెట్టుకుని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్ట‌డం ఇప్పుడు కామ‌న్  అయిపోయింది. ఈ కండీష‌న్లో.. మ‌న‌మ‌లా ఇరుకున ప‌డ‌కుండా ఉండాలంటే ఇదే సేఫ్ ప్లాన్. ఇందులో భాగ‌మే ఒక క‌విత- ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ప‌ద‌వి కాన్సెప్ట్ గా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. అర్ధమ‌వుతోందా!?

కరోనా కలకలం.. చండీగఢ్‌లో వైరస్‌తో ఒకరు మృతి

  కరోనాతో పంజాబ్‌ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్‌-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్‌ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదరు రోగి మంగళవారం ఆసుపత్రిలో చేరాడని.. అతనికి కొవిడ్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించారు. అతనికి కరోనాతో పాటు ఇతర వ్యాధులూ ఉన్నాయని దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. భారత్‌లో సోమవారం వెయ్యికిపైగా యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉన్నట్లుగా కేంద్ర రోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యధికంగా యాక్టివ్‌ కేసులు కేరళలో 430 ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకలో అత్యధికంగా ఉన్నాయి.  

అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి ఆయుధాలు

  అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది. ముస్లింలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం గన్ లైసెన్సులు  ఇవ్వాలని  సీఎం హిమంత బిశ్వ శర్మ  కీలక ప్రకటన జారీ చేశారు.  గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన మంత్రి వర్గ మీటింగ్ జరిగిన తర్వాత శర్మ మాట్లాడుతూ.. నాగావ్‌లోని ఢింగ్, రూపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హాటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాంతాలను ప్రభుత్వమే గుర్తిస్తుందని, దరఖాస్తుదారులు నేర చరిత్ర లేకుండా ఉండాలని షరతు విధించారు. అస్సాం అల్లర్లు సమయం నుంచి స్థానికులు ఈ డిమాండ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నరు. 

10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : సీఎం చంద్రబాబు

  తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు.  దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచామని పేర్కొన్నారు.  రాయలసీమ రాళ్ల సీమ కాదు..రత్నాల సీమగా మారుస్తానని చెప్పాని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ అని అన్నారు.  బసకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని సీఎం చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు లాభమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది నేనే అని ఆయన అన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.9వేల కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో కడప స్టీల్‌ ప్లాంట్ ద్వారా 3వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన తెలిపారు.175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.  

ఎన్టీఆర్ పుట్ట‌క‌ పోయి ఉంటే!?

ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే సినిమాల్లో మ‌న‌కు స్టార్ డ‌మ్ ఎలాంటిదో   తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమ‌కు అతి పెద్ద హీరో చిత్తూరు నాగ‌య్య‌..  అప్ప‌ట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వ‌చ్చినా ఆయ‌నే చేసేవారు. ఎప్పుడైతే  ఎన్టీఆర్ పాతాళ భైర‌వి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైన‌మిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి. అప్ప‌టి  నుంచి ఎన్టీఆర్- ఎన్టీఆర్- ఎన్టీఆర్.. ఎటు చూసినా ఎన్టీఆర్ నామ జ‌పం  మొద‌లైంది.  చుక్క‌లు చాలానే ఉంటాయ్.. కానీ చంద్రుడొక్క‌డే అన్న‌ట్టు.. న‌టులు చాలా మందే ఉంటారు కానీ వాళ్ల‌లో మాత్రం మ‌హాన‌టుడు ఎన్టీఆర్ ఒక్క‌డే అన్న‌ట్టుగా త‌యారైంది  ప‌రిస్థితి. ఇక రెండో విష‌యం ఏంటంటే రాముడు- కృష్ణుడు- రావ‌ణాస‌ురుడు- ధుర్యోధ‌నుడు- క‌ర్ణ‌- భిష్మ వంటి ప‌లు పౌరాణిక చిత్రాలు చేయ‌డం మాత్ర‌మే కాకుండా ఆనాటి మాస్ జ‌నాల ద‌గ్గ‌ర‌కు క్లాసిక్స్ అయిన రామాయ‌ణ,  మ‌హాభార‌తాల‌ను తీసుకెళ్లిన ఘ‌న‌త కూడా ఎన్టీఆర్ దే.  ఒక వేళ ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే..  కొంద‌రికి రాముడు, కృష్ణుడు ఎలా ఉండేవారో అస్స‌లు తెలియ‌క పోయేదేమో. అంత‌గా ఆయ‌న ఆయా పాత్ర‌ల‌కు జీవం పోశారు. ఎంతైనా ఇది తెలుగు వారు మాత్ర‌మే చేసుకున్న అదృష్ట‌మ‌ని చెప్పాల్సి  ఉంటుంది. 1928 మే 28న నిమ్మ‌కూరులో పుట్టిన ఎన్టీఆర్ కి మొద‌ట పెట్టాల‌నుకున్న పేరు కృష్ణ‌. బిడ్డ చూడ్డానికి బాల‌కృష్ణుడిలా ఉన్నాడనుకున్న త‌ల్లి వెంక‌ట‌రామ‌మ్మ‌  ముచ్చ‌ట ఆ నాడు తీర‌లేదు. మేన‌మామ వ‌చ్చి తార‌క రాముడ‌న్న పేరైతే బాగుంటుంద‌ని అనే స‌రికి.. ఆ మ‌హాత‌ల్లి త‌న సోద‌రుడి మాట కాద‌న‌లేక‌.. పెట్టిన పేరు తార‌క రామారావు.  కృష్ణ అని త‌న త‌ల్లి పేరు పెట్ట‌లేక పోయింది. ఆమె ముచ్చ‌ట ఎలాగైనా స‌రే తీర్చాల‌నుకున్నారో ఏమో ఎన్టీవోడు ఏకంగా 18 సార్లు శ్రీకృష్ణుడి వేషం ధ‌రించి.. ఇటు ఆ పాత్ర‌కు వ‌న్నె తేవ‌డం మాత్ర‌మే కాదు.. అటు తెలుగు ప్రేక్ష‌క‌జ‌నుల‌ను ఎంత‌గానో అల‌రించారు.  ఇదిలా ఉంటే ఇదే అంశం మీద మ‌నం గుర్తించాల్సిన  మ‌రో అంశ‌మేంటంటే.. ఎన్టీఆర్ త‌న పిల్ల‌ల్లో అంద‌రి పేర్ల‌కు కృష్ణ అన్న ప‌దం చేర్చి మ‌రీ పెట్ట‌డం వెన‌క ఆ నాడు త‌న త‌ల్లి త‌న‌కు కృష్ణ అన్న పేరు పెట్టలేక పోవ‌డ‌మే అన్న న‌మ్మ‌కాలుండొచ్చ‌నీ అంటారు.  అందుకే తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం కాగా. ఆ పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమారుల పేర్లు ఏంట‌ని చూస్తే.. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కాగా.. లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెల పేర్లు. అలా ఎన్టీఆర్ త‌న త‌ల్లి.. కృష్ణ అన్న పేరు పెట్టలేక పోయింద‌న్న బాధ‌ను తుడిచేస్తూ ఆ పేరు త‌న పిల్ల‌ల‌కు పెట్టి.. ఆమె క‌న్న‌రుణం తీర్చుకున్నారా అనిపిస్తుంది.    త‌ర్వాత చెప్ప‌పుకోద‌గ్గ విష‌య‌మేంటంటే.. పారితోష‌కం.  అత్య‌ధిక పారితోష‌కం అందుకున్న తొలి త‌రం న‌టుల్లో ఎన్టీఆరే ముందుండేవారు. ఆయ‌న తొలి  నాళ్ల‌లో అంటే 1951 నుంచి మొద‌లైన స్టార్ డ‌మ్ ద్వారా ఆయ‌న నెల‌కు 500 నుంచి 5 వేల వ‌ర‌కూ జీతం తీసుకునేవారు. 1956లో విడుద‌లైన మాయా బ‌జార్ లో ఏకంగా 7500 రూపాయ‌లు తీసుకోవ‌డం.. అప్ప‌ట్లో అది అతి పెద్ద పారితోష‌కం.  సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు ఎన్టీఆర్. 1963 లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు  పారితోషికం నాలుగైదు అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది. ఇది కూడా అప్ప‌ట్లో ఒక రికార్డే. అంటే పారితోష‌కంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది కూడా ఎన్టీఆరేన‌ని చెప్పాలి.  యాక్టింగ్ తో ఒక స్టార్ డ‌మ్ క్రియేట్ చేయ‌డం  అత్యంత  ప్ర‌జాద‌ర‌ణ  పొంద‌డం.  సినిమా తీస్తే ఎన్టీఆర్ తోనే తీయాల‌న్న ఆలోచ‌న కొద్దీ నిర్మాత‌లు ఎగ‌బ‌డడం.. పారితోష‌కం అంత‌కంత‌కూ పెరుగుద‌ల అనే ప‌రిణామ క్ర‌మాన్ని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ చూసింది కూడా ఎన్టీఆర్ ద్వారానే. ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం, పంచ‌పాత్రాభిన‌యం ఇలా ఎన్టీఆర్ ఇక్క‌డా ఒక‌ ట్రెండ్ సెట్ చేశారు. రాముడు- భీముడితో మొద‌లైన ఈ ప‌రంప‌ర త‌ర్వాతి కాలంలో.. దాన వీర శూర క‌ర్ణ లో త్రిపాత్రాభిన‌యం, శ్రీమ‌ద్విరాట ప‌ర్వంలో ఐదు పాత్ర‌ల పోష‌ణ.. ఇలా ఈ విష‌యంలోనూ  ట్రెండ్ సెట్ట‌ర్ ఎన్టీఆరే. ఒక న‌టుడిగా ఉండి ద‌ర్శ‌క‌త్వంలోకి ప్ర‌వేశించిన తొలి త‌రం న‌టుల్లోనూ ఎన్టీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. కొంద‌రు ఇది వ‌ర‌కే ఉన్నా..   స్టోరీ- స్క్రీన్ ప్లే-  డైలాగ్స్ లో త‌న‌దైన ముద్ర వేయ‌డంతో పాటు, సూప‌ర్ డూప‌ర్ హిట్స్ అందించిన ఘ‌న‌త  మాత్రం ఎన్టీఆర్ దే. ఇటు య‌మ‌గోల‌, అడ‌విరాముడు, వేట‌గాడు వంటి చిత్రాల ద్వారా మాస్ హిట్స్ అందించిన క్రెడిబిలిటీ కూడా ఎన్టీఆర్ దే. ఆ మాట‌కొస్తే సినిమాల్లో వంద  రోజులు, నూట యాభై రోజులు, 200, 250, 365 రోజులంటూ.. రోజులు- వారాలు- నెల‌లు- సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆడిన సినిమాలు తీసిన చ‌రిత్ర కూడా మాస్ కా బాప్ ఎన్టీఆర్ పేరిటే లిఖించ‌బ‌డి ఉండేది.  అంటే సినిమాల్లో ఏ రికార్డు ఉన్నా ఆ  రికార్డుల‌న్నీ దాదాపు ఎన్టీఆర్ ని మొద‌ట ప‌ల‌క‌రించాకే త‌ర్వాత ఇతరుల ప‌ర‌మ‌య్యేవన్నంతగా ఎన్టీఆర్ ద స్టార్ ఆఫ్ ద ఎంటైర్ తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీగా ఉన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ అంటే ఎన్టీఆర్- ఎన్టీఆర్ అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఉదాత్త‌మైన, పౌరాణిక‌మైన పాత్ర‌ల పోష‌ణ స‌మ‌యంలో త‌న హావ‌భావాల‌తో పాటు.. నిద్రాహారాల‌ను సైతం మార్చుకుని వాటి కోసం తీవ్రంగా శ్ర‌మించ‌డం  అనే విద్య‌ను కూడా ఎన్టీఆర్ నేర్పిందే. ఆయ‌న పౌరాణిక పాత్ర‌లు పోషించేట‌పుడు సాత్వికాహార‌మే తినేవారు. నేల‌పై నిద్రించేవారు.  ఇక న‌ర్త‌న శాల‌లో న‌టించేట‌పుడు నాట్యం రావాల్సి ఉండ‌గా.. అందు కోసం వెంప‌టి  చిన స‌త్యం ద‌గ్గ‌ర కూచిపూడి నాట్యం అభ్య‌సించారు ఎన్టీఆర్. అందుకే ఆయ‌న కెమెరా ముందు ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ త‌డ‌బ‌డిందే లేదు. అంత‌గా ఎన్టీఆర్ ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్ష‌క జ‌న  నీరాజ‌నాలు అందుకున్నారు. డైలాగ్ డిక్ష‌న్ కు కొత్త డిక్ష‌న‌రీ క‌నిపెట్టింది కూడా ఎన్టీఆరే.  డైలాగ్ కొడితే ఎన్టీఆర్ కొట్టిన‌ట్టు ఉండాల‌న్న పేరుండేది. ఇప్ప‌టికీ ఆయ‌న డైలాగ్.. ఏమంటివి ఏమంటివి.. ఆచార్య దేవా! డైలాగ్ డెలివ‌రీ ఒక ట్రెండ్ సెట్ట‌రే.  ఆయ‌న్ని ఫాలో అయ్యేవాళ్లే కానీ, ఆయ‌న ఫాలో అయిన వాళ్లు ఇంత వ‌ర‌కూ లేరంటే అతిశ‌యోక్తి కాదు.  అంత‌గా ప్ర‌తిదీ ఒక ల్యాండ్ మార్క్ లా స్థాపించారు ఎన్టీఆర్.  అందుకే ఆయ‌న విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ బిరుదాంకితుడ‌య్యారు. త‌న 44 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో 13 చారిత్ర‌కాలు, 55 జాన‌ప‌దాలు, 186 సాంఘీకాలు, 44 పౌరాణికాలు చేశారు. 1968లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వ విద్యాల‌యం నుంచి గౌర‌వ డాక్ట‌రేట్, క‌ళాప్ర‌పూర్ణ స్వీక‌రించారు. అందుకే ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం, ప్ర‌చార నిర్వ‌హ‌ణ  అన్నీ ఒక ట్రెండ్ సెట్ట‌ర్లుగా మారాయి. 1978లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో అట్టుడికేది. న‌లుగురు ముఖ్య‌మంత్రులు మారారు. అంతే కాదు ఇక్క‌డి సీఎంని ఎక్క‌డో ఢిల్లీలో నిర్ణ‌యించేవారు. దీంతో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య ఉండేది. ఏదో నామ్ కే వాస్తే ప‌ద‌వులుండేవి. వీట‌న్నిటిని బ‌ద్ద‌లు కొట్టిన చ‌రిత్ర కూడా ఎన్టీఆర్ దే. ఇదెలా జ‌రిగిందో చూస్తే.. 1981లో ఊటీలో స‌ర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జ‌రుగుతున్న సమయంలో..  షూటింగ్ విరామంలో ఒక విలేఖ‌రి.. ఒక ప్ర‌శ్న  వేశాడు. మీకు వ‌చ్చే 6 నెల‌ల్లో అర‌వై ఏళ్లు వ‌స్తాయ్. ఈ క్ర‌మంలో మీరేదైనా  కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారా? అని అడ‌గ్గా.. అందుకు ఎన్టీఆర్ తాను ఇక‌పై తెలుగు ప్ర‌జ‌ల కోసం నెల‌లో 15 రోజులు వారి సేవ‌కోసం కేటాయిస్తాన‌ని అన్నారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్ప‌డానికి అదే తొలి సంకేతంగా మారింది. ఆనాటి నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాల‌న్నిటినీ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసిన ఎన్టీఆర్ 1982 మార్చి 21న హైద‌రాబాద్ వ‌చ్చారు. 1982 మార్చి 29వ తేదీ మ‌ధ్యాహ్నం.. రెండున్న‌ర గంట‌ల‌కు కొత్త  పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాదు దానికి తెలుగు దేశం అనే పేరు సైతం ప్ర‌క‌టించారు ఎన్టీఆర్.  పార్టీ ప్ర‌చారానికి త‌న పాత చెవ్రొలెట్ వ్యాను బాగు చేయించి.. దాన్నో క‌దిలే వేదిక‌గా త‌యారు చేయించారు. చైత‌న్య ర‌థం అంటూ దానిపై రాయించ‌డ‌మే కాకుండా తెలుగు దేశం పిలుస్తోంది రా క‌ద‌లిరా!  అంటూ నినాదాలు రాయించారు. దానిపై నుంచే అద్భుత‌మైన ప్ర‌సంగాలు చేశారు ఎన్టీఆర్. ఆ త‌ర్వాతి కాలంలో భార‌త రాజ‌కీయాల్లో ప్ర‌చార ర‌థాల‌కు ఈ చైత‌న్య ర‌థ‌మే ఒక స్ఫూర్తి   అంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌చారంలో ఒక శ్రామికుడ్ని త‌ల‌పిస్తూ ఖాకీ డ్రెస్సు వేసుకుని మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హించ‌డం కూడా అదే మొద‌లు. (ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా  కాషాయం ధ‌రించిందీ ఆయ‌నే. ఒక రాజ‌కీయ నాయ‌కుడు పిలిస్తే ఇంద‌రు ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి వ‌స్తారా? అని ఈ ప్ర‌పంచానికి రుచి చూపించింది కూడా ఎన్టీఆరే.  అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌సంగాలంటే బోరు కొట్టేవి. కానీ ఎన్టీఆర్ ప్ర‌సంగిస్తే ప్ర‌జ‌ల్లో ఒక చైత‌న్యం వ‌చ్చి ఊగిపోయేవారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం వంటి ప‌దాలు చేర్చి.. వాటి ద్వారా  ఆయ‌న చెప్ప మాట‌ల‌కు చెవులు కోసుకునేవారు తెలుగు ప్ర‌జ‌లు.  ఈ విష‌యంలోనూ ఆయ‌న  త‌ర్వాతే ఎవ‌రైనా. 1983 జనవరి 7 న   ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం- 199, కాంగ్రెసు- 60, సిపిఐ- 4, సిపిఎం- 5, బిజెపి- 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ రాజ‌కీయ‌ చరిత్ర గ‌ల‌ కాంగ్రెసు పార్టీ.. 9 నెలల వ‌య‌సుగ‌ల‌ తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయిందంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య తేడా కూడా ఎన్టీఆరే. ఈ విష‌యంలోనూ ఎన్టీఆర్ రికార్డుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ్వ‌రూ అందుకోలేక పోయారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల‌కే అధికారంలోకి అన్న‌ది కూడా ఎన్టీఆర్ పేరిట అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే పొలిటిక‌ల్ రికార్డ్. ఇక ఎన్టీఆర్ గెలుపు ఓట‌ములు రెండూ రాజ‌కీయ సంచ‌ల‌నాలే. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. కేంద్రం మిథ్య అని తేల్చి చెప్పిన ఘ‌న‌డు ఎన్టీఆర్. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాను అధికారం కోల్పోయాక ఆయ‌న్ను తిరిగి సీఎంగా నియ‌మించింది కూడా అదే కేంద్రంలోని కాంగ్రెస్. అంటే ఆయ‌నెంత విమ‌ర్శించినా.. ఆయ‌న్ను కాద‌నే ద‌మ్ము ధైర్యం కేంద్రానికి కూడా ఉండేది కాదు. అలాంటి కీర్తీ- ప్ర‌తిష్ట రెండూ ఎన్టీఆర్ సొంతం.. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్ర‌తిప‌క్ష హోదా  పొంద‌డం కూడా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్స్ లో ఒక‌టి. 1989 ఎన్నికల్లో  ఓడిపోయినా భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అదే నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటు. ఆనాడు ఎన్టీఆర్ సృష్టించిన ఆ ఫ్రంట్ పాలిటిక్సే ఇప్ప‌టికీ ఎన్డీఏ, యూపీఏల‌కు ప్రేర‌ణ‌.  ఇక ఆయ‌న తీసుకొచ్చిన సంక్షేమ ప‌థ‌కాలే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో న‌డుస్తున్నాయ్. ఎన్టీఆర్ రాజ‌కీయ రంగంలోకి రాకుంటే ఇవి కూడా వ‌చ్చేవి కావేమో. ఇక ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మాల్లోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ట‌ర్. అంతెందుకు మ‌నం నేడు హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ పై చూస్తున్న చారిత్ర‌క పురుషుల విగ్ర‌హాల‌తో పాటు సాగ‌ర్  మ‌ధ్య‌లో నెల‌కొన్న బుద్ధుడి విగ్ర‌హం కూడా ఎన్టీఆర్ ఆలోచన, ఆచరణే. ఇక ప్ర‌త్య‌ర్ధి పార్టీ అయినా స‌రే నంద్యాల‌లో నాడు పీవీ న‌ర‌సింహ‌రావు పోటీ చేస్తే ఆయనకు  పోటీ పెట్ట‌కుండా సాటి తెలుగు వాడ‌న్న గౌర‌వ‌మిచ్చిందీ ఎన్టీఆరే. ఇక రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం, సంపూర్ణ మ‌ద్యపాన నిషేధం,  ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు త‌గ్గింపు, శాస‌న మండ‌లి ర‌ద్దు.. ఇలా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చాలానే.. సినిమా హాళ్ల‌కు స్లాబ్ సిస్ట‌మ్స్.. ఇలా ర‌క‌రాల రాజ‌కీయ నిర్ణ‌యాలకు ఆద్యుడు ఎన్టీఆరే. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు.. ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో న‌టించారు. ఇలాంటి  ఎన్నో విష‌యాల్లో ఎన్టీఆర్ కి తిరుగు లేదు. ఆ మాట‌కొస్తే ప్ర‌చార సినిమాలుగా విశ్వామిత్ర వంటి  చిత్రాలు తీయ‌డంలోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశార‌నే చెప్పాలి.   తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇదే ఆయ‌న కుటుంబ, రాజ‌కీయ జీవితాన్ని స‌మూలంగా మార్చేసింద‌ని చెప్పాలి.  ఆ త‌ర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మ‌ర‌ణించారు విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. మొత్తం 33 ఏళ్ల సినిమా జీవితం, 13 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇటు క‌థానాయ‌కుడిగా, అటు మ‌హానాయ‌కుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పేరిట ఇంకా ఎన్నో రికార్డులు అలాగే నిల‌చి ఉన్నాయి. తిరిగి  ఆయ‌నే పుట్టి ఆయ‌నే వాటిని బ్రేక్  చేస్తే త‌ప్ప వాటినెవ‌రూ క్రాస్ చేయ‌లేరనడం అతిశయోక్తి కాదు.    మీసాల నాగ‌మ్మ‌గా ఆయ‌న వేసిన తొలి పాత్ర‌, మ‌న దేశంలో ఆయ‌న పోషించిన తొలి  సినిమా ఇన్ స్పెక్ట‌రు పాత్ర‌.. త‌ర్వాత త‌ర్వాత ఆయ‌న పోషించ‌ని పాత్ర ఏదైనా ఉందా? అన్న‌ట్టు అన్ని పాత్ర‌ల‌నూ పోషించ‌డం మాత్ర‌మే కాదు. రాజ‌కీయాల్లోనూ ఒక పెను సంచ‌ల‌నంగా ఎదిగిన  ఎన్టీఆర్ ఉత్తానాలే కాదు ప‌త‌నాల‌ను అందుకోవాల‌న్నా గుండెలుండాలి. ఈనాటికీ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ గ‌లిగిన తెలుగు సెల‌బ్రిటీల్లో ఆయ‌నదే తొలి  స్థానం. ఆ స్థానాన్ని చేరుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఒక స‌మ‌యంలో అంటే ఆయ‌న రామ‌, కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర వంటి పౌరాణిక పాత్ర‌లు పోషిస్తున్న స‌మ‌యంలో ఇటు తిరుప‌తికి వ‌చ్చిన జ‌నం అటు చెన్నైకి వెళ్లి ఆయ‌న్ను రెండో వెంక‌టేశ్వ‌ర స్వామిగా చూసుకుని వెళ్లేవారు. ఆ కృత‌జ్ఞ‌త కొద్దీ టీటీడీలోనూ స‌మూల మార్పులు తెచ్చి.. ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింది  కూడా ఎన్టీఆరే.  ఇదీ ఎన్టీఆరే పుట్ట‌క పోయి ఉంటే తెలుగు సినీ రాజ‌కీయాల్లో ఇన్నేసి అంశాల‌ను మ‌న‌మెవ‌రం చూసి ఉండేవాళ్లం కామని అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఒక సాధార‌ణ స‌బ్ రిజిస్ట్రార్ గా ఆయ‌న త‌న జీవితాన్ని వెళ్ల‌దీసి ఉంటే ఆయ‌న సంత‌కానికి  కేవ‌లం ఆస్తులపై పేరు మాత్ర‌మే మారి ఉండేదేమో.. అదే ఆయ‌న సినీ న‌టుడిగా తాను ఎద‌గ‌డంతో పాటు త‌న ప‌రిశ్ర‌మ‌ను సైతం అంతేలా ఎదిగేలా చేసిన  ఘ‌న‌డు. రాజాకీయాల్లో ఎంద‌రో ఆయ‌న సంత‌కం  పొందిన బీఫామ్స్ తో బీసీ ఎస్సీ క్రిష్టియ‌న్ ముస్లిం మైనార్టీలు చ‌ట్ట స‌భ‌ల్లో అడుగు పెట్టారు. వీట‌న్నిటినీ మ‌నం ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే చూసేవారం కాదేమో!