ఎన్టీఆర్ పుట్టక పోయి ఉంటే!?
ఎన్టీఆర్ పుట్టక పోయి ఉంటే సినిమాల్లో మనకు స్టార్ డమ్ ఎలాంటిదో తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమకు అతి పెద్ద హీరో చిత్తూరు నాగయ్య.. అప్పట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వచ్చినా ఆయనే చేసేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ పాతాళ భైరవి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైనమిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి. అప్పటి నుంచి ఎన్టీఆర్- ఎన్టీఆర్- ఎన్టీఆర్.. ఎటు చూసినా ఎన్టీఆర్ నామ జపం మొదలైంది. చుక్కలు చాలానే ఉంటాయ్.. కానీ చంద్రుడొక్కడే అన్నట్టు.. నటులు చాలా మందే ఉంటారు కానీ వాళ్లలో మాత్రం మహానటుడు ఎన్టీఆర్ ఒక్కడే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
ఇక రెండో విషయం ఏంటంటే రాముడు- కృష్ణుడు- రావణాసురుడు- ధుర్యోధనుడు- కర్ణ- భిష్మ వంటి పలు పౌరాణిక చిత్రాలు చేయడం మాత్రమే కాకుండా ఆనాటి మాస్ జనాల దగ్గరకు క్లాసిక్స్ అయిన రామాయణ, మహాభారతాలను తీసుకెళ్లిన ఘనత కూడా ఎన్టీఆర్ దే. ఒక వేళ ఎన్టీఆర్ పుట్టక పోయి ఉంటే.. కొందరికి రాముడు, కృష్ణుడు ఎలా ఉండేవారో అస్సలు తెలియక పోయేదేమో. అంతగా ఆయన ఆయా పాత్రలకు జీవం పోశారు. ఎంతైనా ఇది తెలుగు వారు మాత్రమే చేసుకున్న అదృష్టమని చెప్పాల్సి ఉంటుంది.
1928 మే 28న నిమ్మకూరులో పుట్టిన ఎన్టీఆర్ కి మొదట పెట్టాలనుకున్న పేరు కృష్ణ. బిడ్డ చూడ్డానికి బాలకృష్ణుడిలా ఉన్నాడనుకున్న తల్లి వెంకటరామమ్మ ముచ్చట ఆ నాడు తీరలేదు. మేనమామ వచ్చి తారక రాముడన్న పేరైతే బాగుంటుందని అనే సరికి.. ఆ మహాతల్లి తన సోదరుడి మాట కాదనలేక.. పెట్టిన పేరు తారక రామారావు. కృష్ణ అని తన తల్లి పేరు పెట్టలేక పోయింది. ఆమె ముచ్చట ఎలాగైనా సరే తీర్చాలనుకున్నారో ఏమో ఎన్టీవోడు ఏకంగా 18 సార్లు శ్రీకృష్ణుడి వేషం ధరించి.. ఇటు ఆ పాత్రకు వన్నె తేవడం మాత్రమే కాదు.. అటు తెలుగు ప్రేక్షకజనులను ఎంతగానో అలరించారు. ఇదిలా ఉంటే ఇదే అంశం మీద మనం గుర్తించాల్సిన మరో అంశమేంటంటే.. ఎన్టీఆర్ తన పిల్లల్లో అందరి పేర్లకు కృష్ణ అన్న పదం చేర్చి మరీ పెట్టడం వెనక ఆ నాడు తన తల్లి తనకు కృష్ణ అన్న పేరు పెట్టలేక పోవడమే అన్న నమ్మకాలుండొచ్చనీ అంటారు. అందుకే తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం కాగా. ఆ పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమారుల పేర్లు ఏంటని చూస్తే.. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కాగా.. లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెల పేర్లు. అలా ఎన్టీఆర్ తన తల్లి.. కృష్ణ అన్న పేరు పెట్టలేక పోయిందన్న బాధను తుడిచేస్తూ ఆ పేరు తన పిల్లలకు పెట్టి.. ఆమె కన్నరుణం తీర్చుకున్నారా అనిపిస్తుంది.
తర్వాత చెప్పపుకోదగ్గ విషయమేంటంటే.. పారితోషకం. అత్యధిక పారితోషకం అందుకున్న తొలి తరం నటుల్లో ఎన్టీఆరే ముందుండేవారు. ఆయన తొలి నాళ్లలో అంటే 1951 నుంచి మొదలైన స్టార్ డమ్ ద్వారా ఆయన నెలకు 500 నుంచి 5 వేల వరకూ జీతం తీసుకునేవారు. 1956లో విడుదలైన మాయా బజార్ లో ఏకంగా 7500 రూపాయలు తీసుకోవడం.. అప్పట్లో అది అతి పెద్ద పారితోషకం. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు ఎన్టీఆర్. 1963 లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు పారితోషికం నాలుగైదు అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది. ఇది కూడా అప్పట్లో ఒక రికార్డే. అంటే పారితోషకంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది కూడా ఎన్టీఆరేనని చెప్పాలి. యాక్టింగ్ తో ఒక స్టార్ డమ్ క్రియేట్ చేయడం అత్యంత ప్రజాదరణ పొందడం. సినిమా తీస్తే ఎన్టీఆర్ తోనే తీయాలన్న ఆలోచన కొద్దీ నిర్మాతలు ఎగబడడం.. పారితోషకం అంతకంతకూ పెరుగుదల అనే పరిణామ క్రమాన్ని తెలుగు సినీ పరిశ్రమ చూసింది కూడా ఎన్టీఆర్ ద్వారానే.
ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, పంచపాత్రాభినయం ఇలా ఎన్టీఆర్ ఇక్కడా ఒక ట్రెండ్ సెట్ చేశారు. రాముడు- భీముడితో మొదలైన ఈ పరంపర తర్వాతి కాలంలో.. దాన వీర శూర కర్ణ లో త్రిపాత్రాభినయం, శ్రీమద్విరాట పర్వంలో ఐదు పాత్రల పోషణ.. ఇలా ఈ విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ ఎన్టీఆరే. ఒక నటుడిగా ఉండి దర్శకత్వంలోకి ప్రవేశించిన తొలి తరం నటుల్లోనూ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. కొందరు ఇది వరకే ఉన్నా.. స్టోరీ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్ లో తనదైన ముద్ర వేయడంతో పాటు, సూపర్ డూపర్ హిట్స్ అందించిన ఘనత మాత్రం ఎన్టీఆర్ దే.
ఇటు యమగోల, అడవిరాముడు, వేటగాడు వంటి చిత్రాల ద్వారా మాస్ హిట్స్ అందించిన క్రెడిబిలిటీ కూడా ఎన్టీఆర్ దే. ఆ మాటకొస్తే సినిమాల్లో వంద రోజులు, నూట యాభై రోజులు, 200, 250, 365 రోజులంటూ.. రోజులు- వారాలు- నెలలు- సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు తీసిన చరిత్ర కూడా మాస్ కా బాప్ ఎన్టీఆర్ పేరిటే లిఖించబడి ఉండేది. అంటే సినిమాల్లో ఏ రికార్డు ఉన్నా ఆ రికార్డులన్నీ దాదాపు ఎన్టీఆర్ ని మొదట పలకరించాకే తర్వాత ఇతరుల పరమయ్యేవన్నంతగా ఎన్టీఆర్ ద స్టార్ ఆఫ్ ద ఎంటైర్ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీగా ఉన్నారు.
క్రమశిక్షణ అంటే ఎన్టీఆర్- ఎన్టీఆర్ అంటేనే క్రమశిక్షణ. ఉదాత్తమైన, పౌరాణికమైన పాత్రల పోషణ సమయంలో తన హావభావాలతో పాటు.. నిద్రాహారాలను సైతం మార్చుకుని వాటి కోసం తీవ్రంగా శ్రమించడం అనే విద్యను కూడా ఎన్టీఆర్ నేర్పిందే. ఆయన పౌరాణిక పాత్రలు పోషించేటపుడు సాత్వికాహారమే తినేవారు. నేలపై నిద్రించేవారు. ఇక నర్తన శాలలో నటించేటపుడు నాట్యం రావాల్సి ఉండగా.. అందు కోసం వెంపటి చిన సత్యం దగ్గర కూచిపూడి నాట్యం అభ్యసించారు ఎన్టీఆర్. అందుకే ఆయన కెమెరా ముందు ఇంత వరకూ ఎప్పుడూ తడబడిందే లేదు. అంతగా ఎన్టీఆర్ ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్షక జన నీరాజనాలు అందుకున్నారు.
డైలాగ్ డిక్షన్ కు కొత్త డిక్షనరీ కనిపెట్టింది కూడా ఎన్టీఆరే. డైలాగ్ కొడితే ఎన్టీఆర్ కొట్టినట్టు ఉండాలన్న పేరుండేది. ఇప్పటికీ ఆయన డైలాగ్.. ఏమంటివి ఏమంటివి.. ఆచార్య దేవా! డైలాగ్ డెలివరీ ఒక ట్రెండ్ సెట్టరే. ఆయన్ని ఫాలో అయ్యేవాళ్లే కానీ, ఆయన ఫాలో అయిన వాళ్లు ఇంత వరకూ లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రతిదీ ఒక ల్యాండ్ మార్క్ లా స్థాపించారు ఎన్టీఆర్. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితుడయ్యారు. తన 44 ఏళ్ల సినీ ప్రస్థానంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘీకాలు, 44 పౌరాణికాలు చేశారు. 1968లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ స్వీకరించారు.
అందుకే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, ప్రచార నిర్వహణ అన్నీ ఒక ట్రెండ్ సెట్టర్లుగా మారాయి. 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో అట్టుడికేది. నలుగురు ముఖ్యమంత్రులు మారారు. అంతే కాదు ఇక్కడి సీఎంని ఎక్కడో ఢిల్లీలో నిర్ణయించేవారు. దీంతో తెలుగు వారి ఆత్మగౌరవ సమస్య ఉండేది. ఏదో నామ్ కే వాస్తే పదవులుండేవి. వీటన్నిటిని బద్దలు కొట్టిన చరిత్ర కూడా ఎన్టీఆర్ దే. ఇదెలా జరిగిందో చూస్తే.. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. షూటింగ్ విరామంలో ఒక విలేఖరి.. ఒక ప్రశ్న వేశాడు. మీకు వచ్చే 6 నెలల్లో అరవై ఏళ్లు వస్తాయ్. ఈ క్రమంలో మీరేదైనా కీలక నిర్ణయం తీసుకుంటున్నారా? అని అడగ్గా.. అందుకు ఎన్టీఆర్ తాను ఇకపై తెలుగు ప్రజల కోసం నెలలో 15 రోజులు వారి సేవకోసం కేటాయిస్తానని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడానికి అదే తొలి సంకేతంగా మారింది. ఆనాటి నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాలన్నిటినీ త్వరత్వరగా పూర్తి చేసిన ఎన్టీఆర్ 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చారు. 1982 మార్చి 29వ తేదీ మధ్యాహ్నం.. రెండున్నర గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అంతే కాదు దానికి తెలుగు దేశం అనే పేరు సైతం ప్రకటించారు ఎన్టీఆర్.
పార్టీ ప్రచారానికి తన పాత చెవ్రొలెట్ వ్యాను బాగు చేయించి.. దాన్నో కదిలే వేదికగా తయారు చేయించారు. చైతన్య రథం అంటూ దానిపై రాయించడమే కాకుండా తెలుగు దేశం పిలుస్తోంది రా కదలిరా! అంటూ నినాదాలు రాయించారు. దానిపై నుంచే అద్భుతమైన ప్రసంగాలు చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో ప్రచార రథాలకు ఈ చైతన్య రథమే ఒక స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదేమో. ప్రచారంలో ఒక శ్రామికుడ్ని తలపిస్తూ ఖాకీ డ్రెస్సు వేసుకుని మరీ ప్రచారం నిర్వహించడం కూడా అదే మొదలు. (ప్రతిపక్షంలో ఉండగా కాషాయం ధరించిందీ ఆయనే. ఒక రాజకీయ నాయకుడు పిలిస్తే ఇందరు ప్రజలు ఎగబడి వస్తారా? అని ఈ ప్రపంచానికి రుచి చూపించింది కూడా ఎన్టీఆరే.
అప్పటి వరకూ రాజకీయ నాయకుల ప్రసంగాలంటే బోరు కొట్టేవి. కానీ ఎన్టీఆర్ ప్రసంగిస్తే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి ఊగిపోయేవారు. తెలుగువారి ఆత్మగౌరవం వంటి పదాలు చేర్చి.. వాటి ద్వారా ఆయన చెప్ప మాటలకు చెవులు కోసుకునేవారు తెలుగు ప్రజలు. ఈ విషయంలోనూ ఆయన తర్వాతే ఎవరైనా. 1983 జనవరి 7 న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం- 199, కాంగ్రెసు- 60, సిపిఐ- 4, సిపిఎం- 5, బిజెపి- 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కాంగ్రెసు పార్టీ.. 9 నెలల వయసుగల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయిందంటే ఈ రెండు పార్టీల మధ్య తేడా కూడా ఎన్టీఆరే. ఈ విషయంలోనూ ఎన్టీఆర్ రికార్డులను ఇప్పటి వరకూ ఎవ్వరూ అందుకోలేక పోయారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి అన్నది కూడా ఎన్టీఆర్ పేరిట అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే పొలిటికల్ రికార్డ్.
ఇక ఎన్టీఆర్ గెలుపు ఓటములు రెండూ రాజకీయ సంచలనాలే. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. కేంద్రం మిథ్య అని తేల్చి చెప్పిన ఘనడు ఎన్టీఆర్. సరిగ్గా అదే సమయంలో తాను అధికారం కోల్పోయాక ఆయన్ను తిరిగి సీఎంగా నియమించింది కూడా అదే కేంద్రంలోని కాంగ్రెస్. అంటే ఆయనెంత విమర్శించినా.. ఆయన్ను కాదనే దమ్ము ధైర్యం కేంద్రానికి కూడా ఉండేది కాదు. అలాంటి కీర్తీ- ప్రతిష్ట రెండూ ఎన్టీఆర్ సొంతం.. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడం కూడా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్స్ లో ఒకటి.
1989 ఎన్నికల్లో ఓడిపోయినా భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అదే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు. ఆనాడు ఎన్టీఆర్ సృష్టించిన ఆ ఫ్రంట్ పాలిటిక్సే ఇప్పటికీ ఎన్డీఏ, యూపీఏలకు ప్రేరణ. ఇక ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయ్. ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రాకుంటే ఇవి కూడా వచ్చేవి కావేమో. ఇక ప్రక్షాళన కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్.
అంతెందుకు మనం నేడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై చూస్తున్న చారిత్రక పురుషుల విగ్రహాలతో పాటు సాగర్ మధ్యలో నెలకొన్న బుద్ధుడి విగ్రహం కూడా ఎన్టీఆర్ ఆలోచన, ఆచరణే. ఇక ప్రత్యర్ధి పార్టీ అయినా సరే నంద్యాలలో నాడు పీవీ నరసింహరావు పోటీ చేస్తే ఆయనకు పోటీ పెట్టకుండా సాటి తెలుగు వాడన్న గౌరవమిచ్చిందీ ఎన్టీఆరే. ఇక రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, పదవీ విరమణ వయసు తగ్గింపు, శాసన మండలి రద్దు.. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలానే.. సినిమా హాళ్లకు స్లాబ్ సిస్టమ్స్.. ఇలా రకరాల రాజకీయ నిర్ణయాలకు ఆద్యుడు ఎన్టీఆరే. ప్రతిపక్షంలో ఉన్నపుడు.. ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో నటించారు. ఇలాంటి ఎన్నో విషయాల్లో ఎన్టీఆర్ కి తిరుగు లేదు. ఆ మాటకొస్తే ప్రచార సినిమాలుగా విశ్వామిత్ర వంటి చిత్రాలు తీయడంలోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారనే చెప్పాలి.
తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇదే ఆయన కుటుంబ, రాజకీయ జీవితాన్ని సమూలంగా మార్చేసిందని చెప్పాలి. ఆ తర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. మొత్తం 33 ఏళ్ల సినిమా జీవితం, 13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటు కథానాయకుడిగా, అటు మహానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పేరిట ఇంకా ఎన్నో రికార్డులు అలాగే నిలచి ఉన్నాయి. తిరిగి ఆయనే పుట్టి ఆయనే వాటిని బ్రేక్ చేస్తే తప్ప వాటినెవరూ క్రాస్ చేయలేరనడం అతిశయోక్తి కాదు.
మీసాల నాగమ్మగా ఆయన వేసిన తొలి పాత్ర, మన దేశంలో ఆయన పోషించిన తొలి సినిమా ఇన్ స్పెక్టరు పాత్ర.. తర్వాత తర్వాత ఆయన పోషించని పాత్ర ఏదైనా ఉందా? అన్నట్టు అన్ని పాత్రలనూ పోషించడం మాత్రమే కాదు. రాజకీయాల్లోనూ ఒక పెను సంచలనంగా ఎదిగిన ఎన్టీఆర్ ఉత్తానాలే కాదు పతనాలను అందుకోవాలన్నా గుండెలుండాలి. ఈనాటికీ అత్యంత ప్రజాదరణ గలిగిన తెలుగు సెలబ్రిటీల్లో ఆయనదే తొలి స్థానం. ఆ స్థానాన్ని చేరుకోవడం ఎవరి తరమూ కాదు. ఒక సమయంలో అంటే ఆయన రామ, కృష్ణ, వెంకటేశ్వర వంటి పౌరాణిక పాత్రలు పోషిస్తున్న సమయంలో ఇటు తిరుపతికి వచ్చిన జనం అటు చెన్నైకి వెళ్లి ఆయన్ను రెండో వెంకటేశ్వర స్వామిగా చూసుకుని వెళ్లేవారు. ఆ కృతజ్ఞత కొద్దీ టీటీడీలోనూ సమూల మార్పులు తెచ్చి.. ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది కూడా ఎన్టీఆరే.
ఇదీ ఎన్టీఆరే పుట్టక పోయి ఉంటే తెలుగు సినీ రాజకీయాల్లో ఇన్నేసి అంశాలను మనమెవరం చూసి ఉండేవాళ్లం కామని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒక సాధారణ సబ్ రిజిస్ట్రార్ గా ఆయన తన జీవితాన్ని వెళ్లదీసి ఉంటే ఆయన సంతకానికి కేవలం ఆస్తులపై పేరు మాత్రమే మారి ఉండేదేమో.. అదే ఆయన సినీ నటుడిగా తాను ఎదగడంతో పాటు తన పరిశ్రమను సైతం అంతేలా ఎదిగేలా చేసిన ఘనడు. రాజాకీయాల్లో ఎందరో ఆయన సంతకం పొందిన బీఫామ్స్ తో బీసీ ఎస్సీ క్రిష్టియన్ ముస్లిం మైనార్టీలు చట్ట సభల్లో అడుగు పెట్టారు. వీటన్నిటినీ మనం ఎన్టీఆర్ పుట్టక పోయి ఉంటే చూసేవారం కాదేమో!