బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదన్న సంకేతం
ఇంటి  ఆడబిడ్డపై సోషల్ మీడియాలో టార్గెట్ చేశారంటూ ఆరోపణ

బీఆర్ఎస్  అధినేత కుటుంబంలో  అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓపెన్ అప్ అయిపోయారు. సొంత సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కుటుంబంలో చీలిక అనివార్యమని తేల్చేశారు. తాను సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయమన్న సంకేతాలిచ్చేశారు. తన సోదరుడి నాయకత్వంలో పని చేసే ప్రశక్తే లేదని పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చి చెప్పారు. 

బీఆర్ఎస్ లో ఏకైక నాయకుడు కేసీఆరేననీ, మరెవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించే ప్రశ్నే లేదనీ కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఆమె  ఎలాంటి శషబిషలూ లేకుండా పార్టీపై ధిక్కార స్వరాన్ని చాలా చాలా గట్టిగా వినిపించారు. దీంతో ఆమెకు ఇప్పుడో, ఇహనో షోకాజ్ నోటీసు జారీ చేసి.. పార్టీ నుంచి ఉద్వాసన చెప్పాలని అధినేత భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు షోకాజ్ నోటీసు, పార్టీ నుంచి ఉద్వాసన విషయాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల కవిత  మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పునాదులకు కుదిపేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే కుట్ర జరుగుతోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నంచీ కూడా ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడిన తరువాత కూడా బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రి గురించిన ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా బీఆర్ఎస్ గాలి తీసేశాయి.

అంతే కాకుండా పార్టీలో తనను పక్కన పెట్టడం అన్నది ఇప్పుడు కాదనీ.. చాలా కాలం నుంచీ జరుగుతోందనీ ఆమె అన్యాపదేశంగా చెప్పారు. గతంలో అంటే మద్యం కుంభకోణం కేసులో తాను జైలుకు వెళ్లే సమయంలోనే పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యానని కవిత చెప్పుకోచ్చారు. ఇక తాను జైలులో ఉన్న సమయంలోనే తనపై కుట్రలు మొదలయ్యాయని ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత.. బీఆర్ఎస్ కు కేసీఆర్ వినా ఎవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించేది లేదని కుండబద్దలు కోట్టడం ద్వారా.. తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి తాను ససేమిరా అంగీకరించబోనని స్పష్టం చేశారు.  

ఇక తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.   సొంత పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తననుటార్గెట్ చేశారన్న కవిత, ఇంటి ఆడబిడ్డపై సోషల్  మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులపై దాడి చేయిస్తారా అంటూ పేరు ప్రస్తావించకుండానే సోదరుడు కేటీఆర్ పై విరుచుకు పడ్డారు. నామీద పడి ఏడిస్తే ఏమొస్తుందంటూ పరోక్షంగానైనా తన తిరుగుబాటు సోదరుడిపైనేనని చెప్పేశారు.  తన లేఖను లీక్ చేసిన లీకు వీరులను పట్టుకోమంటూ గ్రీకు వీరులను తనపై రెచ్చగొట్టారని విమర్శలు గుప్పించారు.

ఇప్పటికైనా సరే తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రణాళికాబద్ధంగా తనకూ కేటీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందనీ, తనను దూరం చేస్తే పార్టీలో లాభ పడేదెవరో అందరికీ తెలుసు అనడం ద్వారా ఆమె అన్యాపదేశంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు కవితకు ఉద్వాసన చెప్పి బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారా? లేక మరో సారి కుమారుడి పట్టాభిషేక ముహూర్తాన్ని వాయిదా వేస్తారా అన్నది కేసీఆర్ నిర్ణయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. మరి యువరాజ పట్టాభిషేకం జరుగుతుందా... మరోసారి వాయిదా పడుతుందా..చూడాల్సిందే.