దినేష్ రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నారా?

  ఒకప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరొందిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఆయన తన పదవీకాలం మరో రెండేళ్ళు పొడిగించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించడంతో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)లో అప్పీలు చేసుకొని అక్కడ రెండు సార్లు భంగపడ్డారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా హైకోర్టుకి వెళ్లి అక్కడ కూడా మరోసారి భంగపడి, చాలా అవమానకర పరిస్థితుల్లో పదవీ విరమణ చేయవలసి వచ్చింది. మళ్ళీ ఈ మధ్య సుప్రీంకోర్టుకి కూడా వెళ్లి అక్కడ కూడా లేదనిపించుకొని వచ్చారు. ఆయన తన పదవీ కాంక్ష వలన ఇన్నిసార్లు భంగపాటు ఎదుర్కొన్నారని అర్ధం అవుతోంది.   ఈ అవమానం జీర్ణించుకోలేని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు.   రాష్ట్రంలోనే అత్యున్నత పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన దినేష్ రెడ్డి అవినీతి, అక్రమం ఎక్కడ జరిగినా అడ్డుకొనే సత్తా కలిగి ఉంటాడని ప్రజలు భావించడం సహజం. కానీ, పదవిలో కొనసాగినంత కాలం అదే ముఖ్యమంత్రితో రాసుకు పూసుకు తిరిగి, ఇప్పుడు తన పదవీకాలం పొడిగించని కారణంగా ముఖ్యమంత్రిపై నిందలు వేయడం అనుచితం. ఒకవేళ ఆయనే గనుక నిజంగా గొప్ప నిజాయితీ గల పోలీసు అధికారి అయ్యి ఉంటే, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుచుకోమని సాక్షాత్ ముఖ్యమంత్రే ఆదేశించినా దైర్యంగా తిరస్కరించి ఉండాలి.   కానీ, ఆయన లౌక్యంగా మసులుతూ పదవీ విరమణ చేసారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిని అభాసుపాలు చేసే ప్రయత్నంలో ఆయనే స్వయంగా ఏపీఎన్జీవోల సభకు సహకరించానని తన తప్పును తానే బయటపెట్టుకొన్నారు. ముఖ్యమంత్రి పేషీలోనే నేరాలు జరుగుతున్నపుడు ఆయన ఎందుకు అడ్డుకోలేదు? అంటే పదవిలో కొనసాగనిస్తే ఎటువంటి నేరనయినా చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తారని అర్ధం అవుతోంది.   ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో స్వయంగా సీబీఐ విచారణ కూడా ఎదుర్కొంటున్న దినేష్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిపై ఇటువంటి ఆరోపణలు చేయడం వలన ముందుగా పోయేది తన పరువేనని గ్రహించాలి. తనపై మాజీ మంత్రి శంకర్ రావు ఆరోపణలు చేసినప్పుడు ఆయన ఏవిధంగా స్పందించారో, ఇప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తే ఏమవుతుందో ఆయన గ్రహించాలి.        సాదారణంగా రాజకీయ నాయకులు వ్యవహరించే విధంగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్నారు. మరి త్వరలో ఆయన రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నందునే ఈవిధంగా మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. అదే నిజమయితే కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించి రెడ్డి కులస్తులు అదికంగా ఉండే కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదు గనుక, ఇక వైకాపాలో జేరుతారేమో మరి చూడాలి.

మాజీ డి.జి.పి భూకబ్జా దారుడా?

      సి.ఎం పై డి.జి.పి చేసిన వ్యాఖ్యానాలు సరియైనవి కావని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. డి.జి.పి గా ఆ పోస్ట్ ఎలా వచ్చిందో ఆయనకు గుర్తుందా అని ఆయన అడిగారు. దినేష్ రెడ్డి ముందు తన మీద ఉన్న ఆరోపణల నుండి ఆయన బయటపడాలని సూచించారు. ముఖ్య మంత్రి తమ్ముడి మీద భూకబ్జ ఆరోపణలు చేసే ముందు దినేష్ తన మీదున్న అనేక భూఆక్రమణల వివాదాలకు వివరణ ఇవ్వాలని మంత్రి అన్నారు. డి.జి.పి పదవి కొనసాగింపు అంశం చట్ట పరిధి లోనిది అని మంత్రి వ్యాఖ్యానించారు. సి.ఎం ను విమర్శించే స్థాయి దినేష్ రెడ్డికి లేదని ఆనం అన్నారు. డి.జి.పి గా కొనసాగేందుకు క్యాట్ నిరాకరించిందని,ఆయన పైన ఉన్న అవినీతి ఆరోపణల రీత్యా సుప్రీం కోర్ట్ ఆయన పదవి కొనసాగింపు కుదరదని తీర్పునిస్తే దానికి ముఖ్య మంత్రి ఏమి చేస్తారని మంత్రి ఆనం ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్త్ ఉద్యోగుల చర్చలు విఫలం

      మంత్రివర్గ ఉపసంఘంతో విద్యుత్త్ ఉద్యోగుల చర్చలు విఫలమైనాయి. ఈరోజు సాయంత్రం మరోసారి చర్చలకు భేటీ కానున్నట్లు విద్యుత్త్ ఉద్యోగుల జె.ఏ.సి తెలియజేసింది. రాష్ట్ర విభజన మూలంగా తలెత్తే విద్యుత్త్ సమస్యలను మంత్రి వర్గ ఉపసంఘానికి వెల్లడించామని,సమైఖ్య రాష్ట్రం పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని విద్యుత్త్ ఉద్యోగస్తులు తెలియ చేయటం జరిగింది. ఇదిలా ఉండగా సీమాంద్ర లోని చాలా రంగాలు ఈ విద్యుత్త్ సమ్మె కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒక పక్క హాస్పిటల్స్ లో విద్యుత్త్ లేని కారణం గా రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల జేనరేటర్లు కూడా పనిచేయని కారణంగా జరుగవలసిన ఆపరేషన్లు కూడా వాయిదా పడినాయి. సీమాంధ్ర లోని చాలా ప్రాంతాలలో రైళ్ళను రద్దు చేయగా,చాలా ప్రాంతాలలో నీళ్ళు లేక,పాలు లేక ఎ.టి.ఎమ్ లు పనిచేయక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు.

మళ్ళీ అఖిలపక్షాన్ని పిలవాలి: బొత్స..!

      రాష్ట్ర విభజన విషయమై సీమాన్ధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపధ్యలోను,బొత్స స్వస్థల మైన విజయనగరంలో బొత్స ఆస్తులపై జరుగుతున్న దాడుల నేపధ్యంలోను,బొత్స ఎ.పి ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజలలో నెలకొన్న ఆందోళనల విషయమై మళ్ళి అధిష్టానం అఖిలపక్షాన్ని పిలవాలని లేఖరయనున్నట్లు తెలియజేశారు. అంతే కాదు తాను వెనుకబడిన ప్రాంతం నుండి,వెనుకబడిన సామాజికవర్గం నుండి వచ్చినవాడినని కూడా వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం ఇంతకు ముందు అఖిలపక్ష సమావేశంలో కాని,సి డబ్ల్యు.సి సమావేశంలో కానీ బొత్స తన వంతు కృషిగా తాను ఏమిచేసారో ప్రజలకు తెలియచేయాలని భావిస్తున్నారు.

సిఎం కిరణ్ పై దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

      ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ తనకు అనుకూలంగా సహకారించ మని ఒత్తిడి తెచ్చారని పేర్కొనటం జరిగింది. సి.ఎమ్ సోదరుడు చేస్తున్న భూ దందాలకు తనను సహకరించ మన్నారని,సి . ఎం కు తెలంగాణ రావటం ఇష్టం లేదని,అందుకనే నక్సలైట్ సమస్య వస్తుందని తనను చెప్పవలసిందని ఒత్తిడి తెచ్చారని తాను అందుకు సహకరించ నందున తన పదవిని పోడిగించాలేదని పేర్కొన్నారు.అనంతపురం నిజాయతి పరులైన అధికారులను బలవంతం గ బదిలీ చేశారని పేర్కొన్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఈ వైఖరి ఫై దినేష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవమేనా లేక ఈ వైనం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తేలవలసి ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

రెండో రోజుకు చేరిన చంద్రబాబు ఢిల్లీ దీక్ష

      రాష్ట్రవిభజనపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ డిల్లీలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. చంద్రబాబు మాట్లుడుతూ..రాజకీయాలు చేయడానికి తాను నిరవధిక దీక్ష చేపట్టలేదని స్పష్టం చేశారు. తెలుగువారి కోసం దీక్ష చేయాలంటే తాను ఇటలీ మహిళ పరిమిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు.   రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాటిని సరిద్దిద్దామని రాష్ట్రపతిని కోరినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్రం, సీమాంధ్ర ప్రజల ఆందోళన పట్ల కనీస స్పందన చూపకపోవడం వలనే నేడు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని తెలిపారు.     కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయకోణం నుండే పరిష్కరించాలని ప్రయత్నించుతున్నందున, అది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్, షిండే వంటి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు పొంతన లేని విధంగా మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

2011 గ్రూప్-1 మళ్ళీ నిర్వహించండి: సుప్రీంకోర్టు

      ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 2011లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోసారి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఇంటర్వ్యూలు జరపాలని కమిషన్ ను న్యాయస్థానం ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం ఏపీపీఎస్సీ ప్రకటించిన కీలో ఆరు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు గుర్తించారు. వాటిని తొలగించి ఉత్తీర్ణతను నిర్ధారించాలని, ఆ మేరకు మెరిట్ లిస్ట్‌ను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.       ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీని నియమించాలని ఈ ఏడాది జనవరి 4న ఏపీపీఎస్సీని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఏపీపీఎస్సీనే తప్పు చేసిందని, మళ్లీ వారిచేతే నిపుణుల కమిటీ వేయించడం సరికాదంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశాన్ని యూపీపీఎస్సీకి సిఫార్సు చేస్తూ జూలైలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాజకీయ భవిష్యత్తు కోసమే చిరు రిజైన్!

      కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసినట్లుగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంద్రలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఆయన కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఇప్పటికయినా రాజీనామాలు చేయకపోతే తాను ప్రజలలోకి వెళ్ళలేనని అందుకనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.   చిరంజీవి ఇంట్లో మంత్రుల భేటి తరువాత మీడియా తో మాట్లాడుతూ..రాజీనామాలను ఆమోదిస్తే తప్ప ప్రజల్లోకి వెళ్లలేమని ప్రధానికి చెప్పామని, వాటిని ఆమోదించాలని ఒత్తిడి చేశామని చిరంజీవి అన్నారు. రాజీనామాలను ఆమోదించిన తర్వాతే కేంద్రం, అధిష్ఠానం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని, ప్రజల వాణిని వినిపిస్తామని షిండేకు చెప్పామన్నారు. అంటే రాజీనామాలు ఆమోదించిన తర్వాత కొత్త బాధ్యతలు ఇస్తారని చిరంజీవి అనుకుంటున్నారా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.     ఇదంతా గమనిస్తే మంత్రులు కేవలం ఏపీ యన్జీవోల ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రాజీనామాలు చేసి తమ రాజకీయ జీవితాన్నికాపాడుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్దితో లేదా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తోనో కాదని స్పష్టం అవుతోంది.

వాటీస్ దిస్ నాన్సెన్స్?

  మమ్మీ..మమ్మీ వాళ్ళు నన్ను మళ్ళీ నాన్సెన్స్ అనమంటునారు...   ఎవరురా?   అదే సీమంద్రా వాళ్ళు మమ్మీ   మళ్ళీ దేనికిరా?   అదే మమ్మీ మొన్న మన్మోహన్ అంకుల్ వాళ్ళు ఏదో టీ-నోట్ పాస్ చేసారట కదా! దానిని కూడా ఓసారి నాన్సెన్స్ అనమని సీమంద్రా వాళ్ళు ఒకటే బ్రతిమాలుతున్నారు మమ్మీ. పోనీ ఓసారి దాన్నికూడా నాన్సెన్స్ అనేయమంటావా? వాళ్ళు కూడా మనల్నిమెచ్చుకొంటారు...   మొన్నే కదరా మనవాళ్ళు చేసిన ఆర్డినెన్స్ ని నువ్వు నాన్సెన్స్ అని మన పరువు తీసావు...ఇంకా మన పరువేమయినా మిగిలుంటే దానిని కూడా తీసేద్దామనా? నాన్సెన్స్...మళ్ళీ నాన్సెన్స్ అన్నావంటే ఈ సారి ఊరుకొనేది లేదు..జాగ్రత్త!   నాన్సెన్స్! మన వాళ్ళు అందరూ నన్ను తెగ మెచ్చుకొంటుంటే నువొక్కదానివే ఇలా అంటున్నావు మమ్మీ. రియల్లీ ఇటీజ్ నాన్సెన్స్ మమ్మీ.   అవునురా నాన్సేన్సే... మనవాళ్ళు నేను చెప్పినట్లు నీకు చెక్కభజన భజన చేసారు గాబట్టి బ్రతికిపోయావు లేకుంటే ఆ మోడీ అంకుల్ చేతిలో నీ పనయిపోయేది తెలుసా? నువ్వు గొప్ప అవినీతి వ్యతిరేఖివని అందుకే నాన్సెన్స్ అనగలిగావని మనవాళ్ళు నిన్ను వెనకేసుకు వచ్చేసరికి వాళ్ళ తల ప్రాణం తోక్కి వచ్చింది తెలుసా? నీ నాన్సెన్స్ వల్ల పాపం మన్మోహన్ అంకుల్ ఎంత బాధ పడ్డారో తెలుసా? ఆయనని సముదాయించలేక చచ్చేను తెలుసా? నువ్వీసారి నాన్సెన్స్ అంటే నేనా టీ-నోట్ వెనక్కి తీసుకోమని చెప్పలేను కూడా.   పోనీ సీమంధ్ర ఉద్యమాన్ని నాన్సెన్స్ అనమంటావా మమ్మీ? కేసీఆర్ అంకుల్ మనల్ని బాగా మెచ్చుకొంటారు కదా...?   అప్పుడు గానీ మనకి బుద్ది రాదు. ఆ మాటన్నావంటే వాళ్ళు మనల్ని, మన పార్టీని మళ్ళీ ఆ రాష్ట్రంలో కాళ్ళు కూడా పెట్టనీయరు.. గుర్తుంచుకో...   నేను అనకపోయినా సీమంద్రా వాళ్ళు ఈ సారి కాంగ్రెస్ వాళ్ళని కాలుపెట్టనీయరని మన లగడపాటి, దివాకర్ అంకుల్స్ అందరూ చెపుతున్నారు కదా?   నాన్సెన్స్! వాళ్ళు అలా అంటున్నారనే నేను వేరే ఏర్పాటు చేసాను. మనకేమి డోకా లేదక్కడ.. నువ్వు మాత్రం ఇంక ఎవరు వచ్చి ఎంత బ్రతిమాలినా నాన్సెన్స్ అని మాత్రం అనకు.. గుర్తుంచుకో...   నువెప్పుడు ఇంతే మమ్మీ..నన్నేమి మాట్లాడొద్దంటావు. నేనేమి మాట్లాడినా నాన్సెన్స్ అని తీసి పారేస్తావు! నాన్సెన్స్!   నిన్ను మాట్లాడనీయకపోవడం ఏమిటి? నువ్వు దేశం..సుపరిపాలన..అధికార వికేంద్రీకరణ...అభివృద్ధి...ప్రజలు..త్యాగాలు...అంటూ మాట్లాడినప్పుడు మన వాళ్ళందరిచేతా నీకు ఎవరు చెక్క భజన చేయించారనుకొన్నావు? నువ్వు అలాంటి టాపిక్ ఎంతసేపయినా మాట్లాడుకో నాకేమి అభ్యంతరం లేదు. కానీ నీ ఉపన్యాసంలో ఎక్కడా నాన్సెన్స్ అనే పదం మాత్రం వాడకూడదు. గుర్తుంచుకో...   అలాగే మమ్మీ! కానీ ప్రజలు మాత్రం నా ఉపన్యాసాలు ఎంత కాలం వింటారు? ఏదో ఒకరోజు వాళ్ళు కూడా నాన్సెన్స్ అంటారేమో మమ్మీ?   మరేం పర్వలేదురా..మనకీ చెక్కభజన బృందం ఉన్నంత కాలం నువ్వు ప్రజలేమనుకొంటారోనని ఆలోచించనవసరం లేదు.   థాంక్స్ మమ్మీ మన వాళ్ళని ఇంత బాగా ట్రయిన్ చేసినందుకు...యువ్వార్ రియల్లీ గ్రేట్ మమ్మీ!   అద్సరే గానీ.. మరో విషయం బాగా జ్ఞాపకం ఉంచుకో..మనం దేశం కోసం ప్రజలని త్యాగాలు చేయమని చెపుతుండాలి గానీ, మనం త్యాగాలు చేస్తామని నోరు జారకూడదు..నువ్వు ఇవ్వాళ్ళ కాకపోతే రేపయినా ఆపెద్ద కుర్చీలో కూర్చొంటే, మన వాళ్ళు అందరూ నీ ఎదురుగా చేతులు కట్టుకొని నీకు భజన చేస్తుంటే చూసి ఆనందించాలని ఈ తల్లి మనసు ఆరాటపడుతోంది...అందుకే నాకా కుర్చీ వద్దని మాత్రం ఎప్పుడు ఎక్కడా నోరు జారకు గుర్తుంచుకో...   ఒకే గాటిట్ మమ్మీ.   ఈ రోజు కాలేజీ పిల్లలకి దేశసేవ గురించి లెక్చర్ ప్రోగ్రాం ఒకటుంది. ఎనీ అబ్జక్షన్స్?   నో..నాటెటాల్ మై సన్ క్యారీ ఆన్...పనిలో పనిగా ఆ పక్కనే ఉన్నఎలిమెంటరీ స్కూలు పిల్లలకి కూడా నాలుగు మంచి ముక్కలు చెప్పిరా...   ష్యూర్ మమ్మీ..ఒకే.. సీయూ బై...

చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ పార్టీకి ఇరకాటం

  రాష్ట్రవిభజనపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ డిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబు నాయుడు ఊహించినట్లే కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడం ద్వారా ఇంతకాలంగా రాష్ట్ర విభజనపై సీమంధ్రలో జరుగుతున్నఉద్యమాలను అంతగా పట్టించుకోని జాతీయ మీడియా దృష్టికి కూడా తేగలిగారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఆలోచింప జేస్తున్నాయి.   రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాటిని సరిద్దిద్దామని రాష్ట్రపతిని కోరినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్రం, సీమాంధ్ర ప్రజల ఆందోళన పట్ల కనీస స్పందన చూపకపోవడం వలననే నేడు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంబందించిన ఈ అంశంపై వారికి సరయిన వివరణ ఈయకపోగా కేంద్రం ఎందుకు అంత రహస్యంగా టీ-నోట్ ను ఆమోదించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈవిషయంలో తన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది గనుకనే దానిని ఈవిధంగా దొంగచాటుగా ఆమోదించవలసి వచ్చిందని, లేకుంటే అదేవిషయం ముందుగానే మీడియాకు తెలియజేసి మరీ ఆమోదించి ఉండేదని ఆయన ఆరోపించారు.   కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయకోణం నుండే పరిష్కరించాలని ప్రయత్నించుతున్నందున, అది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్, షిండే వంటి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు పొంతన లేని విధంగా మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈవిధంగా తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకొనే హక్కు మీకెవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.   కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కోసం తన పార్టీని నేతల రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నట్లు ఆ పార్టీకి చెందిన నేతలే చెపుతున్న మాటలను మీడియాకు వివరించి, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన స్వంత పార్టీని, నేతలను కూడా బలిచేసుకోవడానికి సిద్దపడుతోందని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని హేళన చేసారు.   చంద్రబాబు నాయుడు డిల్లీలో నిరాహార దీక్షకు దిగుతున్నపుడు కాంగ్రెస్ అధిష్టానం దానిని చాలా తేలికగా తీసిపడేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన మొదటిరోజే జాతీయ మీడియా ముందు ఈవిధమయిన ప్రశ్నలు లేవనెత్తడంతో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతోంది.

కిరణ్ కూడా రాష్ట్ర విభజనకు సిద్దపడినట్లేనా

  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఉద్యోగుల చేత సమ్మెవిరమింపజేసే బాధ్యత ముఖ్యమంత్రిదేనని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పిన మరునాడే కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మరో మారు మీడియా ముందు తన సమైక్య రాగం ఆలపించారు.   రాష్ట్ర విభజన వల్ల కలిగే సమస్యలను చర్చించకుండా కేంద్రం హడావుడిగా విభజన చేయడం వల్ల మరికొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, ఇప్పటికయినా ప్రజల ఆందోళనలు గమనించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన అధిష్టాన్నాన్నికోరారు. ముఖ్యమంత్రే స్వయంగా వెనుక నుండి ఉద్యోగుల సమ్మెను ప్రోత్సహిస్తున్నరనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. వారు తమ జీతాలను కోల్పోతున్నాపట్టుదలగా ఉద్యమం చేస్తున్నారని మెచ్చుకొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలోఉంచుకొని ఇకనయినా ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   టీ-నోట్ ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రకటన వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందిస్తారని అందరూ భావించారు. కానీ ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం మృదువుగా మాట్లాడటం విశేషం. బహుశః ఇక తను కూడా రాష్ట్ర విభజన ఆపలేనని గ్రహించినందునే ఆయన కొంచెం వెనక్కి తగ్గినట్లున్నారు. అదేవిధంగా ఇంతవరకు చాలా గట్టిగా సమైక్యవాదం వినిపించిన అనేకమంది మంత్రులు, శాసన సభ్యులు కూడా పూర్తిగా చల్లబడిపోయినట్లే ఉన్నారు. ఇక పరిస్థితి అంతా చల్లబడేవరకు కేంద్ర మంత్రులు,యంపీలు తమ రాజీనామా డ్రామాలు కొనసాగిస్తూనే ఉంటారని వేరే చెప్పనవసరం లేదు.   ఇక మిగిలింది ఉద్యోగులు. వారిని మానసికంగా దెబ్బ తీసి వారి ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు ఇప్పటికే చాలామంది మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన అన్ని విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒకసారి ఉద్యోగులు వెనక్కి తగ్గినట్లయితే ఇక రాష్ట్ర విభజన ప్రక్రియలో అందరూ తలో చేయివేసి త్వరగా పనికానిచ్చేయడం ఖాయం. ఎందుకంటే ఆ తరువాత రాజధాని నిర్మాణం కోసం బోలెడు కాంట్రాక్టు పనులుంటాయి మరి.

నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు

      ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ లబించింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు ఇవాళ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం సిబిఐ వీరి బెయిల్ పిటిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడు దర్యాప్తు పూర్తి అయినందున కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జగన్ కు సన్నిహితుడిగా పేరుపడి జగన్ కోసమే 20 నెలలుగా జైలులో ఉన్నట్లు పేరుపడ్డ నిందితుడు సునీల్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద ఈ రోజు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు. రూ.2 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిలు మంజూరయింది.

జీవితా రాజశేఖర్‌పై అరెస్ట్‌ వారెంట్‌

  సినిమాలతో పాటు రాజకీయభవిష్యత్తు కూడా సరిగా లేని జీవితా రాజశేఖర్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన సినిమా కోసం ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ దగ్గర అప్పు తీసుకొని అతని చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి జీవితా రాజశేఖర్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ అయింది.   చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రెండు సార్లుగా జీవితా రాజశేఖర్‌ విచారణకు హాజరు కాకపోవటంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిది : జేసి

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరిని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిదానిలా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అందువల్లే అధిష్టానం మొండిగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు పార్టీ వీడాలంటే చాలా బాధగా ఉందని కానీ అధిష్టానం మాత్రం పార్టీలో కొనసాగే పరిస్థితి కల్పించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితిల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడినా మరే ఇతర పార్టీలో చేరనని తేల్చి చెప్పారు.