హమ్మయ్య అప్పులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు ఊరట

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కు తోచక అల్లాడుతున్న తెలంగాణకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. బాండ్ల విక్రయాల ద్వారా నాలు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాభివృద్ధి రుణాలకు అనుమతిస్తూనే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధికి లోబడే రుణ సమీకరణ చేసుకోవాలని ఆర్బీఐ షరతు విధించింది. ఇలాంటి అనుమతులనే   ఏపీకి  మహారాష్ట్రకు   తమిళనాడుకు కూడా ఇచ్చింది. తెలంగాణకు 13ఏళ్ల కాలపరిమితితో రూ.4 వేల కోట్ల రుణాల సమీకరణకు ఆమోదం తెలిపింది. జూన్   7న ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల మధ్య బాండ్ల వేలం నిర్వహించి రూ.4 వేల కోట్ల నిధుల సమీకరణకు తెలంగాణకు ఆర్బీఐ షెడ్యూల్‌ జారీ చేసింది. ఏ రాష్ట్రమైనా తన జీఎస్‌డీపీలో 35శాతం మేర అప్పు తీసుకునేందుకు వీలుంది. ఆ మేరకు 42,728 కోట్ల అప్పులకు అవకాశం ఉంది. అయితే  అయితే వివిధ ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాలకు గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రూ.లక్షా 30 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం షరతు విధించింది. దీంతో 17 కార్పొరేషన్లకు చెందిన ఆదాయ వ్యయాలు, వాటి అప్పుల వివరాలను కేంద్రానికి తెలంగాణ సమర్పించింది. వీటి చెల్లింపులను రాష్ట్ర బడ్జెట్‌ నుంచే   నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిని రాష్ట్ర అప్పులగానే కేంద్రం పేర్కొని గడచిన రెండు నెలల రుణ సేకరణను ఆర్బీఐ నిలిపివేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సర్కార్‌ ముమ్మరంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రుణ సేకరణ, ప్రస్తుత అవసరాలు, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం, తెలంగాణ జీఎస్‌డీపీ వంటి   అంశాలను వెల్లడించడంతో  తెలంగాణ సర్కార్‌పై  రుణసమీకరణ  ఆంక్షలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో తెలంగాణ సర్కార్‌కు కొండంత ఊరట లభించినట్లైంది.

హిందూ ముస్లిం భాయ్ భాయ్.. మోహన్ భగవత్ నోట మత సామరస్యం మాట

ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలవుతాయి అన్నది నానుడి.  ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో కనిపిస్తున్న పరివర్తన లేదా మార్పు సరిగ్గా అలాంటిదేనని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒకప్పుడు హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, దేశంలో మత సామరస్యానికి భగం కలిగించేలా హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగాలూ, కార్యక్రమాలు చేస్తుంటారని భావించే వారు. కానీ తాజాగా మోహన్ భగవ్ మాటలు వింటే.. ఆర్ఎస్ఎస్   దేశంలో మత సామరస్యం కోరుకుంటోందనీ, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న నినాదాన్ని భుజానికెత్తుకుంటోందనీ అవగతమౌతుంది. ఆలస్యంగానైనా సరే జ్ణానోదయం అయితే మంచిదే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లోబాబ్రీమసీదు విషయంలో తమ ఆందోళన ప్రజాభీష్టం మేరకేనని చెబుతూనే.. దేశంలో అన్ని మసీదులనూ వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మసీదుల్లో జరిగేదీ ప్రార్థనేనని, శివలింగం కోసం మసీదుల్లో అన్వేషించడానికి ఆర్ఎస్ ఎస్ వ్యతిరేకమనీ అన్నారు. అయినా చరిత్రను మార్చడానికి మనమెవరం అని కూడా అన్నారు. గత ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో పెచ్చరిల్లిన విద్వేషభావం దేశంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్న సమయంలో బీజేపీకి సైద్ధాంతిక పునాది వంటి ఆర్ఎస్ఎస్ లో ఇటువంటి పరివర్తన కచ్చితంగా ఆహ్వానించదగ్గదే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులను తవ్వుదాం అంటూ చేసిన వ్యాఖ్యలను నేరుగా ఖండించకపోయినా..ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకాల్సిన అవసరమేమిటన్న మోహన్ భగవత్ ప్రశ్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే పరిగణించాల్సి ఉంటుంది. రాజకీయ పబ్బం కోసం పార్టీల నేతలు దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదన్న హెచ్చరికలాంటి సూచనా మోహన్ భగవత్ మాటల్లో ఉంది.  పక్కా రాజకీయం కోసం బీజేపీ వెంపర్లాడుతుంటే. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా విద్వేష పూరిత ప్రసంగాలతో రెచ్చిపోతున్న బండి సంజయ్ కు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివనడంలో సందేహం లేదు.   రాష్ట్రంలోని మసీదులన్నిటినీ తవ్వుదా.. శివలింగాలు మాకు, శవాలు దొరికితే మీకు అంటూ ముస్లింలను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలకు  మోహన్ భగవత్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది.   నాగపూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేరుగా బండి పేరును, బండి వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా జ్ణానవాపి మసీదు వివాదంపై స్పందిస్తూ దేశంలోని ప్రతి మసీదులోనూ శివలింగం కోసం వెతకాల్సిన పనేమిటని ప్రశ్నించారు. జ్ణానవాపి  మసీదు వివాదంలో విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై కోర్టు నిర్ణయానికే వదిలేయాలన్నారు. ఎక్కడో ఒక మసీదులో శివలింగం ఉందని అన్ని మసీదుల్లోనూ ఎందుకు వెతకాలి? దీని కోసం మరో ఉద్యమం చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ రెడీగా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించలేదని, ఆహ్వానించలేదనీ  జ్ణానవాపి మసీదులో శివలింగం లభ్యం కావడంపై మోహన్ భగవత్ అన్నారు. జ్ణానవాపి కోసం మరో ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్నారు. అయోధ్య విషయం వేరనీ, అక్కడ రామమందిరం ప్రజాభీష్టం కనుక అందుకోసం ఉద్యమించామన్నారు. జ్ణానవాపి మసీదు విషయంలో ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలూ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ అన్నారు.హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నదే తమ సిద్ధాంతమంటూ.. నేటి ముస్లింల పూర్వీకులు హిందువులేననీ, మసీదుల్లో జరిగేవి కూడా ప్రార్ధనలేని మోహన్ భగవత్ అన్నారు.

యుద్ధానికి వందరోజులు మిగిలింది విషాదమే ...

ఏ రెండు దేశాల మధ్య జరిగినా యుద్ధం మిగిల్చేది విషాదం,విద్వంసమే... వందరోజులకు చేరుకున్న ‘రష్యా - ఉక్రెయిన్‌’ యుద్ధం ఇందుకు మినహాయింపు కాదు. ఈ వందరోజుల్లో ఎన్నెన్ని ప్రాణాలు గాలిలో  కలిసిపోయాయో... ఎన్నెన్ని సంసారాలు చితికిపోయాయో లెక్కలేదు. ఎంత మంది చిన్నారులు అనాధలయ్యారో, ఎందరు తల్లులు కానన్ బిడ్డలను కోల్పోయి కడుపు కోతను అనుభవిస్తున్నారో .. తెలియదు. మనిషితనం మరిచి పోయిన యుద్ద పిపాస వందల వేల మంది పాలిట మరణ శాసనమైంది.  పొరుగు దేశం ఉక్రెయిన్‌’పై రష్యా ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శిస్తోందా, అత్మరక్షణ కోసమే రష్యా ఉక్రెయిన్‌ పై బాంబుల వాన కురిపిస్తోందా, ఉక్రెయిన్‌’ అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్నతెరచాటుయుద్ధానికి బలైపోతోందా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ దురహంకార, దుర్మార్గ దండయాత్రకు బలైపోతోంది మాత్రం, అమాయక ప్రజలు, సైనికులే . యుద్ధం వందో రోజుకు చేరుకుంది. అయినా ఇంకా, ఉక్రెయిన్‌’ పై  బాంబుల దాడి కొనసాగుతూనే వుంది.. భవనాలు పేకమేడల్లా కూలుపోతున్నాయి. నగరాలు, పట్టణాలు ఎక్కడంటే అక్కడ వీదుల్లో శవాలే పలకరిస్తున్నాయి. బతికుంటే చాలని సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని వలసలు పోతున్నారు. ఇంత విధ్వసం జరుగుతున్నా అంతర్జాతీయ సమాజం గుడ్లప్పగించి చూడడమే కానీ, ఏమీ చేయలేక పోతోంది. రష్యా మీద ఆంక్షలు విధించినా, అవేవి పనిచేయడం లేదు. మరో వంక ‘రష్యా - ఉక్రెయిన్‌’ యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, అదే విధంగా మన దేశం సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, యుద్ధం ప్రభావం రోజురోజుకు బలపడుతోంది.  అదలా ఉంటే యుద్ధం మిగిల్చిన విషాదం ఎంతన్న దానికి లెక్కలు లేవు.  యుద్ధంలో ఎంత మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నది ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కానీ, కనీసం 10వేల మంది తమ దేశ పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రోజుకు 60 నుంచి 100 మంది ఉక్రెయిన్‌ సైనికులు అమరులవుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఒక్క మేరియుపోల్‌లోనే 21వేల మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెప్పడం గమనార్హం. నిజానికి, అక్కడి పరిస్థితికి సంబంధించి అందుతున్న అరకొర సమాచారం ఆధారంగా చూసినా, మృతుల సంఖ్య వేలు దాటి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దాడిని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్’ లోనే కాదు, తగ్గేదేలే అన్నతీరున దాడి కొనసాగిస్తున్న రష్యా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. అయితే  ఉక్రెయిన్’లోలానే రష్యాలో ఎంత ప్రాణ నష్టం జరిగిందన్నది కూడా ప్రపంచానికి తెలియరాలేదు. 30వేల మందికి పైగా క్రెమ్లిన్‌ సైనికులు మరణించి ఉంటారని జెలెన్‌స్కీ తెలిపారు.కానీ రష్యా మాత్రం ఇప్పటివరకు 1351 మంది జవాన్లు మృతిచెందారని మార్చి 25న ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత ఏమి జరిగింది ఎంతమంది చనిపోయారు అనేదానికి సంబంధించి అధికార, అనధికార సమాచారం  ఏదీ అందుబాటులో లేదు.  ఇక ఉక్రెయిన్’లో జరిగిన ఆస్థి నష్టం విషయానికి వస్తే రష్యా సేనల బాంబు దాడుల కారణంగా దాదాపు 38వేల నివాస భవనాలు నేలమట్టమైనట్లు ఉక్రెయిన్‌ పార్లమెంటరీ కమిషన్‌ వెల్లడించింది. దీంతో 2.20లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని తెలిపింది.దాదాపు 1900 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. ఇందులో 180 నామరూపాల్లేకుండాపోయాయి. 50 రైలు వంతెనలు, 500 ఫ్యాక్టరీలు, 500 ఆసుపత్రులు నాశనమయ్యాయి.మరోవంక, ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 68లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు ఐరాస శరణార్థలు సంస్థ అంచనా వేసింది. అయితే ఆ తర్వాత కీవ్‌ సహా కొన్ని ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు సద్దుమణగడంతో 22లక్షల మంది తిరిగి స్వదేశానికి వచ్చారని తెలుస్తోంది. ఆలాగే ఈ  వందరోజుల యుద్ధంలో 20శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా ఆక్రమించుకుందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే  ప్రకటించారు.  యుద్ధాన్ని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఇప్పటివరకు ఆ దేశంపై 5వేల ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంపైనా ఇన్ని ఆంక్షలు అమల్లో లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల రష్యా బంగారం, విదేశీ మారక నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. ఫలితంగా రష్యాలో 1000కి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించడం చేశాయి.రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఆర్థికంగా భారీగా నష్టపోయింది. ఇప్పటివరకు యుద్ధం కారణంగా జీడీపీలో 35శాతం కోల్పోయింది. మొత్తం నష్టం 600 బిలియన్‌ డాలర్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇలా ఏ కోణం నుంచి చూసినా, యుద్ధం అనర్దాన్నే మిగిల్చింది. అయినా, ఫిబ్రవరి 24 సైనిక చర్యగా మొదలైన యుద్ధం, ముగింపు ఎప్పుడో, ఇంకెంత దూరంలో వుందో తెలియకుండా కొనసాగుతూనే వుంది.

జగనన్నకు బుగ్గన దెబ్బ.. నరం లేని నాలుక కదా?!

పూర్వం గురుద‌క్షిణగా పండు తాంబూలం గురువుగారికి శిష్యుడు ఇచ్చుకునేవాడు. గెలిచిన ప‌త‌కంతో త‌న గురువుకు తిరిగి చిన్న‌పాటి స‌న్మానం చేయ‌డం క్రీడాకారుడి ప‌ని. ఏలిక‌వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డా నికి  పూల‌గుత్తితో  పాటు చిత్ర‌ప‌టాలు ఇవ్వ‌డం రాజ‌కీయనాయకు ల‌కు ప‌రిపాటి.  ఎంతైనా నాడు చంద్రబాబు చేసింది తప్పైనప్పుడు ఇప్పుడు జగన్ చేస్తున్నది రైటౌతుందా? శాలువాల లెక్కలు చెప్పమనడం సమంజసమేనా. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ ఒక‌సారి త‌ప్పు అయిన‌ది మ‌రోసారి ఒప్పు ఎలాగ‌వుతుందో ఆంధ్ర ప్ర‌దేశ్ ఆర్ధిక‌మంత్రి  బుగ్గ‌న గారు సెల‌వియ్యాలి. అవును.  కేంద్ర‌ ప్ర‌భుత్వం నుంచి  రాష్ట్రానికి రావ‌ల‌సినవ‌న్నీ రాబ‌ట్టుకోవ‌డానికి ఢిల్లీ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూనే వున్నారు. ఎప్ప‌డు వెళ్లి వ‌చ్చినా వివ‌రాలు గోప్యం గానే వుంచు తున్నారు స‌రే.  ఇక్క‌డ మ‌రో ముచ్చ‌ట త‌మ నాయ‌కుడు మొన్న ఢిల్లీ వ‌చ్చిన  వివ రాలు ఏవీ  చెప్ప‌లేద‌ని ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు ఆ్ర‌గ‌హిస్తున్నాయ‌ని తేట‌తెల్ల‌మ‌యింది.  త‌మ నాయ‌కుని వైఫ‌ల్యంతో తెగ మ‌ధన‌ప‌డుతుండ వ‌చ్చు గాక‌. కానీ నాడు బాబు దుస్సాలువలు కప్పడం, తిరుమల లడ్డు ఇవ్వడాన్ని తప్పుపట్టిన బుగ్గన ఇప్పుడెందుకు జగన్ అదే పని చేస్తే మాట్లాడటంలేదు. తమ నాయకుడు ఏం చేసినా రైటేనని ఆయన భావిస్తున్నారా?ఢిల్లీకి ప్ర‌ధాని ద‌ర్శ‌నానికి వెళ్లిన నాయ‌కులంతా తిరుమ‌లేశుని ప్ర‌తిమ‌లు, మంచి డిజైన్ శాలువ‌లు ప‌ట్టుకెళ్ల‌డం, వాటిని అందించి వారిని  ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం ఆన‌వాయితీగానే వ‌స్తోంది. ఇందులో ఏముంద‌ని అనుకోవ‌ద్దు. ఇక్క‌డే అస‌లు గొడ‌వ‌.  గ‌తంలో చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వ హ‌యాంలో  ప్ర‌ధానిని క‌లిసిన‌పుడ‌ల్లా  వెంక‌టేశుని ప్ర‌తిమ, దుశ్శాలువ‌ తీసుకెళ్లేవారు. అప్పుడంతా న‌చ్చ‌ని బుగ్గనకు ఇప్పడు జగన్ పర్యటనల్లో అదే చేస్తుంటే   ఎలా న‌చ్చుతోంది.        మ‌తి మ‌రుపున‌కు కొంత ప‌రిమితి అంటూ వుండాలి! బుగ్గ‌న మ‌తిమ‌రుపున‌కు ప‌రాకాష్ట ఆయ‌న అప్పటి  నోటి దూలే సాక్ష్యం.  ప్ర‌ధాని కార్యాల‌యంలో శాలువ‌లు గుట్ట‌గా పేరుకుపోయాయి. వారిని అలా శాంత ప‌ర్చ‌డం త‌ప్ప రాష్ట్రానికి చేసుకొచ్చిందేమీ లేద‌న్నారు.  జ‌గ‌న్ రెడ్డి నిజానికి ఢిల్లీ అనేక‌ ప‌ర్యాయాలు  వెళ్లి వ‌స్తున్నారు.  చంద్ర‌బాబు కంటే ఈయ‌న ప్ర‌యాణాల సంఖ్యా, ఖర్చూ ఎక్కువ అనేది అంద‌రికీ తెలిసిన సంగ‌తి. వెళ్లిన‌పుడ‌ల్లా జగన్ చంద్రబాబు పాటించిన  సంప్ర‌దాయాన్నే అనుస‌రిస్తున్నారుగ‌దా!   ఇపుడు త‌ప్పు కాలేదా? లేక జగన్మాయలో పడి బుగ్గనకు కనపడటం లేదా? అప్ప‌టి ముఖ్య‌మంత్రి పర్యటనలపై ఎన్నిసార్లు వెళ్లినా వొట్టి చేతుల‌తో తిరిగి వ‌చ్చార‌ని కామెంట్లు చేసిన‌వారంతా మ‌రి ఇపుడు జ‌గ‌న్ ఢిల్లీ ప్ర‌యాణాల ప్ర‌యోజ‌నం గురించి నోరెత్త‌రేమి?ప‌రిస్థితులు, కాలంతో పాటు అన్నీ మ‌ర్చిపోతానంటే ఎలా?  బుగ్గ‌న‌కు గుర్తులేకున్నా ప్ర‌జ‌ల‌కు బాగా గుర్తుంది. ఒక‌ప్పుడు త‌ప్ప‌న్న‌ది ఇప్పుడు ఒప్పు ఎలా  అవుతుందో   బుగ్గ‌న‌వారే సెల‌వియ్యాలి.

విషాదం మిగిల్చిన విహార యాత్ర.. ఎనిమిది మంది హైదరాబాదీయులు మృతి

సరదాగా వేసవి సెలవులు ఎంజాయి చేయడానికి వెళ్లిన రెండు కుటుంబాలలో పెను విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి గోవాకు ఒక ప్రైవేటు ట్రావెల్స బస్సు మాట్లాడుకుని రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆనందంగా ఉత్సాహంగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో విహార యాత్ర కాస్తా విషాదంగా మారిపోయింది. తిరుగు ప్రయాణంలో కర్నాటకలోని కలబురిగి వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మినీ  లారీని ఢీకొని కల్వర్టులో పడిపోయింది. వెంటనే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 12 మంది అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.  

హమ్మయ్య అమలాపురానికి ఇంటర్నెట్ మళ్లీ వచ్చేసింది!

హమయ్య కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో దాదాపు పది రోజుల తరువాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. జిల్లా పేరు మార్పు వ్యవహారంతో కోనసీమలో కాక పుట్టింది. పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళన కారుల ఉద్యమం గత నెల 24న ఒక్క సారిగా అదుపు తప్పింది. మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాన్ని ఆందోళన కారులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే సతీష్ నివాసాన్ని ధ్వంసం చేశారు. అమలాపురం పట్టణంలో విధ్వంస కాండ వెనుక అధికార వైసీపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అల్లర్ల వెనుక తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రమేయం ఉందని అధికార పార్టీ ఆరోపణలు గుప్పించినప్పటికీ ఈ అల్లర్ల కేసులకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీకి చెందిన వారే కావడంతో అధికార పార్టీ ఆరోపణలను ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. పైగా 144వ సెక్షన్ అమలులో ఉన్నా వేల మంది రోడ్లపై స్వైర విహారం చేస్తూ ఏకంగా మంత్రి ఇంటిని దగ్ధం చేసి, ఎమ్మెల్యే నివాసాన్ని ధ్వంసం చేశారంటే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అల్లర్లు ఆపడంలో పూర్తిగా విఫలమైన పోలీసులు, జిల్లా యంత్రాంగం.. ఇంటర్నెట్ సేవలను ఆపడంలో  మాత్రం మహా ఉత్సాహం చూపారు. అల్లర్లు అదుపులోనికి వచ్చిన తరువాత కూడా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించకుండా రోజుల తరబడి బ్యాన్ ను కొనసాగించి జనాలను ఇబ్బంది పెట్టారు, పెడుతున్నారు. పది రోజుల తరువాత కూడా ఇంకా జిల్లాలోని ఎనిమిది మండలాలకు అంతర్జాల సేవలు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కోనసీమలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అల్లర్లకు సంబంధించి 91 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అల్లర్లకు వెనుకా ముందూ ఎవరెవరున్నారన్నది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నా కోనసీమ వాసులందరికీ అర్ధమైపోయింది. కానీ పోలీసులకు మాత్రం ఇంకా అల్లర్లు జరుగుతాయన్న సమాచారమే అందుతోంది. అందుకే అల్లర్ల సమాచార వ్యాప్తి నిరోధం అంటూ రోజులకు రోజులు అంతర్జాలం జనాలకు అందకుండా ఆపుతున్నారు. వాస్తవానికి కాశ్మీర్ లో కూడా ఇన్నేసి రోజులు ఇంటర్నెట్ ను ఎప్పడూ నిలిపివేయలేదని పరిశీలకులు అంటున్నారు. అల్లర్ల నిరోధంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కోనసీమలో ఉద్రిక్తతలు చల్లారలేదు. అంతర్జాలాన్ని ఆపేసి అల్లర్లు మరింతగా వ్యాపించకుండా నిరోధించగలిగామని చెప్పుకోవడానికి.. ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా నిరవధికంగా అంతర్జాల సేవలు అందుబాటులో లేకుండా చేస్తున్నారని కోనసీమ వాసులు విమర్శిస్తున్నారు. 

ఏలిక మ‌న‌సంతా అదానీ మ‌యం!

అభిమానం వుండొచ్చు, స్నేహం వుండొచ్చు మ‌రీ మ‌నోడేన‌ని అన్ని వ‌స‌తులూ క‌ల్పించ‌డం, దోపిడీకి వీలు క‌ల్పించ‌డం అసాధ్యం. కానీ శ్రీ‌యుతులు జ‌గ‌న్ మొహ‌న్ రెడ్డి విష‌యంలో సుసాధ్య‌మే. ఎందుకంటే ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, ఆయ‌నకు కావ‌ల‌సిన‌వాడు అదానీ కావ‌డ‌మే! ఈమ‌ధ్య వైసీపీవ‌ర్గాలు అదానీ భ‌జ‌న కూడా చేస్తుండ‌ట‌మే అందుకు సాక్ష్యం! ఏకంగా ర‌హ‌స్య జీవో ద్వారా విశాఖ‌లో తొమ్మిది ఎక‌రాలు క‌ట్ట‌బెట్టేశార‌న్న‌ది బాగా ప్ర‌చారంలో వుంది. అదెంత‌వ‌ర‌కూ నిజం, అలా చేయ‌గ‌ల‌డా.. వంటి సందేహాలు వుండ‌గానే ఏటా దాదాపు నాలుగున్న‌ర వేల కోట్ల విలువైన బొగ్గు స‌ర‌ఫ‌రా కాంట్రాక్ట్ అదానీకి ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.  ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌లు, బిజి నెస్ వ్య‌వ‌హారీకులు ఒక్క‌సారి గిల్లుకుని ఔను ఇది నిజ‌మేన‌ని న‌మ్మారు. దారుణం జ‌రిగింద‌నీ అంటున్నారు. కార‌ణం అందుకు సంబంధించిన టెండ‌ర్ల వ్య‌వ‌హార‌మంతా గోల్ మాల్ గంద‌ర‌గోళం కావడమే. దేశంలో బొగ్గు కొర‌త వుంద‌ని, విదేశీ బొగ్గు కొనుగోలు త‌ప్ప‌నిస‌రి ప్ర‌భుత్వం తేల్చింది.  దీనికి సంబం ధించి టెండ‌ర్లు ఆహ్వానించింది.  కానీ జ‌రిగిందేమిటి?  జ‌గ‌న్ అభిమాని అదానీ, చెట్టినాడు సంస్థ‌లే  టెం డ‌ర్లు సాధించుకున్నాయి. అదానీ 18 ల‌క్ష‌ల ట‌న్నులు, చెట్టినాడు సంస్థ 13 ల‌క్ష‌ల ట‌న్నులూ స‌ర‌ఫ‌రా చేయాలి. వారికి అదేమంత పెద్ద ప‌నిగాక‌పోవ‌చ్చు. కానీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేదేమంటే  అదానీ స‌ర‌ఫ‌రా చేసే బొగ్గుకి ట‌న్నుకి రూ.24,500 ఖ‌రారు చేయ‌డం. ఏపీ జెన్‌కో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా చేసే చెట్టినాడువారికి ట‌న్ను రూ.19,500 ఖ‌రారు చేయ‌డం.  జ‌రిగిన‌దేమంటే, అదానీ వాస్త‌వానికి ట‌న్నుకి రూ.29,500  కోట్ చేస్తే అది రివ‌ర్స్ టెండ‌ర్ల‌లో  ట‌న్నుకు రూ.24,500 అయింది.  అదే చెట్టినాడు సంస్థ‌కి ట‌న్నుకి రూ.19,500 ఖ‌రార‌యింది. అంటే ట‌న్నుకి రూ.5000 చొప్పున అదానీకి ల‌బ్ధిచేకూరేలా స్నేహ పూర్వ‌క ఒప్పందాలు జ‌రిగాయా?  ఔను అంతా జగన్మాయ!  ఎంత‌యినా ఏలిక‌వారి తెలివే తెలివి.   అస‌లీ టెండ‌రు ప్రక్రియే విచిత్రం. ముందుగా ఎక్కువ కోట్ చేసిన సంస్థే త‌ర్వాత  కొంత త‌గ్గిస్తుంది. పైగా చాలా ఆదా చేశామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌చారంతో మ‌ద్ద‌తుదారుల‌ను, అభిమానుల‌ను ఆక‌ట్టుకోవ‌డం జ‌రిగిపోతుంది. మ‌రో చిత్రం ఏమంటే..ప్ర‌తీ టెండ‌ర్‌కు  న్యాయ‌స‌మీక్ష చేస్తామ‌ని ప్ర‌భుత్వం  చెబుతూం డ‌డం. ఇవ‌న్నీ చాలా మామూలుగానే జ‌రిగిపోతుంటాయి. కానీ కావ‌ల‌సివారికి మార్గాలు సుగ‌మ‌మం చేయ‌డం తెర‌ వెనుక కార్య‌క్ర‌మం.  అస‌లు సంగ‌తేమిటంటే టెండ‌రు విలువ రూ.100 కోట్ల‌కు మించితే న్యాయ స‌మీక్ష‌కుపంపాల‌న్న నిబంధ‌న తుంగ‌లో తొక్క‌డం జగన్ ప్ర‌భుత్వంవారి వ‌ల్లే అయింది.   కృష్ణపట్నం అయినా.. ఏపీ జెన్ కో అయినా .. ఎంత ఎక్కువ ధర పెట్టి బొగ్గు కొంటే.. అంత ఎక్కు వగా భారం పడేది ప్రజలపైనే.  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు,  ఓవ‌ర్‌యాక్ష‌న్‌లు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి,  ఎవ‌రినీ  నోరెత్త‌కుండా చేయ‌డానికి వివిధ చార్జీల రూపంలో ప్రజల నుంచే వసూలు చేస్తారు.  ఎందుకంటే ఓట్లు వేసి మ‌రీ అధికారం అప్ప‌గించిన కూన‌లు కదా!  వారు ఆ మాత్రం క‌ష్టం కూడా భ‌రించాలి అన్న‌ది  ప్ర‌భుత్వ భావన.   అదానీని క‌ష్ట‌పెట్ట‌డం జ‌గ‌న్‌కి ఇష్టంలేక‌పోవ‌చ్చు,  వేరే రాష్టీయుడు కావ‌డంతో. ఆ మాత్రం గౌర‌వం, ప్రేమా ప్ర‌క‌టించాలి క‌దా.  పైగా,  జ‌గ‌న్‌కి అదానీ ప‌ట్ల అతి ప్రేమ ప్ర‌క‌టించుకోవాల్సిన అవ‌స‌రం బ‌హుత్ హై. కార‌ణం అదానీలు, ముఖేష్‌లు  ప్ర‌ధాని మోడీగారి ఇష్టులు. పైగా గుజ‌రాతీయులూను. మ‌రి వారి ప‌ట్ల  సోద‌ర సాన్నిహిత్యం వుండ‌నే వుంటుంది. ఈ ర‌హ‌స్యం ఇట్టే గ‌మ‌నించ‌క‌పోలేదు ఏపీ  ముఖ్య‌మంత్రి. ఏది ఏమ‌యినా, ఇప్ప‌డు త‌న స్వ‌విష‌యంలోగాని, రాష్ట్ర అవ‌స‌రాల‌కోస‌మూ ప్ర‌ధాని ని  సానుకూలం చేసుకోవ‌డం అత్యంత అవ‌స‌రం. అది జ‌గ‌న్ ఒక్క‌డివ‌ల్ల సాధ్య‌ప‌డే సంగ‌తి కాదు.  ఇప్పుడీ  బొగ్గు టెండ‌ర్ల‌లో అదానీకి  హెల్ప్ చేస్తే మ‌నోడు  ఢిల్లీలో పెద్దాయ‌న చెవిలో పోనీద్దురూ ఆయ‌నా మ‌నోడే అని  చెప్పి కాగ‌ల‌కార్యం కానిచ్చ‌వ‌చ్చ‌ని జ‌గ‌న్‌రెడ్డి మ‌న‌సులో వుండ‌వ‌చ్చు. ఎంత‌యినా గుజ‌రాతీయులు ప్రాంతీయాభిమానం వుండ‌నే వుంటుంది. ఇటు జ‌గ‌న్ అవ‌స‌ర‌మూ పెద్దాయ‌న‌కి ఉండ‌కా పోలేదు.  అన్ని విధాలా ఈ ఆలోచ‌న‌, స‌మ‌యం క‌లిసి వ‌చ్చిన‌యి అని ఏపీ ముఖ్య‌మంత్రి అనుకోనూ వ‌చ్చు.  ఎంత‌యినా  బిజినెస్ మైండ్‌!  అలా  జ‌గ‌న్ అదానీకి మ‌రింత ద‌గ్గ‌ర‌కావ‌డం అవ‌స‌రం. ఇక్క‌డి  జ‌నాలు జ‌గ‌న్‌కి కేవ‌లం ఓట‌ర్లు. ఏద‌యినా స‌హిస్తార‌న్న ధీమా!  ఇది భ‌రించ‌డం బ‌హు క‌ష్ట్ హై!  అనుకోవ‌డ‌మే కాదు, ఇది ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌స మ‌ని గొంతువిచ్చే వారికోసం ఎదురుచూడాలి.. చూద్దాం!.

అమిత్ షా రాజీనామాకు డిమాండ్ .. చేసింది ఎవరో తెలుసా ?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నో ..రాహుల్ గాంధీ కాదు. మమతా బెనర్జీ, కేసీఆర్ కూడా కాదు. ఆ డిమాండ్ చేసింది, ఇంకెవరో కాదు, సాక్షాత్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుభ్రమణ్య స్వామి. నిజమే, గత కొంత కాలంగా స్వామి, బీజేపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. త్వరలో ఆయన రాజ్యసభ సభ్యత్వ గడవు ముగుస్తోంది. మరోమారు పార్టీ తమను నామినేట్ చేస్తుందని ఆయన ఆశించారో ఏమో కానీ, 80 ప్లస్ వయసున్న స్వామికి మరో అవకాశం ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం నో.. అనేసింది. నిజమే, స్వామికి నో ..చెప్పడానికి ఆయన వయసు ఒక కారణం అయితే కావచ్చును కానీ, అదొక్కటే  కారణం కాదు, ఆయనకు మోడీ, షా జోడీతో సత్సంబంధాలు లేక పోవడమే అసలు కారణం. నిజానికి, ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాల కంటే, స్వామి కొంచెం ఎక్కువ ఘాటుగా విమర్శించిన సందర్భాలున్నాయి. ఇలా,స్వామికి మళ్ళీ టికెట్ రాకపోవడానికి కర్ణుడి చావుకు ఉన్నని కారణాలు ఉన్నాయి. అలాగే  స్వామి బీజేపీ నాయకత్వం పై గుర్రుగా ఉండడానికి కూడా అంతకు రెట్టింపు  కారణాలు ఉంటె ఉండవచ్చును.  అయితే ఇప్పుడు సుబ్రమణ్య స్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా డిమాండ్ చేయాడానికి, ఇదే కారణంమా అంటే, కావచ్చును కాకపోవచ్చును, అనే మాటే పార్టీ  వర్గాలో వినిపిస్తోంది. అయితే, కశ్మీర్‌ లోయలో కశ్మీర్ పండిట్లు, ఇతర ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు సాగిస్తున్న వరుస హత్యల నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి, ప్రతిపక్షాలతో గొంతు కలిపారు. కేంద్ర హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌ ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటుగా, ఆయన హోంమంత్రిగా  పనికిరారని అర్ధం వచ్చేలా ఆయనకు క్రీడాశాఖ అయితే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో సంవత్సర కాలానికి పైగా రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది,అయినా గత కొంత కాలంగా .అక్కడ వరసగా కశ్మీరీ హిందువులు హత్యలకు గురవుతున్నారు. హిందువులలో 1990 నాటి పరిస్థితులు పునరావృతం అవుతయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 'ద కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాను తలపించేలా కశ్మీర్‌లో హిందువులు, కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి.గత నెల రోజుల్లో ఉగ్రవాదులు ఎనిమిది మందిని కిరాతకంగా హత్య చేశారు.   రెండురోజుల క్రితం కశ్మీర్‌ ప్రాంతంలోని కుల్గామ్‌ జిల్లా గోపాల్‌ పొరాలో రజనీ బాల అనే ఉపాధ్యాయురాలిని బలితీసుకున్న ముష్కురులు.. గురువారం ఓ బ్యాంకు మేనేజర్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపధ్యంలోనే, అమిత్ షా రాజీనామాకు డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడిందని స్వామి పేర్కొన్నారు. ఆయనకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.  బహుశా, ఇటీవల గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ 2022 ఫైనల్ మ్యాచ్ ని హోంమంత్రి కుటుంబ సమేతంగా చూసిన విషయాన్ని గుర్తు చేస్తూ స్వామి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చును.  నిజానికి, ఈ టోర్నీ పై అమిత్ షాను టార్గెట్ చేస్తూ స్వామి గతంలో కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టీ 20 మెగా టోర్నీ ఫలితాల్లో రిగ్గింగ్‌ (మ్యాచ్‌ ఫిక్సింగ్‌) జరిగినట్లు నిఘా సంస్థల్లో అనుమానాలున్నాయి.వీటిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలనుకుంటున్నా. ఎందుకంటే భారత క్రికెట్‌ బోర్డుకు అమిత్ షా కుమారుడు ‘నియంత’గా ఉన్నందున ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదు అని స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, రాజ్యసభ టిక్కెట్ రానందుకే, స్వామి, అమిత్ షాను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అదెలా ఉన్నా కశ్మీర్’లో పరిస్థితి అదుపు తప్పుతొందనేది నిజం. అందుకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం మంత్రి బాధ్యత వహించాలని కోరడంలో తప్పులేదు. ఇందులో మరో  అభిప్రాయానికి తావూ లేదు.

రాహుల్ కు మళ్లీ ఈడీ సమన్లు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు పంపింది. ముందుగా పంపిన సమన్ల ప్రకారం రాహుల్ గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈడీ ఎదుట హాజరు కాలేదు. హాజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని రాహుల్ కోరారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఈడీ పేర్కొంది. అయితే శుక్రవారం మరోసారి రాహుల్ కు ఈడీ సమన్లు పంపించింది. ఈ సారి ఈనెల 13న ఈడీ విచారణకు రావాలని ఆ సమన్లలో పేర్కొంది. ఇలస్ట్రేటెడ్ విక్లీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ సీనియర్ నాయకుడు అయిన రాహుల్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ సమన్ల మేరకు సోనియాగాంధీ ఈనెల 8న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా, ఆమె కరోనా బారిన పడ్డారు. అప్పటికి కోలుకుంటే సోనియాగాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరౌతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఇంతకీ ఇలస్ట్రేటడ్ వీక్లీ కేసు ఏమిటంటే.. రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఎజెఎల్ అనే కంపెనీని రాహుల్ కొనుగోలు చేశారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుతో ఇలస్ట్రేటెడ్ వీక్లీ మనీలాండరింగ్ వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఎ) కింద సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు ఈఢీ పేర్కొంది. ఈ మేరకు వారికి సమన్లు పంపింది.  కాగా రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ వేధిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో వానలు అప్పుడే కాదు..!

మండే ఎండలు తెలుగు రాష్ట్రాలను అప్పుడే వదిలేటట్టు లేవు. కేరళలోకి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రవేశించినా అవి తెలుడగు రాష్ట్రాలలోకి విస్తరించడానికి మాత్రం జాప్యం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ హీట్ ప్రభావమో ఏమో కానీ రుతుపవనాల రాకకోసం తెలుగు రాష్ట్రాలు మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పేట్టు లేదు.  తెలుగు రాష్ట్రాలలో వర్షాలకు మరో  వారం రోజులకు పైగానే రోజులు వేచి చూడాల్సిందేనని భారత వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటి వరకూ ఎండల తీవ్రత ఉంటుందని పేర్కొంది.  రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని  అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా మేరకు తెలుగురాష్ట్రాలలో జూన్ రెండో వారం వరకూ వర్షాలు కురిసే అవకాశం లేదు. అప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రతాపానికి అల్లాడాల్సిందే. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉంటాయి.  ఎండకు తోడు ఉక్కపోత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతుండగా అధికారులు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ 8 నాటికి తెలుగు రాష్ట్రాలను పలకరించే అవకాశం ఉందని పేర్కొంది.

తెరాస నేతల్లో అంతర్మథనం?

తెలంగాణ రాజకీయాల్లో కాదేది స్పెక్యులేషన్’ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదిగో తోక అంటే అదిగో పాము అన్నట్లుగా రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటో ఆరో నిజం అయినా, చాలా వరకు గాలి కబుర్లుగానే మిగిలి పోతున్నాయి.  సరే, అదలా ఉంటే తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు, తన పుట్టినరోజు జూన్ 4) సందర్భంగా ఒక రోజు ముందు గురువారం తిరుపతి వెళ్లారు. అక్కడినుంచి  అలిపిరి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు హరీశ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందులో రాజకీయ వాసనలు ఏమీ లేవు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలోనూ ఆయన రాజకీయాలు మాట్లాడలేదు.  తన పుట్టిన రోజును పురస్కరించుకుని తనపై ఉన్న ప్రేమను ప్రజ‌లకు ఉప‌యో‌గ‌పడే సేవా కార్యక్రమాల ద్వారా చాటా‌లని అభి‌మా‌నులు, కార్యక‌ర్తలకు హరీశ్ రావు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడా‌నికి, ఆశీ‌ర్వదించ‌డా‌నికి వస్తా‌మంటూ ఫోన్లు చేస్తు‌న్నవా‌రిని నిరాశ పరు‌స్తు‌న్నం‌దుకు మన్నించా‌లని ట్వీట్‌ చేశారు. అభి‌మా‌నుల ఆద‌రా‌భి‌మా‌నాలు, ప్రేమను తన గుండెల్లో పెట్టు‌కుంటా‌నని పేర్కొ‌న్నారు. నిజానికి ఆయన ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం తమ పుట్టిన రోజు శ్రీవారి సన్నిధిలోనే జరుపుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా.. కానీ, హరీష్ రావు తిరుమల యాత్ర విషయంలో సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ కథనాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కీలక రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో, హరీష్ రావు తమ రాజకీయ భవిష్యత్’కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని, ఈనేపధ్యంలోనే హరీష్ రావు స్వామి వారి అశీస్సులు తీసుకునేదుకు తిరుమల వెళ్ళారని అంటున్నారు.  అయితే నిజం ఏమంటే గత కొన్నాళ్లుగా ప్రతి ఏడాది తన పుట్టిన రోజుకు  హరీశ్ రావు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.అదే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించిన హరీశ్.. ఈసారి స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిజానికి అందులోనూ విశేషం లేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి విజయం సాధించిన అనంతరం కూడా హరీశ్ రావు తిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.ఆ సమయంలో కేసీఆర్ సతీమణి శోభ సైతం తిరుమల వెళ్లారు. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా హరీశ్ రావు తిరుమల వెళ్లారు. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు తెలంగాణ మంత్రులు చాలా మంది ఏదో ఒక సందర్భంలో తిరుమల వెళుతూనే ఉన్నారు, స్వామి వారిని దర్శించుకుంటూనే ఉన్నారు. నిజానికి, కొద్ది నెలల క్రితం ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె, కవిత తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఆమె కూడా అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకనే కొండకు చేరుకున్నారు.మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ, ప్రభుత్వ పగ్గాలు కుమారుడు కేటీఆర్’ కు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో హరీష్ రావుతో పాటుగా మరికొందరు సీనియర్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్’ విషయంలో ఆందోళన చెందుతున్నారని పార్టీ వర్గాలలోనూ వినిపిస్తోంది. హరీష్ తిరుమల వెళ్ళింది అందుకు కాకపోయినా, అధికార  తెరాస నాయకుల్లో  అంతర్మథనంజరుగుతొందనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు. అదలా ఉంటే రాజకీయ పరిశీలకులు మాత్రం నిప్పులేనిదే పొగరాదు కదా అంటూ ముక్తాయింపు ఇస్తున్నారు.

ఆత్మకూరులో మేకపాటి ప్రత్యర్థి భరత్ కుమార్ యాదవ్.. డిపాజిట్ అయినా దక్కేనా?

బీజేపీ ముందు నుంచీ చెబుతున్నట్లుగానే ఆత్మకూరులో అభ్యర్థిని పోటీలో నిలబెట్టి  అధికార వైసీపీ నెత్తిన పాలు పోసింది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ను రంగంలోనికి దింపింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబీకులకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఆనవాయితీని పాటించి తెలుగుదేశం పార్టీ  పోటీకి దూరంగా ఉంది. అయితే రాష్ట్రంలో ఏ మాత్రం పొలిటికల్ స్టేక్ లేని బీజేపీ తగుదునమ్మా అంటూ ఆనవాయితీని తోసి రాజని అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఇక్కడ పోటీ అనివార్యం అయ్యింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ కూడా వైసీపీ ఆత్మకూరులో పోటీ జరగాలని ఆశిస్తూ వచ్చింది. ఎందుకంటే బలమైన తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో పోటీ అంటూ జరిగితే వైసీపీ విజయం నల్లేరు మీద బండినడకే, అయితే మెజారిటీ విషయంలో కొత్త రికార్డులు సృష్టించుకుని.. జనంలో తమ పార్టీకీ, ప్రభుత్వానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరిగిందని చెప్పుకునే వీలుంటుంది. అలాంటి వీలును అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ వైసీపీకి ఇచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టడానికి బీజేపీ నానా యాతనలూ పడాల్సి వచ్చింది. పార్టీ తరఫున అభ్యర్థే దొరకక మల్లగుల్లాలు  తొలుత బిజవేముల రవీంద్రరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దింపాలని భావించినా, పోటీ అనే సరికి ఆయన మొహం చాటేశారు. దీంతో పోటీ చేయడానికి అభ్యర్థి ఎవరూ దొరకని పరిస్థితుల్లో  బీజేపీ  పార్టీ జిల్లా అధ్యక్షుడిని రంగంలోనికి దింపింది. అయితే పరిశీలకులు మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ వచ్చినా గొప్పేనని వ్యాఖ్యానిస్తున్నారు. 

మహానాడును మించా.. సాధ్యమేనా.. ప్లీనరీపై వైసీపీ నేతల మల్లగుల్లాలు!

పార్టీ ప్లీనరీ నిర్వహించాలంటూ వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ శ్రేణులు. వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ ఒంగోలు మహానాడుకు మించి విజయవంతం చేయాలంటూ జగన్ హుకుం జారీ చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైందంటున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజా నిరసన జ్వాలల మంట ఇంకా సెగ తగులుతూనే ఉన్నాయి, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర జనంలేక వెలవెలబోయిన దృశ్యం ఇంకా కళ్ల ముందే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్లీనరీ కోసం జన సమీకరణ సాధ్యమేనా? తమ వల్ల అవుతుందా అన్న శంక వైసీసీ నేతల్లో ప్రారంభమైందని అంటున్నారు. అందకే ప్లీనరీకి ముందు జిల్లాలలో  సన్నాహక ప్లీనరీలు నిర్వహించాలని జగన్ ఆదేశించడంతో జిల్లా స్థాయి నాయకులు ఇప్పటి నుంచే మొహం చాటేస్తున్నారని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీనరీ నిర్వహణలో నేతల ఇబ్బందులు, కష్టాల గురించి పట్టించుకోకుండా.. మీరేం చేస్తారో తెలియదు. మహానాడుకు మించి వైసీపీ ప్లీనరీ విజయవంతం కావాలి. జన సమీకరణ బారీగా జరగాలి అంటూ జగన్ ఆదేశించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న కాక మొన్న సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర సభలకు పథకాలు ఆపేస్తాం అంటూ బెదరించి, భయపెట్టి తీసుకు వచ్చిన జనాలను మంత్రులు వచ్చే వరకూ కూడా నిలువరించలేకపోయిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తూ ఈ పరిస్థితుల్లో జనసమీకరణకు పార్టీ నేతలు నడుంబిగించే అవకాశాలు తక్కువేనని అంచనా వేస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభ నుంచే జనాలు వెళ్లిపోతున్న పరిస్థితుల్లో భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించాలనీ, భారీగా జనసమీకరణ చేయాలనీ తలపెట్టడం సరికాదని వారు విశ్లేషిస్తున్నారు. ఏలూరులో జగన్ పాల్గొన్న రైతు భరోసా సభనుంచి జనాలు గుంపులు గుంపులుగా వెళ్లిపోవడం, పోలీసులు ఆపినా ఆగకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’ అటు ప్రజలనే కాదు, ఇటు వైసీపీ కార్యకర్తలనూ కదలించలేకపోయిన విషయాన్ని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్లీనరీ నిర్వహణకు జన సమీకరణ అంత సులువు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రజలు బహిరంగంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో మహానాడుకు దీటుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించి సత్తా చాటాలని జగన్ నిర్ణయించి, జనసమీకరణ చేయాలంటూ నేతలకు బాధ్యత అప్పగించడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. పార్టీ కేడర్ సైతం చేసిన పనులకు బిల్లులు రాక అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారిని ప్లీనరీ కోసం కార్యోన్ముఖులు చేయడం అంత తేలికైన పని కాదని వైసీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8 నుంచి రెండు రోజుల పాటు  గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ సమీపంలోని మైదానంలో ప్లీనరీ నిర్వహణకు జగన్ నిర్ణయించిన సంగతి విదితమే.  తెలుడగుదేశం జిల్లాల్లో నిర్వహించిన మినీ మహానాడును  తరహాలో నియోజకవర్గాల్లో ప్లీనరీ నిర్వహించి జనసమీకరణ చేయాలని ఆదేశించారు. కీలక నేతలకు ఈ బాధ్యతలు జగన్ అప్పగించారు. జిల్లా ఇన్ చార్జి మంత్రులకు ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే   ప్లీనరీకి ప్రజలను ఎలా రప్పించగలమని వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. బాహాటంగా కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతను తోసిరాజని ప్లీనరీని విజయవంతం చేసుకోవడం, అదీ మహానాడును మించి చేయాలని అధినేత భావించి.. ఆ బాధ్యతను తమ తలపై మోపడం నేల విడిచి సాము చేయమనడం లాంటిదేనని వైసీపీ నేతలు లోపల్లోపల రగిలిపోతున్నారు.

ఉమ్మడి రాష్ట్రం పీఠం కోసం కేసీఆర్ కుట్ర చేశారు..

కేసీఆర్’ ఆ మూడు అక్షరాలే మహామంత్రం. ఆ మూడు అక్షరాలే తెలంగాణ తెచ్చిపెట్టాయి. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు..ఆయనే లేక పొతే తెలంగాణ వచ్చేదా.. ఆయనే లేక పొతే ... టీ కాంగ్రెస్, టీబీజేపీ ఎక్కడివి? రేవంత్ రెడ్డి, బండి సంజయ్’ గాళ్ళకు  పదవులు లెక్కడివి? కుర్చీలెక్కడివి? ఇవి కదా మంత్రి కేటీఆర్ దినానికోసారి వినిపించే కోడి కూత కబుర్లు. (కోడి కూత కబుర్లు అంటే ఏంటో తెలుసు కదా. వెనకటికో ఓగుడ్డి కోడి తాను కూస్తేనే కానీ తెల్లవారదని తెగ గొప్పలకు పోయింది..ట..అప్పటి నుంచి, ఇలా గప్పాలు పోయే కేటీఆర్లు చెప్పే కబుర్లను కోడి కూత కబుర్లని అంటున్నారని అంటారు. అఫ్కోర్స్ ఆ గుడ్డి కోడి కబుర్లు వినివినీ విసుగేసి, ఆ ఆసామి ఆ కోడి గారిని కూర వండేశాడు అనుకోండి అది వేరే విషయం).  నిజానికి, తెలంగాణ ఎవరివలన  వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అందరికీ తెలిసిన విషయమే. పుష్కర కాలం పైగా సాగిన ఉద్యమంలో 1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానంతో తెలంగాణ వచ్చింది.అంతే కానీ, ఒకాయన చావునోట్లో తలపెడితేనో,ఇంకొకాయనకు అగ్గిపెట్టె దొరకనందుకో, ఇంకొకాయన తీరిగ్గా అమెరికా విమానం దిగినందుకో,  తెలంగాణ రాష్టం రాలేదని, అందరికీ తెలిసిన విషయమే.  అదలా ఉంటే, కేసీఆర్, 2001లో తెరాస ఆవిర్భావానికి ముందు  ఏమిటి? తెలంగాణ వాదా? సమైక్య వాదా? అనే చర్చ ఒకటి కొత్తగా తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి పదవి కోసం, ఆయన అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారనే విషయంఫై రాజకీయ వర్గాలో జోరుగా చర్చ జరుగుతోంది.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2 న నాగోల్‌లోని  గడ్డి అన్నారం జె.కన్వెన్షన్‌లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన’ సభలో, కేసీఆర్ మాజీ సహచరుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎ. చంద్రశేఖర్‌  ఇందుకు సంబంధించి, ఇంటి గుట్టును బయట పెట్టారు. అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు తెలియదా? అన్నటుగా, కేసీఆర్ గత చరిత్ర పై   ఎ.చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిజానికి, తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో కేసీఆర్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలోనే సమైక్య వాదాన్ని సమర్ధించారు.  అందుకే, ఇప్పుడు, 2001కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని చంద్రశేఖర్ చేసిన ఆరోపణకు బలం చేకూరిందని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు. నిజం. ఒక్క చంద్రశేఖర్ మాత్రమే కాదు, కేసీఆర్ అప్పటి సహచరులు చాలా మంది కూడా కేసీఆర్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఉండేదని, అందుకే శాసనసభలో ఆంద్రోళ్ళ కంటే, బలంగా సమైక్య వాదాన్ని బలపరచారని గుర్తు చేస్తున్నారు.అలాగే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయిన నేపధ్యంలోనే, కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, అప్పట్లో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే కాదు, ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా తెలుసునని అంటారు. ఇక చంద్రశేఖర్ తాజాగా 2001కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు, 60 మంది ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ కుట్ర పన్నారని తెలిపారు. వీరిలో తనతో పాటు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇతర కీలక నేతలు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేసిన వెంటనే కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే, చివరి క్షణంలో కేసీఆర్ కుట్ర చంద్రబాబు చెవిన పడడంతో,ఆయన పథకం పారలేదని వివరించారు.  అదలా ఉంటే...2001లో కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారని, అంతకుముందు కేసీఆర్‌, తాను ఒకేసారి మంత్రులం అయ్యామని చంద్రశేఖర్ చెప్పారు.‘మళ్లీ జరిగిన ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదు. దీంతో నాటి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కూడా చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేల్లో చీలిక తేవాలని ప్రయత్నించారు’ అని చంద్రశేఖర్ చెప్పారు. ‘చిత్తూరు జిల్లాకు చెందిన గోపాలకృష్ణారెడ్డి, నేను, మరికొంత మంది మిత్రులు కలిసి చంద్రబాబును దించేయాలనేది కుట్ర చేశామని, ఇందుకోసం 3, 4 నెలల పాటు చర్చలు, ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబును దించేందుకు దగ్గరికొస్తున్నాం కాబట్టి ఒక రోజు రాత్రి ప్లాన్‌ చేశాం. సీఎంను దించడానికి 60 మంది ఎమ్మెల్యేలు చాలని కేసీఆర్ చెప్పారు. 20 హెలికాప్టర్లు తెచ్చుకుందాం.. నేరుగా గవర్నర్‌ వద్దకు వెళ్దామని ఆయన అన్నారు. చంద్రబాబును దించేసిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని ఆకాంక్ష. ఆనాటి మీటింగ్‌కు ముఖ్యమంత్రిలా సూటు, బూటు వేసుకొని వచ్చిండు. బొజ్జల గోపాలకృష్ణ సరదాగా నువ్వేందుకు ముఖ్యమంత్రి కావాలె అన్నందుకు ఆయణ్ని కొట్టినంత పనిచేసిండు’ అని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ‘ఐతే, 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు.ఆయన కేసీఆర్ ఇంటి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకెళ్లి విషయం మొత్తం చెప్పారు.ఏకమైన ఆ ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడగొట్టి తన పదవి కాపాడుకున్నారు’ అని చంద్రశేఖర్ అన్నారు.కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం ప్రపంచంలో ఎవరికీ ఉండదు.అందుకు ఉదాహరణగా ఈ ఘటన గురించి చెప్పా’ అని చంద్రశేఖర్‌ చెప్పారు. ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పారని కాదు గానీ, కేసీఆర్, తెలంగాణ సాకారం అయిన వెంటనే ఉద్యమ నేతలను బయటకు పంపి, సమైక్య వాదులను అందలం ఎక్కిస్తున్న తీరును గమించినా, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టింది,చెన్నారెడ్డి తరహాలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకే అని అర్థం అవుతుందని అంటున్నారు. అవును, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ... అందుకే, వారు వీరని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, సిద్ధాంతాలను పక్కన పెట్టి, ఆర్ఎస్ యు మొదలు ఆర్ఎస్ఎస్ వరకు అందరూ ఒకటయ్యారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు..కానీ, కేసీఆర్’కు మాత్రం అధికారమే ప్రధానం.. అయిందని  అంటున్నారు.

అదే రహస్యం.. అదే గోప్యం.. ఈ సారేం మాట్లాడారో?

ఏం చేస్తారో చెప్పరు.. చెప్పిందేమీ చేయరు.. అసలేం జరుగుతోందో బయటకు తెలియనీయరు. ఇదీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లుగా వ్యవహరించిన తీరు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై కాడి వదిలేసిందంటూ అప్పటి అధికార పక్షంపై నిప్పులు చెరిగిన జగన్ అధికారంలోకి వచ్చాకా ఆ ఊసే మరిచారు. ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు మోడీతో భేటీ అయినా ఆ భేటీలో చర్చించిన అంశాలేమిటి, ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్నది ఎప్పడూ వెల్లడించలేదు.   ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో దాదాపు పీఎంవోలోనే మకాం వేస్తారు. అక్కడేం చేస్తున్నారో చెప్పరు. ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రధానితో గురువారం దాదాపు 45 నిముషాల పాటు భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారన్నది రాజకీయ పరిశీలకుల, విలేకరుల ఇంటర్పటేషనే కానీ.. జగన్ నోటి వెంట ఏం ఒక్క మాట కూడా రాలేదు. అయితే గత భేటీలకు, తాజా భేటీకి ఒక స్పష్టమైన తేడా  మాత్రం ఉంది. గత భేటీలన్నీ జగన్ బతిమాలుకుని అప్పాయింట్ మెంటు తీసుకున్నవే. ఆ భేటీలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించి ఉంటారని భావించడం అత్యాశే అవుతుందన్నది అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషణలతో చెప్పేశారు. జగన్ ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు. అన్నీ తీవ్రమైన కేసులే కనుక వాటి విషయంలోనే జగన్ మోడీతో భేటీలను, విజయసాయి పీఎంవో విజిట్లను వారు ఉపయోగించుకుని ఉంటారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణను జాప్యం చేసేందుకు ఉన్న అవకాశాలన్నిటినీ వినియోగించుకునే వెసులు బాటు కోసమే ఆ భేటీలు, విజిట్ లు అన్నది పరిశీలకుల అభిప్రాయం. విపక్షంలో ఉండగా ఒక్క చాన్స్ ఇస్తే తానేం చేస్తారో పదే పదే చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతగా ఏం చెప్పారో అవి మాత్రం పట్టించుకోవడం మానేశారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్.. ఇలా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ విపక్ష నేతగా తాను అధికారంలోకి వస్తే వీటన్నిటినీ చిటికెలో సాధించేస్తానని చెప్పిన జగన్ ముఖ్యమంత్రిగా వాటి గురించి ప్రస్తావించిన దాఖలాలే లేవని పరిశీలకులు అంటున్నారు. సంక్షేమం పేరిట సొమ్ము పందేరానికే ఉన్న నిధులన్నీ వాడుస్తూ ఏరోజు కారోజు అప్పుల కోసం దేవులాడుకోవడంతోనే కాలం గడిపేశారు.  అయితే తాజా భేటీలో ఇంత కాలం తాను విస్మరించిన అంశాలపై డిమాండ్ చేసే అవకాశం ఆయనకు వచ్చింది.   అసలు హఠాత్తుగా సీఎం జగన్ ప్రధానితో ఎందుకు భేటీ అయ్యారన్న విషయంలోనే స్పష్టత లేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మద్దతు కోరేందుకు ప్రధానే ఆయనను పిలిపించుకున్నారా? లేక మద్దతు ఇస్తాం అంటూ స్వచ్ఛందంగా ఈయనే వెళ్లి కలిశారా అన్న విషయంలో ఎటువంటి స్పష్టతా లేదు. భేటీ అనంతరం ప్రధానితో సమావేశం సామరస్య పూరిత వాతావరణం సజావుగా సాగిందన్న ప్రకటనతో సరిపెట్టేశారు. అనుకూల మీడియా మాత్రం యధా ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం ఇలా పలు డిమాండ్లను జగన్ ప్రధాని ముందు పెట్టినట్లుగా కథనాలు ప్రచురించేసింది. అయితే వాస్తవంగా ప్రధానితో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలేమిటన్న విషయం మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. నిజంగానే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లన్నీ జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించి ఉంటే.. ఆయన సానుకూలంగా స్పందించి ఉంటే.. ప్రధాని తరువాత నిర్మలా సీతారామన్ తో భేటీ అంత క్లుప్తంగా, అంత త్వరగా ఎందుకు పూర్తి అవుతుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జగన్ ప్రధానిని డిమాండ్ చేసినట్లుగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పుకుంటున్న అంశాలన్నీ ఆర్థిక పరమైనవే. అటువంటప్పుడు ప్రధాని సానుకూలంగా స్పందించి ఉంటే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సుదీర్ఘంగా సాగి ఉండాల్సింది. అందుకు భిన్నంగా ఏదో వెళ్లి కలిసి వచ్చేశామన్నట్లుగా నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ ఉంది. మహా అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది కనుక మరిన్ని అప్పులకు వెసులు బాటు కల్పించాలని జగన్ కోరి ఉండొచ్చు. అంతే అంతకు మించి జగన్ కేంద్రం ఎదుట తన గళమెత్తే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు అంటున్నారు.  అందుకే జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయంలో ఎప్పటి గోప్యతే కొనసాగుతోందని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాలంటే కచ్చితంగా జగన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కేంద్రానికి అవసరం. అందుకే పీఎం జగన్ ను పిలిపించుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం పిలుపు మేరకు వెళ్లినా జగన్ ప్రధాని వద్ద ప్రదర్శించిన హావభావాలు, వంగి వంగి మాట్లాడటం చూస్తుంటే.. ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించిన అంశాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకూ సంబంధించినవి అయి ఉండవనీ, ఔటాఫ్ ది వే.. తన వ్యక్తిగత అవసరాలకు సంబంధించి (అంటే కేసులకు సంబంధించి) అయి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

న్యాయవ్యవస్థను కించపరిస్తే శిక్ష తప్పదు.. సీజేఐ హెచ్చరికతో వైసీపీలో గుబులు!

నేరుగా ఎవరినీ వేలెత్తి చూపకపోయినా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జగన్ కు, జగన్ ప్రభుత్వానికీ, వైసీపీ నేతలకూ అతికినట్టు సరిపోతాయి.  వ్యవస్థలు చక్కపెట్టుకోవడం చేతకాని వారే కోర్టులను తప్పుపడతారు అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విస్పష్టంగా చెప్పేశారు. ఈ మాట ఆయన తెలంగాణలో జిల్లా కోర్టులను గురువారం ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ చేసిన  జగన్, జగన్ సర్కార్ తీరుకు చెంపపెట్టు వంటివే. ఆయన ఇంకా న్యాయ వ్యవస్థ స్వార్థ పరుల కోసం కాదనీ, సమాజ శ్రేయస్సు కోసమేనని స్పష్టం చేశారు. అడ్డగోలు  నిర్ణయాలు తీసుకోవడం, న్యాయస్థానాలలో చుక్కెదురైతే.. కోర్టులను, ఈ తీర్పులిచ్చిన న్యాయమూర్తుల ఉద్దేశాలనూ తప్పు పడుతూ వ్యాఖ్యలు చేయడం ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిన నేపథ్యంలో తెలంగాణ గడ్డపై నుంచి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇటీవలి కాలంలో కోర్టు తీర్పులపై కొందరు వక్రభాష్యం చెబుతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టు తీర్పును తప్పుపట్టడమే కాకుండా దానికి వక్రభాష్యం చెబుతూ ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన కేబినెట్ లోకి కొందరు మంత్రులు మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సుప్రీం ను ఆశ్రయిస్తామనీ, చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టులు ఎలా చెబుతాయంటూ వారు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి హైకోర్టు సీఆర్డీయే, భూములిచ్చిన రైతులకు న్యాయం అన్న విషయంపైనే తీర్పిచ్చింది. ఆ రెంటికీ విఘాదం కలిగే ఏ చట్టం చేయడానికైనా ప్రభుత్వానికి అధికారం లేదని స్పష్టం చేసింది. ముందుగా కుదుర్చుకున్న( అది గత ప్రభుత్వమైనా సరే) ఒప్పందం ప్రకారం రైతుల ప్రయోజనాలు రక్షించాలన్నదే కోర్టు తీర్పు సారాంశంగా న్యాయనిపుణులు అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి సహా వైసీపీ మంత్రలు, నాయకులు మాత్రం కోర్టు తీర్పుపై పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించారు. అందుకే నేరుగా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలు జగన్ సర్కార్ కు చెంప పెట్టులాంటివేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా న్యాయ వ్యవస్థను కించ పరిచే వారికి, న్యాయ వ్యవస్థపై అభాండాలు వేసే వారికీ శిక్ష తప్పదని కూడా భారత ప్రధాన న్యాయ మూర్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి గతంలో కాబోయే చీఫ్ జస్టిస్‌ (జస్టిస్ ఎన్వీ రమణ)పై నిందలు వేసి.. అప్పటికీ సీజేఐకి లేఖ రాయడమే కాకుండా తప్పుడుపని అని తెలిసినా మీడియాకు విడుదల చేసిన విషయం ప్రస్తావనార్హం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేసి పైశాచికానందం పొందేవారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమని సీజేఐ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుందనడంలో సందేహం లేదు.  ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై నుంచి సీజేఐ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి.  సీజేఐ ఏ తీరును అయితే విమర్శించారో సరిగ్గా ఏపీ ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి తీరు అలాగే ఉన్నాయని  పరిశీలకులు అంటున్నారు. 

సంప్రదాయం మేరకే.. ఆత్మకూరులో పోటీకి ‘దేశం’ దూరం

వైసీపీ సర్వ నియమాలు, ఆనవాయితీలు, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. ప్రభుత్వం ప్రతిష్థత్మకంగా భావించి చేపట్టిన గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలు తుస్సు మనడంతో.. జనంలో వ్యతిరేకత బట్టబయలై ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయింది. అందుకే ఆనవాయితీ ప్రకారం ఏకగ్రీవం కావలసిన ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగాలంటూ విపక్షాన్ని సవాల్ చేస్తోంది. బీజేపీ ఇప్పటికే పోటీకి సై అంటూ వైసీపీ నెత్తన పాలు పోసే లాంటి నిర్ణయం తీసుకుంది. బయటకు విమర్శలు, అంతర్గతంగా ఆ పార్టీకి మేలు చేయడానికి తహతహలా బీజేపీ తీరు ఉందన్న విమర్శలను కూడా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. వైసీపీ అయితే ఆత్మకూరులో పోటీ జరగాలి. తమ అభ్యర్థికి రికార్డు మెజారిటీ రావాలి, తద్వారా జనంలో తమ ప్రభుత్వ పరపతి ఇసుమంతైనా తగ్గలేదని చాటుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతోంది. వైసీపీ సవాల్ ను తెలుగుదేశం అధినేత వైసీపీ నీచత్వానికి పరాకాష్టగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఆత్మకూరులో తెలుగుదేశం పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు. మరణించిన నేత కుటుంబీకుల ఎన్నికకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు. గతంలో బద్వేలులో కూడా ఆ కారణంగానే తెలుగుదేశం పోటీ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మకూరులోనూ అదే విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని తెలుగుదేశం గౌరవిస్తుందని, ఆచరిస్తుందని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆత్మకూరులో పోటీ అంటూ వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచమని విమర్శించారు.  ప‌ద‌విలో ఉన్న నేత చ‌నిపోయిన కార‌ణంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌న్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  

మధ్య తరగతి నెత్తిన ‘గ్యాస్’ బండ

ఒక్కటొక్కటిగా సబ్సిడీలు ఎత్తివేస్తూ కేంద్రం మధ్య తరగతి నడ్డి విరుస్తోంది. ప్రజా సంక్షేమం మాట గాలికి వదిలేసి మార్కెట్ మాయాజాలంలో జనాలు గిలగిలా కొట్టుకునేలా చేస్తోంది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, ధరల పెరుగుదల నియంత్రణ విషయాన్ని గాలికొదిలేసి.. కేంద్రం చోద్యం చూస్తోంది. తాజాగా వంట గ్యాస్ పై సబ్సిడీని ఎత్తివేయడంతో మధ్య తరగతి నెత్తిన బండ పడింది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఇంత వరకూ గ్యాస్ సిలెండర్ పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. కేవలం ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలెండర్ కనెక్షన్ పొందిన వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందంటూ ప్రకటించింది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన 9 కోట్ల మంది పేద మహిళలకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. కేంద్రం నిర్ణయంతో 21 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులు సబ్సిడీకి ఇక అనర్హులు. వారంతా మార్కెట్ ధర చెల్లించి  గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్  పొందిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై, రూ.200 చొప్పున సబ్సిడీ అందుతుంది. ఈ సబ్సిడీ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతుంది. మిగతా వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరకు అనుగుణంగా డబ్బులు చెల్లించి గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాలి.   చమురుపై సబ్సిడీ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గతంలోనూ జరిగింది. 2010లో పెట్రోల్‌పై కేంద్రం సబ్సిడీని ఎత్తివేయగా, 2014లో డీజిల్‌పై సబ్సిడీని ఎత్తివేసింది. తాజాగా ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కారు.

ఒక‌టి ఒక‌టి ఒక‌టి అంటే వాచిపోద్ది.. టెన్త్ ఫలితాలపై విద్యాసంస్థల ప్రచారంపై బ్యాన్ .. నారాయణా

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక ఏ విద్యాసంస్థలూ మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి. టెన్ ఆఫ్ టెన్ ఇంత మందికి వచ్చింది, అంత మందికి వచ్చింది అంటూ ప్రకటనలు ఇవ్వడం, ఫలితాలపై   ప్రచారం చేసుకోవడం,  నిషిద్ధమని, ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌   ఉత్తర్వులు జారీ చేశారు.  విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాల విడుదలలో గతంలో గ్రేడింగ్‌ విధానం ఉండేదని, 2020 మార్చి నుంచి మార్కులు ప్రకటించే విధానాన్ని పున:ప్రారంభించామని తెలిపారు.  ఈ నేపథ్యంలో విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి తమ విద్యాసంస్థలే కారణమని విద్యా సంస్థలు, ట్యుటోరియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేదన్నారు.అలాంటి ప్రచారం వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోందనీ, దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు . ఫలితాలను తమకనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల చట్టం 7ఏ ప్రకారం వీలు లేదన్నారు. ఎవరైనా ఉల్లంఘించి ప్రచారం చేసుకున్న, ప్రకటనలు విడుదల చేసినా  లక్ష జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  కాగా నారాయణ విద్యాసంస్థలను దృష్టిలో ఉంచుకునే ఈ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారని పరిశీలకలు అంటున్నారు. మాజీ మంత్రి నారాయణపై ఇటీవలి కేసులు, అరెస్టులతో చెలరేగిపోయిన సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యలో ఇప్పుడిలా విద్యాసంస్థల ప్రకటనలపై నిషేధం విధించిందని పేర్కొంటున్నారు.