ధ‌న‌ దాహం పెంచేస్తున్న క్రికెట్‌!

ఇంగ్లీషువాడు భార‌త‌దేశాన్ని వ‌దిలిపోతూ అంటించిన జాఢ్యాలు రెండు.. ఇంగ్లీషు, క్రికెట్‌! పిల్ల‌లు ఇంగ్లీషు మీడియంలోనే చ‌ద‌వాలి, మాట్లాడాలి, ఆడితే క్రికెట్ మాత్ర‌మే ఆడాలి .. ఈ రెండు చేయ‌నివారు ఒట్టి పిచ్చాళ్లు! ప‌నికిరానివారు అదే గొప్ప అభిప్రాయం త‌ర‌త‌రానికి అందివ‌స్తున్న గొప్ప సంప్ర‌దాయం. పిల్ల‌లు చ‌దువుతోపాటు ఆట‌లూ ఆడాలి. వొంటికి వ్యాయామం అవ‌స‌రం గ‌నుక‌. పూర్వం క‌బ‌డ్డీ, ప‌రుగు పందెం, బ్యాడ్మింట‌న్ చాలా స‌హ‌జంగా ఆడేవారు. ఇప్పుడూ ఆడుతున్నారు. కానీ క్రేజ్‌, ప్ర‌తిష్ట‌, మీదు మిక్కిలీ మంచి ఆర్ధిక స్థాయి కోసం క్రికెట్ ఆడ‌టం జ‌రుగుతోంది. త‌ల్లిదండ్రులు త‌మ మ‌గ పిల్ల‌ల్లో ఎవ‌రికయినా ఈ జాఢ్యం అంటి పొర‌పాటున అర కొర చాక‌చ‌క్యం చూపితే.. కాబోయే టెండూల్క‌ర్ అని, కాబోయే క‌పిల్ అనీ భావించుకుని కోచింగ్ పేరుతో వాడి జీవితాన్ని స‌ద‌రు కోచ్ చేతిలో పెడుతున్నారు. ఇది గ‌తంలో ప‌ట్ట ణాలలో వుండేది. ఇప్పుడు టీ 20లు, ఐపిఎల్ పుణ్యాన గ్రామీణ ప్రాంతాల్లోనూ అదో పెద్ద సోపానంగా భావి స్తున్నారు.  పైగా టాలెంట్ స‌ర్చ్ పేరుతో క్రికెట్ సంఘాలు  చిన్న వూళ్ల‌లోకి వెళ్లి వారి ఆట‌ను గ‌మ‌నించి న‌చ్చితే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చేయ‌మ‌ని అన‌డం జ‌రుగుతోంది. అదేదో మ‌హాద్భుతం,  ఇక రేపే మ‌నోడు టెస్ట్ ఆడ‌తాడు, ప‌నిగినీ వ‌దిలేసి టీవీ ముందు బైఠాయించాలి అని అమ్మ‌మ్మ‌లు, అమ్మ‌లు సైతం తెగ ఉత్సాహ ప‌డుతున్న రోజులివి.  అస‌లు ఆ ఆట మ‌హత్తే అంత అని అంటూంటారు క్రికెట్‌ను అమితంగా ప్రేమించి తిండీ తిప్పలు మానేసిన‌వారు. ఎందుకంటే, మ్యాచ్‌లు, ప్లేయ‌ర్ల‌కంటే ఆ మ్యాచ్‌ల‌ను చూస్తూ డ‌బ్బు సంపాదించే ఓ కొత్త ద‌రిద్రం వ‌చ్చిప‌డింది. దాన్నే ఆంగ్లంలో  బెట్టింగ్ అంటారు. ఇది ఐపిఎల్ తో మ‌రింత విజృంభిస్తోంది. న‌ర న‌రానా ఆ పిచ్చి ఎక్కించేసుకుంటున్న యువ‌త‌, చిన్న‌పాటి వ్యాపార‌ సంస్థ‌ల‌వారు కూడా ఆవేశ‌ప‌డుతు న్నారు.  క్ర‌మేపీ ఆట‌ను ఆట‌గా చూడ్డం మానేసి వారి అభిమాన ప్లేయ‌ర్ ఆట తీరును క‌రెన్సీ కాయితా ల‌తో కొలుస్తూ ఆ వేడిలో ల‌క్ష‌లకు లక్షలు కోల్పోతున్నారు.   క‌ష్ట‌ప‌డి ఏదో ఒక ప‌నిలో, లేదా వృత్తిలో ఆర్ధికంగా  మెరుగుప‌డ‌టం అనేది లోకం హ‌ర్షించే ప‌ద్ధ‌తి. కానీ కాల‌క్ర‌మంలో ఆట‌ల‌తోనూ కోట్లు గ‌డించ‌వ‌చ్చ‌న్న‌ది గొప్ప ఆర్ధిక సూత్రం కింద త‌యార‌యింది. ప్లేయ‌ర్లు ముఖ్యంగా క్రికెట్ ప్లేయ‌ర్లు త‌మ ప్రొఫెష‌న్‌లో ఉన్న‌త శిఖ‌రాలు అధిగ‌మించ‌డంలో ఆర్ధికంగా బాగానే నిల‌దొక్కుకుంటారు. దాన్ని ఆట్టే ప్ర‌శ్నించ‌లేం. కానీ వారి ఆట‌ను పిచ్చిగా ప్రేమించి ఆర్ధికంగా దిగ‌జారు తున్న కుటుంబాలు త‌యారు కావ‌డ‌మే ఊహించ‌ని ప‌రిణామం!  ప‌నీపాటా లేని ప‌ద‌కండు మంది ఆడే ఆట‌ను కోట్ల‌మంది బుద్ధిహీనులు ఎంజాయ్ చేయ‌డంలో కాలం విలువ తెలుసుకోలేక‌పోతున్నార‌ని పూర్వం ఒక ఆంగ్ల ర‌చ‌యిత అన్నాడు.  అప్పుడ‌న్న‌ది ఇప్పుడు అక్ష‌రాలా నిజం. మ‌త్తులో ప‌డితే గ‌మ్మ త్తుగ చిత్త‌వ‌డం అంటే ఇదేనేమో!       ఐపిఎల్‌లో ఆడితే దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం చాలా సులువు అనే గొప్ప ర‌హ‌స్య‌సారం ప్లేయ‌ర్లు కూడా బాగా జీర్ణించుకున్నారు. అంత‌కుముందు రంజీలో  స‌రిగా ఆడ‌క‌పోయినా, అదృష్ట‌వ‌శాత్తూ ఏదో ఒక జ‌ట్టుకి ఆడేందుకు ఈ టోర్నీకి సెల‌క్ట్ అయితే మారుమూల అమాయ‌కంగా వుండే చిన్న‌పాటి ప్లేయ‌ర్ కి కూడా క‌ళ్లు నెత్తినెక్కుతాయి.  వాడి అదృష్టం మ‌రీ అధిక‌శాతంలో వుంటే వాడికిక తిరుగే వుండ‌దు. ఇప్ప‌టి ట్రెండ్ అదే!  ఇక విదేశీ ప్లేయ‌ర్ల సంగ‌తి వేరు. వారికి కేవ‌లం డ‌బ్బు కావాలి. ఆట ఎలాగూ మ‌న‌వాళ్ల‌తో పోలిస్తే బాగానే ఆడ‌తారు. ఒక‌వేళ ఒక‌టో రెండో మ్యాచ్‌ల్లో పెద్ద‌గా ప‌రుగులు తీయ‌క‌పోయినా, వికెట్లు తీయ‌క‌పోయినా స‌ద‌రు ప్లేయ‌ర్‌కి వ‌చ్చిన న‌ష్టం  లేదు. మ‌హా అయితే త‌ర్వాతి రెండు  మ్యాచ్‌ల‌ను షామియానా కింద చ‌ల్ల‌బ‌డుతూ చూడ‌మంటారు అంతే.  ఆ త‌ర్వాతా అవ‌కాశం ఇవ్వ‌క‌పోయినా మ‌రీ అదృష్ట‌మే వాడికి. ఎందుకంటే మొత్తం టోర్నీలో పాల్గొన‌డానికి ఇవ్వ‌వ‌ల‌సిన మొత్తం సొమ్ము ఎన్నో కొన్ని కోట్లు చ‌చ్చుకుంటూ స్పాన్సర్లు ఇస్తారు!    ఈ వ్యాపార ఆట స‌ర‌ళితో చిన్న చిన్న సంస్థ‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు ప్ర‌చారం మాత్రం బాగానే చేసుకో గ‌ల్గుతున్నారు.  ల‌క్ష‌లు పెట్టి యాడ్స్ రూపంలో అంద‌రి ముందు క‌న‌ప‌డితే వ‌చ్చేదానికంటే, ఈ టోర్నీలో  వారి సంస్థ‌ల పేరు మాటి మాటికీ క‌నిపించి, వినిపించే ప్ర‌చార హోరు ప‌సిడి కుండ‌ల్ని అమాంతం అందిస్తుండ‌వ‌చ్చు అనే అభిప్రాయాలూ లేక‌పోలేదు.       ఒక్క ఆట‌తో వంద‌ల‌ మంది లక్షాధికారులు, కోటీశ్వ‌రులూ  కావ‌డం అనేది ఈ  రోజుల్లో చూడ‌గ‌ల్గుతున్నాం.  ఇందుకు ప్ర‌భుత్వాలూ మ‌ద్ద‌తునిస్తున్నాయి. రాజ‌కీయ‌ నాయ‌కులు, పోనీ వారి బంధువ‌ర్గ‌మో ఆయా స్పాన్సార్ల‌లో భాగ‌మ‌వుతున్నారు. అస‌లు క్రికెట్ పాల‌క‌ మండ‌లిలోనే రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులను స‌భ్యులుగా చూస్తున్నాం. ఇది రాజ‌కీయంగా త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది.       మ‌న దేశంలో దుర‌దృష్ట‌మేమంటే,  హాకీని, ఫుట్‌బాల్‌ని అంత‌గా ప్రోత్స‌హించ‌లేక‌పోవ‌డం.  పైకి ఏదో క‌థ‌లు చెప్ప‌డం, ప్ర‌చారం చేయ‌డం,  ఒక‌టి రెండు టోర్నీల‌కు పెద్ద స్థాయిలో హ‌డావుడి చేయ‌డం త‌ప్ప ప్ర‌త్యేకించి మ‌ద్ద‌తు నీయ‌డం అనేది  చాలా అయిష్టంగానే జ‌రుగుతోంది.  క్రికెట్ వేడితో  కొన్ని కుటుంబాలే  బాగుప‌డుతున్నాయి. చాలామ‌టుకు ఆర్ధికంగా చితికిపోతున్నాయి.

ఆ ఎమ్మెల్యేలకు ఎదురు గాలి ..

గెలిచింది సైకిల్ గుర్తు పైన ... తిరుగుతోంది ఫ్యాన్ పార్టీతో .. నిజమే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీకి అమ్మడు పోవడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు..దేశ రాజకీయల్లోనూ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇటీవల కాలంలో,ఎందుకనో ప్రజలు, పార్టీ ఫిరాయింపులను అంతగా పట్టిచుకోవడం లేదు. చివరకు,అనైతిక ఫిరాయింపులను నిరోధించేందుకు తెచ్చిన, ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఫిరాయింపులను నిరోధించలేక పోతోంది. చట్టంలో ఉన్న చిల్లులను చక్కగా వినియోగించుకుని, గౌరవ ప్రజా ప్రతినిధులు.గోడలు దూకేస్తున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మందికి పైగా ఎమ్మెల్యేలు తెరాస తీర్ధం పుచ్చుకున్నారు.అందులో ‘చేవెళ్ల చెల్లెమ్మ’ సబితా ఇంద్రారెడ్డి వంటి కొందరు మంత్రులు కూడా అయ్యారు. అలాగే, కర్ణాటక, మధ్య ప్రదేశ్, గోవా ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఫిరాయింపుల దారిలోనే ప్రజలు ఎన్నుకున్న ప్రభ్తుత్వాలను కూల్చివేసింది. సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. పరిపాలన సాగిస్తోంది.అలాంటి ఫిరాయింపులు అనైతికం, అప్రజాస్వామికం,ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం అనే ప్రవచనాలు వినిపిస్తూనే రాజకీయ పార్టీలు అదే దారిలో అడుగులు వేస్తున్నాయి. ఇందులో మినహాయింపులు లేవు.అందరూ అదే తానూ ముక్కలు. అయినా ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. ఫిరాయింపుదారులను,మళ్ళీ మళ్ళీ అందలం ఎక్కిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపిస్తూనే ఉన్నారు.  అయితే ఇప్పుడు ఏపీలో సీన్ మారుతోంది.టీడీపీ టిక్కెట్’పై ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీ అనుబంధంగా కొనసాగుతున్ననలుగురు ఎమ్మెల్యేలకు సొంత నియోజక వర్గాల్లో ఎదురు గాలి వేస్స్తోంది. ఎక్కడికెళితే అక్కడ జనం నిలదీస్తున్నారు. మళ్ళీ వస్తే మర్యాద దక్కదని, ముఖం మీదనే తలుపులు వేస్తున్నారు. మరోవంక,అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కుంటున్న వైసేపీ నాయకత్వం, తాను దూర కంత లేదు మెడకో డోలేందుకు అనుకుందో ఏమో, వీరి గోడు అసలు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో ఏమి చేయడమో పాలుపోక, చేసిన తప్పుకు చెంపలు వేసుకుని తిరిగి సొంత గూటి వైపు అడుగులు వేస్తున్నారు.  ఇందులో భాగంగానే, ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. అప్పట్లో గణేష్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించాక ఆయనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామన్న పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పచెప్పడేమిటి’ అని శ్రీవాత్సవ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పోరు వీధుల కెక్కింది. ఎందుకైనా మంచిదని, ముందు జాగత్త చర్యల్లో భాగంగా వాసుపల్లి గణేష్‌ వైసేపీ బాధ్యతలనుంచి తప్పుకున్నారని అంటున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంగతి చెప్పనే అక్కరలేదు. తెలుగు దేశం టికెట్’పై గెలిచి వైకాప అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన వంశీ, మంత్రి (ప్రస్తుత మాజే) కొడాలి నానీతో కలిసి తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు టార్గెట్’గా చిందులు వేశారు.అయితే, అదే సమయంలో స్థానిక వైసీపే నాయకులతో  వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సర్కార్ వారి సలహాదారు సజ్జల జోక్యం చేసుకున్నా, పరిస్థితిలో మార్పు రాలేదు. గోడ దూకిన ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేదే లేదని స్థానిక నాయకులు అధినాయకత్వానికే తేల్చి చెప్పేశారు. ఇక చేసేది లేక అధినాయకత్వం కూడా వంశీని వదిలేసింది. దీంతో వంశీ రెంటికి చెడ్డ రేవడిలా దిక్కులు చూస్తున్నారు.  చీరాల నియోజక వర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన కరణం బలరాం వైకాపాకు మద్దతు ప్రకటించారు. ఆయన కొడుకు వెంకటేష్‌ నియోజకవర్గంలో వైకాపా తరపున పనిచేసుకుంటున్నారు. మరోపక్క అదే నియోజకవర్గం నుంచి 2019లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‌ పోటీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అధినాయకత్వం పలుమార్లు చర్చలు జరిపి ఆయనను పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చీరాలలో కరణంకు కాకుండా మరొకరికి టికెట్‌ ఇస్తే తాను గెలిపిస్తానని ఆమంచి సీఎంకు చెప్పారు.మరోవంక క్షేత్ర సత్యిలో పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి.  గుంటూరు పశ్చిమలో చాపకింద నీరులా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాపకింద నీరులా ఎమ్మెల్యేకి వైకాపా నేతల నుంచి సెగ తగులుతోందన్న భావన వ్యక్తమవుతోంది. 2019లో ఆయనపైన వైకాపా తరపున పోటీ చేసిన ఏసురత్నమే ఇప్పటికీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండడం, అధికార పార్టీ కీలక పదవిలో ఉన్న మరో నేత ప్రభావం ఇక్కడ ఉండడంతో ఎమ్మెల్యేకి అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. ఇటీవల గడప గడపకి కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను తెలిపేలా ఏసురత్నం అనుచరులు ప్లకార్డులు పట్టుకుని తిరగడాన్ని తొలుత ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు నివారించారు. ఆ తర్వాత నుంచి ఏసురత్నం గడప గడప కార్యక్రమానికీ దూరంగా ఉంటున్నారు. మొత్తానికి టీడీపీ టికెట్ పై గెలిచి ఫ్యాన్ పార్టీకి అనుబంధ సభ్యులుగా చేరిన ఎమ్మెల్యేలకు ఇటు జనంలో అటు పార్టీలో ఎదురు గాలులు వీస్తున్నాయి. అందుకే, ఆ నలుగురి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకాగా మారిందని అంటున్నారు.

తాయిలాలతో ప్రజలను ఏమార్చిన ఫలితం..!

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక స్థితికి ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఉత్పాదక అంశాలపై దృష్టి సారించకుండా.. ప్రజలకు అవసరమా కాదా అన్న విచక్షణ కూడా లేకుండా కులాలు, మతాల వారీగా నిధుల పందేరం జరిగేలా పథకాలు రూపొందించి అమలు చేసిన ఫలితమే ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణమని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కేసీఆర్ పాలనా విధానాలే కారణం. ఆవిర్భావంతోనే మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ నేడు సకాలంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పుల మీద ఆధారపడాల్సిన దుస్థితికి  చేరుకోవడానికి తాయిలాల పాలనే కారణం. తాయిలాల ప్రలోభంలో పడి జనం తమ ప్రగతికి, అభివృద్దికి, వికాసానికి హేతువుగా నిలిచే విద్య, ఉపాధి, నైపుణ్యం వంటి ప్రధానమైన విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం విస్మరించడమే కారణం. అధికారంలో ఉండి.. ఐదేళ్ల తరువాత మళ్లీ అధికారం అన్న లక్ష్యం వినా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, ప్రజల భవిష్యత్ బంగారంలా ఉండేందుకు అత్యంత కీలకమైన వైద్య రంగాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలను పట్టించుకోని ప్రభుత్వమూ కారణం. అంటే మొత్తంగా తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి పాలకులూ, ప్రజలూ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఒక సదాశయంతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమ సారథిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవంతం చేయగలిగారు. అయితే అధకారం చేపట్టిన తరువాత ఉద్యమ ఆశయాలను నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారు.  ఉద్యమ ఫలితాలను తెలంగాణ సమాజానికి అందించడంలో విఫలమయ్యారు. రాష్ట్రం సాకారమైతే జనం ఏవైతే తమకు లభిస్తాయని ఆశించారో అవి మాత్రం జనాలకు అందలేదు. అసలా దిశగా పాలన సాగింది లేదు. తెలంగాణ రాష్ట్ర సాకారానికి  జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీయే గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ ఉద్యమ సారథే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిర్భావమే మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ నేడు లోటులో పీకలోతు మునిగిపోయింది.  చిన్న చిన్న బిల్లుల చెల్లింపు నుంచి ఉద్యోగుల వేతనాల వరకూ అప్పులే శరణ్యమనే పరిస్దితికి వచ్చింది. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సైతం అప్పలు తప్ప మరో గత్యంతరం లేని దుస్థితికి చేరుకుంది. కేవలం తాయిలాలకే సింహభాగం ఖర్చు చేస్తూ అత్యంత కీలకమైన, ప్రధానమైన రంగాలను విస్మరించడమే ఇందుకు కారణం.   మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన  తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కేవలం ఎనిమిది  సంవత్సరాలలో కనీస చెల్లింపులు చేయలేని పరిస్థితికి  ప్రాధాన్యం లేని, ఉత్పాదకతకు పనికిరాని వ్యయాలను విపరీతంగా పెంచుకుంటూ పోవడం, వాటికి నిధుల కేటాయింపు ఒక ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. కులాలు మతాల వారీగా కేటాయింపులు కచ్చితంగా ఒక ప్రధాన కారణం.  ఓట్లను రాల్చే, ప్రజాకర్షక పథకాలే పాలనా విధానంగా మారిపోవడం మరో ముఖ్యమైన కారణం. దీని వల్ల  ఇప్పుడా పథకాలే ప్రభుత్వానికి గుదిబండగా మారిన సంగతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది.    ప్రతి విషయాన్నీ కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవడంతోనే తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది కానీ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అందుకే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా కూడా రాజకీయ వేడి రగిల్చి ప్రజల దృష్టి మరల్చడానికే ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నది. ఓట్లు రాల్చే పథకాలతో ఎల్లకాలం ప్రజాభిమానాన్ని చూరగొనడం సాధ్యం కాదనడానికి ఇప్పుడు రాష్ట్రంలో వ్యక్తమౌతున్న ప్రభుత్వ వ్యతిరేకతే నిదర్శనం

మద్యానికి బానిస.. ఈ కోడి రూటే సెపరేట్

అందరిదీ ఒక దారైతే నాది మాత్రం వేరే దారి అనేలా ప్రవర్తించే వాళ్లుంటారు. నలుగురూ నడిచే దారిలో నడిస్తే నా స్పెషాలిటీ ఏంటి అంటూ మిగిలిన వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ గుర్తింపు పొందేవారూ ఉంటారు. పదుగురు నడిచే దారిలో నడిస్తే నా గొప్పేమిటి అంటూ ఒకింత ఎబ్బెట్టుగా అనిపించినా డిఫరెంట్ లుక్ కోసం చిత్ర విచిత్ర వేషాలు వేసే వారూ ఉంటారు. అయితే ఈ రకమైన భిన్నత్వాన్ని కోరుకునే వారు మనుషుల్లోనే ఉంటారనుకోవడం సరికాదు. జంతువుల్లోనూ, పక్షుల్లోనూ కూడా ఇలాంటి ‘ప్రత్యేక’ జాతి ఉంటుంది. అందుకు ఈ కోడే ఉదాహరణ. మామూలుగా ఓ కోడి ఏం చేస్తుంది. నేలపై గింజలేరుకు తింటుంది. వాటినే విసర్జిస్తుంది. పుంజు అయితే తెల్లారగానే ఊరంతటినీ నిద్రలేపేందుకు కొక్కొరోకో అంటూ గట్టిగా అరుస్తుంది. పెట్ట అయితే గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను ఎగరలేని తన రెక్కల కింద భద్రంగా కాపాడుకుంటుంది. కానీ మహారాష్ట్రలో ఓ కోడి మాత్రం మందుకు బానిసైంది. నిజమే. నిత్యం తాగితే కాని ఉండలేని కొందరు మందుబాబులకే బాబు అన్నట్లుగా ఈ కోడి ప్రవర్తన ఉంటోంది. మహారాష్ట్రలో పిప్రికి గ్రామంలో భావుకాతొరే అనే వ్యక్తికి కోళ్ల పెంపకంపై మక్కువ. ఆ మక్కువతోనే పలు రకాల కోళ్లను పెంచుతుంటాడు. అలా అతడి వద్ద నున్న కోళ్లలో ఓ పుంజు మాత్రం సెపరేట్ స్టైల్ మెయిన్టైన్ చేస్తోంది. మిగిలిన కోళ్ల మాదిరిగా వేసింది తిని తొంగోవడం లేదు. మందు ఉంటే తప్ప మొతుకు ముట్టను అంటోంది. ఏం మనుషులకేనా..మాకు మాత్రం అలవాట్లుండవా?, వ్యసనాలుండవా అంటూ కొక్కొరోకో అంటూ నిలదీస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం ఈ కోడికి మందు పడాల్సింది. అదీ ఒకే బ్రాండ్ ఎంహెచ్ బ్రాందీ. పడాల్సిన రెండు పెగ్గులూ పడకపోతే.. ఆ కోడి నిరాహార దీక్ష చేస్తుంది. ఈ విషయంలో ఈ కోడి గాంధీ శిష్యురాలు అని చెప్పొచ్చు. మందు పడకుంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ముక్కుతో చిన్న బియ్యం గించను కూడా ముట్టదు. నీరు తాగదు. దీంతో చేసేదేం లేక ఆ కోడి యజమాని రోజు మద్యం కొని దానికి పడుతున్నాడు. అసలీ కోడి మద్యానికి బానిస అవ్వడానికి కూడా ఓ కథ ఉందట. అదేమిటంటే కొన్నాళ్ల కిందట ఈ కోడికి జబ్బు చేసిందట.  ఉలుకూ పలుకూ లేక పడుంటుంటే..పశువైద్యుడి వద్దకు తీసుకువెళితే కొన్ని రోజులు కొద్దిగా మద్యం పట్టమని చెప్పాడట. పాపం ఆ యజమాని అదే చేశాడు. కోడి జబ్బునుంచి కోలుకుంది. ఇక అప్పట్నుంచీ మొదలైంది దాని హడావుడి. మందు పడితేనే అది కోడి. లేకపోతే కాదు. అంతలా మద్యానికి బానిసైపోయింది. మద్యం తాగే కోడి గురించి ఈ నోటీ ఈనోటా విని చూడడానికి తండోపతండాలుగా జనం రావడం మొదలైంది. దీంతో పిప్రికి గ్రామం ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. కోడికీ కోడి యజమానికీ కూడా బోల్డంత గుర్పింపు వచ్చేసింది.

ఇక్కడ ఇలా.. అక్కడ అలా..!..

ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. పర్యవశానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో అయితే అది మరింత ఎక్కువ కావాలి. ఘనంగా ప్రకటనలు చేసేయడం.. ఆచరణలోకి వచ్చే సరికి జావగారిపోవడం వల్ల ప్రజలలో పలుచన అవుతారు. అలా కాకుండా నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి చెప్పింది చెప్పనట్లు చేయగలితే ప్రజలలో గౌరవం పెరుగుతుంది. వారి నాయకత్వం పట్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పింది చేయను.. చేసేది చెప్పను అన్నట్లు వ్యవహరించే వారు కొందరైతే.. చెప్పింది చెప్పినట్లు చేసి జనం మన్ననలు పొందేవారు మరి కొందరు. ఇందులో మొదటి రకం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే.. రెండో రకం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ముందుగా జగన్ విషయమే తీసుకుంటే.. 2019లో అధికారం చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన వెంటనే జగన్ రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను పూర్తిగా మార్చేస్తాననీ, కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించేశారు. అంటే తొలి రెండున్నరేళ్లు తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారెవరూ రెండున్నరేళ్ల తరువాత ఉండరనీ, వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రులుగా కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించారు. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ శ్లాఘించారు. సాహసోపేత నిర్ణయంగా కీర్తించారు. అలా చేయడం వల్ల మంత్రుల పనితీరే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారని భావించారు. రెండున్నరేళ్లు కాదు.. మూడేళ్లు గడిచిన తరువాత జగన్ చేసింది మంత్రివర్గ  మార్పు కాదు.. పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మరికొందరికి స్థానం కల్పించారు. మొత్తం కేబినెట్ ను మారుస్తానంటూ నాడు చేసిన ప్రకటనను పూర్తిగా మర్చిపోయారు. ఆ మార్పులు కూడా  భయం భయంగా ఎవరిని తొలగిస్తే ఏం సమస్య వస్తుందో అన్నట్లు కసరత్తుల మీద కసరత్తులు, ఒకసారి ఒకరిని అనుకుని కాదు కాదు అంటూ మరొకరి పేరు...ఇలా అంతా గందరగోళం. చివరికి పునర్వ్యవస్థీకరణ చేసినా.. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి. నిరసన ప్రదర్శనలు మొత్తం మీద కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పూర్తయిన నెలల తరువాత కూడా ఇప్పటికీ పార్టీలో అసమ్మతి చల్లారలేదు. మూడేళ్ల ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా తడబాటు. అన్ ప్రిపేర్డ్ నెస్.. ఎవరిని కదిపితే ఏమౌతుందోనన్న భయం. దీంతో జగన్ కేబినెట్ రీషఫుల్ తరువాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. అసమ్మతి రాగాలు శ్రుతి మించాయి. నిరసనలు పరిధి దాటాయి. నెలలు గడుస్తున్నా కొత్త మంత్రులు పూర్తిగా కుదురుకోలేదు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతోనే ఆ పార్టీ బలహీనతలూ బయటపడ్డాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురై మాజీ లైన వారు సైలెంటైపోయారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన దాఖలాలూ కనిపించడం లేదు. మంత్రులుగా నిత్యం విపక్షంపై విమర్శలతో చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాలలోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే ఆయన 2004 నుంచి ఒడిశా సీఎంగా ఉన్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీని విజయ పథంలో నడిపించారు. 2014 ఎన్నికలలో విజయం తరువాత మూడేళ్ల వరకూ కేబినెట్ లో ఎటువంటి మార్పూలూ చేర్పులూ లేవు. ఇప్పడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఉపక్రమించారు. అంతే సీఎంకు సంఘీభావంగా, పునర్వ్యవస్థీకరణకు ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనువుగా స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. ఈ రోజు అంటే ఆదివారం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. సీఎం కొత్త కేబినెట్ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేశారు. అదీ పార్టీపై పట్టు ఉండటమంటే. ఆయనేం మూడేళ్ల తరువాత మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానని 2019లో కేబినెట్ ఏర్పాటు సమయంలో చెప్పలేదు. కానీ ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని తలపెట్టగానే మంత్రులందా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.   స్పీకర్ సహా మంతులంతా   తమ రాజీనామాలను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించారు. ఒడిశా శాసనసభ స్పీకర్ సూర్య నారాయణ్ పాత్రో తొలుత తన రాజీనామాను సమర్పించారు. అనంతరం మంత్రులంతా రాజీనామా చేశారు. పార్టీలో కానీ, మంత్రులలో కానీ ఎక్కడా, ఎవరిలోనూ అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం అయిన దాఖలాలు లేవు. అదీ ఒడిశా సీఎం పట్నాయక్ కు, ఏపీ సీఎం జగన్ కూ  తేడా. స్ఫష్టత, విశ్వాసం, విశ్వసనీయతా నవీన్ పట్నాయక్ బ్రాండ్ అయితే.. అస్పష్టత, అయోమయం జగన్ బ్రాండ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

టెన్త్ పరీక్షల నిర్వహణే కాదు.. ఫలితాల ప్రకటనలోనూ జగన్ సర్కార్ ఫెయిల్

జగన్ మూడేళ్ల పాలన అంతా తప్పులు చేయడం.. వాటిని సవరించుకోవడంతోనే సరిపోయింది. మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఆఖరికి ఫలితాల ప్రకటన వరకూ అన్నీ తొందరపాటు నిర్ణయాలే.. ఆ తరువాత కోర్టులు అక్షింతలు వేయడం వల్లో.. మంత్రుల జోక్యం వల్లో మళ్లీ నిర్ణయాలు మార్చుకోవడం జగన్ పాలన అంతా ఇదే తంతుగా సాగింది.సాగుతోంది. తాజాగా శనివారం టెన్త్ ఫలితాల ప్రకటన విషయంలో కూడా అదే జరిగింది. పరీక్షలు పూర్తయిన పాతిక రోజుల్లోనే ఫలితాలను ప్రకటించేస్తున్నామని విద్యాశాఖ ఘనంగా ప్రకటనలు ఇచ్చేసింది. ఈ హడావుడిలో టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ, అది కూడా వైసీపీ వాట్సాప్ గ్రూపులలోనే ప్రశ్నాపత్రాలు వెలుగులోనికి రావడం, లీకేజీకి బాధ్యుడంటూ మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసి హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీలో కోర్టులో ప్రవేశ పెట్టడం కోర్టు నారాయణకు బెయిలు ఇవ్వడం వంటివన్నీ జనం మరచిపోతారని వైసీపీ భావించింది.  తీరా ఇప్పుడో ఇహనో పరీక్షా ఫలితాలు వెలువడుతాయని విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఫలితాల విడుదల వాయిదా అంటూ విద్యాశాఖ అధికారులు ప్రకటించారురు. విద్యార్థులు నిరాశపడ్డారు. ఇంతకీ ఫలితాల విడుదల వాయిదాకు కారణమేమిటంటే విద్యాశాఖ మంత్రిగారికి కోపం రావడమేనట. సాధారణంగా టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. కానీ ఏపీలో ఈసారి అధికారులు అత్యుత్సాహంతో మంత్రిగారికి ఫలితాల విడుదల గురించిన సమాచారమే అందించలేదట. విద్యాశాఖాధికారే ఫలితాల విడుదలకు రెడీ అయిపోయారట. చివరి నిముషంలో విషయం తెలిసిన మంత్రి బొత్స అగ్గిమీద గుగ్గిలం అయిపో్యి సదరు విద్యాశాఖాధికారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫలితాల విడుదల వాయిదా పడిందట. ఇక సోమవారం ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని అంటున్నారు. జూన్ 4 అంటే శనివారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో  విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోయి ఫలితాల కోసం టెన్షన్ తో ఎదురు చూశారు. చివరి నిముషంలో వాయిదా ప్రకటన రావడంతో అందరూ డీలా పడిపోయారు.  మొత్తానికి జగన్ సర్కార్ పరీక్షల నిర్వహణే అంటే నిర్వహించిన పరీక్షల ఫలితాల విడుదలలోనూ అపహాస్యం పాలైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప రీక్షా ఫలితాల విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించే సర్కార్ ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫలితాల ప్రకటిస్తున్నామంటూ ఊరించి చివరి నిముషంలో వాయిదా వేయడంతో పరీక్షలు రాసిన పిల్లల వారి తల్లిదండ్రులూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సిద్ధపడ్డారంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.  ఏది ఏమైనా టెన్త పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్ని విషయాలలోనూ జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలయ్యిందని లోకేష్ విమర్శించారు. ఇక టెన్త్ ఫలితా విడుదల ప్రహసనంలో బొత్స కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని దక్కించుకున్నా ప్రమోషన్ ఆశించిన బొత్సకు డిమోషన్ దక్కడంతో ఆయన లోలోన రగిలిపోతున్నారని అంటున్నారు. ఆ కారణంగానే విద్యాశాఖ విషయాలను అసలు పట్టించుకోవడం లేదనీ, ఆ కారణంగానే అధికారులు ఆయనతో సంప్రదించకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే టెన్త్ ఫలితాల ప్రకటన చేసేశారనీ, చివరి నిముషంలో బొత్స రంగ ప్రవేశం చేసి అధికారులపై కోపంతో చిందులు వేసి ఫలితాల విడుదలను వాయిదా వేశారనీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రిగారికి కూడా సమాచారం ఇవ్వకుండా ఫలితాల విడుదల ముహూర్తాన్ని అధికారులు తమంత తాముగా నిర్ణయించి ఉంటారా అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు లేదనే చెబుతున్నారు. అధికారులు అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయరనీ, ఈ నిర్ణయం వెనుక జగన్ అనుమతో, ప్రోత్సాహమో కచ్చితంగా ఉండి ఉంటుందనీ అంటున్నారు. విద్యాశాఖ విషయాలలో మంత్రి బొత్స పట్టించుకోవడం లేదని జగన్ కు స్పష్టమైన సమాచారం అందిన నేపథ్యంలోనే బొత్స విషయం మరచి పోయి మీరు పని కానిచ్చేయండి ప్రోత్సహించడంతోనే అధికారులు ఫలితాల ప్రకటనను ముహూర్తం నిర్ణయించి ప్రకటించేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద టెన్త్ ఫలితాల  విడుదల, వాయిదాల ప్రహసనంతో పార్టీలో, కేబినెట్ లో ఆఖరికి తన మంత్రివర్గ సహచరులలో కూడా బొత్స ప్రతిష్ట, పరపతి క్షీణించాయని అర్ధమౌతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

బీజేపీ- వైసీపీ.. హస్తినలో దోస్తీ.. ఏపీలో కుస్తీ!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో బీజేపీ తన అభ్యర్థిని దింపుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ పోటీకి సై అన్నారు. ‘కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ‘వైసీపీకి దమ్ముంటే ఓట్లు కొనకుండా.. ఓటర్లను మంత్రులు ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికలో గెలవాల’ని సవాల్ చేయడాన్ని పరిశీలకులు ఒక పెద్ద జోక్ గా అభివర్ణిస్తున్నారు.   ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింద’నే సామెతను సోము వీర్రాజు మాటలు గుర్తుచేస్తున్నాయంటున్నారు. ఓట్లు రావు.. గెలుపు సాధ్యం కాదు.. కనీసం డిపాజిట్ అయినా అనుమానమే.. అయినా.. తగుదునమ్మా అంటూ ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కమలం పార్టీ పోటీకి సై అంటూ పోటీలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఏ నియోజకవర్గంలోనూ బీజేపీకి  కనీస స్థయి ఓట్లు కూడా లేవనేది నూటికి నూరుపాళ్లూ వాస్తవం. రాష్ట్రంలో పొత్తులు లేకుండా కనీసం ఒక్క స్థానం కూడా గెలిచిన సందర్భం లేదు.  అలాంటిది.. సోము వీర్రాజు అధికార వైసీపీని సవాల్ చేయడం, ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలన్న టీడీపీ నిర్ణయాన్ని వేలెత్తి చూపడం  అతి చేయడమేనని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ వర్గాలలో అయితే  అసలాయన తెలివి ఉండే మాట్లాడుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. గతంలో ఏపీలో నలుగురు బీజేపీ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారంటే అందుకు అప్పట్లో ఆ పార్టీకి తెలుగుదేశంతో పొత్తు ఉండటమే కారణం అనడంలో సందేహం లేదు.ఆ విషయాన్ని మరచి, సోము వాగాడంబరానికి పోవడం జోక్ కాక మరేమిటని నిలదీస్తున్నారు. టీడీపీకి స్థిరమైన సిద్ధాంతం లేదట. ఎంత మాట.. ఎంత మాట.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలట. ఇలాంటి డిమాండ్ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయడం చోద్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సోము వీర్రాజు తీరు  ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. పైగా మంత్రుల్ని ఎన్నికల ప్రచారంలో దింపకుండా , డబ్బులు పంచకుండా కేవలం అభ్యర్థులు మాత్రమే ప్రచారంలో పాల్గొని గెలవాలని సోము వీర్రాజు అధికార వైసీపీకి సవాల్ చేస్తున్నారట. సోము వీర్రాజు మాటలు వింటుంటే.. ‘నేను కొట్టినట్టు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్లు యాక్ట్ చెయ్యి’ అన్నట్లు ఉందంటున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అనే ట్యాగ్ తో తన అభ్యర్థిని బరిలో దింపుతున్న బీజేపీ.. లోపాయికారీగా వైసీపీతోనే అంటకాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కార్ తీసుకునే ఏ నిర్ణయానికైనా  జగన్,  జీ హుజూర్ అనడం అందరికీ తెలిసిన విషయమే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే.. జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా.. ప్రధాని మోడీ సహా కేంద్రంలోని పెద్దలు అపాయింట్ మెంట్ ఇస్తూనే ఉండడం గమనార్హం. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రం పెద్దల నుంచి ఏపీ కోసం జగన్ రెడ్డి ఏమి వరాలు తెస్తారో తెలియదు కానీ.. సొంత విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తుంటాయి. ఢిల్లీ స్థాయి పెద్దలు జగన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు. ఏపీలోని బీజేపీ నేతలు మాత్రం జగన్ పార్టీకి సవాళ్లు విసురుతుంటారు. అంటే ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లు ఆ రెండు పార్టీల తీరూ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక పక్కన బీజేపీతో తాను పొత్తులో ఉన్నదీ లేనిదీ జనసేన అధినేత డైరెక్ట్ గా ఎప్పుడూ ఎక్కడా చెప్పరు. కానీ.. రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం జనసేనతో, పవన్ కళ్యాణ్ తో తమ దోస్తీ కొనసాగుతోందనే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు.  

అమరావతి రైతుల ఉద్యమానికి 900 రోజులు.. సుదీర్ఘ ఉద్యమంగా చరిత్రలో చిరస్థాయి

అమరావతి రాజధాని ఉద్యమం  సుదీర్ఘ కాలంగా నిర్విరామంగా కొనసాగుతున్న ఉద్యమంగా   చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న ఉద్యమం శనివారం నాటికి 900 రోజులకు చేరింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేపట్టిన ఉద్యమం నిరంతరాయంగా సంవత్సరం నాలుగు నెలల రెండు రోజులు కొనసాగింది. అంటే 427 రోజులు కొనసాగిందన్నమాట. దేశంలో జరిగిన ఉద్యమాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ఒకటి. అయితే.. అమరావతి ఉద్యమం 900 రోజులకు చేరుకోవడమే కాకుండా ఇంకా కొనసాగుతుండడం గమనించదగ్గ అంశం. అడ్డగోలు విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా   చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాని అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు 33 వేలకు పైగా ఎకరాలను ప్రజా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. చంద్రబాబు పర్యవేక్షణలో సరికొత్త అమరావతి నగర నిర్మాణం వేగంగా జరుగుతున్న  క్రమంలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అమరావతి నగర నిర్మాణ వేగం తగ్గిపోయింది. అంతే కాకుండా 2019 డిసెంబర్ లో ఆయన మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి అమరావతిని కేవలం శానస రాజధాని చేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటి వరకు అమరావతికి ఎంతో కష్టపడి తెచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోయింది. కొన్ని లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమరావతి రైతుల ఆశల్ని చిదిమేసినట్లయింది. వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరావతిని రాజధానిగా నిర్మించేందుకే తామంతా తమ భూములు ఇచ్చామని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు 2019 డిసెంబర్ 17న అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. నిరాహార దీక్షలతో పాటు వివిధ రూపాల్లో రైతులు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. అయితే.. రైతుల ఉద్యమానికి ప్రభుత్వం, పోలీసులు తొలుత అనుమతించకపోవడంతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమంలో రైతులు, మహిళలు, కవులు రైతులు, చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాది మంది పాల్గొంటున్నారు.  ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్షలు చేశారు. సభలు నిర్వహించారు. దేవుళ్లు, దేవతలకు మొక్కులు కట్టారు. జలదీక్షలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట అమరావతిలోని హైకోర్టు ప్రాంతం నుంచి తిరుపతి వెంకన్న ఆలయం వరకూ పాదయాత్ర  చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూశారు. అరెస్టులు అయ్యారు. అమరావతి రైతులు తీవ్ర నిర్బంధాలకు గురయ్యారు. వైసీపీ మంత్రుల నిందారోపణలు భరించారు. ఆకలి దప్పులతో అలమటించి కూడా అన్నదాతలు తమ ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం విశేషం.  ప్రధాని మోడీ స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. బీజేపీ మాత్రం ముందుగా రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతివ్వలేదు.‘న్యాయాలయం టూ దేవాలయం’ పాదయాత్రకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చిన క్రమంలో బీజేపీ ఏపీ నేతలు అమరావతి రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించడం, ఉద్యమిస్తున్న రైతులతో కలిసి నడవడం గమనార్హం. అమరావతి ఉద్యమం 250 రోజులైన సందర్భంగా టీడీపీ అధినేత తన ట్విట్టర్ వేదికగా ‘ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు. ఇంత జరుగుతున్నా.. ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదే. పైగా వేలాది మంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.  జగన్ రెడ్డి సర్కార్ జగమొండిగా వ్యవహరించి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. చివరికి కోర్టు మొట్టికాయలు వేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పింది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు న్యాయస్థానం నుంచి మొట్టికాయలు పడిన కారణంగా మూడు రాజధానుల బిల్లుల్ని నిలిపివేసింది. అయితే.. అమరావతి నగర నిర్మాణాన్ని మాత్రం ముందుకు సాగనివ్వడంలేదు. కోర్టు ఆదేశాలతో ఆందోళన చేస్తున్న రైతుల్లో సంతోషం కలిగినా.. రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు తమ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆ ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి మళ్లీ సుప్రీంకోర్టు కలగజేసుకుని.. అమరావతి నగర నిర్మాణం కొనసాగించాలని గడువు విధించింది. అలాగే వైసీపీ సర్కార్ రద్దు చేసిన సీఆర్ డీఏను పునరుద్ధరించాలని ఆదేశించింది. భూములు తీసుకున్న రైతులకు ప్రభుత్వం ఒప్పుకున్న ప్రకారం అభివృద్ధి చేసిన స్థలాలు నిర్ణీత గడువులోగా అప్పగించాలని ఆదేశించింది. ఆ క్రమంలో రైతులు తమ తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు పిలుపు ఇస్తున్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న జగన్ రెడ్డి సర్కార్ దుర్నీతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మూడు దశాబ్దాలు వెనకబడిపోయిందనే విమర్శలు, ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ ఢిల్లీ టూర్.. గుట్టురట్టు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల తాజా ఢిల్లీ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలదే అత్యంత కీలక పాత్ర.. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ జరిగిందంటూ మీడియాలో ఓ ప్రచారం   హోరెత్తింది. మరోవైపు ప్రధానితో సీఎం జగన్ భేటీకీ సరిగ్గా రెండు రోజుల క్రితమే.. ఒడిశా సీఎంతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారని.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలతో మోదీ వరుస భేటీలు జరుగుతున్నాయంటూ మీడియా పలు కథనాలను   వండి వార్చింది.  అయితే ప్రధాని మోదీతో సీఎం జగన్ తాజా భేటీ వెనుక అర్థం, పరమార్థం, అంతర్థం వేరే ఉందనే ఓ టాక్   తాడేపల్లి ప్యాలెస్‌లో  హాట్ హాట్ గా నడుస్తోంది. పీఎం మోదీ, సీఎం జగన్ మధ్య దాదాపు 45 నిమిషాల భేటీ జరిగిందని.. ఈ భేటీలో టీటీడీ జేఈవో ఏ.వి.ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందనీ తాడేపల్లి ప్యాలెస్ చర్చల సారాంశం.  అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.    ఏవీ ధర్మారెడ్డి కేంద్ర సర్వీస్ అధికారి అన్న సంగతి అందరికీ తెలిసిందే. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే.. ఏవీ ధర్మరెడ్డిని తమ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై పంపాలంటూ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.   దాంతో ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఏవీ ధర్మారెడ్డిని టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా   జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద నియమించింది. నాటి నుంచి ఆయన ఆ పోస్టులోనే ఉంటూ ఆ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సేవలో కొనసాగుతున్నారు.   మరోవైపు టీటీడీ ఈవోలుగా ఎవరు వచ్చి.. వెళ్లినా.. తాను మాత్రం పక్కా లోకల్ అన్నట్లు   ధర్మారెడ్డి మాత్రం తిరుమలలోనే పాతుకుపోయారు. మరోవైపు అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి కూడా మళ్లీ .. అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో టీటీడీ ఈవోగా ఎఫ్ఏసీ హోదాలో ఏవీ ధర్మారెడ్డిని కొనసాగిస్తూ ఈ వైయస్ జగన్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు  జారీ చేసింది.   అయితే 2022, మే 14తో డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చిన ఏవీ ధర్మారెడ్డి పదవి కాలం ముగిసింది. దాంతో ఆయన మళ్లీ అంటే.. 2022 మే 15వ తేదీ కేంద్ర హోం శాఖకు రిపోర్ట్ చేయాలి. కానీ ఈ ధర్మారెడ్డి మాత్రం ఆనంద నిలయాన్ని వదిలి .. హస్తినకు వెళ్లలేదు. దీంతో టీటీడీ ఉద్యోగులే కాదు.. తెలుగు ప్రజలు సైతం ధర్మారెడ్డి మళ్లీ పేరెంట్ కేడర్‌కు ఎందుకు వెళ్లలేదనే సంశయాన్ని   వ్యక్తం చేస్తున్నారు.    మరోవైపు... ఏవీ దర్మారెడ్డిని టీటీడీలో కొనసాగించాలని   జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలుస్తోంది.   ఏవీ దర్మరెడ్డి మరో రెండేళ్లలో రిటైర్మెంట్ కానున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరో రెండేళ్ల సమయం ఉంది.    ఏవీ ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై ఏపీలోనే కొనసాగించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్జప్తి చేస్తూ.. అందుకు సంబంధించిన దస్త్రాన్ని   ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో పంపిందట.   అయితే ఈ దస్త్రంపై ప్రధాన మంత్రి కార్యాలయం కోర్రిలు మీద కోర్రిలు వేసి..   పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో ఈ ఏవీ దర్మారెడ్డి చేత.. కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగానికి రాజీనామా చేయించి.. ఆయనను ఏపీ సివిల్ సర్వీస్‌ అధికారిగా తీసుకోవాలనే నిర్ణయానికి కూడా సీఎం జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. దీని వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కవాల్సి వస్తుందని.. సీఎం జగన్‌కు వారు సూచించినట్లు తెలుస్తోంది.  ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయి..  ఏవీ ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు అంశంపై  చర్చిస్తే.. ఫలితం ఉండే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌కు ఆయన ముఖ్య సలహాదారు సూచించారట. ఆ క్రమంలో   జగన్..  హస్తనకు పరుగు తీసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోం మంత్రి అమిత్ షాతో బేటీ అయినట్లు సమాచారం. మరి ధర్మారెడ్డి డిప్యూటేషన్ అంశంపై మోదీ, అమిత్ షా ద్వయం ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది   త్వరలో తేలనుంది. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నీకు ఇది... నాకు ఇది (క్విడ్ ప్రోకో) తరహా రాజకీయం జరిగినా   ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది.    మరోవైపు.. పాదయాత్ర సందర్బంగా నాటి ప్రతిపక్ష నేతగా  జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అందుకోసం..ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు సైతం వంచుతామంటూ ప్రగల్భాలు పలికిన సంగతి   తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా జగన్ ఎన్నో చెప్పారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి.. వచ్చినా.. ఆయన మాత్రం ప్రధానితో జరిగిన భేటీలో ఏం జరిగిందో.. కనీసం పెదవి విప్పి కూడా చెప్పరన్న సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలు ఏమిటనేది కూడా మూడో కంటికి సైతం తెలియదన్న సంగతి కూడా తెలిసిందే. కానీ తాజాగా  జగన్ ఢిల్లీ టూర్‌.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసమే అంటూ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా జోరుగా చర్చ జరగడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్  అయింది... అవుతోంది.

కేసీఆర్ చేస్తే తప్పు..మోడీ చేస్తే ఓప్పూనా.. దొందూ దొందే..!

సంద‌ర్భాన్ని అనుస‌రించి వీరాభిమానానికి  అంతు వుండ‌దు. చాలాకాలం సినీ దిగ్గ‌జ హీరోల  జ‌న్మదినా ల‌కు పేప‌ర్ల‌లో భారీ యాడ్స్ రావ‌డం చూశాం. వారి ఉత్సాహాం ఆకాశాన్ని అంటుతుంది. వారిది వేరే  లోకం. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు విజ‌య‌వంతమ‌వుతున్న దృష్ట్యా వాటికి సంబంధించిన యాడ్స్ ఇస్తుండ‌డం ప్ర‌భుత్వా లకు ప‌రిపాటి. ఒక‌రు యాడ్స్‌తో  రెచ్చిపోతున్నార‌ని,  మ‌రొక‌రూ రెచ్చిపోవ‌చ్చు. అది పోటీ అవుతుంది. కానీ  చిత్ర‌మేమంటే, ఒక‌రిని తిడుతూ,  తామూ అదేప‌ని చేయ‌డం స‌మంజ‌స‌మా?  అది పాల‌కులవారికే  తెలి యాలి.  ఎందుకంటే,  ఇప్పుడు చిత్ర‌మ‌యిన చ‌ర్చ‌నీయాంశం ప‌త్రిక‌ల్లో, టీవీల్లో వ‌స్తున్న‌, వ‌చ్చిన యాడ్స్ గురించిన‌దే.  ఇంకాస్త తెలియాలంటే మొన్న తెలంగాణా ఆవిర్భావ‌దినోత్స‌వం రోజున రాష్ట్రంలోని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన యాడ్స్ మ‌ళ్లీ  ఒక‌సారి చూడండి ..పోనీ గుర్తు చేసుకోండి. అంతా  ముఖ్య‌మంత్రి కేసీఆర్ ని భ‌జ‌న‌చేస్తూ వ‌చ్చి న భారీ రంగుల ప్ర‌క‌ట‌న‌లు. అదీ ఏకంగా మూడేసి పేజీలు. అదీ తెలంగాణకు పరిమితం కాదు.. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోనే తెలంగాణ ప్రగతి ప్రకటనల జోరు కనిపిపించింది.  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఈ ప్రకటనలు వాహకంగా ఉపయోగపడతాయని ఆయన భావించి ఉండొచ్చు. కానీ బిజెపీతో స‌హా ప్ర‌తిప‌క్షాల‌న్నిటికీ  క‌డుపు మండింది.  అస‌లే  ఆర్ధికంగా ప‌రి స్థితులు అధ్వానంగా ఉన్న కాలంలో ఇంత‌టి ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అని తెలంగాణా ప్ర‌భుత్వాన్ని తిట్టిపోశాయి.   ఆ ప్రకటనలకురమారమి300 కోట్ల రూపాయలు వ్యయం చేశారని అంచనా. ఏ ప‌త్రిక చూసినా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలువెత్తు ఫోటోల‌తో మూడు పేజీల కలర్ ఫుల్   యాడ్స్‌! మ‌రి విప‌క్షాల‌కు వుక్రోషం రాకుండా వుంటుందా?  ఆవిర్భావ దినోత్స‌వం సంద ర్భంగా ఆ రోజుకివ్వాల్సిన ప్ర‌త్యేక‌త కంటే  సీఎంకే అధిక ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టు  విప‌క్షాలు భావించేయి. క‌స్సుమ‌న్నాయి.   మ‌రి స్వ‌యానా  కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వం వారు చేసిన‌దేమీటి?  కేసీఆర్ ప్రకటనలను విమర్శించిన వారు వారి నేత మోడీ ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించారు? ఆజాదీ కా అమృతోత్స‌వ్ పేరిట, వివిధ ప‌థ‌కాల సంబంధించి దాదాపు అన్ని భాషా ప‌త్రిక‌లు, ఛానళ్లలో  ప్ర‌క‌టన‌లు కుమ్మేసారు. ఉత్త‌రాది ప‌త్రిక‌ల‌న్నీ, ముఖ్యంగా జాతీయ  స్థాయి ప‌త్రిక‌ల్లొ  మ‌రి ప్ర‌ధాని మోడీ బొమ్మ తోనే గ‌దా  రంగుల ప్ర‌క‌ట‌న‌లు కుమ్మ‌రించింది!!  మ‌రి దీన్ని ఏమ‌నాలి?  దీనికి ఎవ‌రు బాధ్యులు?   ఒక‌రు చేస్తే త‌ప్పు అయిన‌ది త‌మ‌రూ చేసి చూప‌డం  ఏ విధంగా స‌మ్మ‌తం?  దేశాన్ని పాలిస్తున్నందుకు ఇలాం టి విష‌యాలు ఇత‌రుల‌తో పోల్చి చూడ‌కూడ‌ద‌ని  బిజెపి నాయ‌కులు, వీరాభిమానులు భావిస్తే అంత‌కంటే అమాయ‌క‌త్వం మ‌రోటి వుండ‌దు. ప్ర‌జ‌లు  అన్నీ గ‌మ‌ని స్తున్నార‌ని, మ‌న కంటే చాలా తెలివిమంతులు అని మాటి మాటికీ విప‌క్షాల‌ను భ‌య‌పెడుతూన్న కేంద్ర ప్ర‌భుత్వం, బిజెపి నాయ‌కులు ఈ విష‌యంలో త‌మ‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌డం లేద‌నుకోవ‌డం  పిల్లి  క‌ళ్లు మూసుకుని పాలు తాగ‌డం వంటిదే క‌దా .. దేవ‌రా! తెలంగాణ ప్రకటనలకు అయిన వ్యయంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు బిజెపి,   బిజెపి ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో ఒక్క మాటా మాట్లాడ‌టం లేదేమి?  వెక్కిరించే వేలు, ముడిచిన మూడు వేళ్ల‌ను చూడ‌ద‌ట‌!  ఇదీ అంతే. వారు ఢిల్లీ వారు, వీరు తెలంగాణావారు. వారు దేశ పాల కులు గ‌నుక నోరెత్తితో ఏమ‌వుతుందోన‌ని స‌ద‌రు విప‌క్షాలు వొణికిపోతాయి.  ఇక్క‌డంటే ప్రాంతీయ పార్టీ, ప్ర‌భుత్వమే కాబ‌ట్టి  విప‌క్షాల‌వారు త‌మ‌ నాలుక మ‌డ‌త‌బ‌డినా  కొంప‌ మున‌గ‌దు  గ‌నుక‌!  మేడ మీద నుంచీ  కిందివారు అన్యాయ‌మ‌ని  తిట్ట‌డం సులువే.  మ‌రో అంత‌స్తుకి వెళ్లి  కిందివారినే అనుస‌రించడం బుద్ధిహీన‌తే అవుతుంది?         వారు చేస్తే అన్యాయం అయిన‌ది  మ‌రీ అతిగా మీరు చేస్తే  వొప్పు ఎలా అవుతుంది  మ‌హాప్ర‌భూ! దొందూ దొందే!   కాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి, మోడీ ప్రధాన మంత్రి అంతే తేడా.

తెలంగాణా పోరాటంలో అల్లూరి పాత్ర‌?!.. కిష‌న్‌ రెడ్డి సరి కొత్త చరిత్ర పాఠం

పిల్ల‌డు పాఠం త‌ప్పు చ‌దివితే తిట్టేవాళ్లు, వీల‌యితే నాలుగు త‌న్నేవాళ్లూ క‌నీసం అయిదుగురు వుంటారు. పెద్ద‌వాళ్లే పొర‌ప‌డితే?! అందులోనూ  ఎర్ర‌బొట్టు పెట్టుని రొమ్మువిరుచుకు తిరిగే  బిజెపి  మ‌హానేత పొర‌బ‌డితే? అది పొర‌బ‌డ‌టం కింద‌కి అస్స‌లు రాదు. ఎందుకంటే కేంద్ర ప‌ర్యాట‌క శాఖా మంత్రి  కిష‌న్ రెడ్డి గ‌నుక‌. ఆయ‌న చేసిన త‌ప్పిదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏడ‌వ త‌ర‌గతి పిల్లాడు చేయ‌బోడు గ‌నుక‌!       మొన్న తెలంగాణా ఆవిర్భావ దినోత్స‌వం ఏకంగా ఢిల్లీలో బిజెపి స‌ర్కారు నిర్వ‌హించింది. అదీ ప‌ర్యా ట‌క శాఖ ఆధ్వ‌ర్యంలోనే.  కొత్త రాష్ట్రాన్ని  పోనీ  ఇలాగ‌యినా  గౌర‌విస్తున్నార‌నే యావ‌త్  తెలంగాణా వాదులూ అనుకున్నారు. కానీ కేంద్రంలో పాల‌కుల‌ను, త‌మ పార్టీ అధినేత వ‌ద్ద మెప్పు పొందాల‌ని కిష‌న్ కాస్తంత ఎక్కువ‌గానే  ఓవ‌రాక్ష‌న్ చేశార‌న్న‌ది ఫోటో ఎగ్జిబిష‌న్ సంద‌ర్భంగా  పాపం ఆయ‌నే బ‌య‌ట పెట్టు కున్నారు.  ఒక గొప్ప సంద‌ర్భం గ‌నుక  తెలంగాణా రాష్ట్ర చరిత్ర సంబంధించి మంచి ఫోటో ఎగ్జిబిష‌న్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. మంచిదే. దాన్ని ప్రారంభించి తిల‌కించినది కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయ‌న్ను అతి ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి  కిష‌న్ బాగానే  తాప‌త్ర‌య‌ప‌డ్డారు.  కానీ ఆవేశం కాస్తంత క‌ట్ట‌లు తెంచుకుంది.  అదీ చరిత్ర‌లో చెప్ప‌ని  సంగ‌తీ సంద‌ర్భాన్ని క‌ల్పించ‌డం, దాన్ని పాపం అమిత్ షా చాలా అమాయ‌క‌త్వంతో విన‌డం, ఫోటోలు చూడ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు క‌నీసం రెండునెల‌లు న‌వ్వుకోవ‌డానికి వీలుక‌ల్పించింది.  ఏ కామెడీ కూడా  ఇందుకు బాలాదూర్‌! ఇంత‌కీ సంగ‌తేమంటే, తెలంగాణా పోరాటంలో  కొమురం భీమ్,  రాంజీ గోండుతో క‌లిసి అల్లూరి సీతా రామరాజు కూడా పోరాడాడు అని వివ‌రించి మ‌రీ చెప్ప‌డం. ఇంత‌కంటే అజ్ఞానం మ‌రోటి వుంటుందా అని యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లూ అవాక్క‌య్యారు.  ఏ గుజ‌రాతీవాడో అలా అంటే తెలంగాణ చ‌రిత్ర తెలీద‌ని అనుకోవ‌చ్చు. ప‌చ్చి తెలంగాణా ప్రాంతీయుడు, మీదు మిక్కిలి తెలంగాణా నుంచీ వెళ్లి, కేంద్రంలో మంత్రిగా వెల‌గ బెడుతున్న‌వాడూ అలా పాఠం చెబుతున్న‌ట్టు అమిత్ షా కి వివ‌రించ‌డం చాలా దారుణం. ఏమాత్రం క్షంత‌వ్యం కాదు.  పుట్టి పెరిగిన తెలంగాణా సంబంధించిన చ‌రిత్ర తెలిసి అల్లూరిని తెలంగాణా పోరాట యోధుల‌లో ఒక‌డిగా చెప్ప‌డం  అస‌లు కిష‌న్ రెడ్డికి  తెలంగాణా చ‌రిత్ర గురించి మాట్లాడే అర్హ‌త వుంద‌ని ఎలా అనుకోవాలి?  చిత్ర‌మేమంటే, పొర‌బాటో,  అమిత్ షా వంటి మ‌హానాయ‌కునితో ఫోటో ఎగ్జిబిష‌న్ చూస్తున్న ఆనందంలోనో, అస‌లు ఢిల్లీలో త‌న మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో తెలంగాణా ఆవిర్భావ దినో త్స‌వం నిర్వ‌హించాన‌న్న రెట్టించిన ఉత్సాహంతోనో తుళ్లి మ‌రీ అన్న మాట కాదు. చాలా స్ప‌ష్టంగా త‌న అజ్ఞానాన్ని తానే ప్ర‌ద‌ర్శించుకోవ‌డ‌మే! టీచ‌ర్లు ఏది బ‌డితే అది బోధించ‌రు.  చ‌రిత్ర‌కు సంబంధించిన అంశాలు ..అస‌లా మాట‌కు వ‌స్తే ఏద యినా.. ఇంత దారుణంగా మార్చి చెప్ప‌గ‌లిగిన బోధ‌కుడు  కిష‌న్ రెడ్డి మాత్ర‌మే.  ఈయ‌న‌కు కాలేజీలో పాఠాలు చెప్పిన‌వారు, పోనీ  తెలంగాణా స్నేహితులు  నైజాం వ్య‌తిరేక పోరాటంలో అల్లూరి ప్ర‌స్థావ‌న తెచ్చి వుంటార‌ని బుద్ధి జీవులెవ‌రూ లేశ‌ మాత్రం కూడా అంగీక‌రించ‌రు.  అస‌లు అదెలా సాధ్య‌మ‌న్న చిన్న‌పాటి ఆలోచ‌న కూడా లేక‌పోవ‌డం బుద్ధిహీన‌తే అవుతుంది.   బిజెపి మంత్రులు, నాయ‌కులు దేశ‌, ప్రాంతీయ భ‌క్తి ర‌సం కాస్తంత అధిక‌మొత్తంలో తీసుకుంటు న్నార‌న్న‌ది  కిష‌న్ రెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు.  ఎర్ర‌టి పెద్ద బొట్టుపెట్టుకుని, రుద్రాక్ష‌లు వేసుకుని  హిందూత్వ ఉప‌న్యాలు అప్ప‌జెప్ప‌డం కొంత త‌గ్గించుకోవ‌డం చాలా అవ‌స‌రం.  అమిత్ షాకి తెలంగాణా గురించి లేశ‌ మాత్రం తెలిసి వుండ‌క‌పోవ‌చ్చు. కొమురం భీమ్ పేరు ఆనోటా, ఈ నోటా పోనీ విన్నాడే అనుకుందాం.. కానీ  ఏకంగా కేంద్ర‌ మంత్రి, అందునా తెలంగాణా ప్రాంతీయుడు అయిన కిష‌న్ రెడ్డి చెప్పే త‌ప్పుల సోది విన‌డం వారి ఖ‌ర్మం అనుకోవాలంతే!  పాప‌ము  శ‌మించుగాక‌!

నేరాల అడ్డా.. తెలంగాణ గడ్డ..! అధ్వానంగా శాంతి బద్రతలు

బంగారు తెలంగాణ సాకారం చేస్తున్నామని ప్రభుత్వం ఒక వైపు గప్పాలు కొట్టుకుంటుంటే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. టీఆర్ఎస్ మూడేళ్ల పాలనలో నేరాల తెలంగాణ సాకారం దిశగా సాగుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి రాజకీయాలే శ్వాసగా మారిపోయిన పరిస్థితుల్లో  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ‘పెద్దల’ సేవలో తరించడమే పరమావధిగా పోలీసుల తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని గప్పాలు కొట్టుకునే ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని కన్వీనియెంట్ గా విస్మరిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడా నింబంధనలకు మన్నన లేని పరిస్థితి నెలకొని ఉంది. మహిళలకు భద్రత గాలిలో దీపంగా మారింది. నేరాలలో ‘పెద్దల’సంబంధీకుల పాత్ర ఉంటే.. ఇక ఆ కేసు దర్యాప్తు గోదాట్లో కలిసినట్లేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణ సాకారం అటుంచి నేరాల తెలంగాణ సాకారం అవుతున్న పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్ వినియోగం, పబ్బుల్లో  మైనర్లకు ప్రవేశం వెరసి తెలంగాణలో పబ్ కల్చర్ వికృత రూపం దాలుస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికపై మైనర్ బాలురు సామూహిత అత్యాచారానికి పల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో పెద్దల తనయుల ప్రమేయం ఉందనీ, దర్యాప్తు సవ్య రీతిలో జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ నమ్మించి కిడ్నాప్ చేసి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు సైతం మైనర్లు కావడం గమనార్హం. నేరం గురించి ఒకింత సేపు పక్కన పెడితే అసలు పబ్ లోకి మైనర్ల ప్రవేశానికి ఎలా అనుమతించారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. పబ్ లకు అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వెనుక కూడా ప్రభుత్వ ప్రమేయం ఉందని అంటున్నారు. అంటే టీఆర్ఎస్ భజన పరులకు అడ్డగోలుగా పబ్ లకు అనుమతులిచ్చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి పబ్ లలో నిబంధనలకు నిలువునా  పాతరేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పబ్ లలో లేట్ నైట్ పార్టీలు, ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తినా సరైన దిశగా విచారణ జరగడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ జరగడం లేదు.  తాజాగా మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం సంఘటనే తీసుకుంటే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర హోంమంత్రి మనవడు, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు ఉన్నందునే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక వైపు విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగానే ఈ కేసులో హోంమంత్రి మనవడి ప్రమేయం లేదంటూ పోలీసులు ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చేయడం, సరిగ్గా అదే సమయంలో హోంమంత్రి మనవడు తనకు ఈ అత్యాచారం సంఘటనతో సంబంధం లేదంటూ ప్రకటన చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పోలీసుల క్లీన్ చిట్ కు ముందు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సామూహిక అత్యాచారం ఘటనలో ఎంతటి వారున్నా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. వీటన్నిటినీ ఒక వరుస క్రమంలో నిశితంగా పరిశీలిస్తే పలు అనుమానాలు తలెత్తుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంఘటన జరిగిన రోజుల తరువాత కానీ  పోలీసులు ఈ సంఘటనపై స్పందించకపోవడం, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు తరువాత కూడా చురుకుగా కదిలి అనుమానితుల వేట ప్రారంభించకపోవడంతో మైనర్ బాలిక అత్యాచారం చేసులో ‘పెద్ద’ల పిల్లలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేశారు. అసలు యువత పెడమార్గం పట్టడానికి, నేరాల దారిలో వెళ్లడానికి కారణం హైదరాబాద్ నగరం మదకద్రవ్యాలకు కేంద్రంగా మారడం, పబ్ సంస్కృతి వికృత రూపం దాలుస్తున్నా ఏలిన వారి ఒత్తడికి లొంగి పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించడమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తోటకూర నాడే మందలించి ఉంటే అన్నట్లుగా సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం కేసును లాజికల్ ఎండ్ కు తీసుకు వెళ్లి ఉంటే ఈ  పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపుగా కొలిక్కి వస్తున్న కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి సినీ జనులకు క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రభుత్వం తహతహలాడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే  నగరంలోని ఫుడింగ్ పబ్ లో డ్రగ్స్ కలకలం రేపినప్పుడే ప్రభుత్వంక నిష్పాక్షక , పారదర్శక దర్యాప్తు జరిపి ఉంటే కొంతలో కొంతనా మాదక ద్రవ్యాల నిరోధంతో పాటు సంబంధిత నేరాలు కూడా అదుపులోనికి వచ్చే వనీ, కానీ రెండు సందర్భాలలోనూ కూడా ‘ ప్రభుత్వ పెద్దల’ జోక్యం అందుకు అడ్డుపడిందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రెండు సందర్భాలలోనూ కూడా డ్రగ్స్ కేసను సీబీఐ విచారణకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ‘అస్మదీయుల’ను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందనీ, అంతే కానీ మాదకద్రవ్యాల నియంత్రణను పట్టిచుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో నేర సంస్కృతి వెర్రితలలు వేస్తున్నదన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం, మాదక ద్రవ్యాలను అరికట్టంలో ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోందని అంటున్నారు.    ఇక తాజా ఘటనలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో  ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని తేల్చిన పోలీసులు ఈఘటనపై విపక్షాలు సహా అన్నివర్గాల నుంచీ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో నలుగురిని అరెస్టు చేశారు. బిగ్ షాట్ల విషయంలో మాత్రం అరెస్టుకు ముందు వెనుకలాడుతున్నారు. పోలీస్ బాస్ హోంమంత్రి మనవడికి ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇందుకు సీసీ ఫుటేజ్ లను ఆధారంగా చూపుతున్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని ఇంకా అరెస్టు చేయలేదని చెబుతున్నారు.  

తూచ్.. ఏపీ టెన్త్ ఫలితాలు ఇవాళ కాదు!

ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల వాయిదా పడింది. చివరి నిముషం వరకూ శనివారం ఉదయం 11 గంటలకల్లా టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామంటూ ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తూచ్.. ఈ రోజు కాదు సోమవారం అంటూ వాయిదా ప్రకటన చేశారు. ఫలితాల కోసం ఉదయం నుంచీ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన విద్యార్ధులు చివరి నిముషంలో వాయిదా ప్రకటన వెలువడటంతో నిరాశ చెందారు. అనివార్య కారణాలను ఉటంకిస్తూ విద్యాశాఖ అధికారులు ఫలితాల ప్రకటనను సోమవారానికి వాయిదా వేవారు. ఏపీలో విద్యాశాఖ మంత్రి మారినా విద్యాశాఖ తీరు ఇసుమంతైనా మారలేదు. ప్రతి విషయంలోనూ గందరగోలం, అయోమయం సృష్టించేలా నిర్ణయాలు తీసుకోవడం ఆ తరువాత నాలుక కరుచుకోవడం విద్యాశాఖ కు ఒక అలవాటుగా మారిపోయింది. గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ విద్యాసంస్థలను తెరుస్తామనీ, ఆఫ్ లైన్ లో కాదు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించి, చివరి నిముషంలో ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవడం పలుమార్లు జరిగింది.   సరైన సమయంలో సరైనా నిర్ణయం తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవడం  ఏపీ ప్రభుత్వ విధానంగా ఉందన్న విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. 

ప్రభుత్వాస్పత్రుల్లో యమదూతలు ఎలుకలు, చీమలు

పెద్ద జంతువులు చిన్న‌జంతువుల్ని ప‌ల‌హారం చేసుకోవ‌డం చాలా మామూలు. అది అట‌వీ న్యాయం. దాన్ని మాన‌వ‌ స‌మాజం అడ్డుకోలేదు, ఏమీ అన‌లేని స్థితి. ఇపుడు చిత్రంగా దేశంలో ఎలుక‌లు, చీమ‌లు మ‌నుషుల్ని చంపేస్తున్నాయి, చంపుకు తినేస్తున్నాయి! దీనికి మాన‌వ‌ స‌మాజం భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతోంది.  విన‌డానికి మ‌హా చిత్రంగా వుండ‌వ‌చ్చు. కానీ ఈ మ‌ధ్య కాలంలో దేశంలో ప‌లు ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి సంఘ‌ట న‌లు జ‌రిగేయి. మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా స‌రే!  చంటిపిల్ల‌ల్ని ఎల‌క‌లు, చీమ‌లు పంచ‌దార‌లా లాగించేయ‌త్నాలు పెద్ద సంఖ్య‌లో జ‌ర‌గ‌డం భ‌య‌పెడుతుంది. ఇలాంటివి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో జ‌ర‌గ‌డం మ‌రీ వొణికించేస్తోంది.  ప్ర‌భుత్వాసుపత్రులు   ఇప్పుడు అద్భుతం అని ప్ర‌చారం చేసుకుం టున్న స‌ద‌రు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ సంఘ‌ట‌న‌ల‌కు, అస‌లు ఆయా ఆస్ప‌త్రుల స్థితికి  కార‌ణాలు తెలుసుకుని ఏ చ‌ర్య‌లు తీసుకున్న‌ది లోకానికి తెలియాలి. ఎందుకంటే దేశంలో బీద బ‌డుగు వ‌ర్గాల వారంతా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను పాపం ఇంకా దేవాల‌యాలుగానే భావిస్తున్నారు. ప్రైవేటును ఆశ్రయించడానికి ఆర్థిక స్థోమత లేని  బీదబడుగు వర్గాలకు అలా భావించడం తప్పని సరి అనివార్యత. డ‌బ్బుపెట్టి పెద్దాస్ప త్రుల‌కు వెళ్ల‌లేం గ‌దండీ.. అంటూ ప్రభుత్వాస్ప‌త్రుల వంక ఎంతో గౌర‌వంతో చూసే వారికి వెన్నులో వొణుకుపుట్టిస్తున్నాయి అలాంటి సంఘ‌ట‌న‌లు.    అది జార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా ఆస్ప‌త్రి..  మ‌మ‌తాదేవి  అనే మ‌హిళకు ఏప్రిల్ 2న పండంటి బిడ్డ పుట్టింది.  రెండు రోజుల త‌ర్వాత ఆ పాప పాదాల నుంచి మోకాళ్ల‌దాకా ఎలుక‌లు కొరుక్కుతిన్నాయి. పుట్ట‌గానే  ఆ ప‌సికందుకు శ్వాస‌ సంబంధిత జ‌బ్బుతో ఆస్ప‌త్రిలో చేర్చారు. పాప‌కు జాండిస్‌వ‌చ్చింద‌ని ఆస్ప‌త్రి లో చిన్న‌పిల్ల‌ల‌ వార్డు  డ్యూటీ డాక్ట‌ర్ అన్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ త‌ర్వాత చికిత్స అందిస్తున్న క్ర‌మంలో ఏకంగా ఇంక్యుబేట‌ర్‌లో పెట్టిన ప‌సికందుపై ఎలుక‌లు దాడిచేయ‌డం మ‌మ‌తా దేవితో పాటు  ఆ వార్త విన్న మ‌నుషులంద‌రికీ గొంతులోకి నీరు కూడా దిగ‌లేదు. భ‌యం, బాధతో  ప్ర‌భుత్వాస్ప‌త్రుల మీద ఆగ్ర‌హంతో ర‌గిలిపోయారు.  కానీ స‌ద‌రు ఆస్ప‌త్రి వ‌ర్గాలు మాత్రం డ్యూటీ డాక్ట‌ర్‌ , ఒక్క‌రిద్ద‌రు న‌ర్సుల‌పై చ‌ర్య‌లు తీసుకోని చేతులు దులిపే సుకున్నారు. మ‌రి మ‌మ‌తాదేవిని ఎవ‌రు ఓదార్చాలి.   ఇదేనా ప్ర‌భుత్వాలు ఇచ్చే ఆరోగ్య, జీవ‌న భ‌రోసా?! ఇక  కేంద్రం మ‌హా అద్భుత పాల‌న‌గా  గొప్ప‌గా  చెప్పుకుంటున్న యోగీ గారి  యూపీకి వ‌ద్దాం. అక్క‌డా ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి నరకానికి నకలుగానే ఉంది. మ‌హోబా జిల్లా ముధారికి చెందిన సీమా అనే మ‌హిళ జిల్లా కేంద్ర ఆస్ప‌త్రిలో  ప్ర‌సవానికి చేరింది. మే 30న బిడ్డ పుట్టింది.  శిశువు అనారోగ్యంగా వుండ‌డంతో వైద్యులు నియోనటల్‌ ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో  లో ఉంచారు. ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్ అంటేనే చాలా జాగ్రత్త‌లు తీసుకుంటార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన సంగ‌తి. కానీ ఈ ఆస్ప‌త్రి లో అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్ధితి ఉంది.  ప‌రిశుభ్ర‌త‌, ప‌సికందుల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకో వ‌డం అనే అంశాలకు అక్క‌డ బొత్తిగా  స్థానం లేదు. ఇంత చెబుతున్న‌ది ఎందుకంటే అక్క‌డ‌, ఆ యూనిట్‌లో వుంచిన  శిశువును చీమలు కుట్టి చంపేశాయి.   త‌ల్లిదండ్రులు, జనం  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల తీరుతెన్నుల‌ను తిట్టిపోశారు. ఆ ఆస్ప‌త్రి వ‌ర్గాల‌కు జీవించే హ‌క్కే లేద‌న్నారు. వారి ఆక్రోశం నిజ‌మే.  కానీ  స‌ద‌రు రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేసిందేమిటి?  త‌మ‌కు ఎలాంటి చెడ్డ‌పేరు రాకుండా వుండేందుకు  ఇది కేవ‌లం వైద్యుల నిర్లక్ష్య‌మే అని  మామూలు ప్ర‌క‌ట‌న చేసేరు,  ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  స‌రే.. మ‌రో  ట్విస్ట్  ఏమంటే... శిశువుకు చికిత్స అందించడానికి వైద్యులు తమ దగ్గరి నుంచి రూ.6500 లంచం తీసుకున్నార‌ని బాధితులు చెప్ప‌డం. అంటే ప్ర‌త్యేకంగా ఎంతో శ్ర‌ద్ధ‌ తీసుకోవ‌డానికి  పాపం ఆ దంప‌తుల ద‌గ్గ‌ర లంచం కొట్టేసి మ‌రీ నిర్ల‌క్ష్యంగా శిశువును వ‌దిలే య‌డం.  అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా?  మాన‌వ‌త్వం గురించి సినిమాలు, సీరియ‌ళ్ల‌లో హీరో హీరోయి న్ల‌తో, బ‌య‌ట నాయ‌కులు ఉప‌న్యాసాల‌తో ఊద‌ర‌గొట్ట‌కుండా వాస్త‌వాల్ని క‌ళ్లారా చూసో, తెలుసు కునో ప్ర‌భుత్వాధికారుల‌కు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల తీరుతెన్నులు మారేందుకు  ప్ర‌భుత్వాలు  ఎన‌లేని కృషి నిజంగానే చేయాలి. కేవ‌లం డాక్ట‌ర్ల‌ను అవ‌స‌రాల‌మేర‌కు గౌర‌వించ‌డం, స‌త్క‌రించ‌డం కాకుండా నిజంగానే అక్క‌డి ప‌రిస్థితులు ఇక‌న‌యినా చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌భుత్వాలు పూనుకోవాల్సిన స‌మ‌యం ఇప్ప‌టికే మించిపోయింది.   తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాస్పత్రులలో కూడా పరిస్థితులు ఇంతే భయానకంగా ఉన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ, గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోనూ రోగులను ఎలుకలు కొరికేసిన సంఘటనలు జరిగాయి. ఏదో చేయాలన్నట్లు విచారణకు ఆదేశించడం, ఏదో ఒకరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులిపేసుకోవడంతో ప్రభుత్వాలు సరిపెట్టేస్తున్నాయి.

ఏపీలో ఎమర్జెన్సీ.. పల్నాడును వల్లకాడు చేస్తున్నారు.. బాబు

హత్యా రాజకీయాలతో వైసీపీ ఏపీలో రక్త చరిత్ర రాస్తోంది. పల్నాడును వల్లకాడు చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నది. ప్రజాదరణ తగ్గిపోతున్నదన్న ఉక్రోషంతో విపక్ష  తెలుగుదేశం క్యాడర్ ను భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదీ తెలుగుదేశంకు తొలి నుంచీ అండదండగా, వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.  తాజాగా తెలుగుదేశం కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం మండి పడుతోంది. వైసీపీ రక్త పింజరిలా మారి బీసీల ప్రాణాలకు హరిస్తోందని దుయ్యబడుతోంది. ముఖ్యంగా పల్నాడులో తెలుగుదేశంకు మద్దతుగా ఉన్న బీసీలను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండకు తెగబడుతోందని ఫైర్ అవుతోంది.  తెలుగుదేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా? అధికారం తలకెక్కిన వైసీపీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోయిందా? విపక్ష కార్యకర్తలపై దాడులు హత్యలూ చేసి వారి మృతదేహాలను ఎక్కడికి తరలించారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పకుండా భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారా అంటే విపక్ష నేత చంద్రబాబు ఔననే అంటున్నారు. పల్నాడులో వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా తెలుగుదేశం నాయకులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడం అంటే రాష్ట్రంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. జల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన నడిరోడ్డుపైనే హత్యలు జరుపుతుంటే ఆపడం చాతకాని పోలీసులు అంత్యక్రియలకు వెళుతున్న వారిని అడ్డుకుని అరెస్టు చేయడమేమిటని నిలదీశారు. ఆఖరికి జల్లయ్య మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్వగ్రామంలో అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా కుటుంబ  సభ్యులకు లేకుండా చేయడం దారుణాతి దారుణం కాక మరేమిటని చంద్రబాబు అన్నారు. హత్యలతో వైసీపీ, వారికి వంత పాడుతూ పోలీసులు పల్నాడును వల్లడాకు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. పల్నడు హత్యాకాండపై ప్రత్యేక కోర్టు పెట్టి వాచారించాలని డిమాండ్ చేశారు.   

కాశ్మీర్ వారికి సినిమాకాదు, ధైర్యం కావాలి!

ఎవ‌రిక‌యినా పుట్టి పెరిగిన వూరు మీద ఎంతో ప్రేమ వుంటుంది.  ఉద్యోగం పేరుతోనో, వ్యాపారం కోస‌మైనా వేరే ప్రాంతానికి వెళ్లినా పుట్టిన ఊరుని మ‌ర్చిపోలేరు. ఆంగ్లంలో ఒక సామెతా వుంది పిల్లాడిని వూరి నుంచి పంపేయ‌చ్చు గాని, వూరుని పిల్లాడి నుంచి దూరం చేయ‌లేరు! మ‌రి కాశ్మీరీ పండితుల సంగ‌తి అంతేగ‌దా! వుండ‌ లేక కాశ్మీర్ ప్రాంతం విడిచి వెళిపోవ‌డం గ‌తంలో జ‌రిగింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున వెళిపోవ‌డం చాలా దారుణం. మ‌రి దేశ పాల‌కులు వారిని ప‌ట్టించుకోరా అని ఈసారి గ‌ట్టిగానే అడిగేరు ఆమ్ ఆద్మీ నాయ‌కుడు సంజ‌య్ సింగ్‌. వారికి ఎంతో చేసాం, వారి ర‌క్ష‌ణ మా ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం అని ఎక్క‌డ పడితే అక్క‌డ‌, దాదాపు ప్ర‌తీ వేదిక మీద ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇక‌న‌యినా ప్ర‌ధాని, ఆయ‌న మంత్రివ‌ర్గం మానుకోవాల‌ని ఇప్ప‌టికే చాలామంది హిత‌వు ప‌లికేరు. కాశ్మీర్‌కి ఎంతో మేలు చేసామ‌ని, లోయ‌ ప్రాంతాన్ని ఓట్ల కేంద్రంగా మార్చు కోవ‌డం త‌ప్ప నిజానికి వారి జీవితేచ్ఛ‌కి, భ‌యాందోళ‌న‌లు పొగొట్ట‌డానికి కేంద్రం పూనుకుని ఏం చేసింది?  మ‌రీ దారుణ‌మేమంటే, వున్న‌చోట‌నే మేము వేరే ప్రాంతీయులం అనే భావ‌న‌తో బ‌త‌కాల్సి రావ‌డం. దీన్ని ఊహించుకోవ‌డ‌మే చాలా క‌ష్టం. మ‌రి కాశ్మీరీ పండిట్‌లు ఆ బాధ‌ను ఇన్నేళ్లుగా ఎలా భ‌రిస్తున్నారో  శివుడే ఎరుక‌! 1990 లో బిజెపి మ‌ద్ద‌తుతో అధికారంలో వున్న ప్ర‌భుత్వం కాశ్మీరీ పండిట్‌లకు నిద్ర‌లేకుండా చేసింది. వారు  గూళ్లు వ‌దిలి వేరే ప్రాంతానికి పెద్ద సంఖ్య‌లో వెళిపోయేరు. ఇప్పుడు మోడీ ప్ర‌భుత్వం పూర్తి మెజా రిటీతో గెలిచి మ‌రింత ధైర్యంగా  కాశ్మీరీ పండిట్‌ల జీవితాలు విచ్ఛిన్నం చేసిద‌ని ప‌రిశీల‌కులు అంటు న్నారు.  1990లో భారీఎత్తున వారు అన్నీ వ‌దులుకుని వేరే ప్రాంతానికి వెళ్ల‌డాన్ని క‌ళ్లారా వీక్షించిన అప్ప‌టి కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌మోహ‌న్‌కి  మోడీ ప్ర‌భుత్వం ఏకంగా ప‌ద్మ‌శ్రీ ఇచ్చి గౌర‌వించ‌డం  బిజెపి ప్ర‌భుత్వం మ‌న సును  ప్ర‌జ‌లు మ‌రింతగా తెలుసుకునేలా చేసింది. వారికి మేలు చేసిన‌ వారిని గౌర‌వించ డంలో త‌ప్పు లేదు. కానీ ల‌క్ష‌లాది మందిని ఊహించ‌ని స్థితిలో వారి ప్రాంతంనుంచి త‌రిమేయ‌డంలో  స‌హ‌క రించిన వారికి వెన్నుద‌న్నుగా నిల‌వ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం.  లోయ‌లో తీవ్ర‌వాదుల హ‌త్యాకాండ‌ను బిజెపి ప్ర‌భుత్వం ఏమీ ప‌ట్ట‌న‌ట్టుగా చూడ‌డం, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్‌ల ర‌క్ష‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకొన‌క‌పోవ‌డం కేంద్రం స‌హ‌జ‌ యాన‌ పంథాగానే తీసుకోవాలా? ఎందుకంటే, అస‌లు కాశ్మీర్ లోయ‌ ప్రాంతంలో జ‌రుగుతున్న దారుణాలు, హ‌త్య‌ల‌న్నీ కూడా ప‌క్క‌నే వున్న పాకిస్తాన్ తీవ్ర‌వాదుల చ‌ర్యలే అని ఒక్క మాట‌తో  కొట్టేయ‌డం ఎంత‌వ‌ర‌కూ న‌మ్మ‌శ‌క్యం. పోనీ అదే నిజమని అనుకున్నా లోయ ప్రాంతీయుల జీవ‌నానికి క‌నీస ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని కేంద్ర ప్రభుత్వంతో  ప్ర‌యోజ‌న‌మేమిటని ప‌రిశీలకుల ప్ర‌శ్న‌. నిజానికి ఈ ప్ర‌శ్న ఆమ్ ఆద్మీ లేదా కాంగ్రెస్ వారు వేయ‌డం కాదు స్వ‌యానా బిజెపి వ‌ర్గాలు, కేంద్ర మంత్రి వ‌ర్గం వేసుకోవాలి.  మొన్నీమ‌ధ్య‌నే ఇలాక్వాయి దెహాతీ బ్యాంకు మేనేజ‌ర్ విజ‌య్ కుమార్‌ను కుల్‌గ్రామ్‌లో తీవ్ర‌వాదులు చంపేసేరు. ఇటీవ‌ల జ‌రిగిన హ‌త్య‌ల‌ మీద అన్ని పార్టీల‌వారూ కేంద్రాన్ని దుమ్మెత్తి పోశారు. కానీ దున్నపోతు మీద వాన సామెతే అయింది! భ‌య‌భ్రాంతుల‌కు గురయిన లోయ‌ప్రాంతీయుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామంటున్నారు. మ‌రి అక్క‌డే వున్న‌ వారిని అలా వ‌దిలేస్తారా?  మ‌రి వారి ర‌క్ష‌ణ సంగ‌తి ఏంటి?  వారు ఇల్లు, గొడ్డు గోతం అన్నీ వ‌దిలేసుకుని పిల్లాజెల్లాతో వేరే ప్రాంతానికి వెళిపోవ‌ల‌సిందేనా?  అమాయ‌కుల‌యిన క‌శ్మీరీ పండిట్‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేయ‌డంతో వారి కాల‌నీల‌న్నీ జైళ్లుగా మారాయ‌ని ప్ర‌తిప‌క్షాలు వారి త‌ర‌ఫున గొంతు చించుకుంటున్నారు. కానీ స‌ర్వాధికారుల‌వారు ఏం చేస్తున్నారు.. కశ్మీరీ ఫైల్స్ అనే చిత్ర‌రాజాన్ని ఎంత బాగా ప్ర‌చారం చేయ‌వ‌చ్చ‌నేది చాలా కీల‌కాంశంగా చేసుకున్నారని ఆమ్ ఆద్మీ నేత సింగ్ వ్యాఖ్యానించేరు. నిజ‌మే మ‌రి.. ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని ప్ర‌చారాలు చేయ‌డం త‌ప్ప వాస్త‌వానికి కాశ్మీరీ పండిట్‌ల జీవితాల్ని దాడుల‌కు వ‌దిలేయ‌డం తప్ప కేంద్రం చేసిందేముందని విశ్లేషకులు నిలదీస్తున్నారు.    వాస్త‌వ మ‌ద్ద‌తు, వెన్నుద‌న్నుగా నిల‌వ‌డం ఇప్పుడు మ‌రీ అవ‌స‌రం.  కేంద్రంలో పెద్దాయ‌న జ్ఞానంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే చూడాల‌ని కాశ్మీర్ లోయ‌ ప్రాంతీయుల‌తోపాటు దేశ‌మంతా ఎదురుచూస్తోంది.

దేశం శ్రేణులు లక్ష్యంగా దాడులు, హత్యలు.. చోద్యం చూస్తున్న పోలీసులు.. పరామర్శకు కూడా నో పర్మిషన్

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయా? దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తూ.. పోలీసులు విపక్ష నేతలను నిర్బంధిస్తున్నారా. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా అనుమతించకుండా గృహ నిర్బంధాలతో వేధిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందనీ, అధికార పక్షం దాష్టీకాలకూ, దౌర్జన్యాలకూ అంతు లేకుండా పోయిందనీ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులు, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా తెలుగుదేశంనేతలను అనుమతించడం లేదు. రాష్ట్రంలో నియంత రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యం అపహాస్యంపాలౌతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మేం దాడులు చేస్తాం... హత్యలు చేస్తాం.. అయినా సరే విపక్ష నేతలు నిరసనలు చేయడానికి కానీ మృతుని కుటుంబాలను పరామర్శించడానికి కానీ వీలు లేదు అన్నట్లుగానే రాష్ట్రంలో అధికార వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్య బడుతున్నారు.    తాజాగా వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన కుంచర్ల జల్లయ్య అంత్రికియలకు హాజరయ్యేందుకు తెలుగుదేశం నేతలెవరూ హాజరు కాకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు శనివారంనరసరావుపేటలో జరుగుతున్న  నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెర తీశారు. జలయ్య మృతదేహానికి నివాళులర్పించేందుకు బయలు దేరిన  మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా నక్కాఆనందబాబు పోలీసుల మధ్య వాగ్వాదంజరిగింది. తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలంటే నక్కా ఆనందబాబు పోలీసులను నిలదీశారు. అక్రమంగా నిర్భంధిస్తే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. వైసీపీ నేతలు చెప్పినట్లల్లా ఆడితే భవిష్యత్ లో పోలీసులు ఇబ్బందులు పడటం ఖాయమని నక్కా ఆనందబాబు అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై వైసీపీ గూండాలు హత్యలు చేస్తుంటే ఆపలేరు కానీ పరామర్శలకు వెళ్లే తెలుగుదేశం నేతలను నిర్బంధించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను దారుణ హత్యకు గురైన సంగతి విదితమే.  తెలుగుదేశం నేతలు జల్లయ్య హత్యను ఖండించారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావు పేట బయలు దేరిన తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, విజయవాడలో బుద్ధా వెంకన్న, తేలుకుంట్లలో యరపతినేని శ్రినివాసరావు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, పొందుగుల వద్ద మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులను పోలీసులు అడ్డుకున్నారు.   రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య ఆ గ్రామాన్ని విడిచిపెట్టి గత మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. బ్యాంకు పని మీద ఆయన దుర్గికి వెళ్లాల్సి ఉండటంతో గురువారం రాత్రి జంగమేశ్వరపాడుకు వచ్చాడు. శుక్రవారం ఉదయమే దుర్గిలోని బ్యాంకుకు వెళుతుండగా దారి కాచి వైసీపీ వర్గీయులు జల్లయ్యపై   వేటకొడవళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జల్లయ్యను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మరణించాడు. జల్లయ్య పై దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జల్లయ్య హత్య జరిగిందని, వైసీపీ గూండాలే ఈ దాడికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనీ, పోలీసులు వైసీపీ తొత్తులుగా మారి వారి అరాచకాలకు, దౌర్జన్యాలకూ దన్నుగా నిలుస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.  

జైళ్లోనూ అదే దర్జా.. అదే దర్పం, అదే దౌర్జన్యం!

వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చన్నా ఫరవాలేదు అంటారు. అలాగే అధికార పార్టీ వ్యక్తి అయితే చాలు జైల్లో ఉన్నా రాచమర్యాదలు అందుతాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్న  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు  రాచ మర్యాదలు లభిస్తున్నాయి. నిబంధనలకు తిలొదకాలు వదిలేసి మరీ జైలు అధికారులు అనంతబాబు సేవలో తరిస్తున్నారు. ఇంతకీ అనంతబాబు గుర్తున్నాడు కదా! అధికార వైసీపీ ఎమ్మెల్సీ. తన మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీ. తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తన కారులోనే అతడి ఇంటికి రోడ్ డెలివరీ ఇచ్చాడు. ఆ తరువాత తీరిగ్గా పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అనివార్య పరిస్థితుల్లో నేరం అంగీకరించినా పోలీసులు మాత్రం అనంత బాబును అరెస్టుకు ముందు, తరువాతా, ఇప్పుడు సెంట్రల్ జైలులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్( వీవీఐపీ) ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్సీ కదా. అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో మొక్కుబడిగా పార్టీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేసినట్లు చేశారు. కానీ రాజమహేంద్రవరం జైలులో అనంతబాబును ‘జాగ్రత్త’గా చూసుకోవాలంటూ పై స్థాయి నుంచి జైలు అధికారులకు ఆదేశాలు వస్తున్నాయని కింది స్థాయి జైలు సిబ్బందే చెబుతున్నారు. అన్ని విధాలుగా జైల్లో కూడా రాచమర్యాదలు అందుతుండటంతో ఆయన ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లుగా జైలే భేషుగ్గా ఉందని ఫీలవుతున్నారట. జైలులోంచే తన బయటి దందాలు దర్జాగా చేసుకుంటున్నారట. నిత్యం నిబంధనలతో సంబంధం లేకుండా వరుస ములాఖత్ లలో అనంత బాబు యమా బిజీగా ఉన్నారట. జైలులో ఆయనను కలవడానికి వచ్చే వారిలో అత్యధికులు వైసీపీ వారేనని కూడా జైలు సిబ్బంది ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే కూడా అనంతబాబుతో ములాఖత్ అయ్యారని చెబుతున్నారు. జైల్లో తోటి ఖైదీలపై అనంతబాబు దాష్టీకం చేస్తున్నాడనీ, మాట వినలేదని ఒక ఖైదీ పై చేయి చేసుకున్నాడనీ సమాచారం. అయితే జైలు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ముగ్గురు ఖైదీలకు కలిపి ఒక గది ఇవ్వాలనీ, కానీ అనంతబాబుకు జైలు అధకారులు ఇస్తున్న రాచమర్యాదలలో భాగంగా ప్రత్యేకంగా గది కేటాయించారనీ చెబుతున్నారు. అలాగే ఖైదీలకు బయట నుంచి భోజనాన్ని అనుమతించరు. కానీ అనంత బాబుకు మాత్రం ప్రతి రోజూ బయట నుంచి మృష్టాన్న భోజనం అందుతోందని జైలు సిబ్బందే చెబుతున్నారు.

జగన్మాయా.. కనికట్టా.. రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది కేంద్రమా?..!

దొంగకు తేలు కుడితే ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్ ఉన్న పరిస్థితిని చూస్తే తెలిసిపోతుంది. ఎదుటి వాడి సొమ్ముతో పండగ చేసుకుంటే.. అప్పటికి సంబరంగానే ఉన్నా నిజం బైటపడిన తరువాత సీన్ సితార అయిపోతుంది. పరువు గంగలో కలుస్తుంది. జగన్ సర్కార్ పరిస్థితి ఇప్పుడలాగే తయారైంది.   ముఖ్యమంత్రి జగన్ తన  బ్రైన్ చైల్డ్ గా రైతు భరోసా కేంద్రాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. అవసరం ఉన్నా లేకున్నా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చేసి గప్పాలు కొట్టుకున్నారు. రైతులకు అవసరమయ్యే సర్వ సేవలూ ఇక్కడ లభ్యమౌతాయని తన భుజాలను తానే చరిచేసుకుని సంబరపడిపోయారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో మొత్తం దేశం ఏపీవైపు చూసేలా జగన్ చేశారని లెక్కలేనన్ని సార్లు ప్రతికలలో ప్రకటనలు ఇచ్చేసి బాకా ఊదుకున్నారు. తీరా చూస్తే ఆ కేంద్రాల నిర్మాణానికి కేంద్రమే నిధులిచ్చిందని తేలిపోయింది. కేంద్రం సొమ్ముతో సొంత బాకా ఊదుకుంటున్న జగన్ కు రైతు భరోసా కేంద్రాల పేరు మార్చేయమంటూ కేంద్రం హుకుం జారీ చేయడంతో దిమ్మ తిరిగింది.   అసలు వాస్తవం బైటపడిపోయింది. రైతు భరోసా కేంద్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది కూలీ పాత్ర. సొమ్ములు ఇచ్చి కట్టించింది కేంద్రం అని తేలిపోయింది. ఇప్పటి వరకూ అంతా తమ ఘనతే అంటూ సొంత భజన చేసుకున్న జగన్ సర్కార్  కేంద్రం రైతు భరోసా కేంద్రాల పేరు మార్చాలని నిర్ణయించడంతో   అవాస్తవాలతో జనాన్ని మభ్యపెడితే ఏం జరుగుతుందన్న తత్వం బోధపడి బొమ్మ కనిపించింది. రైతు భరోసా కేంద్రాల పేరును రైతు ఉత్పత్తి నిల్వ కేంద్రాలుగా మార్చమని కేంద్రం జగన్ సర్కార్ కు హుకుం జారీ చేసింది. ఆలా మార్చకుంటే తానే రంగంలోకి దిగి మార్చేస్తానని హెచ్చరించింది. దీంతో జగన్ బండారం బైటపడిపోయింది. దీంతో అనివార్యంగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్    రైతు భరోసా కేంద్రాల ఘనత కేంద్రానిదేనని, తమ ప్రభుత్వం కేవలం కూలీలా వాటిని కట్టిందని ఒప్పుకుని లెంపలేసుకోవలసి  వచ్చింది. రైతు భరోసా కేంద్రాల పేర నిర్మించిన భవనాలకు 90 శాతం నిధులు కేంద్రం సమకూర్చింది. వీటిని గ్రామీణ ఉపాధి పథకంతో లింక్ చేశారు. వైసీపీ సర్కార్ కేవలం వాటిని కట్టించిందంతే. కానీ ఒక్కో భవనానికి 21 లక్షల రూపాయలు వెచ్చించి తమ ప్రభుత్వమే వాటిని నిర్మించిందని జగన్ బిల్డప్ ఇచ్చారు. తన ఫొటోలతో ఫుల్ పేజీ అడ్వర్టైజ్ మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. నిజానికి జరిగిందేమిటంటే కేంద్రం సొమ్ముతో  జగన్ సోకు చేశారు. వాస్తవం బయటపడటంతో దొంగకు తేలుకుట్టినట్లుగా ముఖ్యమంత్రి మౌన ముద్ర వహించారు. రైతు భరోసా కేంద్రాలేనా..  గ్రామ సచివాలయాల నిర్మాణాలలోనూ కేంద్రం నిధులే వాడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది కేంద్రమేనని ఇప్పుడు వాటి పేరు మార్పు నిర్ణయంతో బయట పడింది. దీంతో గ్రామ సచివాలయాల బండారమూ బయటపడింది. మరి ఇంతకీ  జగన్ ఈ మూడేళ్ల కాలంలో అప్పులు కాక మరేం చేసినట్లు అని జనం చర్చించుకుంటున్న పరిస్థితి.